4, ఆగస్టు 2013, ఆదివారం

కేసీఆర్ చెప్పిన భద్రాచలం కధ


కేసీఆర్ ని దగ్గరగా చూసి తొమ్మిదేళ్ళు అయిందేమో. 2004 లో దూరదర్శన్ లో పనిచేసేటప్పుడు సరిగా గుర్తులేదు కాని కాంగ్రెస్ తో ఎన్నికల పొత్తు గురించి చెప్పడానికి అనుకుంటా బంజారా హిల్స్ లో వున్న ఆయన ఇంట్లో పెట్టిన ప్రెస్ కాన్ఫరెన్స్ లో కలిసిన గుర్తు. మధ్యలో కొంత ఎడం వచ్చింది కాని నేను మాస్కో వెళ్ళాక మునుపు కేసీఆర్ ఎన్టీయార్ క్యాబినెట్ లో రవాణా శాఖ  మంత్రిగా వున్నప్పుడు తరచుగా కలుస్తూ వుండే మంత్రులలో ఆయన ఒకరు. సచివాలయంలో ముఖ్యమంత్రి  పేషీ వుండే ‘సమత’ బ్లాక్ పక్కనే మరో పాత భవనం వుండేది. అందులో వుండేది కేసీఆర్  కార్యాలయం. అదిప్పుడు లేదు. కూల్చేశారు.  ఆ ప్రదేశంలో ప్రస్తుతం ఏమీ వున్నట్టు లేదు.  సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసివచ్చిన రాజకీయ ప్రముఖులు విలేకరులతో నిలబడి మాట్లాడే మీడియా పాయింటు ఆ ప్రదేశంలో వుంది.
ఈరోజు మధ్యాన్నం వీ సిక్స్ టీవీ నుంచి ఫోను వచ్చింది. ఏదయినా అంశం మీద ‘బైట్’ కోసమేమో అనుకున్నా. తీరా చూస్తే క్రాంతి గారు. ఇలాటి వాటికి ఆయన ఫోను చేయాల్సిన అవసరం లేదు. వేరేవాళ్ళు ఇందుకోసం వున్నారు.
క్రాంతి చెప్పారు. ‘కేసీఆర్ కాసేపట్లో తాజ్ డెక్కన్ హోటల్ కు వస్తారు. మీట్ ది ప్రెస్ ప్రోగ్రాం. తప్పకుండా రండి. అదయిన తరువాత కొందరితో పిచ్చాపాటీగా మాట్లాడతారు. తప్పకుండా రండి’
రిటైర్ అయిన తరువాత ఇలా ఎవరి ప్రెస్ కాన్ఫరెన్స్ లకు వెళ్ళలేదు. ప్రత్యేక సందర్భాలలో ప్రత్యేకించి పిలిస్తే తప్ప. ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ కాదు. మీట్ ది ప్రెస్ కాబట్టి బయలుదేరి వెళ్లాను
.

(కేసీఆర్ మీట్ ది ప్రెస్ లో జ్వాలా, నేనూ, హెచ్.ఎం.టీ.వీ. శ్రీ ధర్ బాబు - ఫోటో భరత్ భూషణ్ సౌజన్యం)    

హాలు నిండి కిటకిటలాడుతోంది. అందరూ తెలియకపోయినా మా తరం జర్నలిస్టులు కొందరు కలిశారు. ఇంతలో ఇతర టీ ఆర్ ఎస్ నాయకులను వెంటబెట్టుకుని కేసీఆర్ వచ్చారు. ముందు వరసలో వున్న జర్నలిస్టులను పలకరిస్తూ నాతొ కూడా కరచాలనం చేసారు. ఓ క్షణం తేరిపార చూసినట్టు అనిపించింది కాని గుర్తు పట్టినట్టులేదు అనుకున్నాను.
సరే! ఆయన సుదీర్ఘంగా ప్రసంగించారు. రాజకీయ నాయకులు అంతసేపు మాట్లాడితే కాస్త భరించడం కష్టం. కాని ఆయన చెప్పిన విషయాలు, తడుముకోకుండా, అసహనానికి గురికాకుండా విలేకరుల ప్రశ్నలకు జవాబులు ఇచ్చిన తీరు సభికులను కట్టి పడేశాయి. సభికులు అని ఎందుకు అంటున్నానంటే అది విలేకరుల సమావేశం లా లేదు. ఓ మోస్తరు బహిరంగ సభలా వుంది. గిట్టని వాళ్ళు ఆయన్ని ‘మాటల మాంత్రికుడు’ అంటుంటారు కాని నిజంగా ఆయన మాటల్ని మంత్రించి వొదలడంలో దిట్ట. ఆయన చెప్పిందంతా తిరిగి రాయాలంటే ఓ గ్రంధం అవుతుంది. తెలంగాణా కల నెరవేరిననాడు ఆ కొత్త రాష్ట్రాన్ని ఎలా తీర్చి దిద్దబోతున్నదీ ఆయన సవివరంగా చెప్పారు. వినడానికి అంతా కల మాదిరిగానే వుంది. నూతన తెలంగాణా ఆవిష్కృతం అయ్యే క్రమంలో ఆయన చెప్పిన విషయాలు – ఒక రకంగా ఏదో ఒక సందర్భంలో చెప్పినవే అయినా – వాటన్నిటిని ఆయన గుది  గుచ్చి చెప్పిన తీరు ‘ప్రత్యక్షప్రసారం’లో చూస్తున్న మిత్రుడు ఒకరు ఎస్ ఎం ఎస్ పంపారు. ఆయన ఓ అయిదేళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి, ఇప్పుడు చెప్పినంతగా యావత్ ఆంద్రప్రదేశ్ ని అభివృద్ధి చేసివుంటే ఇప్పుడీ గొడవలే ఉండేవి కావన్నది దాని తాత్పర్యం. అన్నీ ఇక్కడ ప్రస్తుతం కాని భద్రాచలం సంగతేమిటి అని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు జవాబుగా చరిత్రలోని ఒక వృత్తాంతాన్ని వివరించారు. వెనుక అది తెలంగాణాలోనే వుండేది. భక్త రామదాసును బందిఖానాలో వేసింది అప్పటి గోలకొండ కోటలోనే. పొతే, భద్రాచలానికి పొరుగున బ్రిటిష్ ఇండియాలోని వైజాగ్ ప్రాంతంలో ఒక ముష్కరుడు గ్రామాలమీద పడి దోపిడీలు చేస్తుంటే బ్రటిష్ సాయుధ సాయాన్ని కోరడం, వాళ్ళు  ఆ దోపిడీదారుడి నుంచి ప్రజలకు ఉపశమనం కల్పించడం, చేసిన సాయానికి కృతజ్ఞతగా నవాబు గారు  గోదావరి ఆవల వైపువున్న ప్రాంతాన్ని వారికి దఖలు పరచడం – ఇదంతా వినడానికి చాలా ఆసక్తిగా అనిపించింది. అదే కేసీఆర్ ప్రత్యేకత.
సమావేశం ముగిసే సరికి చాలా పొద్దు పోయింది. ఆయన ఆప్యాయంగా భోజనానికి వెంటబెట్టుకుని పోయారు. పక్కపక్కనే కూర్చుని భోజనం. అది హోటల్ అయినా అందర్నీ చక్కగా కనుక్కున్నారు. ఎవేవో పదార్ధాలు ఆయనకు వడ్డించబోతే, వద్దు ఇంత అన్నం, పప్పూ పట్టుకు రమ్మన్నారు. సింపుల్ భోజనం. ఆయనకు నేనెవరో క్రమంగా గుర్తుకువచ్చినట్టు వుంది. పక్కనే కూర్చోబెట్టుకుని ఆప్యాయంగా మాట్లాడారు. అనేక ముచ్చట్లు చెప్పారు.

మొత్తానికి చాలా రోజుల తరువాత జీవితం విభిన్నంగా గడిచినట్టనిపించింది. పోనీలే మంచిదే అనుకున్నాను. (04-0802013)                                     

కామెంట్‌లు లేవు: