16, ఆగస్టు 2025, శనివారం

చావుకు వయసెంత? – భండారు శ్రీనివాసరావు

 

మౌత్ కి ఉమర్ క్యా హై? దో పల్ భీ నహీ!”
అని రాసుకున్న కవి పండితుడు అటల్ బిహారీ వాజ్ పాయ్ మరణించిన రోజు నేడు.
“ ఏదో ఒక రోజు నేను మాజీ ప్రధానిని కావచ్చేమో కానీ, మాజీ కవిని ఎన్నటికీ కాను”
అని చెప్పుకున్న రాజకీయ దురంధరుడు అటల్ బిహారీ వాజ్ పాయ్ చనిపోయిన రోజు ఈ రోజు.
2018 ఆగస్టు 16 న ఆ మహానుభావుడు కన్నుమూశాడు.
ఒక రకంగా అదృష్టవంతుడు. రోజురోజుకూ దిగజారిపోతూ, అధఃపాతాళానికి పడిపోతున్న రాజకీయ విలువలను కళ్ళారా చూడకుండానే కన్నుమూశాడు.
డెబ్బయ్ ఏళ్ళ నాటి సంగతి.
అప్పటికి ఆ పార్టీ పేరు జనసంఘ్. ఇప్పుడు బీజేపీ. ప్రమిదె గుర్తు. బెజవాడలో ఎన్నికలప్పుడు ఏదో ఒక మూల గోడలమీద చేత్తో రాసిన ఈ గుర్తు కనబడేది. కానీ జనం గుర్తు పెట్టుకునే వాళ్లు కాదు.
ఆ రోజుల్లో, ఢిల్లీ నుంచి ఒక పెద్దాయన వస్తున్నాడు, గాంధీజీ మునిసిపల్ స్కూలు ఆవరణలో సాయంత్రం మీటింగు అంటూ వూళ్ళో టముకు వేసారు. తెలిసీ తెలియని వయసు. అయినా పెద్దవాళ్ళతో కలిసి వెళ్లాను. కాసేపటి తరువాత ఆ వచ్చినాయన మాట్లాడడం మొదలు పెట్టాడు. శుద్ధ హిందీ. ఒక్కరికీ అర్ధం అయినట్టు లేదు. మాటల జడివాన మొదలయింది. పిడుగులు పడ్డట్టుగా ప్రసంగం సాగింది. ఒక్క ముక్క అర్ధం కాకపోయినా స్పీచ్ అంటే ఇలా వుండాలి అని అనిపించింది. వచ్చిన వాళ్ళల్లో చాలామంది ఆయనకు అప్పటికప్పుడే అభిమానులు అయిపోయారు.
ఆయన ఎవరో కాదు, తదనంతర కాలంలో దేశానికి అయిదేళ్ళు సుస్థిర
పాలన అందించిన ప్రధాని అటల్ బిహారీ వాజ్ పాయ్.
భాష అర్ధం కాని వారిని సయితం తన వాగ్ధాటితో కట్టిపడేసిన ఆయనకు చివరి రోజుల్లో మాట పడిపోవడం ఏమిటో విధి వైచిత్రం కాకపొతే.
చనిపోయి ఏడేళ్లు ఏళ్ళు గడిచిపోయినా ఇప్పటికీ ప్రజల మనస్సులో జీవించేవున్న వాజ్ పాయ్ వర్ధంతి ఈరోజు.
కింది చిత్రం: పెన్సిల్ స్కెచ్ : శ్రీ పీ.వీ.ఆర్. మూర్తి
(16-08-2025)



కామెంట్‌లు లేవు: