16, ఫిబ్రవరి 2022, బుధవారం

దటీజ్ కేసీఆర్ - భండారు శ్రీనివాసరావు

 

(ఫిబ్రవరి 17 కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని ఈరోజు (16-02-2022) నమస్తే తెలంగాణ దినపత్రికలో ప్రచురితం)

అద్భుతమైన తెలివితేటలతో రాణించాలంటే అమెరికా వెళ్లి హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో చదువుకోనక్కరలేదని రుజువు చేసారు తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు. ఆ స్కూల్లో చదువుకుంటే కూడా లభించని వ్యవహారదక్షత ఆయనలో పుష్కలం.
బిజినెస్ స్కూల్లో నేర్పే మోటివేషన్, డెలిగేషన్ మొదలయిన విషయాలు కేసీఆర్ కు పుట్టుకతోనే అబ్బాయనుకోవాలి. రాజకీయాల్లో చేరి మంత్రిగా పనిచేసినప్పుడు, మరీ ముఖ్యంగా ముఖ్యమంత్రిగా ఇప్పుడు పనిచేస్తున్నప్పుడు ఈ లక్షణాలు ఎంతగానో ఆయనకు ఉపయోగపడ్డాయి. పడుతున్నాయి.
కేసీఆర్ నవజాత తెలంగాణా తొలి ముఖ్యమంత్రిగా ఏడాది పాలన పూర్తిచేసుకున్నప్పుడు ఊహించని వ్యక్తి నుంచి ఆయనకు దక్కిన ఒక చక్కటి కితాబును ఇక్కడ గుర్తు చేసుకోవాలి.
ఈ కితాబు ఇచ్చింది కూడా ఆషామాషీ మనిషేమీ కాదు. మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా వున్నప్పుడు చాలాకాలం ఆయన వద్ద సమాచార సలహాదారుగా పనిచేసిన ఆర్ధిక వ్యవహారాల పాత్రికేయుడు సంజయ్ బారు. నిజానికి ఈ బారు గారు ప్రత్యేక తెలంగాణాకు బద్ధ వ్యతిరేకి. కరడుగట్టిన సమైక్యవాది. తన మనస్సులోని ఈమాటని అయన ఏనాడూ దాచుకోలేదు. అలాటి సంజయ్ బారు, తెలంగాణా కల సాకారం అయిన ఏడాది తరువాత అన్నమాట ఇది. నిజానికి అక్షరాలా రాసిన మాట ఇది.
‘డెక్కన్ హైదరాబాదు గురించి నేను భయపడ్డది ఏమీ జరగలేదు. ఇక్కడి (తెలంగాణా) వారికి అరమరికలు తెలియవు, ఆదరించి అక్కున చేర్చుకునే తత్వం ఇక్కడివారి సొంతం. అన్నింటికీ మించి ఈ నగరానికి వున్న ప్రత్యేక ఆకర్షణ, శోభ, సౌందర్యం ఇవేవీ (తెలంగాణా ఏర్పడ్డ తరువాత) చెరిగిపోలేదు. ఇవన్నీ చరిత్ర పుటల్లో చేరిపోతాయేమో అని నేను భయపడ్డాను. కానీ నా సందేహాలన్నీ పటాపంచలయ్యాయి' అని ఒక ఆంగ్ల జాతీయ దినపత్రికలో రాసిన వ్యాసంలో సంజయ్ బారు పేర్కొన్నారు.
అయితే ఈ ఘనతను కేసీఆర్ ఏనాడూ తన సొంత ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేయలేదు. సరికదా, సమయం దొరికినప్పుడల్లా సంబంధిత మంత్రి, జెన్కో చైర్మన్, అధికారులు, సిబ్బంది సమష్టి కృషి వల్లనే ఈ ‘అద్భుతం’ సాధ్యం అయిందని పలుమార్లు బహిరంగంగా చెప్పుకొచ్చారు కూడా. పరిపాలనలో ‘నేను’ అని కాకుండా ‘మేము’ అనే పదాన్ని మించిన మోటివేషన్ ఏముంటుంది? అందుకే ఈ విషయంలో ఇక ఆయన కొత్తగా నేర్చుకోవాల్సిన పాఠాలు లేకుండా పోయాయి.
