30, మే 2016, సోమవారం

ప్రత్యామ్నాయం లేని ప్రజానాయకుడు కేసీఆర్

సూటిగా....సుతిమెత్తగా..........
(జూన్ రెండో తేదీ తెలంగాణా ఆవిర్భావ దినోత్సవం)  

తెలంగాణా వచ్చేసింది. వచ్చి కూడా  రెండేళ్ళయింది. కొన్ని దశాబ్దాలుగా  ఈ ప్రాంతం ప్రజలు అవిశ్రాంతంగా కంటున్న స్వప్నం నెరవేరింది. ఈ నిజం  నీటి మీది రాత కాదు, రాతి మీది గీత. చెరపడం అసాధ్యం. చెరపాలనే ఆలోచన అవివేకం.
రెండు సంవత్సరాల క్రితం, 2014 జూన్ రెండో తేదీన, భారత దేశంలో ఇరవై తొమ్మిదో రాష్ట్రంగా ఏర్పడ్డ తెలంగాణాకు, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాధినేతగా టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు తొలి ముఖ్యమంత్రిగా పదవీ ప్రమాణ స్వీకారం చేశారు.
ప్రజల నమ్మకాలు విచిత్రంగా వుంటాయి. ప్రత్యేక తెలంగాణా సాధన ఖ్యాతిని ఏపార్టీకి ఆ పార్టీ తమ ఖాతాలో వేసుకోవాలని చూసినా ప్రజలు మాత్రం కేసీఆర్ వల్లనే కొత్త రాష్ట్రం సాధ్యపడిందని బలంగా నమ్ముతున్నారు. ఈ నమ్మకమే ఆయన బలం. ఎవర్నీ లెక్కచేయకుండా వ్యవహరించే ఆయన పని తీరుకు ప్రజల్లో వున్న ఈ నమ్మకమే ఊపిరి పోసింది.
ఎవరెన్ని విమర్శలు చేసినా, వ్యాఖ్యానాలు చేసినా ఆయన లెక్క చేసే రకం కాదు. 'బంగారు తెలంగాణా కల సాకారం చేయడానికి ఏమైనా చేస్తా, ఏమైనా చెబుతా' అనే ఒకే ఒక్క మాటతో ప్రత్యర్ధుల వాదనలను పూర్వపక్షం చేయడానికి ఆయన ఎప్పుడూ సంసిద్ధంగానే వుంటారు. ఒకరకంగా ఇది కేసీఆర్ బలమూ, బలహీనత రెండూ.  
అరకొర మెజారిటీతో ఏర్పడ్డ ఈ ప్రభుత్వం ఎన్నాళ్ళు౦టుంది అని కొందరు మొదట్లోనే మెటికలు విరిచారు. తెలంగాణా వాదం కొడిగడుతూ వుండడం వల్లనే, రెండేళ్ళ నాటి అసెంబ్లీ ఎన్నికల్లో  టీఆర్ఎస్ సీట్లు గణనీయంగా తగ్గిపోయాయని లెక్కలు కూడా వేశారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీలో   చోటుచేసుకున్న  ‘నాదెండ్ల టైపు’ తిరుగుబాటు టీఆర్ఎస్ లో కూడా తప్పదని ఊహాగానాలు చేశారు. తెలంగాణా ఏర్పడిన జూన్ రెండో తేదీకి పూర్వమే, విడిపోయిన రెండు జర్మనీలు తిరిగి ఏకం అయిన ఉదాహరణలను ప్రస్తావిస్తూ, కొత్త రాష్ట్రానికి పురిట్లోనే సంధి కొడుతుందన్నతీరులో, సంధి ప్రేలాపనలు చేసి, ఆ ప్రాంతపు ప్రజల్లో లేనిపోని అనుమానాలు రగిలించే ప్రయత్నాలు కూడా  చేశారు.
ఇవన్నీ రాజకీయపరమైన అంశాలు, కాబట్టి వాటిల్లో వాస్తవం కంటే రాజకీయం పాలు కాస్త ఎక్కువ వుండే అవకాశం హెచ్చు.
మరోపక్క ఆర్ధిక నిపుణులు తెలంగాణా రాష్ట్రం ఎదుర్కోబోయే బాలారిష్టాలు గురించి అనుమానాలు వ్యక్తం చేసారు. నవజాత  రాష్ట్రంలో, ‘కారు’ చీకట్లు కమ్ముకుంటాయన్నారు. విద్యుత్ కొరతతో పరిశ్రమలు, వ్యవసాయ రంగం ఇక్కట్లపాలవుతుందన్నారు. హైదరాబాదులో వున్న ప్రముఖ కంప్యూటర్ సంస్థలు బిచాణా ఎత్తేసి బెంగుళూరో, మరో వూరో తరలి వెడతాయని జోస్యం చెప్పారు.
అసలు అన్నింటికీ మించి మరో భయం పెట్టారు. హైదరాబాదులో ఏళ్ళతరబడి నివాసం వుంటున్న సీమాంధ్ర ప్రజానీకం దిక్కుతోచని స్తితిలో, బిక్కుబిక్కుమంటూ అభద్రతాభావంతో రోజులు లెక్కించే పరిస్తితి ఏర్పడగలదని లెక్కలు వేసారు. కొత్త ప్రభుత్వం ఏర్పడ్డ కొత్త రోజుల్లో తీసుకున్న సర్వజనుల సర్వే వంటి సరికొత్త నిర్ణయాలను తమ వాదాలకు మద్దతుగా ఉదహరించారు.
ఇలా లేనిపోని అనేక అనుమానాలతో  నూర్రోజులు గడిచాయి. రాను రాను, పోను పోను ఆ సందేహాల్లో సాంద్రత తగ్గింది.
ఏడాది తిరిగిపోయింది. అన్ని  అనుమానాలు పటాపంచలు అయ్యాయి. సందేహాలు తొలగిపోయి, కొత్త ప్రభుత్వంపై నమ్మకం పెరిగింది.
ఏడాది గడిచినప్పుడు కేసీఆర్ పాలనకు లభించిన  ఒక చక్కటి కితాబును ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
ఈ కితాబు ఇచ్చింది కూడా ఆషామాషీ మనిషేమీ కాదు. మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా వున్నప్పుడు చాలాకాలం ఆయన వద్ద సమాచార సలహాదారుగా పనిచేసిన ఆర్ధిక  వ్యవహారాల పాత్రికేయుడు సంజయ్ బారు. నిజానికి ఈ బారు గారు ప్రత్యేక తెలంగాణాకు బద్ధ  వ్యతిరేకి. కరడుగట్టిన  సమైక్యవాది. తన మనస్సులోని ఈ మాటని అయన ఏనాడూ  దాచుకోలేదు. అలాటి సంజయ్ బారు  తెలంగాణా కల సాకారం అయిన ఏడాది తరువాత  అన్నమాట ఇది. నిజానికి అక్షరాలా రాసిన మాట ఇది.  
‘డెక్కన్ హైదరాబాదు గురించి నేను భయపడ్డది ఏమీ జరగలేదు. ఇక్కడివారికి  అరమరికలు తెలియవు, ఆదరించి అక్కున చేర్చుకునే తత్వం ఇక్కడివారి సొంతం. అన్నింటికీ మించి ఈ నగరానికి వున్న ప్రత్యేక ఆకర్షణ, శోభ, సౌందర్యం  ఇవేవీ చెరిగిపోలేదు. (తెలంగాణా ఏర్పడ్డ తరువాత) ఇవన్నీ చరిత్ర పుటల్లో చేరిపోతాయేమో అని నేను భయపడ్డాను. కానీ నా సందేహాలన్నీ  పటాపంచలయ్యాయి' అని ఒక ఆంగ్ల జాతీయ దినపత్రికలో రాసిన వ్యాసంలో  పేర్కొన్నారు.
సంజయ్ బారు  చెప్పినట్టు భయాలు, అనుమానాలు, సందేహాలు తొలగిపోయాయి. అయితే తెలంగాణాపై తెలంగాణా  ప్రజలు  పెంచుకున్న కోటి ఆశల మాటేమిటి? అవన్నీ నీటిమూటలేనా? నెరవేరే మాటలేనా? తెలంగాణా రాకముందు, వచ్చిన తరువాత తెలంగాణా సాధకుడిగా పేరు మూటగట్టుకున్న కేసీఆర్ గతంలో చెప్పిన మాటలు ఏమిటి? ఇప్పుడు  చేస్తున్న ఆలోచనలు ఏమిటి? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  
చూస్తుండగానే మరో రెండేళ్ళ కాలం గడిచింది.
బాలారిష్టాల దశ దాటి, బాల తెలంగాణా బలం పుంజుకుంటోంది. బుడిబుడి అడుగులు వేస్తోంది.
రెండేళ్ళ కాలంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అనేకానేక మాటలు చెప్పారు. మాటలు చెప్పడం ఆయనకు కొత్త కాదు. ఉద్యమ కాలంలో  పోరాటానికి ఊపిరిలూదింది కూడా ఆయన ఆ మాటలతోనే. జనాలను సమ్మోహితుల్ని చేసి ఆ మాటల మత్తులో కూరుకుపోయేలా చేయగల వాక్చాతుర్యం కలిగిన ఏకైక నాయకుడాయన.
గత రెండేళ్ళ కాలంలో కేసీఆర్ నోటివెంట అనేక మాటలు వర్ష రుతువులో వానచినుకుల్లా అనేక సందర్భాల్లో రాలిపడ్డాయి.
ఆకాశ హర్మ్యాలుఆరు లేన్ల రహదారులుహరితహారాలు, ప్రతి గృహానికి  నల్లా నీళ్ళుప్రతి పొలానికీ సాగు నీళ్ళుకనురెప్పపాటు కూడా పోని  కరెంటుగొడ్డూ గోదాతో ఇంటిల్లిపాదీ హాయిగా కాపురం వుండే చక్కటి రెండు పడకల చిన్నారి  లోగిళ్ళుచదువుకునేవారికి దమ్మిడీ  ఖర్చులేని చదువుచదువయిన వారికి వెంటనే కొలువుచదువంటని వారికి తగిన ఉపాధిఆడపడుచులకు కళ్యాణలక్ష్మి , తెలంగాణలో ప్రతి బీడు పొలాన్ని కృష్ణా, గోదావరి జలాలు  తడిపేలా సాగు నీటి ప్రాజెక్టుల రీ డిజైనింగు,  .......ఒకటా రెండాఇవన్నీ చదువుతున్నప్పుడువీటన్నిటి గురించి వింటున్నప్పుడు ఒక బక్కపలచటి మనిషి  మనస్సులో ఇన్నిన్ని  ఆలోచనలా! యెంత విడ్డూరం అనిపిస్తుంది. బంగరు తెలంగాణా తప్ప ఈ మనిషి కేసీఆర్ కు  వేరే ఏ ఇతర ఆలోచలు లేవారావాఅనికూడా అనిపిస్తుంది. ఇవన్నీ నెరవేరితే తెలంగాణా బంగారం కాకుండా ఉంటుందా! ఈ కలలు కల్లలు కాకూడదని కోరుకోనివారు తెలంగాణా గడ్డ మీద ఎవరయినా ఉంటారంటారా? 
తెలంగాణా ప్రజల్లో అత్యధికులు ఆయన మాటల్ని  ఇప్పటికీ విశ్వసిస్తారు. ఇక ముందు కూడా నమ్ముతారు. ఎందుకంటే కేసీఆర్  తెలంగాణాను నమ్ముకున్నారు. తెలంగాణా  ఆయన్ని నమ్ముకుంది. ఆయన్ని కాక వేరెవర్నయినా నమ్మితే  ఎన్నో కష్టాలు పడి తెచ్చుకున్న తెలంగాణకు ఏమైనా ఇబ్బంది కలుగుతుందేమో అన్న సంశయాన్ని వారిలో రగిలించడంలో కేసీఆర్ పూర్తిగా కృతకృత్యులయ్యారు. ఆయనపై పెంచుకున్న ఆ నమ్మకంతోనే వాళ్ళు ఆయన్ని నేటికీ నమ్ముతున్నారు. ఆ కారణంగానే ఈ రెండేళ్లలో జరిగిన అన్ని ఎన్నికల్లో టీఆర్ఎస్ విజయాలకు ఎదురులేకుండా పోతోంది. ఆకర్ష్ అనండి, మరోటి అనండి, ప్రతిపక్షాలకు చెందిన ప్రజాప్రతినిధుల్ని టీఆర్ఎస్ లో విలీనం చేసుకుంటున్న విధానాన్ని ప్రజాస్వామ్య ప్రియులు హర్షించక పోయినా, మరోపక్క  సామాన్య తెలంగాణా జనాలు మాత్రం ఆయనకు, ఆయన పార్టీకి  ప్రతిఎన్నికల్లో నీరాజనాలు పడుతుండడానికి ఈ ‘నమ్మకమే’ కారణం. నిజానికి  రాజకీయాల్లో పనితీరుకు  నిఖార్సయిన నిదర్శనం ఎన్నికల్లో సాధించే విజయాలే.
బంగారు తెలంగాణా సాధన కోసం అందర్నీ కలుపుకు పోవడం అంటే ఇతర పార్టీల వారిని తమ పార్టీలో కలుపుకోవడం కాదనే విమర్శలు లేకపోలేదు. ప్రజాతీర్పు అనుకూలంగా వున్నంతకాలం  ఏ విమర్శలు, ఆరోపణల గురించి పట్టించుకోవాల్సిన అవసరం వుండదన్నది నేటి రాజకీయాల్లో కొత్త థియరీ. దీనిప్రకారం,  ప్రజాస్వామ్యంలో ఒక పార్టీని అంచనావేయడానికి విజయాన్ని మించిన గీటు రాయి లేదు.  ఈ విషయంలో ఇంతవరకు టీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత అదృష్టవంతులనే చెప్పాలి. 2014 సార్వత్రిక ఎన్నికల తరువాత  తెలంగాణాలో జరిగిన ప్రతి ఎన్నికలోనూ ఆ పార్టీ తన విజయాలను మరింత మెరుగుపరుచుకుంటూ వస్తోంది.  

 
పన్నెండేళ్ళ పైచిలుకు సాగిన ఉద్యమ కాలంలో కేసీఆర్ పలవరించినా, కలవరించినా తెలంగాణా గురించే. అధికారంలో లేనప్పుడు అదే ధ్యాస, వున్నప్పుడు అదే ధ్యాస. తెలంగాణాలో అణువణువూ ఆయనకు కొట్టిన పిండి. గూగుల్  పరిజ్ఞానంతో దానికి మరిన్ని మెరుగులు దిద్దుకున్నారు. అసెంబ్లీ సాక్షిగా సేద్యపు నీటి ప్రాజెక్టులపై కేసీఆర్  ఇచ్చిన  పవర్  పాయింట్  ప్రజెంటేషన్  దీనికి  తార్కాణం. అలాగే, ఎక్కడ ఏ విషయం ప్రస్తావనకు వచ్చినా, ఎక్కడ ఏ సంఘటన జరిగినా దాన్ని తెలంగాణాకు ముడిపెట్టి  మాట్లాడ్డం  ఆయనకు అలవాటు. కొందరికి  అది  మొండితనం అనిపించి వుంటుంది, కానీ ఆయన లెక్కచేసేరకం కాదు. ఈ లెక్కలేనితనమే ఒకరకంగా ఆయనకు తెలంగాణా ప్రజల్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది. తిరుగులేని నాయకుడిగా నిలబెట్టింది. తెలంగాణా యాసలో అలవోకగా ప్రసంగించే చాతుర్యం అందరినీ కట్టిపడేసింది. రాజకీయ శత్రువులు సయితం మెచ్చుకునే ఆయనలోని  లక్షణం ఇదే.
మరి ఇలా మాటలతోనే సరా, జనాలు సరిపెట్టుకుంటారా  అంటే యెంత మాత్రంకాదని ఘంటాపదంగా చెప్పొచ్చు.  అయితే, చేసింది ఎలా చేశాము, చేయలేనిది ఎందుకు చేయలేకపోయాము, లేదా ఎందుకు చేయలేము అనే విషయాలు నిర్భయంగా, నిబద్ధతతో చెప్పగలిగే నాయకులను ప్రతిపక్షాలు తప్పుపడతాయేమో, కానీ సామాన్య జనం చక్కగా అర్ధం  చేసుకుంటారు.    
నిజమే! ఎన్నికలకు ముందు చెప్పినవి అన్నీ చేసి చూపించడం మానవ మాత్రులకు సాధ్యం కాని పని. కానీ, అన్నీ కాకపోయినా కొన్ని అయినా చేసి చూపించడం రాజకీయ పార్టీల ధర్మం. లేని పక్షంలో రాజకీయ నాయకుల వాగ్దానాలపట్ల ప్రజల్లో విశ్వాసం కుదురుకోవడం కష్టం. ఇది ప్రజాస్వామ్యానికి మేలు చేయదు.        
చూస్తుండగానే రెండేళ్ళ  పుణ్యకాలం చరిత్ర పుటల్లోకి చేరిపోతోంది. చరిత్రలో నిలబడి పోవాలంటే చేయాల్సినవి చాలా వున్నాయి. ప్రజలు తమ తీర్పు ద్వారా అప్పగించిన సమయంలో మిగిలివున్న వ్యవధానం మూడేళ్ళే.
పరిష్కారం కాకుండా వున్న తెలంగాణా సమస్యలు అన్నింటికీ పాత పాలకుల పాపమే కారణం అన్న వాదన ఇన్నేళ్ళు జనంలో చాలామంది నమ్మారు. ఇంకా కొన్నాళ్ళు నమ్ముతారు. మరి కొన్నాళ్ళ తరువాత నమ్మేవాళ్ళు తగ్గిపోవచ్చు. అసలు మిగలకపోవచ్చు.
ఏ రంగంలో అయినా   శాశ్వతంగా నిలదొక్కుకోవాలి అంటే నిజాయితీ, నిబద్దత, విశ్వసనీయత చాలా ముఖ్యం. రాజకీయాలకి ఈ సూత్రం మరింత బాగా అన్వయిస్తుంది.
అభివృద్ధి అంటే కేవలం రోడ్లు, విమానాశ్రయాలు కాదు, మొత్తం ప్రజానీకం అభివృద్ధి చెందడమే నిజమైన అభివృద్ధి అని కేసీఆర్ చెబుతుంటారు. ఆయన అదృష్టం ఏమిటంటే చెప్పింది చేసి చూపెట్టగల అధికారం, అవకాశం  ఆయన చేతుల్లోనే వున్నాయి. చూడాలి ఏం చేస్తారో! 
కలలు కనమని కలాం చెప్పారు. ఆ  కలలు నిజం చేసుకునే ప్రయత్నాలు చేయాలని కూడా చెప్పారు. అదే జరగాలి ఇప్పుడు. కేసీఆర్ తన ప్రతి మాటా ఆచరణలోకి వచ్చే విధంగా చర్యలు మొదలు పెట్టాలి. ఇంకా మూడేళ్ళ వ్యవధానం లెక్కకు మాత్రమే మిగిలివుంది. వాస్తవంగా వుంది రెండేళ్ళ లోపే.      
కోటి ఆశల నేపధ్యంలో, శతకోటి అనుమానాల నీలి నీడల్లో కొత్త రాష్ట్రం తెలంగాణా ఏర్పడింది. ఈ రెండేళ్లలో అనుమానాలు   తీరిపోయాయి. మరి ప్రజల  ఆశల సంగతి?
రెండేళ్ళ పసికందు తెలంగాణా రాష్ట్రాన్ని చేతుల్లో పట్టుకుని, కనుపాప మాదిరిగా  పెంచుతున్న టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర రావు ఎదుట నిలిచిన ప్రశ్న ఇది. ఆయన మాత్రమే జవాబు చెప్పగలిగిన ప్రశ్న కూడా.
తెలంగాణా భవిష్యత్తు గురించిన పూర్తి బాధ్యత ఆయనదే. దానిపైనే ఆయన పార్టీ భవితవ్యం కూడా ఆధారపడివుంటుంది. 
ఉపశ్రుతి:
కేసీఆర్ చెప్పిన భద్రాచలం కధ
ఇది జరిగి దాదాపు  మూడేళ్ళు.
2013 జులై 30 వ తేదీన ప్రత్యేక తెలంగాణాకు అనుకూలంగా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ  ఏకగ్రీవ తీర్మానం చేయడంతో ఆ ఘడియ కోసం ఎదురుచూస్తున్న టీఆర్ఎస్ శ్రేణుల ఆనందానికి అవధి లేకుండాపోయింది.
ఆగస్టు నాలుగో తేదీన టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖరరావు హైదరాబాదులో ఏర్పాటయిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
 ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. రాజకీయ నాయకులు అంతసేపు మాట్లాడితే  భరించడం కాస్త  కష్టం. కాని ఆయన చెప్పిన విషయాలు, తడుముకోకుండా, అసహనానికి గురికాకుండా విలేకరుల ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన తీరు సభికులను కట్టి పడేశాయి. సభికులు అని ఎందుకు అంటున్నానంటే అది విలేకరుల సమావేశంలా లేదు. ఓ మోస్తరు బహిరంగ సభలా వుంది. గిట్టని వాళ్ళు ఆయన్ని ‘మాటల మాంత్రికుడు’ అంటుంటారు కాని నిజంగా ఆయన మాటల్ని మంత్రించి వొదలడంలో దిట్ట. ఆయన చెప్పిందంతా తిరిగి రాయాలంటే ఓ గ్రంధం అవుతుంది. తెలంగాణా కల నెరవేరిననాడు ఆ కొత్త రాష్ట్రాన్ని ఎలా తీర్చి దిద్దబోతున్నదీ ఆయన సవివరంగా చెప్పారు. వినడానికి అంతా కల మాదిరిగానే వుంది. నూతన తెలంగాణా ఆవిష్కృతం అయ్యే క్రమంలో ఆయన చెప్పిన విషయాలు – ఒక రకంగా ఏదో ఒక సందర్భంలో చెప్పినవే అయినా – వాటన్నిటిని ఆయన గుది  గుచ్చి చెప్పిన తీరు ‘ప్రత్యక్షప్రసారం’లో చూస్తున్న మిత్రుడు ఒకరు బెజవాడ నుంచి  ఎస్.ఎం.ఎస్. పంపారు. ఆయన ఓ అయిదేళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి, ఇప్పుడు చెప్పినంతగా యావత్ ఆంద్రప్రదేశ్ ని అభివృద్ధి చేసివుంటే ఇప్పుడీ గొడవలే ఉండేవి కావన్నది దాని తాత్పర్యం.
‘భద్రాచలం సంగతేమిటి’ అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబుగా చరిత్రలోని ఒక వృత్తాంతాన్ని కేసీఆర్  వివరించారు.
కొన్నాళ్ళు బ్రిటిష్ అంధ్రాలో  వున్న భద్రాచలం, అంతకు  పూర్వం తెలంగాణాలోనే వుండేది. భక్త రామదాసును బందిఖానాలో వేసింది అప్పటి గోలకొండ కోటలోనే. పొతే, భద్రాచలానికి పొరుగున బ్రిటిష్ ఇండియాలోని వైజాగ్ ప్రాంతంలో ఒక ముష్కరుడు గ్రామాలమీద పడి దోపిడీలు చేస్తుంటే బ్రిటిష్ సాయుధ సాయాన్ని కోరడం, వాళ్ళు  ఆ దోపిడీదారుడి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడం, చేసిన సాయానికి కృతజ్ఞతగా నవాబు గారు  గోదావరి ఆవల వైపువున్న ప్రాంతాన్ని వారికి దఖలు పరచడం – ఇదంతా వినడానికి చాలా ఆసక్తిగా అనిపించింది. అదే కేసీఆర్ ప్రత్యేకత.

రచయిత ఈ మెయిల్: bhandarusr@gmail.com  మొబైల్: 98491 30595


  

3 కామెంట్‌లు:

నీహారిక చెప్పారు...

తెలంగాణా రాకముందు టీ వీ 5 లోని ఒక చర్చా కార్యక్రమంలో కేసీఅర్ తప్ప మరో నాయకుడు తెలంగాణాలో లేరు అని నేను అంటే పద్మా దేవేందర్ రెడ్డి కి కోపం వచ్చి ఆంధ్రా పొగరు అని అనేసింది.

Unknown చెప్పారు...

Very nice and unbiased article,in telangana we all have hopes that KCR will give a new direction to our state and sir not 3 years he will get another 5 years mandate to do what he is dreaming about telangana.Yes sir people are not ready to believe any leader from other parties as their credibility is very low when compared with KCR.

Unknown చెప్పారు...

Very nice and unbiased article,in telangana we all have hopes that KCR will give a new direction to our state and sir not 3 years he will get another 5 years mandate to do what he is dreaming about telangana.Yes sir people are not ready to believe any leader from other parties as their credibility is very low when compared with KCR.