27, నవంబర్ 2021, శనివారం

ఒంటి చేత్తో లిఖించిన భారత రాజ్యాంగం – భండారు శ్రీనివాసరావు

 

మత విశ్వాసులకు భగవద్గీత, ఖురాను, బైబిల్ మాదిరిగా ప్రజాస్వామ్యంలో నమ్మకం వున్నవారికి రాజ్యాంగం కూడా ఒక పవిత్ర గ్రంధం.

రాజ్యాంగ రచనలో అంబేద్కర్ ప్రదర్శించిన దూరదృష్టిని మననం చేసుకోవడంతో పాటు, రాజ్యాంగంలోని వివిధ అంశాలపై ఆసక్తికరమైన విషయాలు మననం చేసుకోవడం వ్యాసకర్త ఉద్దేశ్యం.

“దేశంలో అత్యధికంగా దుర్వినియోగం అయిన పదం ఏదయినా వుందంటే అది ‘సెక్యులరిజం’. ఈ పదం ఇలా దుర్వినియోగానికి గురికాకుండా భరతవాక్యం పలకాలి. ఎందుకంటే, సమాజంలో ఉద్రిక్త పరిస్తితులు తలెత్తడానికి ఈ పదం దోహదపడుతోంది” అనేది నేడు కొంత మంది అభిప్రాయం. సెక్యులరిజం అనే ఆంగ్ల పదానికి విస్తృతంగా వాడుతున్న అనువాద పదం ‘లౌకిక వాదం’ అనే పదాన్ని రాజ్యాంగ నిర్మాత బాబా సాహెబ్ అంబేద్కర్, రాజ్యాంగ పీఠికలో చేర్చాలని భావించలేదు. 1976 లో చేసిన 42వ రాజ్యాంగ సవరణ ద్వారా ‘సోషలిష్టు (సామ్యవాద), సెక్యులర్ (లౌకిక) పదాలను రాజ్యాంగ పీఠికలో కొత్తగా చేర్చారని  వారి నమ్మకం.

“సెక్యులరిజం’ అనే ఆంగ్ల పదానికి ‘ధర్మ నిరపేక్షత’(మతాతీత లౌకిక వాదం) అనే హిందీ అనువాదం సరికాదనీ, దాన్ని ‘పంత్ నిరపేక్ష’ (వర్గాతీత లౌకిక వాదం) అని వుంటే సబబుగా వుండేదని వారు చేసే వ్యాఖ్యానం.

“రాజ్యాంగంపై విశ్వాసం లేనివాళ్ళు, రాజ్యాంగ నిర్మాణంలో పాలుపంచుకోనివాళ్ళు ఈ నాడు ఇలాంటి ధర్మ పన్నాలు వల్లిస్తున్నారని  వారి ప్రత్యర్థుల వాదన.

“రాజ్యాంగం యెంత మంచిదయినా దాన్ని అమలు చేసేవాళ్ళు మంచివాళ్ళు కాకపొతే, అంతిమప్రభావం చెడుగానే వుంటుందని ఆనాడే అంబేద్కర్ అన్నారన్న సంగతిని వారు గుర్తు చేస్తున్నారు.

ఘర్షణాత్మక రాజకీయాలు వద్దని ఒకపక్క చెబుతూనే, సహనం నేటి అవసరం అని ఇంకో పక్క ఉద్ఘాటిస్తూనే, ఉభయ పక్షాలు తద్విరుద్ధంగా ప్రవర్తించడంలో తమ శక్త్యానుసారం పాటుపడుతున్నాయనే వాస్తవం ఎవ్వరికయినా  ఇట్టే బోధపడుతుంది.

భారత రాజ్యాంగం గురించి, దాని విశిష్టతను గురించి బొత్తిగా తెలియని నేటి యువతరానికి తెలియయచేప్పే అనేక ఆసక్తికర అంశాలు ఈనాడు వెలుగులోకి వస్తున్నాయి.

సుమారు  ఏడు దశాబ్దాలుగా అమల్లో వున్నభారత రాజ్యాంగానికి ఘనమైన చరిత్రే వుంది. స్వాతంత్ర పోరాటంలో భాగంగానే సొంత రాజ్యాంగం కావాలంటూ 1930 లోనే కాంగ్రెస్ గళమెత్తింది. కాంగ్రెస్ వాదన ఒప్పుకోవడానికి బ్రిటిష్ పాలకులకు పదహారేళ్ళు పట్టింది. 1946లోనే నాటి వైస్రాయ్ లార్డు వావెల్ ఈ డిమాండును అంగీకరించారు. రాజ్యాంగ రూపకల్పనకు ఉద్దేశించిన పరిషత్ లో అన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లభించింది. రాజ్యాంగ పరిషత్ ఏర్పడే నాటికి సభ్యుల సంఖ్య 389 కాగా, దేశ విభజనానంతరం 299 కి తగ్గింది. కొందరు ఎన్నికయిన వారు కాగా మరికొందరు నామినేటెడ్ సభ్యులు. మరో విశేషం ఏమిటంటే రాజ్యాంగ పరిషత్ సభ్యుల్లో 24 మంది అమెరికన్లు. రాజ్యాంగ నిర్మాణ చర్చల్లో ఈ విదేశీయులు వారం రోజులు పాల్గొన్నారు. రాజ్యాంగ రచన అక్షరాలా రెండేళ్ళ పదకొండు నెలల పద్దెనిమిదిరోజుల పాటు సాగింది. ఇందులో 114 రోజులు ముసాయిదా రూపకల్పనకే సరిపోయాయి. చర్చ సందర్భంగా 7,635 సవరణలు ప్రతిపాదించారు. సుదీర్ఘ పరిశీలన తరువాత 2,473 సవరణలను తిరస్కరించారు. 1946 డిసెంబరు లో మొదలయిన రాజ్యాంగ రచన 1949 డిసెంబరు వరకు కొనసాగింది. మరో విచిత్రం ఏమిటంటే ఈ క్రతువు కొనసాగుతున్న కాలంలో దేశం అత్యంత క్లిష్ట పరిస్తితుల్లో వుంది. మతఘర్షణలు, వర్గ పోరాటాలతో అట్టుడికి పోతున్న రోజులవి. బహుశా ఈ నేపధ్యమే సమానత్వం, స్వేచ్చ, సౌభాతృత్వం, సమ న్యాయం వంటి అంశాలు రాజ్యాంగ పరిధిలోకి తేవడానికి రాజ్యాంగ నిర్మాతలను ప్రేరేపించి ఉండవచ్చు. వివిధ దేశాల రాజ్యాంగాలను సవిరంగా అధ్యయనం చేసి, వాటిలోని మంచి లక్షణాలను భారత రాజ్యాంగంలో గుదిగుచ్చారు. ఫ్రాన్స్ నుంచి స్వేచ్చ, సమానత్వం, సౌభాతృత్వం, రష్యా నుంచి పంచవర్ష ప్రణాళికలు, ఐర్లాండు నుంచి ఆదేశిక సూత్రాలు, జపాన్ నుంచి స్వతంత్ర న్యాయ వ్యవస్థ, అమెరికా నుంచి ప్రాధమిక హక్కులు, కెనడా నుంచి సమాఖ్య స్పూర్తి, ఇలా పలు అంశాలకు మన రాజ్యాంగంలో చోటు దొరకడంవల్లనే అది కాల పరీక్షలను తట్టుకుని నిలబడి ప్రజాస్వామ్యం విలసిల్లడానికి తోడ్పడింది. యావత్ ప్రపంచంలోనే భారత రాజ్యాంగం అతి పెద్దది. మొత్తం 25 భాగాలు. పన్నెండు షెడ్యూల్స్, 448 అధికరణలు, అయిదు అనుబంధాలు. ఇంతటి విస్తృత రాజ్యాంగాన్ని సరిగ్గా అరవై ఆరేళ్ళ క్రితం నవంబరు 26 న మన రాజ్యాంగ సభ ఆమోదించింది. జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. నాటి నుంచి స్వేచ్చా భారతం గణతంత్ర రిపబ్లిక్ గా అవతరించింది. ఇన్నేళ్ళ తరువాత తొలిసారి ఈ రోజును అంటే నవంబరు ఇరవై ఆరో తేదీని రాజ్యాంగ ఆమోద దినోత్సవంగా జరుపుకోవాలనే సత్సంకల్పం పాలకులకు కలిగింది. రాజ్యాంగం గురించి భావి భారత పౌరులయిన విద్యార్ధులకు మరింత అవగాహన కలగడానికి వీలుగా సరళమైన భాషలో ప్రాధమిక దశ నుంచే పాఠ్య ప్రణాళికలలో చేర్చే సదుద్దేశం కూడా ఏలిన వారికి కలిగితే అంతకంటే కావాల్సింది లేదు.

తోక టపా: విశేషం ఏమిటంటే, ఇంత పెద్ద రాజ్యాంగ రూపకల్పనలో ఆనాడు అందుబాటులో వున్న టైపు రైటర్లను సయితం వాడక పోవడం. మొత్తం రాజ్యాంగాన్ని ప్రఖ్యాత లేఖకులు ప్రేమ్ బిహారీ నారాయణ్ ఒంటి చేత్తో లిఖించారు. ఇందుకోసం ఆయన ఒక పైసా కూడా తీసుకోలేదు. ఆయన రాసిన మొదటి ప్రతి ఇప్పటికీ పార్లమెంటు గ్రంధాలయంలోని హీలియం చాంబర్స్ లో భద్రంగా వుంది.



26-11-2021

కామెంట్‌లు లేవు: