23, నవంబర్ 2021, మంగళవారం

భయం లేదు! యువతరం గొప్పగా ఆలోచిస్తోంది

 నా తరువాతి తరం వారిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది.

మొన్న మా రెండో బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్ర రావు గారి శత జయంతి జరిగింది. కరోనా లేకపోతె చాలా బాగా చేయాలని కుటుంబం అనుకుంది. కానీ కుదరక జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఆ రోజు ఉదయం మా బావగారి మనుమడు  శంతన్ మా ఇంటికి వచ్చాడు. ఈ వేడుక సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచికను ముందుగానే అందచేశాడు. దానితో పాటు ఓ కాంగ్రెస్ కండువా పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి చెప్పాడు, పుస్తకం ఆవిష్కరణ సమయంలో మెడలో వేసుకోమని.  

‘ఇదేమిటి ఇది ఎప్పటి నుంచి’ అని అడిగాను.

‘మా తాతగారి మీది గౌరవం. తరాలు మారితే అభిప్రాయాలు, ఆలోచనలు మారడం సహజం. కానీ ఇది మా  తాతయ్య ఫంక్షన్. జీవితాంతం ఆయన కాంగ్రెస్ వాదిగా జీవించాడు. కాంగ్రెస్ సిద్ధాంతాలను పాటించాడు. మా తరం వచ్చేసరికి  మా అభిప్రాయాల్లో మార్పు వచ్చింది. కానీ తాతయ్యను గౌరవించడానికి అవేమీ అడ్డురాలేదు. అడ్డు కాకూడదు కూడా. అందుకే రాత్రి మార్కెట్లు అన్నీ గాలించి ఈ కండువాలు  కొనుక్కుని వచ్చాము. ఇది నా ఒక్కడి ఆలోచన కాదు. మా తాతయ్య మనుమరాండ్రు,  మనుమలం  అందరం కలిసి తీసుకున్న నిర్ణయం’

“తాతయ్యా! (వాళ్ళు నన్ను తాతయ్యా అనే పిలుస్తారు) నీకూ తెలియంది కాదు. ప్రతి ఏడాది మా తాతయ్య పుట్టిన రోజున మా ఇంటిల్లిపాదీ ఖాదీ బట్టలు కొనుక్కుంటాము. ఎన్నో ఏళ్ళుగా ఇలా చేస్తున్నాము, మా తాతయ్య గుర్తుగా

నాకెంతో సంతోషం అనిపించింది. మన అభిప్రాయాలు ఎలా వున్నా పెద్దల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలనే ఆలోచన ఆ తరం వారిలో వున్నందుకు.

సిద్దాంతాలకు విశాలదృక్పథం తోడయితే ఎన్ని సిద్ధాంత విబేధాలు వున్నా ఈ జాతికి వచ్చిన ముప్పేమీ వుండదు.



(23-11-2021)

3 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

కాంగ్రెస్ కండువాకు అస్సలు గిరాకీ లేదు. అందుకే పాపం మార్కెట్ గాలించవలసి వచ్చిందన్నమాట.

అజ్ఞాత చెప్పారు...

కాంగ్రెసు సిధ్ధాంతాలా? అవేంంటబ్బా! ఈక్రిందివే తప్ప ఇంకేమన్నా ఉంటాయా?
1. కాంగ్రెసు పార్టీ నెహ్రూ గారి సారధ్యంలో పోరాడి దేశానికి స్వతంత్రం తెచ్చింది.
2. నెహ్రూ కూతురు ఇందిరా గాంధీ మరియు ఆకుటుంబమే వారి వారసులే తరతరాలకూ దేశాధినేతలూ దిక్కూ దివాణమూను.
3. దేశప్రజలు కాంగ్రెసు కార్యకర్తలుగా పనికివస్తారు. వారికి అధినాయకకుటుంబం అవసరానికి తగిన చిల్లర పదవులను దయతో ఇస్తూ ఉంటుంది.
4. కాంగ్రెసు వారే దేశభక్తులు. మిగిలిన పార్టీలు కాంగ్రెసు వారితో కలవనప్పుడు దేశద్రోహులు
5. కాంగ్రెసుకు మాత్రమే వోటువేయటం పౌరుల పవిత్రకర్తవ్యం.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@అజ్ఞాత: సరిగ్గా ఇలా ఆలోచించే వాళ్ళ కోసమే ఈ పోస్టు. ఆయన మనుమలు మీలాగే కాంగ్రెస్ వ్యతిరేకులు. అయినా తాతగారి పట్ల గౌరవంతో కాంగ్రెస్ కండువాలు ఎలా ఉంటాయో, ఎక్కడ దొరుకుతాయో తెలియకపోయినా వెతుక్కుని మరీ కొనుక్కుని వచ్చారు. మీలాగా సంకుచితంగా ఆలోచించలేదు. ఇప్పుడు, ఎప్పుడూ దేశానికి కావాల్సింది ఇలా విశాల దృక్పధంతో ఆలోచించే వాళ్ళే. మర మనుషులు కాదు