20, ఏప్రిల్ 2022, బుధవారం

నాకు తెలిసిన చంద్రబాబు - భండారు శ్రీనివాసరావు

 (ఏప్రిల్ 20 చంద్రబాబు జన్మదినం)

“నారా చంద్రబాబు నాయుడు అను నేను .....
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా...” అంటూ రెండుసార్లు పదవీ ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు రేడియో విలేకరిగా నేను ప్రత్యక్ష సాక్షిని. మూడోమారు విభజిత ఆంధ్రప్రదేశ్ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసేనాటికి నేను యాక్టివ్ జర్నలిజంలో లేను.
27 ఏళ్ళ కిందటి సంగతులు. ఇప్పుడు నలభయ్ ఏళ్ళ వయసులో ఉన్నవారికి కూడా ఆనాటి సంగతులు సరిగ్గా గుర్తు వుండే అవకాశం లేదు. ఇప్పుడు అంటే ప్యాంటు చొక్కాల రాజకీయ నాయకులు చాలామంది కనబడుతున్నారు. కానీ ఆ రోజుల్లో ప్యాంటు షర్టు చీఫ్ మినిస్టర్ ని చూడడం కొంచెం అటూ ఇటూగా అదే అదే వయసులో వున్న మా బోటి జర్నలిస్టులకు అదే ప్రధమం. పరిచయాలు పెరగడానికి, బలపడడానికి అదొక్కటే కారణం కాదు. పాత్రికేయులతో సత్సంబంధాలు కలిగి ఉండాలనే చంద్రబాబు తత్వం కూడా ప్రధాన కారణం. అంచేత అనేక అనుభవాలు, చిరకాలం గుర్తుండిపోయే జ్ఞాపకాలు ఆయనతో ముడిపడి వున్నాయి.
ఊహకు అందని రాజకీయ పరిణామాల నేపధ్యంలో మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏడెనిమిది మాసాలకు ఆయన పుట్టిన రోజు వచ్చింది. ముఖ్యమంత్రి జన్మదినం అంటే చాలా హడావిడి వుంటుంది. కానీ అప్పటికి ఎన్టీఆర్ మరణించి మూడు మాసాలే అయింది. ఆ పరిస్తితిలో వేడుకలు సంభావ్యం కావని భావించి, తనకు శుభాకాంక్షలు చెప్పదలచుకున్న వాళ్ళు పెద్ద పెద్ద పుష్ప గుచ్చాలతో హడావిడి చేయవద్దని చంద్రబాబు ముందస్తుగానే ప్రజలకు, అభిమానులకు, పార్టీ కార్యకర్తలకు పత్రికాముఖంగా విజ్ఞప్తి చేసారు. సాధారణంగా నాయకులు చేసే ఈ నిరాడంబర వినతులను అభిమానులు, కార్యకర్తలు పెద్దగా పట్టించుకోరు. (విజయవాడ నుంచి ఒక ఉపాధ్యాయురాలు ప్రతియేటా క్రమంతప్పకుండా విజయవాడ నుంచి ముందు రాత్రి బస్సులో వచ్చి ఉదయమే ముఖ్యమంత్రి ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు చెప్పి మళ్ళీ వెంటనే బస్సు పట్టుకుని తిరిగి వెళ్ళిపోవడం ఒక విలేకరిగా నాకు తెలుసు)
అభిమానుల తాకిడి తప్పించుకోవడానికి తరువాతి సంవత్సరాలలో చంద్రబాబు మరో పద్దతిని ఎంచుకున్నారు. ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమం పెట్టుకుని పుట్టినరోజున ఇంట్లో లేకుండా ఆ రోజంతా ప్రజల నడుమన గడపడం.
ఒక తరానికి చెందిన రాజకీయ నాయకులు అందరితో పోలిస్తే చంద్రబాబు అదృష్టవంతులయిన రాజకీయులలో మొదటి స్థానంలో నిలుస్తారు. అత్యంత పిన్న వయసులో మంత్రి అయ్యారు. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కాగలిగారు. జాతీయ స్థాయి రాజకీయాలను ప్రభావితం చేసే స్థాయికి ఎదగగలిగారు. టీడీపీ వ్యవస్థాపకుడు అయిన ఎన్టీ రామారావు ముఖ్యమంత్రిగా వున్న కాలంలో కేంద్రంలో ఆయనంటే పొసగని ప్రభుత్వం వుండేది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో బాబు కనుసన్నల్లో మెలిగే కేంద్ర ప్రభుత్వం వుండేది. రాజకీయంగా చూసినప్పుడు ఒక ప్రాంతీయ పార్టీ ముఖ్యమంత్రికి ఇంతకంటే కావాల్సింది ఏముంటుంది కనుక.
ముందే చెప్పినట్టు ఆయన పుట్టిన రోజును పురస్కరించుకుని రాస్తున్న వ్యాసం ఇది. దీన్ని గమనంలో వుంచుకుంటే రాజకీయంగా ఆయనతో విబేధించేవారికి అనవసరమైన అనుమానాలు కలగవు. ఆయనను అభిమానించేవారికి వారు కోరుకునే అవసరమైన అంశాలు కనబడవు. గత నలభయ్ ఏళ్ళకు పైగా ఆయనతో వృత్తిపరంగా పెంచుకున్న సాన్నిహిత్యం కారణంగా తెలియవచ్చిన కొన్ని సంఘటనలు ఒక చోట గుదిగుచ్చి, వాటి ద్వారా ఆయన వ్యక్తిత్వాన్ని బేరీజు వేసుకునే అవకాశాన్ని పాఠకులకే వదిలిపెడుతున్నాను.
కరెంట్స్ కట్స్
చంద్రబాబు నాయుడు గారు తొలిసారో, మలిసారో 'మీడియా సావీ ముఖ్యమంత్రి'గా ఉమ్మడి రాష్ట్రంలో ఎదురులేని పాలన సాగిస్తున్నప్పుడు, భవదీయుడికి ఒక 'ధర్మ సందేహం' కలిగింది. కరెంటు 'కట్లు' ఏ టైంలో ఎక్కడెక్కడ ఎంతసేపు ఉంటాయో రాష్ట్ర ప్రజలందరికీ ముందుగానే తెలియచేసి, తదనుగుణంగా వాటిని అమలు చేసే పని ముమ్మరంగా జరుగుతున్న రోజులవి. ఏమాటకామాటే చెప్పుకోవాలి. కరెంటు కొరత పుష్కలంగా ఉన్నప్పటికీ, కోతలు మాత్రం ఠంచనుగా టైం ప్రకారం ఆయన హయాములో అమలయ్యేవి. కరెంటు తీయడం, ఇవ్వడం ఒక పధ్ధతి ప్రకారం జరిగేవి. ఇక ఆ కోతల సమయాలు ఒకసారి పరికిస్తే, రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో ఒకే సమయంలో కరెంటు వుండే అవకాశం లేదు. కరెంటు లేకపోతే టీవీలు పనిచెయ్యవు. ఇలాటి సందర్భాలలో కూడా కరెంటు అవసరం లేని రేడియోని పక్కన బెట్టి, కరెంటు లేకుండా పనిచేయని 'టీవీ' లకు ముఖ్యమంత్రిగారు ఎందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు. అదీ, నాక్కలిగిన ధర్మ సందేహం. 'వాళ్ళనీ వీళ్ళనీ ఎందుకు నేరుగా ఆయన్నే అడుగుదాం' అనుకుని ఒకోజు విలేకరుల సమావేశం ముగిసిన తరువాత ఆయన తన చాంబర్ కు వెడుతున్నప్పుడు మధ్యలో కలుసుకుని నా మనసులో మాట చెప్పాను. 'మీరు చెప్పేది ప్రజలకు చేరాలని అనుకుంటున్నారా లేక మీరు చెప్పేది మీరే చూడాలనుకుంటున్నారా?' అని. మడత పెట్టి అడిగినా నా ప్రశ్నలోని మర్మం ఇట్టే గ్రహించగలిగినవాడు కనుక సమాధానంగా ఓ నవ్వు నవ్వి, 'సాంబశివరావుగారూ! (నాటి ముఖ్యమంత్రి పేషీలో ఐ.ఏ.ఎస్. అధికారి) శ్రీనివాసరావు ఏదో అంటున్నాడు, కాస్త వినండి' అంటూ విషయం ఆయనకు వొప్పచెప్పి లోపలకు వెళ్ళిపోయారు.
ఆకస్మిక పర్యటనల ఆకర్షణ
ఉమ్మడి రాష్ట్రంలో ఆరోజుల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకస్మిక పర్యటనలు ఒక ఆకర్షణ. తన పరిపాలన విభిన్నంగా ఉంటుందని ప్రజలకు తెలియచెప్పడానికి ఆయన ఎంచుకున్న విధానం ఇది. ఒకరోజు పొద్దున్నే విలేకరులు వెంటరాగా ఒక ప్రత్యేక బస్సులో బయలుదేరేవారు. ఒకరోజు వెంగళరావు పార్కు దగ్గర చెత్తపోగు ఒకటి ఆయన కంటపడింది. వెంటనే సంబంధిత మునిసిపల్ అధికారికి ఫోను చేశారు. ఆ అధికారి అప్పటికి నిద్ర లేచి వుండడు. భార్య ఫోను తీసిందేమో!
’నేనమ్మా! చంద్రబాబునాయుడిని మాట్లాడుతున్నాను. మీ వారిని ఫోను దగ్గరకు పిలవమ్మా’ అని ఆయన అనడం పక్కనే వున్న మా అందరికీ వినబడుతూనే వుంది. నిద్రనుంచి లేచి ఫోనులో ముఖ్యమంత్రితో మాట్లాడిన తరువాత ఆ అధికారికి మళ్ళీ నిద్రపట్టి వుండదు.
‘నేను నిద్ర పోను, మిమ్మల్ని నిద్రపోనివ్వను’ అనే ఈ తరహా ప్రవృత్తి, ‘ఒకే ఒక్కడురా’ మన ముఖ్యమంత్రి అనే సంతృప్తిని జనంలో కలిగిస్తే, కింద పనిచేసే ఉద్యోగుల్లో అసంతృప్తిని రగిలించింది. ‘బాస్ అనేవాడు తనకు ఏం కావాలో చెప్పి ఆ విధంగా చేయించుకోవాలి కానీ ఆయనే అన్నింట్లో తలదూరిస్తే యెట్లా?’ అనేది సిబ్బంది వాదనగా వుండేది.
కాకినాడ రేడియో స్టేషన్
ఇది ఏర్పాటు కావడానికి ముందు ఒక చిన్న కధ నడిచింది. రేడియో స్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వ స్థలం కేటాయించడానికి ముందు స్థానిక రెవెన్యూ అధికారులు ఒప్పుకోలేదు. ఇప్పుడు రేడియో వినే వాళ్ళు ఎవ్వరు, దానికోసం స్థలమా అని ఎద్దేవాచేసిన వాళ్ళు కూడా వున్నారు. హైదరాబాదులోని ఆకాశవాణి కేంద్రంలో సివిల్ వర్క్స్ చూసే ఇంజినీర్ రాజు పట్టుకుంటే వదిలే రకం కాదు. నన్ను అడిగితే నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకు వెళ్లాను. విషయం చెప్పాను. ఆయన ఆ బాధ్యతను తన కార్యాలయంలో పని చేసే ఐఏఎస్ అధికారి సాంబశివరావు గారికి ఒప్పచెప్పారు. ఆ అధికారి వెంటనే జిల్లా కలెక్టర్ తో మాట్లాడి తక్షణం స్థలాన్ని రేడియో అధికారులకు అప్పగించి ఆ విషయం వెంటనే సీఎం పేషీకి తెలియపరచాలని, ఈ విషయంలో ముఖ్యమంత్రి గట్టి పట్టుదలతో వున్నారని చెప్పారు.
అంతే! పెద్ద ఆటంకం ఆ విధంగా చంద్రబాబు చొరవతో తొలగిపోయింది.
చంద్రబాబు నవ్వుతారా!
సీరియస్ గా పనిచేసుకుపోతూ చంద్రబాబు నవ్వుకు దూరం అయ్యారా అని అప్పట్లో విలేకరులకు అనిపించేది. ఉమ్మడి రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా వున్న తొమ్మిదేళ్ళ పైచిలుకు కాలంలో 'నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వన'ని ఉద్యోగులని వెంటబడి తరుముతూ పనిచేయిస్తున్న కాలంలో, నవ్వుతూ వుంటే ఆ మాటలకు సీరియస్ నెస్ రాదని మానేసారేమో తెలియదు. కాని ఆయనా నవ్వుతారు. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే!
1995 లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో జూబిలీ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి ఆహ్వానాలు పంపారు. 'డిన్నర్ ఫాలోస్' అని దానికో టాగ్ లైన్. ఆరోజు ప్రాంతీయ వార్తలు సమాప్తం అనగానే నడుచుకుంటూ రేడియో స్టేషన్ కు ఎదురుగానే వున్న జూబిలీ హాలుకు బయలుదేరాను. పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గరే పోలీసుల హడావిడి కనిపించింది. లోపలకు వెడితే సీఎం పేషీ అధికారులు కొందరు కనిపించారు. విలేకరుల సంఖ్య చాలా పలుచగా వుంది. నేనంటే ఎదురుగా వున్నాకనుక వెంటనే వచ్చాను మిగిలిన వాళ్లు నెమ్మదిగా వస్తారులే అనుకున్నా. ఈ లోపల సీపీఆర్వో విజయ్ కుమార్ వచ్చాడు. విలేకరుల సంఖ్య చూసి ఆయనా నిరుత్సాహపడ్డట్టున్నాడు. కొందరికి ఫోన్లు చేసి గుర్తుచేసే పనిలో పడ్డాడు. ఈలోగా సచివాలయం నుంచి ఫోన్లు, ‘సీఎం బయలుదేరి రావచ్చా’ అని. మొత్తం మీద కొంత కోరం పూర్తయింది. చంద్రబాబు వచ్చేసారు. విలేకరులు పలుచగా వుండడాన్ని ఆయన కూడా గమనించారు.
'దీనికి మూడు కారణాలు వున్నాయి' అన్నాను, నేను కల్పించుకుంటూ. అవేమిటో చెప్పమని అడిగారు చంద్రబాబు.
'నెంబర్ వన్. ఈరోజు వాతావరణం చల్లగా వుంది. చినుకులు పడే అవకాశం వుంది'
'అయితే...'
'నెంబర్ టూ. ఈరోజు టీవీలో ఇండియా పాకిస్తాన్, డే అండ్ నైట్ వన్ డే మ్యాచ్ వస్తోంది'
'వూ..'
'లాస్ట్ వన్. ఇది జూబిలీ హాలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిన్నర్. ఇక్కడేమి వుంటుంది. మా ఆఫీసు దగ్గర్లో లేకపోతే నేను కూడా డుమ్మా కొట్టేవాడినే'
ఆయనకు అర్ధం అయింది. అర్ధం కాగానే హాయిగా నవ్వేసి నా భుజం తట్టారు.
పుట్టినరోజు సందర్భంగా చంద్రబాబు నాయుడికి శుభాకాంక్షలు.


(కాలు విరిగి ఆసుపత్రిలో వున్న రచయితకు ముఖ్యమంత్రి చంద్రబాబు పరామర్శ)


1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

చంద్రబాబు గారి డ్వాక్రా , SHG impetus గురించి వ్రాయండి‌.