13, జులై 2014, ఆదివారం

వినదగునెవ్వరు చెప్పిన .......


ఒక విషయం మీద మనం వ్యక్తం చేసే అభిప్రాయంతో అందరూ ఏకీభవించకపోవచ్చు. అంతమాత్రాన అక్కడికక్కడే జంధ్యాలు తెంచుకోనక్కరలేదన్నది నా నిశ్చితాభిప్రాయం. ఈ ఉదయం టీవీ 5  'న్యూస్ స్కాన్'  ప్రోగ్రాంలో నాతొ పాటు ఢిల్లీలో  టీడీపీ అధికార ప్రతినిధి కంభంపాటి రామ్మోహన్, సీనియర్ న్యాయవాది పట్టాభి, టీజేయేసీ నాయకులు కోదండరామ్, కార్యక్రమ నిర్వాహకులు సాంబశివరావు పాల్గొన్నారు. ప్రధాన చర్చనీయాంశం 'పోలవరం'.




ఒక ప్రాంతానికి వరంగా, మరో ప్రాంతానికి శాపంగా మారుతూ రెండు రాష్ట్రాల  నడుమ చిచ్చుపెడుతున్న పోలవరం వివాదం మరింత ముదరకుండా చూసుకోవాల్సిన నైతిక బాధ్యత ఉభయ రాష్ట్రాల ముఖ్యమంత్రులపై వుంది అని చెబుతూ, పోలవరం పూర్వాపరాలను కొంత మేరకు వివరించే ప్రయత్నం చేసాను. మరోచోట నుంచి లైవ్ లో పాల్గొంటున్న కోదండ రామ్ గారికి నేను చెప్పింది సరిగా వినబడకపోవడానికి అవకాశం  వుంది. అందువల్లనేమో, కోదండరాం గారు మధ్యలో కల్పించుకుని, ఈ  (పోలవరం ప్రాజెక్ట్  చరిత్ర) విషయంలో నేను తెలుసుకోవాల్సిన విషయాలు వున్నాయని, అందుకు సంబంధించిన అనేక పుస్తకాలు తనవద్ద వున్నాయని  చెప్పారు. తెలంగాణా ఉద్యమ సారధిగా ఆయనకు వున్న అపార  అనుభవం కానీ, విషయ పరిజ్ఞానం కాని నాకుంటుందని నేననుకోను. అదీకాక కొన్ని విషయాలలో ఎవరి అభిప్రాయాలు వారికి వుంటాయి. వాదనకు దిగడం ద్వారా అవి తేలేవి కావు. అలాగే  టీవీ ల్లో నిర్వహించే ఇటువంటి చర్చల్లో అభిప్రాయ వ్యక్తీకరణ జరగాలి కాని వాదప్రతివాదాలకు తావివ్వకూడదు. చర్చలో పాల్గొనే రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ వైఖరులకు కట్టుబడి కొంత వాదానికి దిగినా తప్పుబట్టాల్సిన పనిలేదు కాని జర్నలిష్టులు తాము చెప్పిందే రైటు అనే రీతిలో వాదప్రతివాదాలకు దిగరాదన్నది నా సిద్ధాంతం. అందుకే సాంబశివరావు గారు జవాబుకు అవకాశం ఇచ్చినా నేను వాడుకోలేదు. హిందూ పత్రిక మాజీ రెసిడెంట్ ఎడిటర్ కీర్తిశేషులు రాజేంద్ర ప్రసాద్ గారు అంటుండేవారు. జర్నలిష్ట్ అనేవాడు ఎదుటివాడు చెప్పింది వినడం అలవాటు చేసుకోవాలని. విభిన్న రంగాలకు చెందిన వాళ్లు చెప్పే అభిప్రాయాలు వినడం ద్వారా మన పరిజ్ఞానం పెంచుకోవచ్చన్నది కూడా ఆయన నుంచి నేను నేర్చుకున్న పాఠం. అందుకే అది టీవీ చర్చ అయినా, ఫేస్ బుక్ చర్చ అయినా నా అభిప్రాయంతో విబేధించేవారితో నేను వాదం పెంచుకోను. అది నా పాలసీ.                      

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

అందరినీ దబాయించే ఆర్నాబ్ గోస్వామిపై మీ అభిప్రాయం?