అలాగే, బిజినెస్ గురువులు చెప్పే మరో అంశం డెలిగేషన్. అంటే అధికారాలు, బాధ్యతల బదిలీ. ముఖ్యమంత్రిగా ఎన్నో అధికారాలు తనవద్దనే కేంద్రీకృతం అయివున్నా వాటిని సంబంధిత మంత్రులకు, అధికారులకు కేసీఆర్ అప్పచెప్పేసారు. లక్ష్యాలు నిర్ణయించి, ఫలితాలు రాబట్టాలని నిర్దేశించారు. అన్నింటా తానయి, అన్నిట్లో వేలు దూర్చడం కాకుండా దశ, దిశలను నిర్దేశించడం వరకే తన పాత్రను పరిమితం చేసుకుని ఫలితాలు సాధించే పనిని ఎంచుకున్నారు. మిషన్ భగీరధ, మిషన్ కాకతీయ ఇందుకు ఉదాహరణలు. అయితే కేసీఆర్ కు ఉన్న ఈ ప్రత్యేక లక్షణం కారణంగా ముఖ్యమంత్రి. తన క్యాంప్ కార్యాలయానికో, ఫాం హౌస్ కో పరిమితమై పోతున్నారనే అపవాదును కొనితెచ్చిన మాట కూడా నిజం.
అనర్ఘలంగా ప్రసంగించేవారు రాజకీయుల్లో చాలామంది కనబడతారు. కానీ ఆకట్టుకునేలా ఉపన్యసించడం కేసీఆర్ కి వెన్నతో పెట్టిన విద్య. తన ఎదురుగా వున్న శ్రోతలను బట్టి ఆయన ప్రసంగశైలిని మార్చుకుంటారు. మహిళలు, ఉపాధ్యాయులు, మేధావులు, విలేకరులు ఇలా ఎవరికి తగ్గట్టు అప్పటికప్పుడు ఆయన ప్రసంగధోరణి మారిపోతుంది. వారి వారి అభిరుచులు, ఇష్టాఇష్టాలను గమనిస్తూ సంభాషణ కానీ, ఉపన్యాసం కానీ కొనసాగించడం ఆయన ప్రత్యేకత. వేదిక ఎక్కి ఆశువుగా మాట్లాడితే ఇక దానికి అడ్డే వుండదు. అదే కాగితాలు చూస్తూ చదివితే పేలవంగా వున్నట్టనిపిస్తుంది. ఈ విషయం ఆయనే అనేక సందర్భాలలో స్వయంగా చెప్పారు. కాగితం చూస్తూ చదవడం తనకు ఇష్టం ఉండదని, అయినా కొన్ని కొన్ని అధికారిక కార్యక్రమాల్లో తప్పడం లేదని అన్నారు కూడా. భోజనం వేళకు ఇంట్లో ఎంతమంది వుంటే అంతమందిని భోజనాలకు లేపడం ఆయనకు ఓ అలవాటని ఆయన సన్నిహితులు చెబుతుంటారు. స్వతహాగా భోజన ప్రియుడు కాకపోయినా ఇతరుల ఇష్టాఇష్టాలను గమనిస్తూ ఒక గృహస్తుగా భోజనాదికాలు కనుక్కుంటూ వుండడం ఆయనకు అలవాటని కూడా చెబుతుంటారు. నాతొ సహా హైదరాబాదులోని చాలామంది విలేకరులకు ఇది అనుభవైకవేద్యమే.
రాజనేవాడికి స్పందించే గుణం వుండాలని కౌటిల్యుడు అర్ధశాస్త్రంలో చెబుతాడు. తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఈ లక్షణం అతికినట్టు సరిపోతుంది.
ప్రతిరోజూ క్రమం తప్పకుండా అన్ని దిన పత్రికలు చదవడం ఎన్నో ఏళ్ళుగా ఆయనకు వున్న అలవాటు. పత్రికల్లో వచ్చే ముఖ్యమైన వార్తలను క్రోడీకరించి అనుదినం అందించే యంత్రాంగం ప్రతి ముఖ్యమంత్రికి వున్నట్టే కేసీఆర్ కి కూడా వుంది. అయినా ఆయన స్వయంగా ప్రతి పత్రికను ఆమూలాగ్రం చదువుతారు. చదివిన తరువాత ఆయా విషయాల మీద ఆయన తక్షణం స్పందించే తీరు కూడా అద్భుతం అనే చెప్పాలి.
ఒక్కోసారి ఆయన వ్యవహార శైలిని గమనిస్తుంటే అమెరికన్ రచయిత డేల్ కార్నెగి రాసిన పుస్తకాన్ని కేసీఆర్ ఆమూలాగ్రం చదివి వొంటబట్టించుకున్నారా అనిపిస్తుంది.
స్టేట్ బ్యాంకులో చీఫ్ జనరల్ మేనేజర్ గా పనిచేసిన మా రెండో అన్నయ్య భండారు రామచంద్రరావు నాకు ఈ పుస్తకాన్ని గురించి చెప్పారు. “కేసీఆర్ తరహా చూస్తుంటే ఆయన డేల్ కార్నెగి రాసిన “స్నేహితుల్ని, ప్రజలను ప్రభావితం చేయడం ఎలా?” అనే పుస్తకాన్ని ఆమూలాగ్రం చదవడమే కాకుండా దాని నుంచి స్పూర్తి పొంది వుంటార”నే అభిప్రాయాన్ని ఆయన నాతో పంచుకున్నారు.
ఈ పుస్తకాన్ని డేల్ కార్నెగి రాసి కూడా ఏ౦డ్లుపూండ్లు గడిచిపోయాయి. ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల ప్రతులు అమ్ముడు పోయాయి. అనేక దేశాల్లో అనేకమందికి స్పూర్తి ఇచ్చింది.
డేల్ కార్నెగి తాను రాసిన ఈ పుస్తకంలో ఇలా పేర్కొంటారు.
‘పనిచేసేవారి నుంచి మంచి ఫలితాలు రాబట్టాలంటే వారిని మెచ్చుకుంటూ వుండాలి. ప్రతి మనిషికీ అంతర్లీనంగా తన పేరుపై తగని మమకారం వుంటుంది. అతడు, ఆమె అని ఏదో పొడిపొడిగా కాకుండా, ‘పలానా వారు’ అని పేరుతో పిలిస్తే, పేరు పెట్టి ప్రశంసిస్తే అందులోని ఉల్లాసమే వేరు. అదీ తన పైవారు పేరుపెట్టి నలుగురిలో పొగిడితే ఇక వారి ఆనందానికి అంతే వుండదు.”
ఆయన తన పుస్తకంలో గీత బోధ చేసారిలా.
“మీ సహచరులు, సాటి ఉద్యోగులు చేసిన మంచి పనిని ప్రశంసించేటప్పుడు ఆ పనిని ఏదో మాటవరసకు చేసినట్టుగా కాకుండా మనః స్పూర్తిగా చేయండి.
“బాగా పనిచేసే వారిని బాగా ప్రశంసించండి. ఆ పొగడ్తలు పెదవి నుంచి కాకుండా గుండెల్లోనుంచి రావాలి. అప్పుడే వాటికి నిబద్దత వుంటుంది. విలువ పెరుగుతుంది”
కేసీఆర్ ఈ సూత్రాన్ని చాలా లాఘవంగా ఒడిసిపట్టుకున్నారనే చెప్పాలి.
అందుకే ఆయన తన ఆలోచనలకు తగ్గట్టుగా అధికారులతో, మంత్రులతో చక్కగా పనిచేయించుకోగలుగుతున్నారు.
చివరిగా ఓ ఆప్త వాక్యం.
అధికారం అనేది సమాజానికి మంచి చేయడానికి లభించే ఒక మంచి అరుదైన అవకాశం. అలా దొరికిన అపూర్వ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలగడమే ఏ రాజకీయ నాయకుడికైనా అవశ్యకర్తవ్యమ్.
అరవై తొమ్మిదో ఏట అడుగుపెడుతున్న తెలంగాణా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు పుట్టినరోజు అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుకుంటూ తనపదవీ కాలాన్ని ఈ దిశగానే కొనసాగించాలని కోరుకుంటున్నాను.




(16-02-2022)

కామెంట్‌లు లేవు: