23, మార్చి 2022, బుధవారం

అయ్యొస్తుండు బిడ్డా ఇమానంలో – భండారు శ్రీనివాసరావు

 ఏడ్చి ఏడ్చి ఎర్రబారిన కళ్ళతో, పూర్తిగా  సోయలేని స్థితిలో బయటకు వచ్చిన ఆమెకు ఇంటి ముందు సర్కారు వాళ్ళు పంపిన కారు కనబడింది. కార్లు కొత్త కాదు కానీ  కారులో ఎక్కడం కొత్త. ఆమె అవస్థ గమనించి ఎవరో డోరు తెరిచి ఎక్కించారు.  ఏమి జరిగిందో తెలియని పిల్లలు దిగాలుగా నిలబడ్డారు.

వాళ్లకు యేమని చెప్పాలి? అయ్యొస్తుండు బిడ్డా ఇమానంలో  అని చెప్పాలా! ఏమి చెప్పకుండానే కారు కదిలింది.  విమానాశ్రయం చేరింది. అక్కడ గుమికూడిన మరికొందరు  ఆడవాళ్ళ  రోదనలతో ఆ ప్రదేశం  మారుమోగుతోంది. ఆమెకూ దుఖం ఆగడం లేదు.

కాసేపటికి తెల్లటి గుడ్డలో చుట్టిన మనిషిని ఆమెకు  అప్పగించారు. గుడ్డ తొలగించి చూసింది. తెల్లటి రంగులో మెరిసిపోయే తన పెనిమిటి మంటల్లో కాలిపోయి మసి బొగ్గులా వున్నాడు.

‘ఈయనేనా మీ ఆయన. గుర్తు పడతావా’ ఎవరో అడుగుతున్నారు. యేమని చెప్పేట్టు. గుర్తు పట్టలేని విధంగా కాలిపోయిన మనిషిని గుర్తు పట్టాను అని ఎలా చెప్పేట్టు? 

ఉబికి వస్తున్న కన్నీటి పొరల నడుమ ఇంటి దగ్గర ఉన్న పిల్లలు ఆమె కంట్లో మెదిలారు. ఈ మనిషిని ఇలా తీసుకువెళ్లి వాళ్లకు యేమని చెప్పాలి?

“అయ్యొచ్చిండు  బిడ్డా ఇమానంలో” అని చెప్పాలా!

(సికిందరాబాదు బోయిగూడాలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన పదకొండు మంది బీహారు  కార్మికులను ప్రభుత్వం విమానంలో స్వరాష్ట్రానికి పంపుతోందన్న సమాచారం తెలిసిన నేపధ్యంలో)

(23-03-2022)