వెనుకబడిన బీహారు రాష్ట్రానికి ఎప్పుడో అయిదు దశాబ్దాలకు పూర్వమే వెనుకబడిన తరగతులకు చెందిన ఒక నాయకుడు ఏకంగా ఆ రాష్ట్రానికి రెండు పర్యాయాలు ముఖ్యమంత్రి కాగలిగారు. ఆ రాష్ట్రంలో ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తి ముఖ్యమంత్రి కావడం అన్నది అదే మొదటిసారి. అది కూడా నామినేటెడ్ వ్యవహారం కాదు. లెజిస్లేచర్ పార్టీ నాయకుడిగా పోటీ చేసి, తన పార్టీకి చెందిన బలమైన ప్రత్యర్థిపై పెద్ద మెజారిటీతో గెలిచి సాధించుకున్న పదవి అది. ఈ కీర్తి దక్కిన ఆ రాజకీయ నాయకుడి పేరు కర్పూరీ ఠాకూర్. ఆయనకు జనం మెచ్చి ఇచ్చిన గౌరవ పురస్కారం జన నాయక్. లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ గారికి ఈ జన నాయక్ కర్పూరీ ఠాకూర్ ప్రధమ శిష్యుడు. బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలలో బీసీ రిజర్వేషన్స్ కు శ్రీకారం చుట్టిన ధీశాలి. రేపు అంటే జనవరి 24 ఆయన శత జయంతి.
కర్పూరీ ఠాకూర్ గురించి ఇంత వివరమైన ప్రస్తావన
తీసుకురావడానికి మరో బలమైన కారణం వుంది. శతజయంతిని పురస్కరించుకుని, ఆయన చనిపోయిన
కొన్ని దశాబ్దాల తర్వాత, బడుగు
బలహీన వర్గాల వారికి కర్పూరీ ఠాకూర్ చేసిన సేవలకు గుర్తింపుగా, కేంద్ర ప్రభుత్వం ఒకరోజు ముందుగా అంటే ఈరోజున అత్యున్నత
పౌర పురస్కారం భారత రత్న ప్రకటించింది. ఈ పురస్కారానికి ఆయన పూర్తిగా అర్హులు
అనడానికి సందేహం లేదు. ఆయన శిష్యులు అయిన లాలూ ప్రసాద్ యాదవ్, రాం విలాస్
పాశ్వాన్, నితీష్ కుమార్ లు తదనంతర కాలంలో
ముఖ్యమంత్రులు అయ్యారు.
కర్పూరీ ఠాకూర్ 1988 లో పట్నాలో మరణించారు. వారి తండ్రి
గోకుల్ ఠాకూర్ నాయీ బ్రాహ్మణుడు. కొడుకు ముఖ్యమంత్రి అయినా ఆయన తన కుల వృత్తిని
వదులుకోవడానికి ఇష్ట పడలేదు. ఈ విషయం తెలిసిన ఒక తెలుగుపత్రిక, ‘కులవృత్తికి
సాటిలేదు గువ్వల చెన్నా!’ అనే శీర్షికతో ఈ వార్తను బాక్స్ ఐటంగా ఆ రోజుల్లో ప్రచురించింది.
కేంద్రంలో
మోడీ ప్రభుత్వ పనితీరుపై, భిన్నాభిప్రాయాలు కలిగిన వారు కూడా పద్మ అవార్డుల ఎంపిక
జరుగుతున్న జరిగే తీరును మాత్రం ప్రశంసించక తప్పదు.
23-01-2024