నా తరువాతి తరం వారిని చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది.
మొన్న
మా రెండో బావగారు కీర్తిశేషులు కొలిపాక రామచంద్ర రావు గారి శత జయంతి జరిగింది.
కరోనా లేకపోతె చాలా బాగా చేయాలని కుటుంబం అనుకుంది. కానీ కుదరక జూమ్ కాన్ఫరెన్స్
ద్వారా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఆ రోజు
ఉదయం మా బావగారి మనుమడు శంతన్ మా ఇంటికి
వచ్చాడు. ఈ వేడుక సందర్భంగా ప్రచురించిన ప్రత్యేక సంచికను ముందుగానే అందచేశాడు.
దానితో పాటు ఓ కాంగ్రెస్ కండువా పట్టుకొచ్చాడు. పట్టుకొచ్చి చెప్పాడు, పుస్తకం ఆవిష్కరణ సమయంలో మెడలో
వేసుకోమని.
‘ఇదేమిటి
ఇది ఎప్పటి నుంచి’ అని అడిగాను.
‘మా తాతగారి
మీది గౌరవం. తరాలు మారితే అభిప్రాయాలు, ఆలోచనలు మారడం సహజం. కానీ ఇది మా తాతయ్య ఫంక్షన్. జీవితాంతం ఆయన కాంగ్రెస్ వాదిగా
జీవించాడు. కాంగ్రెస్ సిద్ధాంతాలను పాటించాడు. మా తరం వచ్చేసరికి మా అభిప్రాయాల్లో మార్పు వచ్చింది. కానీ తాతయ్యను
గౌరవించడానికి అవేమీ అడ్డురాలేదు. అడ్డు కాకూడదు కూడా. అందుకే రాత్రి మార్కెట్లు
అన్నీ గాలించి ఈ కండువాలు కొనుక్కుని
వచ్చాము. ఇది నా ఒక్కడి ఆలోచన కాదు. మా తాతయ్య మనుమరాండ్రు, మనుమలం అందరం
కలిసి తీసుకున్న నిర్ణయం’
“తాతయ్యా! (వాళ్ళు నన్ను తాతయ్యా అనే పిలుస్తారు) నీకూ
తెలియంది కాదు. ప్రతి ఏడాది మా తాతయ్య పుట్టిన రోజున మా ఇంటిల్లిపాదీ ఖాదీ బట్టలు
కొనుక్కుంటాము. ఎన్నో ఏళ్ళుగా ఇలా చేస్తున్నాము, మా తాతయ్య గుర్తుగా’
నాకెంతో సంతోషం అనిపించింది. మన అభిప్రాయాలు ఎలా వున్నా
పెద్దల మనోభావాలు దెబ్బతినకుండా చూడాలనే ఆలోచన ఆ తరం వారిలో వున్నందుకు.
సిద్దాంతాలకు విశాలదృక్పథం తోడయితే ఎన్ని సిద్ధాంత
విబేధాలు వున్నా ఈ జాతికి వచ్చిన ముప్పేమీ వుండదు.
(23-11-2021)