3, మే 2021, సోమవారం

ధన్యజీవి జ్వాలా

 కంచి కామకోటి పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకులు, శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు ఆసేతు హిమాచలం అంతటా పరమ పూజ్యనీయులు. అలాంటి మహనీయుడి నోటి నుంచి ఒక రచయిత పేరు, ఇంటి పేరుతో సహా పలుమార్లు  ప్రస్తావనకు రావడం అంటే, అంతకు మించిన అదృష్టం వుండదు. అలాంటి సుకృతం నా మిత్రుడు,  నా మేనకోడలు విజయలక్ష్మి భర్త అయిన  వనం  జ్వాలా నరసింహారావుకు లభించడం మా కుటుంబం మొత్తానికి గర్వకారణం.     

జ్వాలా ఐహిక పరమైన గృహస్తుబాధ్యతలు ఓ పక్క నిర్వర్తిస్తూనే, మరోపక్క ఆముష్మిక మార్గంలో గత రెండు దశాబ్దాలుగా అనేక ఆధ్యాత్మిక గ్రంధ రచనలు  చేస్తూ వస్తున్నాడు. తాజాగా ‘ఆంధ్ర వాల్మీకి రామాయణ రసరమ్య గాధలు అనే పుస్తకాన్ని రాయడం, దర్శనం శర్మగా ప్రసిద్ధి చెందిన శ్రీ మరుమాముల వెంకట రమణ శర్మ ప్రచురించడం ఈ కరోనా కట్టడి సమయంలో కూడా ఎలాంటి అవాంతరాలు లేకుండా జరగడం నిజంగా ఒక అద్భుతమే. పరమేశ్వరుడి కృప ఉంటేనే సాధ్యం.



అంతకు మించిన భాగ్యం ఈ ఇరువురికీ దక్కింది ఎలా అంటే కంచి కామకోటి పీఠాధిపతులు పరమహంస పరివ్రాజకులు, శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు స్వయంగా తమ అమృత హస్తాలతో నిన్న ఆదివారం సాయంత్రం  ఈ పుస్తకాన్ని ఆవిష్కరించి అనుగ్రహ భాషణ చేయడం. కంచి పీఠం నుంచి స్వామి కరకమలాలతో చేసిన ఆవిష్కరణ కార్యక్రమాన్ని హైదారాబాదులోను, ఇతర ప్రదేశాలలోనూ ఉన్న భక్త జనం, దర్శనం ఆధ్యాత్మిక మాస పత్రిక వారు చేసిన ప్రత్యేక ఏర్పాట్ల ద్వారా వీక్షించగలిగారు.

ఈ సందర్భంగా ప్రసంగిస్తూ శ్రీ చరణులు ఇలా అన్నారు.

“రామాయణం  గొప్ప ఇతిహాసం. శ్రీరామచంద్రుడు  భారతీయ ఆధ్యాత్మిక తత్వానికి, సాంప్రదాయ పరంపరకు ప్రతీక. మనిషి అనేవాడు ఎలా వుండాలి అనేది రామాయణం చెబుతుంది.  రామనామం మధురాతి మధురం. అందుకే ఉత్తర భారతాన ప్రతి ఒక్క సామాజిక వర్గంలోనూ రామ రామ అనే పేరుకలవాళ్ళు  అనేకమంది వుంటారు.

“వనం – దర్శనం (రాసింది వనం జ్వాలా నరసింహారావు, ప్రచురించింది దర్శనం శర్మ). శ్రీరాముల వారు కూడా వనం దర్శనం చేశాడు. దండకారణ్యంలో ప్రవేశించాడు.

“వనం జ్వాలా నరసింహారావు లోగడ అనేలా ఆధ్యాత్మిక రచనలు చేశారు. ఇప్పుడు ఈ రామాయణం గురించి రాసారు. అయోధ్యలో రామమందిరం నిర్మాణం అవుతోంది. ఈనెలలోనే శ్రీరామ నవమి జరుపుకున్నాము. అదే సమయంలో రామాయణ రసరమ్య గాధలు పుస్తకం కూడా.

“విశాల దృక్పథం, అందర్నీ కలుపుకుని పోయే తత్వం (Coexistence), ధైర్యం ధన ప్రధానమైన జీవితం కాకుండా  గుణ  ప్రధానమైన జీవనం ఇవన్నీ భారతీయ సంస్కృతిలో భాగాలు. స్థిరప్రజ్ఞత, స్థితప్రజ్ఞతలతో భారతీయ ఇతిహాస పరంపర పరిపక్వత చెందింది.

“రానున్న తరాలలో ఈ పరంపర కొనసాగించడానికి వనం జ్వాలా నరసింహారావు రాసిన సంశోధనాత్మక  సాహిత్యం అవసరం.

“విభూతి అంటే ఏమిటి? గోమయం విశిష్టత ఏమిటి? తిలక ధారణ ఏమిటి అనే విషయాలను విపులీకరిస్తూ తమిళంలో ఒక పుస్తకం వేశారు. అలాంటివి తెలుగులో కూడా రావాలి. E-learning ద్వారా దేశ విదేశాల్లోని బాలబాలికలకు భారతీయ ఆధ్యాత్మిక విలువలను బోధించాలి”

గ్రంధ రచయిత శ్రీ వనం జ్వాలా నరసింహారావు మాట్లాడుతూ  ఆధ్యాత్మిక గ్రంధ రచనకు తనను ప్రోద్బలం చేసిన కారణాలను వివరించి, పుస్తకావిష్కరణ చేసిన కంచి స్వామికి కృతజ్ఞతలు తెలిపారు. దాదాపు రెండు గంటలకు పైగా సాగిన ఈ కార్యక్రమంలో కంచి కామకోటి పీఠాధిపతులు, పరమహంస పరివ్రాజకులు, శ్రీ శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ స్వామివారు ఆసాంతం  పాల్గొనడం ఓ విశేషం.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ ఎల్.వీ. సుబ్రహ్మణ్యం, కేంద్ర సమాచార హక్కు మాజీ కమిషనర్ శ్రీ మాడభూషి శ్రీధర్, ఎస్.బి.ఐ. మాజీ సీ.జీ.ఎం. శ్రీ భండారు రామచంద్రరావు, సీనియర్ జర్నలిస్ట్ శ్రీ వి.జే.ఎం. దివాకర్, బ్రహ్మశ్రీ కొడకండ్ల రాధాకృష్ణ శర్మ, శ్రీ దర్శనం శర్మ ప్రభ్రుతులు పాల్గొన్నారు.   

(03-05-2021)

             

  

కామెంట్‌లు లేవు: