12, ఆగస్టు 2013, సోమవారం

తేరా భారత్! మేరా మహాన్!!




ఇటాలియన్ మంత్రిగారొకరు హడావిడిగా ఇండియా వచ్చి భారత విదేశాంగ మంత్రితో సమావేశం అయ్యారు. దీనికి కొంత నేపధ్యం వుంది. ఇటలీ నౌకాదళ సైనికులు ఇద్దర్ని అంతకు కొన్ని రోజులముందు కేరళ పోలీసులు అరెస్టు చేశారు. కేరళ, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన మత్స్యకారులను సముద్రపు దొంగలుగా భ్రమపడి  ఇటలీ సైనికులు కాల్చి చంపారని అభియోగం. వారిని విడిపించే ప్రయత్నంలో భాగంగా ఇటలీ మంత్రి ఇండియా మంత్రి చర్చలు జరుపుతున్నారు.
పట్టుబడిన  ఇద్దరినీ ఇండియాలోనే వుంచి విచారణ జరపడం మంచిదని ఇండియా మంత్రి ఇటలీ మంత్రికి సలహా ఇచ్చారు. ఈ విషయాన్ని వివరించే క్రమంలో ఆయన ఇటలీ మంత్రికి కొన్ని విషయాలు విశదం చేశారు.
ఇటలీలో పుట్టి పెరిగి ఇండియా కోడలిగా వచ్చి ఇప్పుడు ఏకంగా మొత్తం ఇండియానే శాసిస్తున్న సోనియా గాంధీకి జాతీయ అంతర్జాతీయ నేరస్తులపట్ల యెనలేని  కనికరం వున్న సంగతి యాదాలాపంగా బయట పెట్టారు. అందుకు దృష్ట్యాంతంగా   యూనియన్ కార్బైడ్ వ్యవహారం గురించీ, ఆయుధాల వ్యాపారి ఖత్రోచీ గురించీ, చివరాఖరుకు పాక్ ఉగ్రవాది కసబ్ పట్ల చూపిన  అపూర్వఆదరణ  గురించీ  ఇటలీ మంత్రికి వివరించి చెప్పి, ఇటాలియన్ సైనికుల విచారణ ఇండియాలోనే జరగడం వల్ల వాళ్లకు మంచే కాని చెడు జరగదన్న విషయాన్ని విడమరచి చెప్పారు.
అంతేకాదు స్పెక్ట్రం కుంభకోణం గురించీ, అందులో పీకల్లోతు ఇరుక్కున్న రాజా, కనిమొళి గురించీ ఇటలీ మంత్రి చెవిలో వేసారు. స్విస్  బ్యాంకుల్లో  కోట్లకు కోట్లు డబ్బు దాచుకున్న వారి సంగతి కూడా చెప్పి అలాటివారంతా భారత దేశంలో ఎలాటి  చీకూ చింతా లేకుండా యెలా రోజులు వెళ్ళదీస్తున్నారో సయితం అంకెలతో సహా చెప్పిచూసారు.        
ఎంతచెప్పినా ఆ ఇటలీ మంత్రికి చెవికెక్కిన దాఖలాలు లేవు.  భారత దేశంలో తన వారిపై విచారణ జరపడానికి సుతరామూ ఆయన  అంగీకరించలేదు. నేరస్తులకు రక్షణ పూర్తిగా వుంటుందని యెంత చెప్పినా అర్ధం చేసుకోని ఇటలీ మంత్రిపై ఇండియా మంత్రికి పట్టలేని కోపం వచ్చింది.
అయితే ఇంతలో ఒక అద్భుతం జరిగిపోయింది.
మంత్రి గదిలో వున్న టెలివిజన్ తెరపై అప్పుడు ఒక స్క్రోలింగ్ వస్తోంది.
ఇటలీ నౌకను పాతిక లక్షల రూపాయల పూచీకత్తుపై విడిచిపెట్టాలని కేరళ న్యాయమూర్తి ఆదేశించారన్నది  ఆ వార్త సారాంశం.
పాతిక లక్షల రూపాయలంటే యెంత అని ఇటలీ మంత్రి అడిగాడు. సుమారుగా ముప్పయ్ ఎనిమిది వేల   యూరోలని ఇండియా మంత్రి జవాబు చెప్పాడు.
భారత దేశ పౌరసత్వం దొరకాలంటే ఏం చెయ్యాలని ఇటలీ మంత్రి ఆసక్తిగా అడిగాడు.
నెహ్రూ కుటుంబంతో వియ్యం అందితే ఇట్టే  దొరుకుతుందని ఇటునుంచి సమాధానం.
వాళ్ల కుటుంబంలో  పెళ్ళికాని ప్రసాద్రాహుల్ ఒక్కడే కదా! అదెలా సాధ్యం?’ అని ఇటాలియన్ మరో ప్రశ్న సంధించాడు.
అనవసరంగా రాహుల్ ప్రసక్తి తెచ్చానే అని నీళ్ళు నమిలిన ఇండియా మంత్రి సిటిజన్ షిప్ లాంటి తతంగాలన్నీ అత్యల్ప స్వల్ప విషయాలు. వాటిని గురించి కనుక్కుని ఏర్పాట్లు చేయడానికి కోటరీ చాలా వుంది. ముందు మీ సంగతి  తేల్చండిఅన్నాడు.          
ఇటలీ మంత్రి కూర్చున్న చోటి నుంచి కదలకుండా రోముకు ఫోను చేసి తాను ఇప్పట్లో ఇటలీ రావడం లేదని చెప్పాడు. మరో ఫోను సిసిలీకి చేసి అక్కడి మాఫియా అధినేతతో మాట్లాడాడు.
ఇన్నాళ్లబట్టి మీరంతా ఏదో పోటుగాళ్లన్న భ్రమలో వున్నాం. ఒకసారి ఇండియా వచ్చి చూడండి. ఇక్కడివాళ్ళు చాలా తెలివిమీరిపోయారు. మీరింకా పాత రాతి యుగంలోనే  వున్నారన్న సంగతి భారత దేశానికి వస్తే అర్ధమవుతుంది.

(ఇంటర్నెట్ లో సంచారం చేస్తున్న ఇంగ్లీష్ జోకుకు స్వేచ్ఛానువాదం)   

కామెంట్‌లు లేవు: