17, జూన్ 2016, శుక్రవారం

తెనాలి ప్రేమికుడు


డాక్టర్ సామ్ పిట్రోడా, డాక్టర్ మాధవన్ నాయర్, డాక్టర్  కోట హరినారాయణ, డాక్టర్ కే. కస్తూరి రంగన్, డాక్టర్ ఎస్. స్వామినాధన్, ప్రొఫెసర్ ఎం.జీ.కే. మీనన్, డాక్టర్ యూ.వీ. వర్లు, వీళ్ళందరూ విభిన్న రంగాల్లో ప్రసిద్ధి చెందిన ప్రముఖ శాస్త్రవేత్తలు. మరి వీళ్ళందరికీ కామన్ పాయింటు ఒకటుంది. అదేమిటంటే డాక్టర్ నాయుడమ్మ అవార్డు గ్రహీతలు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశిష్టమైన పురస్కారంగా ఈ అవార్డును పరిగణించడం కద్దు. అంతే  కాదు, ఏటా ఇచ్చే ఈ అవార్డును స్వీకరించడం కోసం దేశంలోని సుదూర ప్రాంతాలనుంచి గ్రహీతలు తెనాలి వెళ్లి తీరాల్సిందే. అవార్డు ట్రష్టీల్లో ఒకరయిన పీ. విష్ణు మూర్తి గారిది ఈ గొప్పతనం. ఆయన పట్టుదలే క్షణం తీరికలేని అంతమంది ప్రముఖులను తెనాలి వెళ్ళేలా చేసింది. చాలా సందర్భాలలో నేనే ప్రత్యక్ష సాక్షిని.
విష్ణుమూర్తి గారిని  నాకు పరిచయం చేసింది హిందూ మాధవరావు గారు. ఆయనకో ఇంటి పేరుంది కానీ బహుశా ఆయనా  మరచిపోయి వుంటారు. హిందూ పత్రికలో సుదీర్ఘ కాలం విలేకరిగా పనిచేయడం వల్ల ఆ పేరే స్థిర పడిపోయింది.
ఏటా ఇచ్చే ఈ అవార్డుకు ‘గ్రహీతల’ ను ఎంపిక వ్యవహారం నిమిత్తం విష్ణుమూర్తి గారు తెనాలి నుంచి బస్సులో హైదరాబాదు వచ్చి సచివాలయం దగ్గరలోని ద్వారకా హోటల్లో దిగేవాళ్ళు. ఆ రోజుల్లో సెల్  ఫోన్లు లేవు కాబట్టి, రూమ్ తీసుకోగానే ఆయన మొదట చేసేపని మాధవరావు గారికీ, బిజినెస్ లైన్ సోమశేఖర్ కూ, నాకూ ఫోన్లు చేసి ఊళ్ళోకి వచ్చాను, సాయంత్రం కలుస్తున్నాము అనే వారు  ఓ ఆర్డరు లాగా. హోటల్  పక్కనే ఇల్లు కాబట్టి, చెప్పిన టైముకు ఠంచనుగా మాధవరావు గారు,  కాస్త దగ్గరలోనే  రేడియో స్టేషన్ వుంది  కాబట్టి కాస్త ఆలస్యంగా నేనూ, వర్కింగ్ జర్నలిష్టు కాబట్టి మరి కొద్ది లేటుగా ములుగు సోమశేఖర్ అలా ఆయన హోటల్ రూముకు చేరుకునేవాళ్ళం. వాళ్ళ వాళ్ళ వీలును బట్టి ఆకిరి రామకృష్ణా రావు గారు, ఆర్వీవీ కృష్ణారావు గారు ఈ చర్చల్లో పాల్గొనేవాళ్లు. శాస్త్ర సాంకేతిక రంగాలు కాబట్టి ఆ గొడవేదో వాళ్ళు ముగ్గురూ చూసుకుండేవాళ్ళు. మనం కాస్త పొలిటికల్ కాబట్టి  ముఖ్యమంత్రులు వగయిరా పేర్లు చెప్పేవాడిని. వారిని ముఖ్య అతిధులుగా పిలిచే పక్షంలో అటువంటి వాళ్లకు హైదరాబాదు అయితే సులువుగా ఉంటుందనేవాడిని. విష్ణుమూర్తి గారు ససేమిరా అనేవాళ్ళు. తెనాలి రావాల్సిందే అనేవారు మొండిగా.
ఇదిగో ఈ మొండితనం వల్లనే పైన పేర్కొన్న అంతటి ప్రసిద్ధులందరూ (నిజానికి ఈ జాబితా చాలా పెద్దది)  తెనాలి వెళ్లి నాయుడమ్మ పురస్కారం స్వీకరించి వచ్చారు.
ఆ విష్ణుమూర్తి ఇక లేరు. కొద్ది కాలం  అస్వస్తులుగా వుండి రాత్రి కన్నుమూశారు. 
       


కామెంట్‌లు లేవు: