3, ఆగస్టు 2013, శనివారం

భండారు వంశం

(నిన్నటి తరువాయి)

మగవాళ్ళ మధ్య ఇంతగా వైరాలు నడుస్తున్నా, పిల్లలు కలిసి ఆడుకోవడానికి కాని, ఆడవాళ్ళు కలిసి మంచి నీళ్ళ బావికి వెళ్ళడానికి కాని, మధ్యాహ్నం వేళల్లో కలిసి కూర్చుని కాలక్షేపానికి పచ్చీసు ఆడుకోవడానికి కాని మగవాళ్ళు అభ్యంతరం పెట్టేవాళ్ళు కాదు. లక్ష్మయ్య తాతయ్య గారి భార్య వరలక్ష్మి ( అంతా వరమ్మగారనేవారు, మేమంతా వరం బామ్మ అనేవాళ్ళం) ఎంతో ఆప్యాయత, ఆపేక్ష కలకలిగిన  మనిషి. మమ్మల్నీ, వాళ్ళ పిల్లల్నీ సమంగా చూసేది. మా నాన్నగారికి మేము పదకొండుమందిమి. ఏడుగురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలం. మా ప్రసాదం బాబాయి గారికి ఒక్కడే కొడుకు సత్యమూర్తి. ఆడపిల్లలు ఇద్దరు – సుగుణ, మధుర. మేమంతా ఎంతో స్నేహంగా, కలివిడిగా వుండేవాళ్ళం. నేనూ (పర్వతాలరావు) సత్యమూర్తి అన్నయ్య  చాలా  స్నేహంగా వుండేవాళ్ళం. మా రెండిళ్ళ నడుమ తగాదాలను గురించి మేం కాలేజీలో చదివేటప్పుడు తరచూ చర్చించుకునేవాళ్ళం. ‘మనం పెద్దవాళ్ళం అయిన తరువాత అలాటి గొడవలను ఇక ససేమిరా రానీయ వద్దు’ అని దీక్ష పూనాం కూడా. ఆవిధంగానే, తగాదాలు, గొడవలు అన్నీ పెద్దవాళ్ళతోటే పోయాయి.


(కీర్తిశేషులు శ్రీ భండారు సత్యమూర్తి)

సత్యమూర్తి  అన్నయ్య మాకే కాక ఊరంతటికీ పెద్ద అండగా ఉండేవాడు. సహాయకారి. పైపెచ్చు ధైర్యశాలి కూడా. దేనికీ భయపడే తత్వం కాదు. రాజకీయాల్లో తిరిగినా, హింస, దౌర్జన్యాలకు తావులేకుండా సామరస్య పూర్వకంగా వ్యవహారాలు నడిపేవాడు.  మా వూరి పంచాయతీకి మొట్టమొదటి సర్పంచ్ గా పనిచేసాడు. గ్రామాభివృద్ధికి బాగా పాటుపడ్డాడు. కాకాని వెంకటరత్నం గారికి ఏకలవ్య శిష్యుడు. చదువుకోసం వెళ్ళిన నన్ను తప్పిస్తే ఆయనే మా వూరునుంచి  హైదరాబాదు వ్యవహారరీత్యా వెళ్లి వచ్చిన మొదటి వాడు. ఆయన హైదరాబాదులో బస్సు దిగి నేరుగా ఖైరతాబాదులో, కాకాని వెంకట రత్నం గారు మంత్రిగా వున్న ఇంటికి వెళ్ళిపోయేవాడు. వూరికి తిరిగి వచ్చిన తరువాత ‘హైడ్రాడ్’ (ఆయన ఉచ్చారణ అలానే వుండేది) విశేషాలను వైన వైనాలుగా వివరంగా చెప్పేవాడు. ఊరివారందరు గుమికూడి ఆ సంగతులన్నీ ఆసక్తిగా వినేవారు. ఊళ్ళోకి కరెంటు తీసుకు రావడానికి, రోడ్డు పడడానికి ఎంతో శ్రమ పడ్డాడు. గుండె జబ్బుతో ఆయన అకాల మరణం చెందకపోతే, మా వూరికి ఆయన తిరుగులేని నాయకుడిగా ఉండేవాడు. వూళ్ళో కలిగిన వాళ్ళే కాకుండా బీదాబిక్కీ కూడా ఆయన్ని విపరీతంగా అభిమానించేవారు. ఆయన చనిపోయినప్పుడు వారంతా తాము దిక్కులేని వాళ్ళు అయిపోయినట్టు దుఖించారు. ఆయన మృత దేహాన్ని మోసే హక్కు  మీకే కాదు మాకూ వుందని ఇంటి వాళ్ళతో పోట్లాడి చివరకు అందరు కలసి స్మశానానికి తీసుకువెళ్ళి దహనం చేసారు. మేమందరం నిమిత్తమాత్రులుగా చూస్తూ ఉండిపోయాం. ఆరోజుల్లో స్మశానాలకు ఆడవాళ్ళు వచ్చేవాళ్ళు కాదు. కాని అదేమిటో ఆ రోజు వూరు వూరంతా తరలివచ్చింది. అక్కడ కులబేధం అని కాని, చిన్నా పెద్దా అని కాని  లేకుండా అంతా ఆయన చితిలో కట్టెపుల్లలు వేయడానికి తొక్కిసలాడారు. ‘మేమంతా ఆయన పిల్లలమేగా, ఆయన చితికి నిప్పంటించే కర్తవ్యం మాకు లేదా’ అంటూ షెడ్యూల్డ్ కులాలవారు పెద్దగా ఏడుస్తూ  ఆయన చితిపై కొరవులు వేయడం అందరి హృదయాలను కదిలించింది. అంతమంది అభిమానాన్ని సంపాదించుకున్న సత్యమూర్తి అన్నయ్య ధన్యజీవి. చిరంజీవి. ఇప్పటికీ గ్రామంలో ఏదయినా సమస్య తలెత్తితే ‘ సత్యమూర్తి గారు ఉంటేనా ..’ అనుకోవడం సర్వసాధారణం అయిపోయింది.
(మరో భాగం మరో సారి)

కామెంట్‌లు లేవు: