18, మే 2021, మంగళవారం

ధైర్య్యప్పిల్ల


మాకు తెలిసిన కుటుంబం కనుక పేర్లు చెప్పడం బాగుండదు. కానీ ఈ కరోనా కాలంలో నలుగురు తెలుసుకోవాల్సిన విషయం కనుక మిగిలిన వివరాలు రాస్తున్నాను.
అత్తా మామా, కొడుకూ కోడలు, వాళ్లకు ముగ్గురు పిల్లలు. అత్తామామలు పెద్ద వయసువాళ్ళు. మొగుడికి ఇంటి నుంచే పని. పిల్లలు కూడా అప్పటికి ఆన్ లైన్ క్లాసులు. కోడలు చదువుకున్నది చిన్నా చితకా చదువు కాదు. మంచి డాక్టరు. పైగా, కరోనా కాలంలో సెలవు దొరకని, తప్పనిసరిగా వెళ్ళాల్సిన ఉద్యోగం కూడా.
ఒకరోజు వృద్దురాలయిన అత్తగారికి గొంతులో నొప్పితో పాటు జ్వరం వచ్చింది. ఇంటిల్లిపాదీ కంగారు పడ్డారు. ఆసుపత్రి నుంచి వచ్చిన కోడలు ఏమాత్రం కంగారు పడకుండా, ‘మీకు వచ్చింది కరోనా కాదు’ అని గట్టిగా చెప్పింది. చెప్పింది డాక్టరు. నమ్మక పొతే ఎలా.
ఏదో వైద్యం చేస్తున్నట్టు బ్లడ్ సాంపిల్ తీసుకుంది. ‘కరోనా టెస్ట్ చేయిద్దాం’ అంటే అసలు ఆ అవసరమే లేదు. కొన్ని రోజులు విడిగా వుంటే చాలు అని వాళ్ళ పడక గదిలో అత్తగారిని వుంచి, మామగారి పడకను బయటకు మార్చింది. ఇదంతా ముందు జాగ్రత్త కోసమే కానీ అత్తయ్యకు వచ్చింది కరోనా కాదు అని మళ్ళీ స్థిరంగా చెప్పింది.
రెండోరోజు పాజిటివ్ అన్న రిజల్ట్ వచ్చింది. కానీ ఆ విషయం ఇంట్లో ఎవరికీ చెప్పలేదు. మీకు వచ్చింది వేరే. నేను మందులిస్తాను, వేసుకోండి, కాకపొతే కొన్ని రోజులు విడిగా, ఒంటరిగా ఉండక తప్పదు అని తేల్చి చెప్పింది.
ఉదయం ఆసుపత్రికే వెళ్ళే ముందే ఆవిడకి అవసరమైన ఆహారం మందులు ఇచ్చి వెళ్ళేది.
తనకు వచ్చింది కరోనా అనే అనుమానం మనసు మూలల్లో ఉన్నప్పటికీ, కోడలు అంత గట్టిగా చెబుతుండేసరికి ఆ అనుమానం ఆవిరై పోయింది. ఎలాంటి భయం లేకుండా ఐసోలేషన్ లో రెండు వారాలు వుండి బయటకు వచ్చింది.
ఇప్పటికీ ఆమెకు తెలియదు, తనకు కరోనా వచ్చి తగ్గిపోయిందని. కోడలుకు తెలుసు, కరోన వచ్చిందని తెలిస్తే అత్తగారు అంత నిబ్బరంగా ఐసోలేషన్ లో గడపలేదని.
మొత్తానికి కోడలు పిల్ల ధైర్యం చేయబట్టి కధ సుఖాంతం అయింది.
(18-05-2021)

కామెంట్‌లు లేవు: