15, ఫిబ్రవరి 2022, మంగళవారం

కొలిపాక కాందాన్ తిరుపతి యాత్ర

 

నీ కర్తవ్యాన్ని నువ్వు పాలించు. మిగిలినవి నాకు వదిలెయ్యి’ అన్నాడు నారాయణుడు నరుడితో.

నరుడితో అన్నాడు కానీ నరులతో కాదుకదా అని ఆ గీతావాక్యాన్ని ఈ చెవితో విని ఆ చెవితో వదిలేస్తున్నారు నాబోటి మానవులు.

అయితే చెవినపెట్టడడమే కాదు చేసి చూపించేవాళ్ళు కూడా వున్నారు. వారే వీరు.

మొత్తం నలభయ్ ఎనిమిదిమంది. నాలుగేళ్ల పిల్లవాడి నుంచి ఎనభయ్ అయిదేళ్ళ వృద్దురాలివరకు ఈ యాత్రలో పాల్గొన్నారు. హాయిగా తిరుపతి వెళ్ళారు. తృప్తిగా దర్శనం చేసుకున్నారు. మొక్కుబళ్ళుతీర్చున్నారు. ఎంచక్కా తిరిగొచ్చారు. ఒక్క పిర్యాదు లేదు. ఒక్క నసుగుడు లేదు. ఎలా! అంటే నారాయణుడు చెప్పినట్టు విన్నారు. చేయాల్సిన మానవ ప్రయత్నం చేశారు. ఫలితం దేవుడికి వదిలేసారు. అక్కడినుంచి ఆయనే చూసుకున్నాడు.

కొలిపాక కాందాన్ వాట్సాప్ గ్రూపులోఒక మెసేజ్ వెళ్ళింది, కొలనరావు నుంచి.

పలానా రోజున బయలుదేరుతున్నాం తిరుపతికి. పలానా రైల్లో. ఆరోజు యాభయ్ అరవై ఖాళీ బెర్తులు వున్నాయి. ఇష్టం వున్నవాళ్ళు, రావాలనుకునే వాళ్ళు వెంటనే కన్ఫర్మ్ చేయండి”

ఆ రోజు ఏ వారం. ఆఫీసులు ఉంటాయా? పిల్లలకు పరీక్షలు ఉంటాయేమో! సవాలక్ష అనుమానాలు. తీర్చుకునే వ్యవధి లేదు.

టిక్కెట్లు బుక్ చేయాలి వెంటనే చెప్పండి’ అనే విన్నపంతో కూడిన హుకుం.

అయిదే అయిదు నిమిషాల్లో నలభయ్ ఎనిమిది మంది కన్ఫర్మ్ చేసారు. ‘వీలుండి పొతేపోతాం. పోలేకపోతే హుండీలో వేశామనుకుందాం’. విడివిడిగా అందరూ అనుకున్న మాట ఇదే.

ప్రయత్నం ఫలించింది. అందరికీ రైలు టిక్కెట్లు దొరికాయి రానూ పోను.

ఇక దర్శనం, కాటేజీ బుకింగ్.

మళ్ళీ మరో మెసేజ్ వెళ్ళింది.

నెట్ ఫెసిలిటీ ఉన్న అయిదారుగురం అందరి ఆధార్ వివరాలతో ఉదయం ఏడుకల్లా ఒకచోట కలుద్దాం’

మర్నాడే కలిశారు. క్షణం ఆలస్యం చేయకుండా తిరుమల వెబ్ సైట్ ఓపెన్ చేసారు. ఒకేసారి అన్ని వివరాలు దగ్గర ఉంచుకుని ప్రయత్నం చేశారు. నారాయణుడి మాట విన్నారు. మానవ ప్రయత్నం చేసారు.

గీతా వాక్యం నిజమైంది. అనుకున్న దర్శనం టిక్కెట్లు అన్నీ దొరికాయి. అల్లాగే వసతి ఏర్పాట్లు.

ఇక చకా చకా మేసేజిలు అటూ ఇటూ పరిగెత్తాయి. ప్రతి పనికీ ఒకరు బాధ్యత తీసుకున్నారు. ఒకళ్ళు తిండీ తిప్పలు. మరొకళ్ళు చిన్న పిల్లల ఆలనా పాలనా. ఇంకొకళ్ళు పెద్దవాళ్ళ మంచీచెడ్డల బాధ్యత. వేరొకళ్ళు సమన్వయం.

ఘడియ దగ్గర పడింది. అన్నీ అనుకున్నట్టు జరుగుతున్నాయో లేదో చూడడానికి ముందుగా ఒకళ్ళను పంపారు. కొండకు తీసుకువెళ్ళే మూడు ఏసీ మినీ బస్సుల్ని కుదుర్చుకున్నారు. అన్నీ ఆన్ లైన్ లోనే. అనుకున్న ప్రకారం రైల్వే స్టేషన్ చేరుకున్నారు. ఒకళ్ళు అందరూ వచ్చారా లేదా ఆజా కనుక్కుంటే మరొకళ్ళు లగేజీ చెక్ చేసారు. ముందుగా బుక్ చేసుకోవడం చేత ఒక బోగీలోనే అందరికీ బెర్తులు దొరికాయి. చిరుతిండ్లు ఇళ్ళవద్దనే తయారు చేసుకున్నారు. తినే పేపరు ప్లేట్లు, గ్లాసులు, వాడిన వాటిని ఒకేసారి పారేయడానికి పెద్ద పెద్ద డిస్పోజబుల్ బ్యాగ్స్ అన్నీ రెడీ.

తిరుపతిలో రైలు దిగగానే మినీ బస్సులు ఎక్కారు. కొండపైకి వెళ్ళారు. అందరికీ ఒకే భవనంలో వసతి దొరికింది. సాయంత్రం కాగానే నిర్దేశిత సమయానికి క్యూ కాంప్లెక్స్ కి వెళ్ళారు. గంటల్లో దర్శనం అయింది. వీళ్ళల్లో పెద్దవాళ్ళు కొందరు వయో వృద్ధుల కోసం ఏర్పరచిన సదుపాయం ఉపయోగించుకుని త్వరగా దర్శనం చేసుకున్నారు.

కొండ పైనా కిందా హోటళ్ళలో ఒకేసారి టేబుల్స్ ఇంతమందికి దొరకడం కష్టం. అందుకని ఒకళ్ళిద్దరు ముందుగా వెళ్లి టేబుల్స్ సిద్ధం కాగానే మెసేజ్ పెట్టేవాళ్ళు. ఎక్కువ సమయం వేచి ఉండకుండా భోజన కార్యక్రమం పూర్తయ్యేది.

ఇలానే మంగాపురం. ఇలానే తిరుగు ప్రయాణం. ఇలానే హాయిగా యాత్ర పూర్తి చేసుకుని హైదరాబాదు తిరిగొచ్చారు.

ఇదంతా జయప్రదం కావడానికి ఈ యాత్రకు వెళ్ళిన వారిలో చాలామంది తమవంతు సాయం చేసిన మాట నిజమే కానీ వాళ్ళు అందరూ ముక్త కంఠంతో చెప్పే మాట ఒక్కటే. చెప్పేపేరు ఒక్కటే. కొలనరావు. అంటే మా మేనల్లుడు. ‘వాడు ఒక పధకం ప్రకారం అన్ని ఏర్పాట్లు చేయబట్టే ఇది సాధ్యం అయింద’ని కొలనరావు అన్నయ్య రాంబాబు చెప్పాడు. చెబుతూ ఈ యాత్రా విశేషాలన్నీ నా చెవిన వేసాడు.

ఒక పైరవీ లేదు. ఒక్క సిఫారసు కాగితం లేదు. ఒకళ్ళని ప్రాధేయపడింది లేదు. జరుగుతుందో లేదో అనే భయం లేదు. జరగదేమో అనే ఆందోళన అంతకంటే లేదు. వెళ్ళేటప్పుడు వేరే ఏ ధ్యాసా లేకుండా వెళ్ళాము. వచ్చేటప్పుడు మంచి దర్శనం దొరికిందనే తృప్తితో వచ్చాము’ అన్నాడు రాంబాబు.



1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

‘ఒక పైరవీ లేదు. ఒక్క సిఫారసు కాగితం లేదు. ఒకళ్ళని ప్రాధేయపడింది లేదు' - ఇధి నిజంగా అభినందనీయం.