22, జూన్ 2021, మంగళవారం

విని తీరాల్సిన కేసీఆర్ ప్రసంగం – భండారు శ్రీనివాసరావు

 ఉద్యమ కాలంలో సరే, గత ఏడేళ్ల కాలంలో తెలంగాణా ముఖ్యమంత్రిగా కేసీఆర్ శాసనసభలోను, బహిరంగ సభలలోను అనేకానేక అద్భుత ప్రసంగాలు చేశారు. అవన్నీ ఒక ఎత్తు, ఈరోజు వాసాలమర్రి గ్రామ సభలో చేసిన ప్రసంగం ఒక ఎత్తు.

ఆయన ఈ సభలో కేవలం ప్రసంగం మాత్రమే చేశారని నాకు అనిపించలేదు.

దత్తత తీసుకున్న తీసుకున్న తండ్రి పిల్లవాడికి సుద్దులు చెప్పినట్టు ప్రజలకు  అనేక హిత బోధలు చేశారు.  ఒకరకంగా చెప్పాలంటే అనుగ్రహ భాషణం చేశారు. ఇందులో సూక్తులు వున్నాయి. సలహాలు వున్నాయి. హితోక్తులు వున్నాయి. హెచ్చరికలు వున్నాయి. హామీలు వున్నాయి. వరాల జల్లులు  వున్నాయి. సుతిమెత్తని చీవాట్లు వున్నాయి. కానీ ఎక్కడా దాష్టీకం లేదు. పైపెచ్చు అధికారులని, అనధికారులని పేర్లతో సంబోధిస్తూ, వారి సేవలని ప్రశంసిస్తూ అందరినీ కలుపుకుపోయే ఒక సమర్ధ నాయకుడిగా ప్రేక్షకులకు దర్శనం ఇచ్చారు.

ఈ కార్యక్రమం ఆసాంతం చూడని వారికి ఈ వాక్యాల్లో కొంత అతిశయోక్తి కనిపించవచ్చు. చూడకపోతే నేనూ అలాగే అనుకునేవాడిని.

బహుశా ఆయన ప్రసంగం రేపు పత్రికల్లో వివరంగా రావచ్చు. ఆయన చెప్పినవన్నీ ఇక్కడ రాయడం సాధ్యం కాని పని.

అయినా ఒక విషయంతో ముగిస్తాను.

ఆ గ్రామం సర్వతోముఖాభివృద్ధికి ఆ జిల్లా కలెక్టర్ నే ఆ వూరికి స్పెషల్ ఆఫీసర్ గా నియమిస్తున్నట్టు కేసీఆర్ ఈ సభలో ప్రకటించారు.

ఇలాంటివి ఒక్క కేసీఆర్ కే సాధ్యం. సందేహం లేదు.

తోకటపా: సుదీర్ఘ ప్రసంగ సమయంలో, ఉక్కపోతకు చేతిలో వున్న కాగితాలతో విసురుకున్నారే కానీ, అక్కడ ఎవరిమీదా విసుక్కోలేదు.

(22-06-2021)

కామెంట్‌లు లేవు: