5, జూన్ 2021, శనివారం

మౌనమే నీ భాష – భండారు శ్రీనివాసరావు

 అనగనగా ఓ అమ్మ. ఆ అమ్మకు ఒక్కగానొక్క కొడుకు. పిల్లలు మంచిగా చదువుకుని వృద్ధిలోకి రావాలనుకునే కన్నతల్లులందరి మాదిరిగానే ఈవిడా తన కన్నకొడుకు విషయంలో తెగ ఆరాటపడింది. చదువు చెప్పే మేష్టార్ని వెదికిపట్టుకుని కొడుకును అప్పగించింది. పొద్దున్నే చద్దన్నం తిని చదువుకోవడానికి వెళ్ళే పిల్లాడిని చూస్తూ ఆ మాతృహృదయం మురిసిపోయేది. నాలుగు మంచి ముక్కలు వొంట బట్టించుకుని ప్రయోజకుడు అవుతాడని కలలు కంటున్న తల్లికి అసలు విషయం అర్ధం కాలేదు. ఆ పిల్లాడేమో – చదువుకు ఎగనామం, పంతులుగారికి పంగనామం పెట్టేసి పగలంతా గాలికి తిరిగేవాడు. పొద్దుగూకేవేళ ఇంటికి తిరిగొస్తూ – పొరుగు పెరట్లోని కరివేపాకు రెబ్బలు నాలుగు దొంగతనంగా కోసుకుని – బుద్ధిమంతుడిలాగా అమ్మ చేతిలో పెట్టేవాడు. దాంతో ఆ కన్నతల్లి మరింత మురిసిపోయేది. ‘నా బాబే! నా తండ్రే!’ అంటూ గారంగా ఓ బెల్లం ముక్క నజరానాగా అతడి చేతిలో పెట్టేది. తల్లి మురిపెం ముచ్చట చూస్తూ పెరిగిన పిల్లాడికి తాను చేస్తున్న తప్పేమిటో అర్ధం చేసుకునే వీలు లేకుండా పోయింది. అతగాడు పెద్దయి- పెద్ద దొంగగా మారి పోలీసుల చేతిలో చిక్కిన తరవాత కానీ తల్లికి కూడా తాను చేసిన తప్పు గ్రహింపుకు రాలేదు.’ఇదేమిట్రా! మన ఇంటావంటా లేని ఈ దొంగతనాలేమిట్రా! దొంగతనం చేయడం తప్పురా తండ్రీ ‘ అంటూ ఆ అమ్మ తల్లడిల్లిపోతుంటే – ‘ ఈ ముక్క కరివేపాకు తెచ్చిననాడే చెప్పివుండాల్సిందమ్మా’ అనేసి ఆ దొంగ పిల్లాడు చక్కా జైలుకు పోతాడు.

కరివేపాకూ, తోటకూరో  ఏదో ఒక పేరుతొ  చిన్నప్పుడు  చదువుకున్న ఈ నీతికధ అందరికీ తెలిసిందే. ఇటీవల  జరుగుతున్న సంఘటనలు, మీడియాలో వస్తున్న కధనాలు గమనిస్తున్నప్పుడు ఈ కధని మరోమారు నెమరు వేసుకోవాల్సిన ఆవశ్యకత వుందనిపిస్తోంది.

మంచివాళ్ల మౌనం మరీ ప్రమాదం అని పెద్దలు జయప్రకాశ్ నారాయణ్ చెబుతుంటారు. అయితే, చెబితే వినేవాళ్ళు లేనప్పుడు, వినిపించుకునే పరిస్తితి లేనప్పుడు మౌనమే శ్రేయస్కరమని విదురనీతి చెబుతోంది. నాకు అర్ధం అయినంతవరకు, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో సాగుతున్న అర్ధం లేని రగడలో విదురుడి మాటే రైటని పిస్తోంది.

ఇలా మాట్లాడ్డం తగదు అని ఒకరికి చెప్పబోయేలోగా మరొకరు రెచ్చిపోయి మాట్లాడతారు. తెరవబోయిన నోరు ఠక్కున మూతబడిపోతుంది.

కామెంట్‌లు లేవు: