1, నవంబర్ 2021, సోమవారం

ఎప్పటికెయ్యది ప్రస్తుతమప్పటికా మాటలాడి….భండారు శ్రీనివాసరావు


నిప్పు ఉప్పులాంటి ఇద్దరు రాజకీయ పార్టీల ప్రతినిధులు టీవీ తెరలపై చాలాకాలంగా ఒకరిపై ఒకరు, ఒకరి పార్టీపై మరొకరు నిప్పులు చెరుగుతూ విమర్శలు చేసుకునేవారు.
కొంతకాలం తర్వాత, సరైన సమయం చూసుకుని పార్టీలు కూడా మారిపోయారు. పైగా ఆయన ఈ పార్టీలో, ఈయన ఆ పార్టీలో.
ఇన్నేళ్ళుగా వినిపించిన వారి వాదనలు కూడా చిత్రంగా మారిపోయాయి. అప్పటివరకు తాము ప్రాతినిధ్యం వహించిన పార్టీని చీల్చి చెండాడం, తమ నోటితో దూషించిన పార్టీని నెత్తికెత్తుకుని నాలుక మడతేసి మాట్లాడడం చూస్తూ నివ్వెరపోయిన ఓ విశ్లేషకుడు తేనీటి విరామ సమయంలో తన సందేహాన్ని బయట పెట్టాడు, ఎలా ఇలా మాట్లాడగలుగుతున్నారు అని.
దానికి వారు వేర్వేరుగా జవాబు ఇచ్చినప్పటికీ సారాంశం మాత్రం ఒక్కటే.
“ఇందులో అంత ఆశ్చర్యపోవాల్సింది ఏముంది?
“మీరు ఎన్టీఆర్ సావిత్రి హీరో హీరోయిన్లుగా నటించిన సినిమాలు చూశారా! వాళ్ళిద్దరూ అన్నాచెల్లెళ్ళుగా నటించిన రక్త సంబంధం సినిమా కూడా చూసే వుంటారు. నాయకీ నాయకులుగా ప్రేమ సన్నివేశాల్లో ఎంత తాదాత్మ్యంగా నటించి ప్రేక్షకులను ఎలా మెప్పించారో, ఏకోదరులైన అన్నా చెల్లెళ్లుగా అదే స్థాయిలో అనురాగం, ఆత్మీయత కురిపించి, ప్రేక్షకులను ఒప్పించారు. అలాగే మేము. వాదించే విధానాన్ని బట్టే మాకు డిమాండ్ వుంటుంది. ఇంకా అర్ధం కాకపొతే ఎప్పటికీ మీకు అర్ధం కాదు”
ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇక అర్ధం కాకుండా ఎలా వుంటుంది చెప్పండి!
(01-11-2021)

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

నేటి రాజకీయం గురించి "ఇంత స్పష్టంగా చెప్పిన తర్వాత ఇక అర్ధం కాకుండా ఎలా వుంటుంది చెప్పండి!"