26, ఏప్రిల్ 2021, సోమవారం

మరుగున పడిన ‘మణిరత్నం’

కస్తూరి రామచంద్ర మూర్తి. ఈ పేరు ఎవ్వరికీ తెలియక పోవచ్చు. జర్నలిష్టు మిత్రుడు వీ.జే.ఎం. దివాకర్ కు స్వయానా మేనల్లుడు. కాకపొతే వయస్సులో కాస్త పెద్దవాడు. పుణే ఫిలిం ఇన్స్టిట్యూట్ లో సినిమాటోగ్రఫీ కోర్సు రెండో బ్యాచ్ . గోల్డ్ మెడలిష్ట్. అక్కడ కట్ చేస్తే...

ఏడిద నాగేశ్వరరావు (మా రేడియో సహచర ఉద్యోగి, నాటక ప్రియుడు ఏడిద గోపాల రావుకు స్వయానా అన్నగారు) విశ్వనాద్ దర్శకత్వంలో శంకరాభరణం సినిమా మొదలు పెట్టారు. బాలు మహేంద్ర సినిమాటోగ్రాఫర్. మొదటి షెడ్యూలు అయిందో లేదో తెలవదు, బాలూ మహేంద్రకి మొదటిసారి దర్శకత్వం వహించే అవకాశం వచ్చింది. చేసేది విశ్వనాద్ గారి సినిమా. వదిలిపెట్టాలంటే కష్టమే. చివరికి విశ్వనాథ్ గారే కల్పించుకుని, డైరెక్షన్ చేసే ఛాన్సు అరుదుగా వస్తుంది కాబట్టి, బాలూ మహేంద్రకి ఆ అవకాశం వాడుకోమని చెప్పి పంపేశారు. అంతవరకూ శంకరాభరణం సినిమాకి ఆపరేటివ్ కెమెరామన్ గా పనిచేస్తున్న కస్తూరి రామచంద్ర మూర్తికి మొత్తం బాధ్యత అప్పగించారు. సినిమా టైటిల్స్ లో మాత్రం బాలూ మహేంద్ర పేరునే వుంచేసారు.
కాకపోతే విశ్వనాద్ తరువాత సినిమా సప్తపది అనుకుంటా, దానికి సినిమాటోగ్రాఫర్ గా కస్తూరి రామచంద్ర మూర్తినే పెట్టుకున్నారు. ఆ రెండూ ఘన విజయం సాధించాయి కానీ కస్తూరి వారికి రావల్సినంత పేరు రాకపోగా అవకాశాలు కూడా రాలేదు.
సినిమాలు తీసేటప్పుడు కెమెరామన్ల జేబులో ఒక చిన్న పరికరం వుంటుంది. (ఏదో మీటర్ అంటారు) దాన్ని నటుడి మొహం మీద పెట్టి లైటింగుని సరిచేస్తారు (ట). అయితే మన కస్తూరి రామచంద్ర మూర్తి మాత్రం మొహం మీద అరచేయి అడ్డుగా పెట్టి లైటింగు సరిచేస్తారట, పూర్వకాలంలో వైద్యులు నాడిపట్టుకు చూసి రోగనిర్ధారణ చేసినట్టు. తన రంగంలో అంతటి ఘనుడామూర్తిగారు.
సినిమా రంగంలో ప్రతిభ వుంటే సరిపోదు, అదృష్టం కూడా వుండాలి అంటారు.
అందుకు కస్తూరివారు ఒక మంచి ఉదాహరణ.

కామెంట్‌లు లేవు: