16, ఏప్రిల్ 2024, మంగళవారం

ఎవరీ సాయి పద్మగారు - భండారు శ్రీనివాసరావు

 రాత్రి పొద్దుపోయిన తర్వాత Sujatha Velpuri గారి పోస్టు చూశాను. అందులో ఒక వాక్యం నన్ను రాత్రంతా నిద్ర పోకుండా చేసింది. అదే ఇది.

“వెళ్ళిరండి పద్మా! నొప్పి, బాధ, మోసం, దుర్మార్గం లేని ప్రపంచంలోకి, వీల్ చైర్ విసిరేసి స్వేచ్ఛగా పరిగెత్తండి”

అప్పుడు మొదలయిన ఆలోచనలు రాత్రంతా నిద్ర లేకుండా చేసాయి.

ఎవరీ పద్మ? ఫేస్ బుక్ మొత్తం మితృలు పంచుకుంటున్న పద్మగారి జ్ఞాపకాలతో నిండిపోతోంది. ఎందుకు ఇలా అందరూ అర్ధరాత్రి వేళ మౌనంగా రోదిస్తున్నారు? ఒకళ్ళా ఇద్దరా వందలమంది ఆమె గురించి రాస్తూనే వున్నారు. నేను ఆవిడ గారి గురించి ఆలోచిస్తూనే వున్నాను.  నాకున్న రెండువేల పై చిలుకు మిత్ర బృందంలో ఈ సాయి పద్మ గారి పేరెందుకు లేదు? ఇంత గొప్ప మనిషి ఇంతకాలం నాకు తెలియకుండా ఎందుకు వుండిపోయారు. పద్మగారిని తెలిసిన వారు, కేవలం ఫేస్ బుక్ ద్వారా మాత్రమే తెలుసుకున్న వారు, వారూ వీరని లేకుండా ప్రతి ఒక్కరూ బాధ పడుతున్నారు అంటే ఆవిడ ఎంత గొప్ప వ్యక్తి అయి వుండాలి.

చివరికి ఆమె గురించి తెలుసుకునేసరికి దాదాపు తెల్లవారింది. అదీ పద్మగారు స్వయంగా రాసుకున్న ఒక పోస్టు ద్వారానే.  పద్మగారు రాసుకున్న అమ్మ కధల ద్వారానే.

నా కంటపడ్డ ఆ పోస్టులో పద్మగారు ఇలా రాసుకున్నారు.

దేవుడు అంత చక్కటి మొహం అందం ఇచ్చి ఇంత లోపం పెట్టడం ఎందుకు కనీసం ఒక కాలు అన్నా నడిచేందుకు వీలుగా ఉంటే బాగుండు.... నా మొదటి సారి ఆపరేషన్ అప్పుడు అనుకుంటా అమ్మ అమ్మమ్మతో అన్నమాటలు.. ఆపరేషన్ థియేటర్ బయట ఇంకా నాకు మత్తు వీడలేదు బహుశా ఆరు ఏడేళ్లు ఉంటాయేమో

ఆ కొంచెం అన్న అవకరం ఎందుకు ఉండాలి? ఏంటో అంటూ నిట్టూర్చిన అమ్మమ్మ మాటలు. సరే ఓహో నేను అందంగా ఉంటానా అని గొప్పగా ఫీల్ అయ్యాను రెండు కాళ్లు తొడల నుంచి పాదం చివర దాకా ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్లతో ఉన్నా కూడా..

అది మార్చి నెల పదో తారీకు. నా పుట్టినరోజు నాడు కూడా ఒక ఆపరేషన్ చేయించారు. బహుశా నాకు గుర్తుండి అది మొదటి ఆపరేషన్.. అంతకు ముందు ఇచ్చిన షాక్ ట్రీట్మెంట్లు అలాంటివి పెద్దగా గుర్తు లేవు.

అప్పటికి రెండు పాదాలు పూర్తిగా వాలిపోయి ఉండేవి నడుము పట్టుకుని లేవదీస్తే పాదాలు మెలి పడిపోయేవి. టెండన్ ట్రాన్స్ ప్లాంటేషన్ లాంటి సర్జరీ ఏదో చేశారు. ఎడమ కాలు ఫీమర్ బోన్ బోన్ కట్ చేసి పాదం వాలిపోకుండా ఏడు ముక్కలుగా పాదం చుట్టూ బోన్ కి జత చేశారంట.

డాక్టర్ కైలాస రావు గారు, డాక్టర్ చావలి వ్యాఘ్రేశ్వరుడు గారి నేతృత్వం లో విశాఖపట్నం అమెరికన్ హాస్పిటల్లో చేశారు.

తను పుట్టినరోజు కదా ఒక రెండు రోజులు ఆగొచ్చు కదా అని అమ్మ అన్నదని తర్వాత మళ్లీ డాక్టర్లు దొరకరు బోన్ ముదిరిపోతే పాదం మళ్ళీ హీల్ అవ్వదు అని నాన్నగారు పట్టుదలగా చేయించారు అని తర్వాత తెలిసింది.

ఆ సంవత్సరం సుమారు ఐదు నెలలు ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్లతో మంచం మీదే ఉన్నాను. విశాఖపట్నం విజయనగరం ఇలాంటి ప్రదేశాల్లో పీక్ సమ్మర్ భయంకరంగా ఉంటుంది. సర్జరీ చేయించుకోవడానికి ఒకసారి మళ్లీ కుట్లు విప్పించుకోడానికి ఒకసారి అమెరికన్ హాస్పిటల్ కి వెళ్ళాల్సి వచ్చేది. ఆ కట్లు కట్టించుకొని విపరీతమైన దురద, చమట నొప్పి బాధ ఎలా అనుభవించాను అన్నది ఈరోజున నాకు ఊహకి కూడా అందదు.

షార్ప్ ఆబ్జెక్ట్స్ ఏది దొరికిన ఆ ప్లాస్టర్ లోకి నెమ్మదిగా దూర్పి గోక్కునేదాన్ని.అందుకని అమ్మ అమ్మమ్మ పిన్ని నాకు బలమైన ఆయుధాలు ఏవి దగ్గరలో ఉంచేవారు కాదు. ప్లాస్టిక్ స్కేలు, పళ్ళు ఊడిపోయిన దువ్వెన, గట్టిగా వున్న చీపురు పుల్లలు ఇవి నా ఆయుధాలు.

అప్పట్లో సూచర్స్ బొంత కుట్లు లాగా కుట్టేవారు. ఫీల్ అవ్వడానికి నెలలు పట్టేది మధ్యలో మనం ఇలా గోక్కోవడం వల్ల లేదా చెమట పట్టి అప్పుడప్పుడు ఇన్ఫెక్షన్ అయిపోయేవి. బోన్ ఇన్ఫెక్షన్స్, టిష్యూ ఇన్ఫెక్షన్స్ పరమ భయంకరంగా ఉంటాయి. ఎందుకంటే అసలు ఆర్థోపెడిక్ అంటేనే ఎంతకీ హీల్ అవ్వదు అని అర్థం అలాంటిది పాదం చుట్టూ బోన్స్ అమర్చి అన్ని కుట్లు వేస్తే నేను ఒక బొంతలా ఉండేదాన్ని.

సమ్మర్ స్నానం చేయకుండా ఉండలేను అని ఏడిస్తే అమ్మమ్మ కార్పెంటర్ నీ పిలిపించి ఒక కుర్చీ చేయించింది. దానికి మధ్యలో ఒక ప్లేట్ లా కట్ చేసి పెట్టుకొని తీసేటట్టు అదే స్నానానికి బాత్రూం కి.

తొడల దగ్గర నుండీ పాదం చివరి దాకా కట్లతొ స్నానం ఒక గోల గా ఉండేది. అది ప్లాస్టర్ ఆఫ్ పారిస్ కాబట్టి, కాస్త తడి తగిలినా మెత్తబడి పోయేది. అమ్మమ్మ చాలా తెలివిగా నా ఎత్తులకు పై ఎత్తులు వేసేది ఒక వడియాలు పెట్టుకునే పెద్ద ప్లాస్టిక్ కవర్ తెప్పించి దాన్ని చేసి పూర్తిగా తొడిగేది స్టిక్కర్ టేప్ లాగా దాన్ని ఫుల్ గా అతికించేది. ఏంటీ కష్టంగా ఉందా అని అడిగేది..అవును అమ్మమ్మా అంటే.. పర్లేదు అలవాటు అయిపోతుంది అనేది.

ఇదంతా దేనికి అంటే నీ పని మాత్రం నువ్వే చేసుకోవాలి అది ఎంత కష్టమైనా బయట నుంచి సహాయం మాత్రమే తీసుకో అనేది.

చాలా సర్జరీలు అయిపోయిన తర్వాత కుట్లు విప్పడం మాత్రం నాన్నగారు అమ్మ చేసేవారు. ఫలానా రోజు కుట్లు విప్పుతారంటే భయానికి నాకు జ్వరం వచ్చేది. దాని బాధ చూడలేను అదేదో మీరే చేసేయండి అని అమ్మ అనేది, అయినా తప్పకుండా బెటాడిన్ టించర్ పట్టుకొని నిల్చునేది.

ఈ సర్జరీలలో నాకు రిలీఫ్ వేసవి సెలవులకు వచ్చి మా కజిన్స్ అందరూ. వాళ్ళందరూ ఆడుకుంటుంటే డాబా మీద నేనా పక్కనే కూర్చునే దాన్ని. వాళ్లు నన్ను మోయలేక మా తమ్ముళ్లు గోపి బుజ్జి రెండు కాళ్లు ఇద్దరు మోసేవారు, మా అక్కలు వెనకాల నుంచి పట్టుకుని వాళ్లే స్త్రెచర్ లాగా వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడికి నన్ను మోసుకొని పోయేవారు. మా డాబా మధ్యలో మెట్లు ఉండేవి దాని చుట్టూ ఒక గూడు లాగా సిమెంట్ తో కట్టిన కట్టడం ఉండేది,పక్కనే పెద్ద సిమెంట్ నీళ్ల ట్యాంక్ ఉండేది. అక్కడ నీడగా ఉండేది. ఒక చాప వేసేసి నన్ను అక్కడ కూర్చోబెట్టేవారు. పక్కనే అమ్మమ్మ చేసిన జంతికలు చేగోడీలు. నా పని ఏంటంటే వాళ్ళు ఆడుకుంటుంటే పాయింట్స్ లెక్కపెట్టడం. ఎవరికైనా ఆడడం బోర్ కొడితే వాళ్ళు వచ్చి నాతో బ్యాంకాట గాని చైనీస్ చక్కర్ గానీ ఆడేవారు. వాళ్ళ ఆడుకుంటుంటే నేను అలా చూస్తూ కూర్చోవడం నాకు అప్పుడప్పుడు తిక్క వచ్చేసేది. ఒకసారి అమ్మమ్మ తో నేను డాబా మీదకి వెళ్ళను అంటే.. ఒకసారి కుట్లు అల్లికలు మరోసారి పుస్తకాలు. శివరాత్రి నా పుట్టినరోజు చాలాసార్లు దగ్గరలో ఉండేవి ఒకసారి అపూర్వ సహస్ర శిరచ్చేద చింతామణి పుస్తకాలు అన్ని భాగాలు, మరో పుట్టినరోజు నాడు మొగలాయి చరిత్ర అన్ని భాగాలు చదివేసిన గుర్తు.

ఒకసారి ఫ్రాక్చర్ అయినప్పుడు మళ్లీ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ కట్టలో ఉన్నప్పుడు పొద్దున్నే నూనె రాసి కనీసం స్నానం కూడా చేయించలేకపోయాను ఏమిటో దీనికి కష్టం అంటూ అమ్మమ్మ కళ్ళ నీళ్లు పెట్టుకోవడం అమ్మ మొహం తిప్పుకుంటూ వెళ్ళటం కూడా గుర్తు.

స్థలాలు కాలాలు మారుతాయి అన్నిటికంటే విచిత్రంగా మనుషులు మారుతారు వాళ్ల చుట్టూ ఆహాలు పంతాలు.. నార్శిసిజం, మెంటల్ హెల్త్ ఇష్యూస్ లాంటి ఎన్నో పేరుకుంటాయి.

అమ్మమ్మ అనేది నువ్వు ఎంత స్ట్రాంగ్ గా ఉండాలి అంటే నీకు తగిలిన నొప్పులు బాధలు మంచి జ్ఞాపకాలుగా తలచుకొని నవ్వుకునేంత అని.

ఇందులో నవ్వుకోడానికి ఏముంది అమ్మమ్మ నా బొంద అనేదాన్ని..!

కానీ నిజమే.. ఇవాళ కుట్లు విప్పుతారు అంట అంటూ నిద్ర లేచాను. ఏదైనా చేసేయగలవు అనే అమ్మమ్మ, దీన్ని బంగాళా ఖాతంలో పడేసినా ఈదుకొని వచ్చేస్తుంది అనే తమ్ముడు, దాని మైండ్ బానే వుంది కదా శేషు బాధపడకు అనే నాన్నగారూ, మాట్లాడని మల్లె మొగ్గ మా అమ్మ ఎవరూ లేరు కుట్లు విప్పటానికి...!!

కొన్ని జ్వరాలు బావుంటాయి

ITS HARD TO TURN THE PAGE WHEN YOU KNOW SOMEONE WON'T BE IN THE NEXT CHAPTER, BUT THE STORY MUST GO ON.


(కీర్తిశేషులు సాయి పద్మ గారు)


 

దైన్యం తెలియని మనిషి, ధైర్యం ఒక్కటే తెలిసిన మనిషి పద్మగారు అనడానికి ఇంతకంటే సాక్ష్యం ఏమి కావాలి?

 

(16-04-2024)

8, ఏప్రిల్ 2024, సోమవారం

సర్వే పంచాంగాలు – భండారు శ్రీనివాసరావు

 రేపే, అంటే ఏప్రిల్ తొమ్మిది శ్రీ క్రోధి ఉగాది. తెలుగువారి నూతన సంవత్సరం. అందరికీ శుభాకాంక్షలు.  

ఉగాది పర్వదినంనాడు పంచాంగ శ్రవణం అనేది అనూచానంగా వస్తున్న ఆచారం.

మా స్వగ్రామం కంభంపాడులో మా చిన్నతనంలో ఇద్దరు పంచాంగకర్తలు వుండేవాళ్ళు. లంకా సూర్య ప్రకాశ సిద్ధాంతి గారు. గూడా సత్యనారాయణ సిద్ధాంతి గారు. నాకు గుర్తున్నంతవరకు తెలుగు అంకెల్లో అంటే – ౧ ౨ ౩ ౪ ౫ (1 2 3 4 5 ) ఇలా ముద్రించే ప్రింటింగ్ ప్రెస్సులు ఆ రోజుల్లో చాలా తక్కువ వుండేవి. పైగా పంచాంగంలో తెలుగు భాషను అర్ధం చేసుకుని కంపోజ్ చేసేవాళ్ళు, ప్రూఫులు దిద్దేవాళ్ళు కూడా తక్కువగా వుండడం వల్లనో యేమో, చాలా పంచాంగాలు, విభిన్న పండితులు రాసినా ఒకే ప్రెస్సులో ముద్రించేవారు. (ఇలాంటి ఓ ముద్రణాలయం తెనాలిలో ఉండేదని జ్ఞాపకం)  ఉగాదికి చాలా ముందుగానే వీటి ముద్రణ పూర్తయ్యేది. ఎందుకంటే రాసిన సిద్ధాంతులు వాటిని కాలినడకన అన్ని వూళ్ళకు వెళ్ళి పంచాంగాల ముద్రణకు ద్రవ్యసాయం చేసిన దాతలకు వాటిని ఇచ్చి అందుకు ప్రతిఫలంగా తృణమో ఫణమో స్వీకరించేవారు. పంచాంగ రూపకల్పనకు ముందు, నాకు బాగా గుర్తు, సత్యనారాయణ సిద్ధాంతిగారు అస్తమానం గాలిలో చేతులు ఆడిస్తూ, అర్ధనిమీలిత నేత్రాలతో ఏదో గణిస్తూవుండేవారు. ఒకరకంగా చెప్పాలంటే వాళ్లదో లోకం.

తెలుగు నూతన సంవత్సరాదిని పురస్కరించుకుని అనేక తెలుగు ఛానళ్ళు ‘రాజకీయ పంచాంగాల’ పేరుతొ ప్రత్యేక కార్యక్రమాలను ప్రసారం చేస్తుండడం  ఒక ఆనవాయితీగా మారింది. ప్రతి రాజకీయ పార్టీ కూడా  తన కార్యాలయంలో ఒక సిద్ధాంతి గారితో పంచాంగ శ్రవణం కార్యక్రమాలను ఏర్పాటుచేసుకుని, తమకు అనుకూలమైన ఫలితాలను చెప్పించుకుని తాత్కాలిక ఉపశమనం పొందుతూ వుండడం కూడా కొత్తేమీ కాదు. నిజానికి దేవాలయ ప్రాంగణాల్లో నిర్వహించాల్సిన తంతు ఇది. వెనుకటికి, ఆ మాటకు వస్తే ఇప్పటికీ చాలా ఊళ్ళల్లో  గుళ్ళల్లో జరిగే పంచాంగ శ్రవణాలకు ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరవుతూనే వున్నారు. టెక్నాలజీ వినియోగం తక్కువగా వున్నరోజుల్లో ప్రజలు, తమకు తెలియని కొన్ని విషయాలు తెలుసుకోవాలనే ఆసక్తిని ఈ పంచాంగ శ్రవణాల ద్వారా తీర్చుకునేవారు. అప్పట్లో వాళ్లకు కొన్ని అంశాల మీదనే ఆసక్తి వుండేది. ఈ ఏడాది వానలు యెలా పడతాయి? పంటలు యెలా పండుతాయి? యే పంటలకు ఎలాటి ధర లభిస్తుంది? ఇక వ్యక్తిగతంగా చూసుకున్నప్పుడు ఆదాయ వ్యయాలు యెలా వుంటాయి? ఆరోగ్యం ఎలావుంటుంది? ఇలాటి ప్రశ్నలకు పంచాంగ శ్రవణ కార్యక్రమాల్లో సమాధానాలు లభిస్తాయన్న ఆశ వారిది. నాటి పరిస్తితుల దృష్ట్యా తప్పుబట్టడానికి కాని, సిద్ధాంతులు చెప్పే విషయాలతో కేవలం వాదన కోసం విభేదించడానికి కాని వీలులేదు.

కాకపొతే ప్రజలు వీటిని బాగా నమ్ముతున్నారు అన్న నమ్మకం పెంచుకున్న రాజకీయ పార్టీలు, వాటి నాయకులు ఈ పంచాంగ శ్రవణాన్ని సైతం తమ ప్రయోజనాలకు వాడుకోవడం ఈ మధ్యకాలంలో బాగా ప్రబలిపోయింది. అందుకే యే పార్టీకి ఆ పార్టీ సొంతంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటుచేసుకుని పండితుల చేత నాలుగు మంచి ముక్కలు చెప్పించుకుని, మీడియాలో ప్రచారం చేయించుకుని, తాము సంతోషపడడం మాత్రమే కాకుండా ఆ మాటలు జనం కూడా నమ్ముతున్నారు అనే భ్రమలో పడిపోతున్నారు. మరో రకంగా చెప్పాలంటే ఎన్నికల సర్వేలు చేయించుకుని, తమకు అనుకూలంగా రాయించుకుని, సానుకూల ఫలితాలు రాకపోతాయా అని సంతృప్తి పడడం ఎలానో ఇదీ అలానే.

ఈ ఆచారానికి బీజం పడింది మాత్రం పాలక పక్షాలు ప్రభుత్వ ఖర్చుతో ఉగాది వేడుకల పేరుతొ నిర్వహించే అధికారిక కార్యక్రమాల్లో. మొదట్లో గుడిలో జరిగే రీతిలోనే ఈ పంచాంగ శ్రవణాలు మొదలయినా, పోను పోను రాజుల ఆస్థానాల్లో వందిమాగధుల స్త్రోత్రపాఠాల మాదిరిగా తయారై, ఇదిగో ఈనాటి ఈ వికృత రూపాన్ని సంతరించుకున్నాయి. దేనికీ పడనివాడు పొగడ్తకు పడతాడన్నట్టుగా ఈ నాటి రాజులను అంటే ముఖ్యమంత్రులను సంతోషపెట్టడానికి నాలుగు మంచి ముక్కలతో ప్రారంభమై ఇప్పడు పొగడ్తల అగడ్తలలో కూరుకుపోతున్నాయి. పేరున్న సినిమానటి ‘పలానా సబ్బునే వాడుతాను’ అంటే జనం ఎగబడి కొంటారన్న భ్రమలకు గురై వాణిజ్య సంస్థలు ప్రకటనలు గుప్పిస్తున్నట్టు, ఇప్పుడు ఈ కార్యక్రమాలకోసం ప్రజల్లో పట్టున్న పండిత ప్రకర్షులను పోటీలుపడి ఎంపిక చేసుకుంటున్న తీరు గమనిస్తే పరిస్తితి యెంత వేగంగా దిగజారుతున్నదో అర్ధం అవుతుంది. యే రోటి వద్ద ఆ పాట పాడాలి అన్నచందంగా యే పార్టీ ఆఫీసులో ఆ పార్టీ పలుకు పలికే తీరులో ఇవి ఏడాది ఏడాదికీ విలువలు పోగొట్టుకుంటున్నాయి. ‘పంచాంగాలా పాత చింతకాయ పచ్చడేం కాదూ’ అంటూ అవహేళన చేసే హేతువాదులకు, జన చైతన్య కార్యకర్తలకు కొత్త ఆయుధాన్ని చేతికి అందిస్తున్నాయి. అలాగే, వాటిని పవిత్రంగా, సంస్కృతిలో భాగంగా భావించేవారికి కూడా ఈ పరిణామాలు తీరని మనస్తాపాన్ని కలిగిస్తున్నాయి. ప్రాచీన సంస్కృతీ వైభవాన్ని పునరుద్ధరించాలని కోరుకుంటున్న ప్రతిఒక్కరూ ఈ విషయంపై దృష్టి సారిస్తే బాగుంటుంది.

తోకటపా:

పంచాంగపఠనం అనాలా, పంచాంగ శ్రవణం అనాలా అనే విషయం పక్కనపెడితే, అసలే ఎన్నికల సమయం, మరి రాజకీయ పంచాంగ శ్రవణ కార్యక్రమాలు ఎన్నికల నియమావళి కిందికి వస్తాయా లేదా అనేది మరో సందేహం.

08-04-2024  

 

 

5, ఏప్రిల్ 2024, శుక్రవారం

శాంతి స్వరూప్ ఇక లేరు – భండారు శ్రీనివాసరావు

 “ఏంటి శాంతీ ఏమిటి కబుర్లు”

నా మాటలు విని నాతొ ఫోన్లో మాట్లాడుతున్న అవతల వ్యక్తి ఎవరో ఆడపిల్ల అనుకునే వారు నా పక్కన వున్నవాళ్ళు. పలానా అని చెప్పగానే, నిజమా మీకు శాంతి స్వరూప్ అంత బాగా తెలుసా అని ఆశ్చర్యంగా అడిగేవారు అతడో  సెలెబ్రిటి అన్నట్టుగా. ఇలాంటి రెండు మూడు అనుభవాల తర్వాత కానీ, శాంతి స్వరూప్ స్పెషల్ స్టేటస్  నాకు అవగతం కాలేదు. ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ అలా జనంలో పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి నలభయ్ ఏళ్ళ క్రితం మొదలైన దూరదర్సన్ తెలుగు వార్తా ప్రసారాల్లో తొలి తెలుగు బులెటిన్ చదివిన న్యూస్ రీడర్ కావడం ఒక కారణం అయితే,  ఆయన వార్తలు చదివే తీరులోని విలక్షణత్వం మరో కారణం. మీదు మిక్కిలి ఆయన ధారణ శక్తి అమోఘం. పది నిమిషాల వార్తలని కాగితాలు చూడకుండా ఏకధాటిగా  చదివేసేవాడు, టెలి ప్రాంప్టర్లు లేని ఆ కాలం లోనే. దూరదర్సన్ అనగానే శాంతి స్వరూప్ అని గుర్తు చేసుకునే మంచి పేరు సంపాదించుకొన్నాడు.

నా కంటే ఆరేళ్లు చిన్న. మొన్న గుండెపోటు అన్నారు. ఆసుపత్రిలో చేర్చారు అన్నారు. ఈ ఉదయం లేడు, దాటిపోయాడు  అన్నారు.

ఏమిటో ఈ జీవితాలు.

ఓం శాంతి!


(సదా మందహాసి శాంతి స్వరూప్)



5-4-2024

24, ఫిబ్రవరి 2024, శనివారం

మూడు రోజుల్లో ముగిసిన 47 ఏళ్ళ జీవితం – భండారు శ్రీనివాసరావు

 

సరిగ్గా నేటికి ఇరవై రోజుల క్రితం నా నెత్తిన ఓ పిడుగు పడింది. మెదడు మొద్దు బారింది. నా కలంలో ఇంకు ఇంకిపోయింది. చుట్టూ ఉన్న ప్రపంచం చీకటి అయిపోయింది. నలభయ్ ఏడేళ్ల వయసున్న నా రెండో కుమారుడు సంతోష్ ఈ నెల ఫిబ్రవరి నాల్కో తేదీ ఉదయం కార్డియాక్ అరెస్టుతో కన్ను మూశాడు. ఒకటో తేదీ చెస్ట్ కంజెషన్ కంప్లయింట్ తో అపోలో ఆసుపత్రిలో చేరాడు. మొదటి రోజు అడ్మిషన్, రెండో రోజు ఐ సీ యు, మూడో రోజు వెంటిలేటర్, నాలుగో రోజు ఉదయం మా ప్రయత్నం మేము చేశాం అనేసి చెట్టంత కొడుకుని కట్టెగా మార్చి ఇంటికి పంపేశారు. అలా మూడు రోజుల్లో మావాడి నలభయ్ ఏడేళ్ల జీవితం ముగిసిపోయింది.

అయిదేళ్ళ క్రితం మా ఆవిడ నిర్మల ఇలాగే నన్ను వదిలేసి పై లోకాలకు వెళ్లి పోయింది. అప్పుడు ఇలాగే రంపపు కోత. ఇప్పుడు ఏకంగా కడుపు కోత.

నా కోడలు నిషా బాధతో పోలిస్తే నాదెంత అని సరిపుచ్చుకోవాల్సిన పరిస్థితి నాది. ఎదిగే పొద్దు వాళ్లది. వాలే  పొద్దు నాది.

‘భరింప శక్యం కాని బాధ ఏమిటి?’ అని యక్షుడు ధర్మరాజుని ప్రశ్నిస్తే, ‘పెద్ద వాళ్ళ కళ్ళ ముందే చిన్నవాళ్లు దాటిపోవడాన్ని మించిన బాధ ఏముంటుంది అంటాడు. 

పిల్లల్ని ముద్దు పేర్లతో కాకుండా అసలు పేర్లతో పిలవాలి అనే కోరికతో నా పిల్లలకు సందీప్,  సంతోష్ నామకరణం చేసుకున్నాను. ఎప్పుడూ అరె ఒరే పిలవలేదు. ఇప్పుడు తప్పడం లేదు.

      

‘నన్ను సరే! నీ ప్రాణానికి ప్రాణం అయిన నీ రెండేళ్ల కూతురు జీవికను వదిలి ఎలా వెళ్ళావురా సంతోష్!  జరిగి రోజులు గడిచిపోతున్నా నేను ఇంకా  ఇలా వున్నాను అంటే నేను తండ్రి నేనా!

నాది గుండా! రాతి బండా!

(24-02-2024)




30, జనవరి 2024, మంగళవారం

మూడు దారుల్లో దేవులపల్లి అమర్

 నారా చంద్రబాబు నాయుడు, వై.ఎస్. రాజశేఖరరెడ్డి, వై.ఎస్. జగన్మోహన రెడ్డి  ఈ ముగ్గురూ ముఖ్యమంత్రులుగా తమదైన ముద్ర వేసుకున్నారు. కాకపొతే, ఈ మువ్వురిలో చంద్రబాబు నాయుడిది రాజకీయంగా భిన్నమైన మార్గం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, నూతనంగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నలభయ్ ఏళ్ళ చరిత్ర ఈ ముగ్గురితో ముడిపడి వుంది. ఈ చారిత్రక పరిణామాలను ఒక సీనియర్  జర్నలిస్టుగా దగ్గరనుంచి పరిశీలించగలిగిన అనుభవాన్ని ఆధారంగా చేసుకుని దేవులపల్లి అమర్,  తన అనుభవ సారాన్ని తాను రాసిన మూడు దారులు అనే ఈ రెండువందల పేజీల గ్రంథంలో సవిస్తరంగా ప్రస్తావించారు.

చంద్రబాబు అనగానే గుర్తు వచ్చే మరో ముఖ్యమంత్రి కీర్తిశేషులు ఎన్టీ. రామారావు. ఆ పేరు వినగానే తలపుకు వచ్చే మరో పదం వైస్రాయ్ ఎపిసోడ్. ఇప్పుడు మూడు, నాలుగు పదుల వయసులో వున్నవారికి గుర్తు వుండే అవకాశం లేదు కానీ, కొంత పాత తరం వారికి తెలుసు. విచిత్రం ఏమిటంటే వారికీ పూర్తిగా తెలియదు. ఆ కాలంలో చురుగ్గా పనిచేసిన కొందరు జర్నలిస్టులు అప్పటి రాజకీయ పరిణామాలను నిశితంగా చూసిన వారే అయినా, ఇంకా ఏదో   కొంత సమాచారం మరుగున ఉందేమో అనే సందేహం, వారు ఈ అంశంపై రాసిన రచనలు, వార్తలు, పుస్తకాలు చదివినప్పుడు పాఠకులకు కలగడంలో ఆశ్చర్యం లేదు. కారణాన్ని కూడా అమర్ తన గ్రంథంలో ప్రస్తావించారు. ఆయన అప్పట్లో ఇండియన్  ఎక్స్ ప్రెస్ గ్రూపు పత్రిక అయిన ఆంధ్రప్రభలో రిపోర్టింగ్ బ్యూరో ఇంచార్జ్ గా వున్నారు.

‘మరి, అప్పట్లో ఇటువంటి (ఈ గ్రంథంలో పేర్కొన్న) విషయాలను మీరెందుకు రిపోర్ట్ చేయలేదని కొందరు మితృలు నన్ను ప్రశ్నించారు. వాళ్ళు అలా అడగడం సబబే. ఇలా అడిగిన వారిలో మీడియా మితృలు కూడా వున్నారు. పత్రికా స్వేచ్ఛ నేతి బీరకాయ చందం అని వారికి తెలియనిది కాదు.  పత్రిక పాలసీని సంపాదకులు కాకుండా యజమానులే నిర్ణయించే కాలానికి వచ్చాక జరిగిన ఉదంతం ఇది. అప్పుడు నేను పనిచేస్తున్న పత్రిక యజమాని,  చంద్రబాబు నాయుడు పక్షం ఎంచుకున్నారు. ఇక మా ఎడిటర్ ఆయన్ని మించి బాబు భక్తి ప్రదర్శించేవారు.’ అంటూ రాసుకొస్తూ అమర్ ఆ రోజుల్లో జరిగిన డిస్టిలరీ అనుమతి ఉదంతాన్ని పేర్కొన్నారు.

‘బాబుకు అనుకూలంగా రాసిన ఆ వార్తను   ఈనాడు పత్రిక మాత్రమే ప్రముఖంగా ప్రచురించడం,  ఆ వార్త మా పత్రికలో మిస్ అవడం తట్టుకోలేని మా ఎడిటర్, మా బ్యూరోను తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టారు.  జరిగిన పొరబాటును దిద్దుకునే ప్రయత్నంలో భాగంగా మర్నాడు మొదటి పేజీలో, సుదీర్ఘంనైన సంపాదకీయం రాసి, చంద్రబాబు పట్ల తన విధేయతను చాటుకున్నారు. అయితే సంపాదకుడి వైఖరికి నిరసనగా ఉద్యోగాన్ని వదిలి వేయవచ్చు కదా అంటే, నిజమే చేయవచ్చు. కానీ అప్పట్లో వెంటనే మరో చోట ఉద్యోగం దొరికే అవకాశం లేక ఆ సాహసం చేయలేదు. చాలామంది జర్నలిస్టుల పరిస్థితి అదే. బయటకు  చెప్పుకోలేక పోవచ్చు. ఇప్పుడయినా ఆ వివరాలన్నీ  రాసే అవకాశం వచ్చింది. వైస్రాయ్ సంఘటనలో  నిజానిజాలు గురించి నేటి యువతరం తెలుసుకోవాలనే ఉద్దేశ్యంతో సవివరంగా రాయడం జరిగింది’ అని అమర్ ఇచ్చిన వివరణ.

మూడు దారుల్లో ఇదొకటి. మిగిలినవి రెండూ వై.ఎస్. ఆర్., వై ఎస్. జగన్ ఎంచుకున్న దారులు. ఈ దారులపై మీడియా కావాలని వికృత ధోరణితో వార్తలు వండి వార్చింది అనే ఆరోపణలకు సంబంధించి కొన్ని దృష్టాంతాలను అమర్ ఈ గ్రంథంలో పేర్కొన్నారు. నాటి సంఘటనలకు సాక్షీభూతులైన అనేకమందిని కలుసుకుని,   చంద్రబాబు అనుకూల, ప్రతికూల  జర్నలిస్టులు, రచయితలు  రాసిన పుస్తకాలలోని అంశాలను కూడా ఆయన ఉదహరించి, తన రచనకు సాధికారతను ఒనగూర్చే ప్రయత్నం చేశారు.

తాను స్వయంగా గమనించిన విషయాలతో పాటు, తనకు తెలియ వచ్చిన  మరి కొన్ని అంశాలను ధ్రువపరచుకునేందుకు అమర్ చాలా కసరత్తు చేసినట్టు ఈ పుస్తకం చదివిన వారికి తెలుస్తుంది.

కన్నవీ, విన్నవీ విశేషాలతో కూడిన గ్రంధరచన కాబట్టి కొంత వివాదాస్పదం అయ్యే అవకాశాలు వున్నాయి.

నాటి సంఘటనలకు నేనూ ఒక ప్రత్యక్ష సాక్షిని కనుక పుస్తకం చదువుతున్నప్పుడు మూడు దశాబ్దాల క్రితం జరిగిన సంగతులు మూగ మనసులు సినిమాలోలా కళ్ళ ముందు గిర్రున తిరిగాయి. చరిత్ర పట్ల ఆసక్తి ఉన్న పాఠకులను ఇది ఆకర్షిస్తుంది.

ఈ పుస్తకాన్ని ముందు అమర్ ఆంగ్లంలో DECCAN POWER PLAY అనే పేరుతొ ప్రచురించారు. ఆ పుస్తకం ఆవిష్కరణ ఢిల్లీలో జరిగింది. తెలుగు అనువాద రచన మూడు దారులు పుస్తకావిష్కరణ కొద్ది రోజుల క్రితం విజయవాడలో జరిగింది.  ఫిబ్రవరి ఒకటో తేదీ సాయంత్రం హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో మరోమారు జరగనుంది.

తోకటపా: విజయవాడ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ పార్లమెంటు సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ ప్రసంగ ఉవాచ:

‘దేవులపల్లి అమర్ కు వై.ఎస్. రాజశేఖర రెడ్డి అంటే ప్రేమ. జగన్ మోహన్ రెడ్డి అంటే పిచ్చి. ఇక ఈ పుస్తకంలో చంద్రబాబు గురించి ఏమి రాసి ఉంటాడో అర్ధం చేసుకోవచ్చు’

(మూడు దారులు – రాజకీయ రణరంగాన భిన్న ధ్రువాలు రచన: దేవులపల్లి అమర్, రూపా పబ్లికేషన్స్ ఢిల్లీ. రెండువందల పేజీలు , 395 రూపాయలు)



(30-01-2024)            

 

29, జనవరి 2024, సోమవారం

ఒక తరం నిష్క్రమిస్తోంది – భండారు శ్రీనివాస రావు

 ఈ ఉదయం తెలంగాణా  రాష్ట్ర కాంగ్రెస్ కురువృద్ధుడు ఒకరు నిశ్శబ్దంగా తన జీవితాన్ని చాలించారు. వారి పేరు పి. నరసారెడ్డి. యాభయ్ ఏళ్ళ క్రితమే ఆయన రాష్ట్ర స్థాయిలో సీనియర్ రాజకీయ నాయకుడు. ఎమ్మెల్యేగా, క్యాబినెట్ మంత్రిగా,  ఎంపీగా , ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.  

చాలా ఏళ్ళ క్రితం ఏదో ఫంక్షన్ లో కలిసారు. రేడియో విలేకరిగా నాకు ఆయనతో సన్నిహిత పరిచయం వుండేది. చాలా కాలం తరువాత మళ్ళీ ఇదే కలవడం. వృద్ధాప్యపు ఛాయలు మినహా, మానసికంగా ఆయన గట్టిగానే కనిపించారు. గతం బాగానే గుర్తున్నట్టు వుంది. అలనాటి విషయాలు కాసేపు ముచ్చటించారు. ‘ఎలా వున్నారు’ అనే నా ప్రశ్నకు ఆయన ఇలా జవాబిచ్చారు.

హైకోర్టులో బార్ రూమ్ అనేది వుంటుంది. యువ లాయర్లతో పాటు వయసు ఉడిగిన మాజీ అడ్వొకేట్లు కూడా అక్కడ కనిపిస్తారు. నిజానికి వారికి వాదించే కేసులు ఏమీ వుండవు. ఇంట్లో ఉబుసుపోక అక్కడికి చేరి కాసేపు కాలక్షేపం చేసి ఇళ్ళకు వెడతారు. నేనూ అంతే. అప్పుడప్పుడూ పార్టీ ఆఫీసు గాంధీ భవన్ కు  వెడతాను. నేను ఎవరన్నది మా పార్టీలోనే చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్టు తప్పుకుంటారు. ఒక్కోసారి బాధగా అనిపిస్తుందని అన్నారు.  అయితే,  గొప్ప గొప్పనాయకులని తలచుకుంటే, వారితో పోల్చుకుంటే తన పరిస్తితి చాలా మెరుగని కూడా చెప్పారు.

కంటి చూపుతో దేశ రాజకీయాలని, ఒంటి చేత్తో జాతీయ పార్టీ కాంగ్రెస్ ని శాసించిన ఇందిరాగాంధీ దివి తుపాను బాధితులను పరామర్శించడానికి రాష్ట్రానికి వస్తే, కొంతకాలం క్రితం వరకు ఆమె కనుసన్నల్లోనే పనిచేసి ఎమర్జెన్సీ పుణ్యమా అని సమర్దుడయిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం వెంగళరావు, మాజీ ప్రధాని అని కూడా చూడకుండా ఆమెకు గెస్ట్ హౌస్ సౌకర్యం కల్పించడానికి నిరాకరించిన సందర్భాన్ని ఆ మాజీ మంత్రి ప్రస్తావించారు. ఆవిడతో పోల్చుకున్నప్పుడు తన పరిస్తితి చాలా మెరుగని చెప్పారు. ఇందిరాగాంధీకి జరిగిన అవమానానికి నిరసనగా ఆనాడు వెంగళరావు మంత్రివర్గం నుంచి కార్మిక మంత్రి టి.అంజయ్య రాజీనామా చేసిన సంగతిని ఆయన గుర్తు చేసుకున్నారు.

నర్సారెడ్డి గారితో నాకు ఓ పర్సనల్ టచ్ వుంది.

నేను రేడియో విలేకరిగా హైదరాబాదు వచ్చిన కాలంలో ఆయన రెవెన్యూ మంత్రి. నగరానికి కొత్తగా వచ్చాను కనుక రేషన్ కార్డు అవసరం పడింది. ఆ రోజుల్లో ఇన్నిన్ని సంక్షేమ కార్యక్రమాలు లేకపోయినా రేషన్ కార్డు అవసరం అనేది అన్ని వర్గాలకు వుండేది. పాస్ పోర్టు కావాలన్నా రేషన్ కార్డు కావాలి. అంచేత ఆ కార్డు కోసం నా స్థాయిలో అన్ని ప్రయత్నాలు చేశాను. తహసీల్ దారు (ఆ రోజుల్లో ఇదే పేరు) ఆఫీసు చుట్టూ అనేక సార్లు తిరిగి వేసారి, చివరకు రెవెన్యూ మంత్రి నర్సారెడ్డి గార్కి విషయం చెప్పాను. ఆయన నన్ను కూర్చోమని చెప్పి, పియ్యేకు ఏం చేయాలో చెప్పారు. కాసేపట్లో ఆ అధికారి ఉరుకులు పరుగుల మీద మంత్రి పేషీకి వచ్చారు. ముందే చెప్పడం వల్ల ఆయన తన ఆఫీసు స్టాంపు, స్టాంపు ప్యాడ్ తో సహా వచ్చారు. అక్కడికక్కడే నా వివరాలు తీసుకుని రేషన్ కార్డు మంజూరు చేస్తూ  సంతకం చేశారు. మర్నాడు ఆఫీసుకు వెళ్ళే సరికి రేషన్ కార్డు పుస్తకం టేబుల్ మీద వుంది.

29-01-2024   

 

23, జనవరి 2024, మంగళవారం

జన నాయకుడికి భారత రత్న – భండారు శ్రీనివాసరావు

 వెనుకబడిన బీహారు రాష్ట్రానికి ఎప్పుడో అయిదు దశాబ్దాలకు పూర్వమే వెనుకబడిన తరగతులకు చెందిన ఒక నాయకుడు ఏకంగా ఆ రాష్ట్రానికి రెండు పర్యాయాలు  ముఖ్యమంత్రి కాగలిగారు. ఆ రాష్ట్రంలో ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం అన్నది అదే మొదటిసారి. అది కూడా నామినేటెడ్ వ్యవహారం కాదు. లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా పోటీ చేసి, తన పార్టీకి చెందిన బలమైన  ప్రత్యర్థిపై పెద్ద మెజారిటీతో గెలిచి సాధించుకున్న పదవి అది.  ఈ కీర్తి దక్కిన ఆ రాజకీయ నాయకుడి పేరు కర్పూరీ ఠాకూర్. ఆయనకు జనం మెచ్చి ఇచ్చిన గౌరవ పురస్కారం జన నాయక్. లోక్ నాయక్ జయప్రకాష్  నారాయణ్ గారికి ఈ జన నాయక్ కర్పూరీ ఠాకూర్ ప్రధమ శిష్యుడు. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీ రిజర్వేషన్స్ కు శ్రీకారం చుట్టిన ధీశాలి. రేపు అంటే జనవరి 24 ఆయన శత జయంతి.

కర్పూరీ ఠాకూర్ గురించి ఇంత వివరమైన ప్రస్తావన తీసుకురావడానికి మరో బలమైన కారణం వుంది. శతజయంతిని పురస్కరించుకుని, ఆయన చనిపోయిన కొన్ని దశాబ్దాల తర్వాత, బడుగు బలహీన వర్గాల వారికి కర్పూరీ ఠాకూర్ చేసిన సేవలకు  గుర్తింపుగా, కేంద్ర ప్రభుత్వం ఒకరోజు ముందుగా అంటే ఈరోజున అత్యున్నత పౌర పురస్కారం భారత రత్న ప్రకటించింది. ఈ పురస్కారానికి ఆయన పూర్తిగా అర్హులు అనడానికి సందేహం లేదు. ఆయన శిష్యులు అయిన లాలూ ప్రసాద్ యాదవ్, రాం విలాస్  పాశ్వాన్, నితీష్ కుమార్ లు తదనంతర కాలంలో ముఖ్యమంత్రులు అయ్యారు.

కర్పూరీ ఠాకూర్ 1988 లో పట్నాలో మరణించారు. వారి తండ్రి గోకుల్ ఠాకూర్ నాయీ బ్రాహ్మణుడు. కొడుకు ముఖ్యమంత్రి అయినా ఆయన తన కుల వృత్తిని వదులుకోవడానికి ఇష్ట పడలేదు. ఈ విషయం తెలిసిన ఒక తెలుగుపత్రిక, ‘కులవృత్తికి సాటిలేదు గువ్వల చెన్నా!’ అనే శీర్షికతో ఈ వార్తను బాక్స్ ఐటంగా  ఆ రోజుల్లో  ప్రచురించింది.

కేంద్రంలో మోడీ ప్రభుత్వ పనితీరుపై, భిన్నాభిప్రాయాలు కలిగిన వారు కూడా పద్మ అవార్డుల ఎంపిక జరుగుతున్న  జరిగే తీరును మాత్రం  ప్రశంసించక తప్పదు.



23-01-2024