30, మార్చి 2021, మంగళవారం

మళ్ళీ అంటున్నాను ఇది అవసరమా! – భండారు శ్రీనివాసరావు

“కాలం మారింది సర్ అన్ని మతాలను గౌరవించాలి అన్న మాట అన్నారు అంటే మీరు దేశద్రోహి అంతే”

Sreeram Eswara గారు పెట్టిన కామెంటు ఇది. నేను రాసిన పోస్టు చదివి నేరుగా నాపై చేసిన వ్యాఖ్య ఇది. ఇది వారి అభిప్రాయం. దాన్ని వ్యక్తం చేసుకునే స్వేచ్ఛ వారికి వుంది. నా సర్కిల్ లో వారు వున్నారో లేదో తెలియదు. కనుక ఆయన ఈ స్థాయిలో కామెంటు చేసినా, అందులో వాస్తవం వున్నాలేకపోయినా ఆ వ్యాఖ్యను నేను తొలగించడం లేదు.
కొందరు అలా కాకుండా నా పోస్టుతో సంబంధం లేకుండా వ్యాఖ్యలపై వ్యాఖ్యలు చేస్తూ అసలు విషయాన్ని పక్కదోవ పట్టిస్తున్నారు. అలాంటి వ్యాఖ్యలు తొలగించినా తప్పులేదు.
నా పోస్టుతో నేరుగా సంబంధం వుంటే వ్యాఖ్య రాయండి. లేదా ఊరుకోండి. నాతొ నిమిత్తం లేకుండా, సుదీర్ఘంగా సాగే చర్చకు జవాబు ఇవ్వడం కూడా కష్టం. సాధ్యం కాదు కూడా.
ఒక ‘దేశద్రోహి’తో ఫ్రెండ్ సర్కిల్ లో వుండడం Sreeram Eswara గారికి కూడా మంచిదికాదు. వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకుంటే నేను సంతోషిస్తాను.
నా రాతలు నచ్చని వాళ్ళు అనేకులు వున్నట్టు కూడా తేటతెల్లం అయింది. వారికోసం నా తీరు మార్చుకోను. వారికి నచ్చే రాతలు రాయలేను కూడా. కాబట్టి అలాంటివాళ్ళు కూడా ఏదో ఒక నిర్ణయం తీసుకోవడం మంచిది. ఎందుకంటే నా అంతట నేను బ్లాక్ చేయడం నాకెందుకో నచ్చదు. అది నా పాలసీ కాదు. వుండదలచుకుంటే వుండండి, సహనం పాటిస్తూ. హుందాగా ఉంటూ.
విదేశాల్లో పాదరక్షల మీద మన దేవతల బొమ్మలు వేయడం ఎవరూ హర్షించే విషయం కాదు. కాకపోతే ఈ విమర్శలు చేసేవాళ్ళు అసలు మన పురాణాలనే పూర్తిగా చదవలేదని అనిపిస్తోంది. రాక్షసుల చేత అంతకంటే భయంకరంగానే పురాణాల్లో దేవతలను అవమానాలకు గురి చేయించారు.
నేను హిందువుని. హిందూ ధర్మం పాటిస్తాను. ‘సహనావతు’ అని ఆ ధర్మం నాకు బోధించింది.
ఇక చివర్లో ఒక మాట.
నేను రాసేవి ఆయా రాజకీయ పార్తీలకోసం, లేదా వాళ్ళ అధినాయకులకోసం. కొన్ని సందర్భాలలో ఈ రాతలు వాళ్లకు ఫీడ్ బ్యాక్. అది వాళ్లకు తెలుసు. తెలియనిదల్లా వారి అభిమానులకు. వారిని పట్టించుకుంటూ రాయాలి అంటే ఏ జర్నలిస్టు కూడా ఒక్క వాక్యం రాయలేడు. కాబట్టి వారందరికీ ఓ నమస్కారం.
(30-03-2021)

కామెంట్‌లు లేవు: