28, సెప్టెంబర్ 2025, ఆదివారం

అయాం ఎ బిగ్ జీరో (223) : భండారు శ్రీనివాసరావు

“పెళ్ళికి ముందు”
“ విధి! అదేమిటో ఎన్నడూ కలిసి రాదు,
“తాజ్ మహల్ కడదామని అనుకున్నాను, కానీ ముంతాజ్ దొరకలేదు”
“పెళ్లి తర్వాత”
“తాజ్ మహల్ కడదామని అనుకున్నాను,
కానీ ముంతాజ్ చనిపోలేదు”
ఈ మాటలు చెప్పింది ఎవరో కాదు, అన్నమాచార్య భావనా వాహిని శోభారాజు గారు. ఈ మాటలు చెప్పింది ఎవరి గురించి? నా గురించే!
తరువాత ఆవిడగారు చెప్పిన మాటలు నన్ను మ్రాన్పడిపోయేలా చేసాయి.
“అయితే శ్రీనివాసరావు గారు ఇలాంటి మనిషి కాదు, భార్య బతికి వున్నప్పుడు ఆయన ప్రేమానురాగాలు ఆవిడ పట్ల ఎలా వున్నాయో, చనిపోయి ఇన్నేళ్ళు గడిచినా అవి చెక్కు చెదరకుండా అలాగే వున్నాయి. వారు రాసే ఆవిడ జ్ఞాపకాలే ఇందుకు సాక్ష్యం”
శోభారాజు గారు నాకు తెలిసినంతవరకూ అన్నమయ్య భావనలను జనంలోకి తీసుకువెళ్ళే నిర్విరామ కృషిలో తలమునకలుగా వుంటారు. అలాంటి వ్యక్తి దృష్టికి నా రాతలు ఎలా చేరాయి? అదే దైవ లీల.
నా చిన్నప్పుడు దత్తాత్రేయ శర్మ గారితో పరిచయం వుండి వుంటే, ఇప్పుడు మనిమాపు వయసులో మతిమరపుతో ఇబ్బంది పడాల్సిన అవసరం పడేది కాదేమో. శోభారాజ్ గారికి దత్తాత్రేయ శర్మ గారికి ఏమిటి లింకు అంటారా!
ఎప్పుడో చాలా కాలం క్రితం ఒక రోజు ఉదయం మిత్రుడు జ్వాలా పూనిక మీద ఇంటికి పాతిక కిలోమీటర్ల దూరంలో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను. జ్వాలా ముఖ్య అతిథి. నారుమంచి అనంత కృష్ణ శర్మగారు అధ్యక్షులు. ఈ రెండు పాత్రల్లో ఉభయులకీ అపార అనుభవం ఉంది. అంచేత చివరివరకూ సజావుగా ఆసక్తికరంగా సాగిపోయింది. ఇది చిన్న సైజు స్నాతకోత్సవం అని చెప్పాలి. అవధాన విద్యలో చక్కటి శిక్షణ పొందిన చిన్నారులు, యువతీ యువకులకు సర్టిఫికెట్ల ప్రదానం జరిగింది.
అవధానానికి కావాల్సింది ధారణ శక్తి. నిజానికి ప్రతి విద్యార్థికి ఇది ఎంతో అవసరం. అలాగే ఈ విద్యలో ప్రావీణ్యం సంపాదిస్తే ముసలితనంలో అల్జీమర్స్ వంటి వ్యాధులు దరిచేరవు అనే అభిప్రాయం నాకు ఆ క్షణంలో కలిగింది.
దత్తాత్రేయ శర్మగారు ఉపాధ్యాయుడిగా పనిచేసారు. పదవీ విమణ అనంతరం పిల్లలకు చిన్న నాటి నుంచే అవధాన ప్రక్రియలో శిక్షణ ఇచ్చే మేలుబంతి లాంటి కార్యక్రమాన్ని తమ భుజాలకు ఎత్తుకున్నారు. దర్శనం శర్మగా ప్రసిద్ధులైన మరుమాముల శర్మ గారికి వీరు స్వయానా సోదరులు. సంకల్ప శుద్ధి వుంటే ఏదైనా సిద్ధిస్తుంది, సాధ్యమవుతుంది అని త్రికరణ శుద్ధిగా నమ్మిన సోదరులు వీరు.
తూముకుంటలోని సీతా రామభద్ర ఆలయం నిర్వాహకులు తగిన తోడ్పాటు అందించారు. మధ్యలో జ్వాలాతో కలిసి దైవ దర్శనం చేసుకున్నాను.
మెట్ల దగ్గరే దేవుడు కనిపించాడు. పాల బుగ్గల పసివాడు ఒకరు ఉద్ధరిణ, పంచపాత్ర ముందు పెట్టుకుని అర్ధ నిమీలిత నేత్రాలతో ధ్యాన ముద్రలో కానవచ్చాడు. అంతటి సంరంభం పక్కనే జరుగుతున్నా అతడి ఏకాగ్రత చెదరలేదు. బహుశా అవధాన శిక్షణ పొందిన కారణంగా ఇది సిద్ధించి వుండవచ్చు. అప్రయత్నంగా ఆ చిన్నారికి చేతులు జోడించి నమస్కారం చేశాను. నేను వయో వృద్ధుడిని. ఆ బాలుడు జ్ఞాన వృద్ధుడు.
ఈ కార్యక్రమానికి వెంటబెట్టుకుని వెళ్లిన జ్వాలాకి మనసులోనే కృతఙ్ఞతలు చెప్పుకున్నాను.
ఇది ఒకనాటి మాట.
మళ్ళీ ఈరోజు (సెప్టెంబరు ఇరవై ఏడు, శనివారం) అలాంటి అనుభవమే. ఇంకా గొప్ప అనుభవం. ఇందులో ప్రధాన పాత్ర కూడా జ్వాలాదే. నేను నిమిత్త మాత్రుడిని.
మా మేనకోడలు శాంత కుమార్తె శ్యామల కుమారుడు తేజ పెళ్లి నిశ్చితార్థం. చివర వరకూ వెళ్ళాలా వద్దా అనే గుంజాటనే.
చివరికి వెళ్లాను. వధువు, వరుడు తరపు వాళ్ళు ఇద్దరూ నాకు దగ్గరి బంధువులు. ఒకరు ఎక్కువ ఒకరు తక్కువ అని తేడా లేకుండా పడుగుపేకల్లా కలిసిపోయి కార్యక్రమాన్ని చక్కగా నిర్వహించారు. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారు అనివార్య కారణాల వల్ల రాలేకపోవడంతో వయసులో అక్కడ అందరికంటే పెద్ద అనే పెద్దరికం నన్ను కొంత ఇబ్బంది పెట్టింది. చిన్నాపెద్దా అందరు వంగి నమస్కారాలు పెట్టే వాళ్ళే.
చుట్టపక్కాలు అందరూ కలిసారు. చాలా సేపు చాలా రోజుల తర్వాత కాలక్షేపం. భోజనానికి ముందూ, భోజనం చేస్తూ,ఆ తర్వాతా ఒకటే నవ్వులు, ఒకటే కబుర్లు. కొన్ని గంటలు ఆహ్లాదంగా గడిచిపోయింది.
అందరిలో అలా వుంటూ కూడా ఏదో తెలియని ఒంటరితనం.
ఇది గమనించినట్టున్నాడు నా చిన్న నాటి మిత్రుడు, నా మేనకోడలు మొగుడు అయిన జ్వాలా నరసింహారావు, కార్యక్రమం తర్వాత నా మరో మేనల్లుడు, ఆధ్యాత్మిక భావాలు కలిగిన కొమరగిరి శ్రీ రామచంద్ర మూర్తి ఇంటికి తీసుకుపోయాడు.
వాడు వయసులో నాకంటే చాలా చిన్న. కానీ ఆధ్యాత్మిక విషయాల్లో చాలా పెద్ద. ఆధ్యాత్మిక అంశాలతో ఎప్పుడు ఏ పోస్టు పెట్టినా సింహభాగం నా ఈ మేనల్లుడితో నేను జరిపిన మాటామంతీలో భాగమే. రామచంద్రం ఉంటున్న కాంప్లెక్స్ లోనే చిన్న బాలాజీ దేవాలయం ఉంది. చాలా ప్రశాంతంగా, తొడతొక్కిడి లేకుండా వుంటుంది. మా దురదృష్టం ఆ గుడి తెరవడానికి చాలా వ్యవధి వుంది. బయట నుంచే దణ్ణం పెట్టుకుని బయట పడ్డాము.
తరువాయి అడంగు, మాదాపూర్ హైటెక్స్ దాపులో వున్న శోభారాజు గారి అన్నమాచార్య భావనా వాహిని. నేను తప్పు రాస్తే మన్నించాలి. నాకు ఇటువంటి వాటి పట్ల పెద్ద ఆసక్తి లేదు. ఎప్పుడయినా వెళ్ళినా జ్వాలాతో పాటే.
వెళ్ళడం వెళ్ళడం అక్కడ వున్న శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయానికి. అంతకు ముందు దర్శనం ఇవ్వని వాడు ఈ గుడిలో నిండు రూపంలో దర్శనం ఇచ్చాడు. వచ్చే డిసెంబరు పదహారో తేదీన మా పెళ్లి రోజు. 1971 లో మా పెళ్లి జరిగింది తిరుమల కొండపై. మళ్ళీ ఓసారి అదే రోజున అక్కడికి వెడితే ఎలా వుంటుంది అనిపించింది. సీనియర్ సిటిజన్స్ కోటాలో మా మరో మేనల్లుడు పింగిలి శ్రవణ్ కుమార్ చాలా ప్రయత్నం చేశాడు. కానీ ఫలించలేదు. నాహం కర్తా హరి కర్తా. స్వామి అనుమతి లేనిదే ఎవరికీ దర్శనం దొరకదు అని పూజ్యులు పీవీ ఆర్కే ప్రసాద్ గారి అనుభవాలే చెబుతున్నాయి. నేనెంత అని సరి పుచ్చుకున్నాను.
అయితే ఈరోజు స్వామి నా కోరిక మరో విధంగా తీర్చాడు. జ్వాలా వెంటబెట్టుకుని తీసుకువెళ్ళిన అన్నమయ్య క్షేత్రంలో బ్రహ్మాండమయిన వేంకటేశ్వరుని దేవాలయం వుంది. కన్నుల పండువుగా స్వామి దర్శనం జరిగింది. మా పిల్లల గోత్ర నామాలతో అర్చన చేయించుకునే మహత్తర భాగ్యం లభించింది. ఆ దేవదేవుని చెంత ఎంతసేపు ఉన్నామో నాకే తెలియదు. ఇలా అనుకోకుండా స్వామి దర్శనం అద్భుతంగా జరిగింది. అక్కడ వుండే పాండురంగడు ఇక్కడ వున్నాడు అన్నట్టుగా తిరుమలలో అయినా, అన్నమయ్య క్షేత్రంలో అయినా ఆయన వైభవం ఆయనదే.
అసలు అంకం అప్పుడే మొదలయింది.
గత కొద్ది రోజులుగా అక్కడ ప్రతి సాయంత్రం కూచిపూడి నృత్య ప్రదర్శనలు జరుగుతున్నాయి, శోభారాజు గారి ఆధ్వర్యంలో. ప్రతియేటా అక్కడ ఇది ఆనవాయితీ. ఈరోజు (అంటే నిన్న శనివారం సాయంత్రం) ప్రముఖ నాట్య కళాకారిణి ఉషా గాయత్రి బృందం చక్కటి ప్రదర్శన ఇచ్చింది. అనుకోకుండా నేత్ర పర్వంగా జరిగిన ఈ ప్రదర్శనను ఆసాంతం చూడడం జరిగింది. నా అభిరుచులు, ఆసక్తి కోణంలో చూస్తే ఇది అపూర్వమే అని చెప్పాలి. వేదిక మీద రాసి వున్న ఒక వాక్యం నన్ను ఆకర్షించింది.
“భక్తి సంగీతం ద్వారా భావకాలుష్య నివారణ”
“భావ దారిద్య్రం కన్నా భాషా దారిద్య్రం మేలు” అన్న ఒక కవి వాక్యం గుర్తుకు వచ్చింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మిత్రుడు జ్వాలా నరసింహారావు, ఆయన భార్య, నా మేనకోడలు శ్రీమతి విజయలక్ష్మి ప్రధాన ఆహ్వానితులు. నేను, మరో మిత్రుడు మావుడూరి ప్రసాద్. డాక్టర్ భరత్ ఒకరకంగా చెప్పాలంటే తోడుగా వెళ్ళిన తోడు పెళ్లి కొడుకులం. జ్వాలా మమ్మల్ని కూడా శోభారాజు గారికి పరిచయం చేశాడు.
ఇంతవరకు అతి కొద్ది సందర్భాలలోనే కలిసిన శోభారాజు గారితో నా పరోక్ష పరిచయం 38 ఏళ్ళ నాటిది. నేను నా కుటుంబంతో కలిసి మాస్కోలో ఉద్యోగం చేస్తున్నప్పుడు, ఆ రోజుల్లో వ్యాపార పనుల నిమిత్తం మాస్కోకు తరచుగా వస్తుండే అప్పటి పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు గారు, శోభారాజు గారు గానం చేసిన అన్నమయ్య కీర్తనల ఆడియో కేసెట్లు తెచ్చి ఇచ్చేవారు. అవి క్రమంగా మాస్కోలోని తెలుగు లోగిళ్ళకు వెళ్ళేవి. ఆ విధంగా ఆమె చక్కటి గాత్రం అందరి ఇళ్ళల్లో మారుమోగేది. అలాంటి మధుర స్వరం కలిగిన శోభారాజు గారు, పైన చెప్పిన మాటలు వింటూ నా చెవుల్ని నేనే నమ్మలేకపోయాను.
2019 లో నా భార్య నిర్మల చనిపోయినప్పటి నుంచి పుంఖానుపుంఖాలుగా నేను సోషల్ మీడియాలో రాస్తూ వస్తున్న అంశాలను శోభారాజు గారు ప్రస్తావించారు. స్వయంగా చదివారో, లేక చదివిన వారు చెప్పగా విన్నారో నాకు తెలియదు కానీ పెళ్ళికి ముందు భార్య పట్ల భర్త ప్రవర్తన, పెళ్ళికి తర్వాత మారిపోయే నడవడిక గురించి హిందీలో ప్రాచుర్యం పొందిన కొన్ని పై వాక్యాలను ప్రస్తావించి, శ్రీనివాసరావు గారు దీనికి విరుద్ధం అని, భార్య పట్ల ఆయన ప్రేమానురాగాలు ఇన్నేళ్ళు అయినా చెక్కుచెదరలేదని అని అర్ధం వచ్చేలా మాట్లాడారు. బహిరంగ సమావేశంలో ఆమె నా పట్ల ప్రదర్శించిన ఈ అభివ్యక్తి నా నోరు పూడుకుపోయేలా చేసింది. ఆవిడకు మౌనంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలపడం మినహా ఏమీ చేయలేని అశక్తత నాది. మన్నించండి శోభారాజు గారు.
నాకు సంతోషం కలిగించిన మరో విషయం ఏమిటంటే ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం మరణించిన మా పెద్దన్నయ్య పర్వతాల రావు గారిని సంస్మరిస్తూ ఆవిడ గారు నాలుగు మంచి ముక్కలు చెప్పడం.
ఒక రోజు ఇలా చిరస్మరణీయ దినంగా మారడానికి కర్తా, కర్మా, క్రియ అయిన మిత్రుడు జ్వాలాకి కృతజ్ఞతలు అనే ఒకే ఒక్క చిన్న పదంతో సరిపుచ్చడం అంటే నాకే నచ్చడం లేదు. ఆయన అర్ధం చేసుకుంటాడని ఆశ వుంది.
కింది ఫోటో: నన్ను శాలువాతో సత్కరిస్తున్న శోభారాజు గారు.



(ఇంకావుంది)
(28-09-2025)

23, సెప్టెంబర్ 2025, మంగళవారం

అయాం ఎ బిగ్ జీరో (222): భండారు శ్రీనివాసరావు

 

చీరే మేరే సప్నే
నా నలభయ్ అయిదేళ్ళ వైవాహిక జీవితంలో రెండే రెండు సార్లు మా ఆవిడకు చీరెలు కొన్న సందర్భాలు వున్నాయి.
అంటే ఇన్నేళ్ళుగా ఆవిడ ఆ రెండు చీరెలతోనే నెట్టుకొచ్చిందని అర్ధం కాదు. నేను మళ్ళీ ఎప్పుడూ నాకు నేనుగా చీరెలు కొన్న పాపాన పోలేదని మాత్రమే దీని తాత్పర్యం. ఆ రెండు సందర్భాలు బాగా గుర్తుండి పోవడానికి కూడా కారణాలు వున్నాయి.
చాలా ఏళ్ళక్రితం ఒక బ్యాంకు తాలూకు మనిషి పనికట్టుకుని మరీ మా ఆఫీసుకువచ్చి వివరాలు అడిగి తీసుకుని పోస్టులో ఓ క్రెడిట్ కార్డు పంపించాడు. క్రెడిట్ కార్డులు అప్పుడే రంగ ప్రవేశం చేస్తున్న రోజులవి. అది నా గొప్పదనం అనుకున్నాకాని, నేను చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంటు నౌఖరీ కాబట్టి ఆ బ్యాంకు అంత ఉదారంగా ఆ కార్డు మంజూరు చేసిందన్న వాస్తవం అప్పట్లో నాకు బోధపడలేదు.
కార్డు చేతికి వచ్చింది కానీ దాన్ని వాడి చూసే అవకాశం మాత్రం వెంటనే నాకు రాలేదు.
అప్పట్లో ఇప్పట్లా ఏటీఎం లు లేవు. ఏదయినా వస్తువు కొనుగోలు చేసినప్పుడు మాత్రమే కార్డు వాడే వీలుండేది. ఓసారి బెజవాడ టూర్ వెళ్ళినప్పుడు మా ఆవిడకోసం బీసెంటు రోడ్డు షాపులో అయిదారొందలు పెట్టి, ఆ క్రెడిట్ కార్డు వాడి, ఓ చీరె కొన్నాను. అంత వరకు బాగానే వుంది.
మరుసటి నెల నుంచీ ఆ బ్యాంకు తాఖీదులు రావడం, ఆ కిస్తీ కట్టే బ్యాంకు ఎక్కడో సికిందరాబాదులో వుండడం, అంతంత దూరాలు పోయి ఓ వందో, యాభయ్యో చెల్లు వేసి రావడానికి సహజ బద్ధకం అడ్డం రావడం ఇత్యాది కారణాలతో నాకూ ఆ బ్యాంకుకూ నడుమ సంబంధ బాంధవ్యాలు పూర్తిగా చెడిపోయాయి.
చీరె తాలూకు అప్పు మొత్తం వడ్డీలతో పేరుకు పోయి, అయిదారువేలకు చేరడం, చివరికి ఆఫీసులో పీఎఫ్ అడ్వాన్సు తీసుకుని ఆ అప్పు తీర్చి కార్డు ఒదిలించుకోవడం ఓ వ్యధాభరిత అధ్యాయం. అయిదారువందల నెల జీతగాన్ని పెళ్ళానికి అయిదారువేల రూపాయల (అసలు వడ్డీలతో కలిపి) చీరె కొనగలిగానన్న తృప్తితో ఆ మొదటి చీరె అంకం అలా ముగిసిపోయింది.
అలాగే మరోసారి ఆఫీసు పనిమీద ఢిల్లీ వెళ్లి, తిరిగి వచ్చే రోజు పాలికా బజారులో నచ్చిన చీరె సెలక్టు చేసి, వచ్చీరాని హిందీలో, గీసి గీసి బేరం చేస్తున్న సమయంలో, అప్పటివరకు శుద్ధ హిందూస్తానీలో మాట్లాడుతున్న షాపు వాడు అచ్చ తెలుగులోకి తిరిగిపోయి ‘అందరికీ నూట ఇరవై, మీకొక్కరికే అరవై సాబ్’ అంటూ నన్ను మారుమాట్లాడనివ్వకుండా మొహమాట పెట్టి ఆ చీరె పొట్లం చేతిలో పెట్టాడు. హైదరాబాదు వచ్చిన తరువాత ఎందుకయినా మంచిదని యాభయ్ రూపాయలకే కొన్నట్టు ఫోజు పెట్టి నా ప్రయోజకత్వాన్ని ప్రదర్శించాను. చీరె రేటు చెబుతున్నప్పుడు మా ఆవిడ ‘అలాగా’ అంటూ చిన్నగా నవ్వుకున్న సంగతి గమనించలేకపోయాను. తరువాత ఇరుగు పొరుగు ఆడంగుల మాటలు చెవిన పడ్డప్పుడు కానీ అసలు విషయం బోధపడలేదు. అదేమిటంటే అరవై రూపాయలకు నేను కొన్న చీరె లాంటిది, మూడు నెలసరి వాయిదాలలో నలభయ్ రూపాయలకే అమ్మే షాపులు చిక్కడపల్లిలో అయిదారు వున్నాయట.
దాంతో బోధి చెట్టుతో అవసరం లేకుండానే తత్వం తలకెక్కింది. ఇక అప్పటి నుంచి ఆ తర్వాత ఎప్పుడూ మా ఆవిడకు చీరె కొనే ప్రయత్నం మళ్ళీ చేయలేదు.
నడిచి వచ్చిన జీవితం బాగా గుర్తుంది అని చెప్పడం పెద్ద అబద్ధం కాకపోయినా మన మనస్సుని మోసం చేసుకోవడమే.
1975 లో హైదరాబాదు వచ్చిన కొత్తల్లో చిక్కడపల్లిలోని మా ఇంటికి రెండు ఫర్లాంగుల దూరంలో మెయిన్ రోడ్డుమీద, సుధా హోటల్ వద్ద సిటీ బస్ స్టాపు వుండేది. అక్కడి నుంచి నేరుగా రేడియో స్టేషన్ కు కాని, సెక్రెటేరియేట్ కు కానీ వెళ్ళాలంటే రామ్ నగర్ నుంచి విజయనగర్ కాలనీకి వెళ్ళే 139 నెంబరు బస్సు ఒక్కటే దిక్కు. ఒక్కటే అవటాన దానికి టెక్కు సహజం. అంచేత దాని రాకపోకలు అనూహ్యం. కావున, మన రూటుది కాకపోయినా మరో బస్సును పట్టుకుని ప్రయాణం చేయడం తప్పనిసరి. పైగా జేబులో ‘అన్ని సిటీ రూట్లలో ఉచిత ప్రయాణానికి సర్కారు (ఆర్టీసీ) వారిచ్చిన జర్నలిస్టు పాసు సిద్ధంగా వుండేది. అలా నిత్యం బస్సుల్లో తిరిగే రోజుల్లో సిటీ బస్సు ప్రయాణీకుల పాట్లు బాగా అర్ధం అయ్యేవి.
ఆ తరువాత కొన్నాళ్ళకు ఆటో శరణ్యం అయింది. అప్పుడు కానీ నాకు ఆటో బాధలు (ఆటో వారితో ప్రయాణీకుల బాధలు అన్నమాట) అర్ధం కాలేదు. రమ్మన్న చోటుకు రావడం వాళ్లకు ఇష్టం వుండేది కాదు. వాళ్ళు అలా రాననడం నాకు నచ్చేది కాదు. వాళ్ళతో ప్రతిరోజూ నా పొట్లాటలు మా ఆవిడకు నచ్చేవి కావు. సినిమాకని బయలుదేరి, ఆటోవాడు రానంటే, అతడు చెప్పిన చోటుకే తీసికెళ్ళమని అందులో ఎక్కి కూర్చుని మధ్యలో పోలీసు స్టేషన్లకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉండేవి. రోడ్డు మీద మన మాట చెల్లకపోయినా, పోలీసుల దగ్గర విలేకరిగా చెల్లుబాటయ్యేవి. ఇంతా చేసి మనం అడిగే ఫేవర్ ఒక్కటే, మీటరు మీద వచ్చే ఆటో మాట్లాడి పెట్టమని. వాళ్ళకది చిటికెలో పని. ఆ విధంగా ముందుకు పోతూ, కొంతమంది ఆటో డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేసేంతవరకు నా చేష్టలు శృతిమించడంతో, మా ఇంటిల్లిపాదీ స్కూటర్ కొనుక్కోవడం ఒక్కటే దీనికి తరుణోపాయమని ఒక ఏకగ్రీవ తీర్మానం చేసారు.
కొన్నాళ్ళకు ఆ ముచ్చటా తీరింది. స్కూటర్ నడపడం మొదలెట్టాక, ఇక ద్విచక్ర వాహనదారుల కడగండ్లన్నీ కళ్లకు కట్టినట్టు కనిపించడం మొదలయింది. హెల్మెట్ ఉదంతంతో ఆ అధ్యాయమూ ముగిసింది.
జీవితం అన్నాక ఒక్కోమెట్టు నింపాదిగానో, హడావిడిగానో ఎక్కుతుంటాం.
మరి అదేమి చిత్రమో, చూపు ఎక్కే పైమెట్టు మీదనే కానీ, ఎక్కివచ్చిన కింది మెట్టు మీద వుండదు.
కొసమెరుపు
1975 లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో నేను రోజు వారీ రాసి వడ్డించిన వాక్టూన్లలో ఒక వంటకం:
చీరే మేరే సప్నే
పండక్కి ఈ మారయినా
షాపులో చేసి అరువయినా
కనీసం కంచిపట్టు చీరయినా
కొని తీరాలి ఆరునూరయినా





(ఇంకావుంది)

20, సెప్టెంబర్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (221): భండారు శ్రీనివాసరావు

 ‘నిన్ను కలుసుకోవాల్సింది అక్కడ కాదు, ఇక్కడ అన్నారు మా న్యూస్ యూనిట్ లో  నా బల్లకు ఎదురుగా వున్న ఒక మామూలు ఫేమ్ కుర్చీలో కూర్చొంటూ మా సమాచార శాఖ జాయింట్ సెక్రెటరీ, మొత్తం ఆలిండియా రేడియో, దూరదర్సన్ లతో కూడిన ప్రసార భారతి సీ ఈ ఓ  కె.ఎస్. శర్మ గారు. అంతవరకూ ఆయన మీద గొంతు వరకూ కోపం పెంచుకున్న నేను, ఆయన మాటలతో ఒక్కసారిగా చల్లబడిపోయాను.

అప్పటికి ఒక పదేళ్లు వెనక్కి వెడదాం.

కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం నుంచి మా డైరెక్టర్ కు ఫోన్ వచ్చింది.

‘మీ దగ్గర భండారు శ్రీనివాసరావు అనే పేరుగల వాళ్ళు పనిచేస్తున్నారా అని కలెక్టర్ గారు కనుక్కోమన్నారు అని వాకబు. అప్పుడు అక్కడ కలెక్టర్ గా పనిచేస్తున్నది ఐ ఎ ఎస్ అధికారి శ్రీ కంభంపాటి సుబ్రమణ్య శర్మ. ఆయన బెజవాడలో చదువుకునే రోజుల్లో ఒక శ్రీనివాసరావు ఆయనకు స్కూల్లో క్లాసుమేటో, జూనియరో అట.  ఆ రోజు ఉదయం  రేడియోలో నా జీవన స్రవంతి ప్రోగ్రాం విన్న తరువాత కలెక్టర్ గారికి నా గురించి తెలుసుకోవాలని అనిపించిందట. సాయంత్రం ఆఫీసుకు వెళ్ళిన తరువాత ఈ విషయం నా చెవిన వేశారు. ఆ తరువాత ఆ సంగతి ఆయనా మరచిపోయారు, నేనూ మరచిపోయాను.

కరీంనగర్ కలెక్టర్ గా ఆయన మంచి పేరు తెచ్చుకున్నారు. కొన్ని వివాదాస్పద నిర్ణయాలు కూడా. అక్కడ ఒక పాడుపడ్డ చెరువును పూడ్పించో , లేదా  ఆ జాగాను వేలం వేయించో ప్రజలకు అవసరమైన ప్రభుత్వ కార్యాలయాలు అన్నీ ఒకే గొడుగు కింద వుండేలా విశాలమైన పరిపాలనా విభాగాల సముదాయాన్ని నిర్మించారు. ఇటువంటి నిర్ణయాలను ప్రజలు హర్షించారు,  ప్రజాప్రతినిధులు వ్యతిరేకించారు. ఏమైతేనేం సమర్ధుడు అయిన కలెక్టర్ గా పేరొచ్చింది. తరువాత ఆయన్ని హైదరాబాదుకు బదిలీ చేశారు,  విద్యుత్ బోర్డు కార్యదర్శిగా. ఒకటి రెండు సార్లు వెళ్లి కలిశాను వార్తల పనిమీద. ఒక క్లాసు మేటుగా ఆయన నన్ను గుర్తుపట్టలేదు. పట్టినా పైకి ఆ మాట అనలేదు. నా  సంగతి సరే!

చిన్నప్పుడు స్కూలుకు సరిగానే వెళ్ళే వాడిని కానీ అందరితో స్నేహం చేసే అవకాశం లేదు. మా బావగారు ఈ విషయంలో చాలా స్ట్రిక్టు.

ఆ తరువాత నా మకాం, చదువు ఖమ్మానికి మారాయి. ఆ తరువాత మళ్ళీ కాలేజి చదువుకు బెజవాడ. మధ్యలో ఎమ్మెసెం బండి (మార్చి – సెప్టెంబరు- మార్చి). ఈ లోగా క్లాస్ మేట్స్ సీనియర్లు, జూనియర్లు క్లాస్ మేట్స్, ఆ క్లాస్ మేట్స్ సీనియర్లు అయ్యారు. నా లాంటి వాళ్లకు క్లాస్ మేట్స్ ఏం గుర్తుంటారు?

ఖమ్మంలో చదివేటప్పుడు వెంకటేశ్వర రావు అనే తెలివికల విద్యార్థి నా క్లాసు మేట్. ఎంత తెలివి కలవాడు అంటే, నేను రేడియోలో ఉద్యోగం చేసేటప్పుడు నన్ను వెతుక్కుంటూ హైదరాబాదు వచ్చాడు. భోజనం చేసేటప్పుడు విషయం చెప్పాడు. ఎలక్ట్రిసిటీ బోర్డులో ఉద్యోగం. బదిలీ అయింది. ‘నీకు శర్మగారు తెలుసు కదా! ఒక మాట చెప్పవా’ అన్నాడు. అదెంత భాగ్యం అని  వెంటబెట్టుకుని తీసుకుని వెళ్లాను. అతడిని బయట కూర్చోమని, నన్ను అడిగారు శర్మగారు, ‘మీ ఫ్రెండ్ ఎక్కడికి అంటే ఏ విభాగానికి బదిలీ కోరుతున్నాడో నీకేమైనా తెలుసా’ అని. ‘తెలియదు, శర్మగారు నీకు తెలుసా అంటే తెలుసు అని తీసుకువచ్చాను’ అన్నాను. ‘అది నాకు ముందే అర్ధం అయింది. ఈ బదిలీ చేయడం నాకు చిటికెలో పని. కానీ అతడు కోరుతున్నది నాలుగు రాళ్లు అదనంగా వచ్చే పోస్టు. తరువాత నీకూ నాకూ చెడ్డపేరు రాదని నువ్వు హామీ ఇవ్వగలవా!’ అన్నారు. ‘నాకు ఇవన్నీ తెలియదు, ఏమైనా ఇబ్బంది అనిపిస్తే వదిలేయండి, నేను అతడికి సర్ది చెబుతాను’ అని వచ్చేశాను.

తరువాత కొన్నాళ్ళకు మా వాడికి కోరిన చోటుకు కోరిన పోస్టులో బదిలీ అయింది.  థాంక్స్ చెబుదాము అనుకుంటే శర్మగారు బదిలీపై కేంద్ర సర్వీసులకు ఢిల్లీ వెళ్ళారు.

ఇదొక కధ.

ఆ తరువాత నేను కుటుంబంతో సహా మాస్కో వెళ్లాను, రేడియో మాస్కోలో పనిచేయడానికి.

అక్కడ ఒక చిక్కొచ్చిపడింది.

రష్యన్ స్కూళ్ళలో విద్య పూర్తిగా ఉచితం. ప్రతి ఏరియాలో ఇంటి నుంచి నడిచిపోయే దూరంలో వుంటాయి ఆ స్కూళ్ళు. ఎక్కడైనా కొంచెం దూరంగా వుంటే, ఉచితంగా తీసుకువెళ్ళే స్కూలు  బస్సులు వుంటాయి. మధ్యాన్న భోజనంస్కూలు యూనిఫారాలు,  పుస్తకాలతో సహా అన్నీ ఉచితం. పోతే, మేము వెళ్ళిన సంవత్సరమే ఇండియన్ ఎంబసీ సిబ్బంది పిల్లకోసం మాస్కోలో కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ వారు  ఇండియన్ స్కూల్ ప్రారంభించారు.  అయితే ఫీజులు వుంటాయి.   రష్యన్ స్కూళ్ళలో చేర్పిస్తే ఇండియాకు తిరిగి వెళ్ళిన తరవాత చదువులకు ఇబ్బంది అవుతుందని ఇండియన్ స్కూల్ నే ఎంచుకోవాల్సి వచ్చింది.  

 అక్కడా ఎడ్మిషన్లు  అంత సులభంగా రాలేదు. మేము రష్యన్ ప్రభుత్వం పనుపున వచ్చాము కాబట్టి హార్డ్ కరెన్సీ లో అంటే డాలర్లలో ఫీజు కట్టాలని ప్రిన్సిపాల్  గంగల్  కండిషన్ పెట్టారు. మాకిచ్చే జీతం మీలాగా డాలర్లలో కాదు, రూబుళ్ళలో ఇస్తారని యెంత మొత్తుకున్నా ఆ బెంగాలీ బాబు గారు వినిపించుకోలేదు. ఇక గత్యంతరం లేక,  ఆ రోజుల్లో ఢిల్లీలో  కేంద్రీయ విద్యాలయ్ సంఘటన్ కు డైరెక్టర్ జనరల్ గా పని చేస్తున్న కె యస్ శర్మ గారికి మాస్కోనుంచి ఫోన్ చేసి విషయం వివరించాను.

 ఆయన కూల్ గా విని,  రేపు ఉదయం పోయి ప్రిన్సిపాల్ ని కలవమని తాపీగా చెప్పారు. మర్నాడు నేను వెళ్లేసరికి స్కూలంతా చాలా హడావిడిగా కానవచ్చింది. మాస్కో రేడియో శ్రీనివాసరావు వచ్చాడా అని ప్రిన్సిపాల్ అప్పటికే వాకబు చేయడం మొదలు పెట్టారు. నిబంధనలు ఏ గాలికి పోయాయో తెలియదు కానిమా ఇద్దరు పిల్లలకు మేము అనుకున్న పద్దతిలో ఎడ్మిషన్ లభించింది.

శర్మగారి మీద గొంతు వరకూ కోపం వచ్చిందన్నాను కదా! ఎందుకో ఇప్పుడు చెబుతాను.

కేంద్ర సమాచార శాఖ జాయింట్ సెక్రెటరీగా వున్నప్పుడు ఒకసారి రేడియో స్టేషన్ కు వచ్చారు. డైరెక్టర్ గదిలో ఉన్నతాధికారుల సమావేశం. శర్మగారు వచ్చిన సంగతి తెలిసి చూడడానికి వెళ్లాను. తలుపు తెరుచుకుని లోపలకు వస్తున్న నన్ను చూసి తర్వాత కలుద్దాం అన్నారు శర్మగారు. నాకు తలకొట్టేసినట్టు అయింది. చెప్పలేని ఉక్రోషంతో మా గదికి వచ్చి కుర్చీలో కూలబడ్డాను. ఇదేమిటి! ఎందుకిలా జరిగింది? ముళ్ళపూడి వారి భాషలో చెప్పాలి అంటే బల్లపై పెట్టి ఉన్న నీళ్ళ గ్లాసులో దూకి ఆత్మహత్య చేసుకోవాలనిపించింది.

మీటింగు అయిన తర్వాత ఆయనే నా దగ్గరకు వచ్చి అన్నారు, ‘నిన్ను కలుసుకోవాల్సింది ఇక్కడ, అక్కడ కాదు’ అని. మనసు తేలికపడింది. కృష్ణుడు, కుచేలుడు గుర్తుకు వచ్చారు.

ఇంతకీ నేను వారికి స్కూల్లో క్లాసు మేటునా కాదా! అవునో కాదో కానీ ఒక బాదరాయణ సంబంధం వుంది. మా స్వగ్రామం పేరు కంభంపాడు. శర్మగారి ఇంటిపేరు కంభంపాటి.

అలాంటి వ్యక్తి, అడగకుండానే వరాలిచ్చే దేవుడు అని ప్రసార భారతి సిబ్బంది చెప్పుకుని మురిసిన ఒక ఉత్తమ ఐ.ఎ.ఎస్. అధికారి శ్రీ కంభంపాటి సుబ్రమణ్య శర్మ గారు ఈరోజు  హైదరాబాదు లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో   మరణించారనే విషాద వార్త నుంచి తేరుకోవడానికి, వారికి నివాళిగా  ఈ నాలుగు ముక్కలు రాస్తున్నాను.

(20-09-2025)

కింది ఫోటో:  అప్పటి  తమిళనాడు గవర్నర్ రోశయ్య గారు,  కే. ఎస్.శర్మగారితో నేను




(ఇంకా వుంది)

19, సెప్టెంబర్ 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (220): భండారు శ్రీనివాసరావు

రాత్రి ఏదో ఛానల్ లో పాత చిత్రం ఈడూ జోడు వచ్చింది.

కొల్లిపర బాల గంగాధర తిలక్ అంటే ఎవరు వారు అనే వాళ్ళు వుండవచ్చేమో కానీ, కె.బీ.తిలక్ అంటే గుర్తుపట్టని వాళ్ళు వుండరు.
తెలుగు చిత్రసీమ గ్రంథంలో ఆయనకో పేజీ వుంది. అంతటి దిగ్డర్శకుడు. తాను తీసిన భూమికోసం సినిమాలో ప్రముఖ నటి జయప్రదకు తొలిసారి అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాత. ముద్దుబిడ్డ, ఎమ్మెల్యే, అత్తా ఒకింటి కోడలే, ఉయ్యాల జంపాల మొదలైన అనేక చిత్రాలు ఆయన ఖాతాలో వున్నాయి. హిందీలో ఛోటీ బహు, కంగన్ చిత్రాలు తీశారు.
ఈ చిత్రాలు గురించి కేబీ తిలక్ తనకు చెప్పిన విశేషాలతో,’అనుపమ గీతాల తిలక్’ అనే పేరుతొ మిత్రుడు జ్వాలా నరసింహారావు ఏకంగా ఒక పుస్తకాన్నే రచించాడు.
2010 లో అమెరికా వెళ్లి, కొన్ని మాసాలు మా పిల్లల దగ్గర గడిపి హైదరాబాదు తిరిగి వచ్చేందుకు సియాటిల్ విమానాశ్రయానికి బయలుదేరడానికి సిద్ధం అవుతున్న సమయంలో పిడుగులాటి దుర్వార్త తెలిసింది ‘తిలక్ గారు ఇక లేర'ని. నేను హైదరాబాదు చేరడానికే గంటలు పడుతుంది. చివరి సారి ఆయన్ని చూడగలుగుతానో లేదో అనే ఆందోళనతో, ఆయన గురించిన జ్ఞాపకాలతో నా ప్రయాణం సాగింది.
తెలుగు సినిమా పరిశ్రమకు కురువృద్ధుడయినా మా దగ్గర మాత్రం ఒక పిల్లవాడిలా వుండే వారు. ఒకరకంగా ఆయనా నేనూ ఇరుగుపొరుగు. నేను పనిచేసే రేడియో స్టేషన్ ను ఆనుకునే నిజాం క్లబ్. ఆ క్లబ్ సభ్యుడిగా తిలక్ గారు ఎక్కువ సమయం అక్కడే గడుపుతుండేవారు. ఆయనకదో కాలక్షేపం.
పేకేటి శివరాం, కేబీ తిలక్ మంచి స్నేహితులు. రేడియో స్టేషన్ కు మరో వైపున వున్న ఫతే మైదాన్ క్లబ్ లో శివరాం సభ్యులు. ఆయన సభ్యత్వం సంఖ్య, నాకు గుర్తు వున్నంతవరకు మూడంటే మూడు. అంటే ఆ క్లబ్ మొదలయినప్పటి నుంచి అందులో పేకేటి సభ్యులు అన్నమాట. అంత సీనియర్ సభ్యుడు కాబట్టి అక్కడ పనిచేసేవాళ్ళు అందరూ ఆయన్ని ఇట్టే గుర్తు పట్టేవాళ్ళు. నిజాం క్లబ్ లో తిలక్ గారి పలుకుబడి కూడా అంతే.
సాయంత్రం మా ప్రాంతీయ వార్తలు ముగిసే సమయంలో ఈ ఇద్దరూ కలిసి న్యూస్ యూనిట్ కు వచ్చేవారు. మా క్యాంటీన్ టీ తాగుతూ మేము చెప్పే కబుర్లు వినే వారు. ఆరూ ఇరవై అయిదుకి ప్రాంతీయ వార్తలు సమాప్తం అనగానే పదండి పోదాం అనే వారు. ఈ లోపల మా పక్కనే యువవాణి కార్యక్రమాలు చూసే డాక్టర్ పీ ఎస్ గోపాల కృష్ణగారు వచ్చి పొద్దుటి నుంచి (వార్తలకోసం) పడ్డ శ్రమ గాలిలో కలిపేసారు కదా! అనేవారు నవ్వుతూ. (ఆయన ఆ తర్వాత ఆలిండియా రేడియో అడిషినల్ డైరెక్టర్ జనరల్ గా రిటైర్ అయ్యారు)
ఈ లోపల బీ హెచ్ ఈ ఎల్ లో పనిచేస్తున్న మిత్రుడు జ్వాలా నరసింహారావు వచ్చి కలిసేవాడు. న్యూస్ ఎడిటర్లు ఆకిరి రామకృష్ణారావు, ఆర్వీవీ కృష్ణారావు అందరం కలిసి అటు ఫతే మైదాన్ క్లబ్ కో, ఇటు నిజాం క్లబ్ కో నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళం. బహుశా ఆ క్లబ్ లకి కాలినడకన వెళ్ళింది మేమే అనుకుంటా.
క్లబ్ లు సరే! కేబీ తిలక్ వంటి పెద్ద వాళ్ళు మా ఇళ్లకువచ్చి పోతుండేవారని చెబితే జనం ఒక పట్టాన నమ్మేవారు కాదు.
జ్వాలా ‘తిలక్ జ్ఞాపకాలు’ రాస్తున్నప్పుడు, తిలక్ గారు తెలతెల వారుతూనే, ఎక్కడో రెడ్ హిల్స్ నుంచి ఖైరతాబాద్ వరకూ మార్నింగ్ వాక్ లాగా జ్వాలా ఇంటికి నడుచుకుంటూ వచ్చి కాఫీ తాగి, తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకుని వెడుతుండడం నాకు తెలుసు. ఆ జ్ఞాపకాలు పుస్తకరూపంలో రావడానికి పూర్వం ప్రజాతంత్ర పత్రికలో సీరియల్ గా వచ్చాయి.
24x7 టీవీ ఛానళ్ళు రాకపూర్వమే, ఏరోజు వార్తలను ఆ రోజే వీడియో కేసెట్లో రికార్డ్ చేసి కేబుల్ టీవీ ద్వారా ప్రసారం చేయించాలని ఆయన చేసిన ఒక చిరు ప్రయత్నంలో జ్వాలా, నేనూ, ఎమ్మెస్ శంకర్ ప్రధాన సూత్రధారులం.
ఆ ప్రోగ్రాం పేరు స్పందన. అప్పట్లో ఇండియా టుడే వాళ్ళు ఇలానే న్యూస్ ట్రాక్ పేరుతో ఒక కార్యక్రమం ప్రసారం చేసేవాళ్ళు. కాకపోతే తిలక్ గారి ఆలోచన ఒక అరగంట కార్యక్రమం విజువల్స్ తో రికార్డు చేసి ఆ కేసెట్ కాపీలను స్థానిక కేబుల్ ఆపరేటర్ల ద్వారా ఉదయం ఆరుగంటలకల్లా ప్రసారం అయ్యేలా చూడడం. కేసెట్ రికార్డింగ్ విషయంలో మా అందరికి కామన్ ఫ్రెండ్ శ్రీ అట్లూరి సుబ్బారావు సాయపడేవారు.
కానీ అది పూర్తి స్థాయిలో కార్యరూపం ధరించలేదు. మ్యాన్ పవర్ వున్నా, మనీ పవర్ లేకపోవడమే ప్రధాన కారణం.
ఈ కార్యక్రమం కోసం నాచేత నాలుగు ముక్కలు రాయించడానికి ఆయన ఎంతో ప్రయాసపడేవారు. ‘నీ వెంటబడి రాయించడం నా చేతకావట్లేదు. నీకంటే సినిమా రైటర్లే ఎంతో నయం’ అనేవారు.
మా ముందు కూర్చున్నది ఎవరో కాదు, ఒకనాడు తన అద్భుత చిత్రాలతో తెలుగు చిత్ర రంగాన్ని ఒక మలుపు తిప్పిన పెద్ద మనిషి అని తెలిసి కూడా మేము లైట్ తీసుకునేవాళ్ళం. అది మా అజ్ఞానం. మమ్మల్ని ఓపికగా భరించగలగడం ఆయన గొప్పతనం. వయస్సులో చాలా తేడా వున్నా, మాతో ఆయన చాలా పొద్దుపోయేదాకా గడిపేవారు.
అహంకారం, అభిజాత్యం సుతరామూ లేని మనిషి. అంతటి పెద్ద మనిషితో, అంత పెద్ద మనసున్న ‘మహా మనీషి’ తో కొన్నేళ్లపాటు అతి సన్నిహితంగా మెలగగలిగిన అవకాశం రావడాన్ని మించిన అదృష్టం ఏముంటుంది?
కింది ఫోటో:
కీర్తిశేషులు కేబీ తిలక్



(ఇంకావుంది)

18, సెప్టెంబర్ 2025, గురువారం

అయాం ఎ బిగ్ జీరో (219): భండారు శ్రీనివాసరావు

1975 లో పుట్టి 1985 లో చనిపోయాను.

అంటే ప్రభలు విరజిమ్మిన విలేకరిగా నా వృత్తి జీవితం అంతలో ముగిసిందన్నది నా కవి హృదయం. విలేకరిగా ఒక వెలుగు వెలిగింది నిజానికి ఆ పదేళ్లే..
అప్పటివరకు పదిమందిలో ప్రథముడిని కాకపోయినా, మొదటి వరసలో వుండేవాడిని, తరువాత మూడు దశాబ్దాలు ఇంగువకట్టిన గుడ్డ మాదిరి. పాత వాసనలతో వృత్తి జీవితం గడిచిపోయింది.
నిజానికి నిండు జీవితం నూరేళ్లు అంటారు కానీ మనిషి తన జీవితంలో గొప్పగా బతికే కాలం అన్నేళ్ళు వుండదు. నా విషయంలో అది పదేళ్లకు కుంచించుకుపోయింది.
విలేకరుల సమావేశాలు మొదలుపెట్టేముందు రేడియో శ్రీనివాసరావు వచ్చాడా లేదా అని ఆరాలు తీసిన రోజులు చూశాను. వచ్చే వుంటాడులే అనుకున్న రోజులు చూశాను. మీడియా విస్తృతి అంత వేగంగా పెరిగిపోయింది. గుర్తింపు కోసం చేసిన ఉద్యోగం కాదు కనుక ఈ పరిణామాలు నా మనసును తాకలేదు.
నా విషయంలోనే కాదు, ప్రతి వృత్తిలో ఇది సహజం. ఎన్నో చూశాను, ఎందరెందరినో చూశాను. ఒక ఉదాహరణ చెబుతాను.
పి. నరసారెడ్డి. అరవై ఏళ్ళ క్రితమే ఆయన రాష్ట్ర స్థాయిలో సీనియర్ రాజకీయ నాయకుడు. ఎమ్మెల్యేగా, క్యాబినెట్ మంత్రిగా, అదీ అతి ప్రధానమైన రెవెన్యూ మంత్రిగా, ఎంపీగా , ఉమ్మడి రాష్ట్రంలో పీసీసీ అధ్యక్షుడిగా పనిచేశారు.
చాలా ఏళ్ళ క్రితం ఏదో ఫంక్షన్ లో కలిసారు. రేడియో విలేకరిగా నాకు ఆయనతో సన్నిహిత పరిచయం వుండేది.
చాలా కాలం తరువాత మళ్ళీ అదే కలవడం. వృద్ధాప్యపు ఛాయలు మినహా, మానసికంగా ఆయన గట్టిగానే కనిపించారు. గతం బాగానే గుర్తున్నట్టు వుంది. అలనాటి విషయాలు కాసేపు ముచ్చటించారు. ‘ఎలా వున్నారు’ అనే నా ప్రశ్నకు ఆయన ఇలా జవాబిచ్చారు.
“హైకోర్టులో బార్ రూమ్ అనేది వుంటుంది. యువ లాయర్లతో పాటు వయసు ఉడిగిన మాజీ అడ్వొకేట్లు కూడా అక్కడ కనిపిస్తారు. నిజానికి వారికి వాదించే కేసులు ఏమీ వుండవు. ఇంట్లో ఉబుసుపోక అక్కడికి చేరి కాసేపు కాలక్షేపం చేసి ఇళ్ళకు వెడతారు. నేనూ అంతే. అప్పుడప్పుడూ పార్టీ ఆఫీసు గాంధీ భవన్ కు వెడతాను. నేను ఎవరన్నది మా పార్టీలోనే చాలామందికి తెలియదు. తెలిసిన వాళ్ళు కూడా తెలియనట్టు తప్పుకుంటారు. ఒక్కోసారి బాధగా అనిపిస్తుందని అన్నారు. అయితే, గొప్ప గొప్పనాయకులని తలచుకుంటే, వారితో పోల్చుకుంటే తన పరిస్తితి చాలా మెరుగని కూడా చెప్పారు.
కంటి చూపుతో దేశ రాజకీయాలని, ఒంటి చేత్తో జాతీయ పార్టీ కాంగ్రెస్ ని శాసించిన ఇందిరాగాంధీ దివి తుపాను బాధితులను పరామర్శించడానికి రాష్ట్రానికి వస్తే, కొంతకాలం క్రితం వరకు ఆమె కనుసన్నల్లోనే పనిచేసి ఎమర్జెన్సీ పుణ్యమా అని సమర్దుడయిన ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న జలగం వెంగళరావు, మాజీ ప్రధాని అని కూడా చూడకుండా ఆమెకు గెస్ట్ హౌస్ సౌకర్యం కల్పించడానికి నిరాకరించిన సందర్భాన్ని ఆ మాజీ మంత్రి ప్రస్తావించారు. ఆవిడతో పోల్చుకున్నప్పుడు తన పరిస్తితి చాలా మెరుగని చెప్పారు. ఇందిరాగాంధీకి జరిగిన అవమానానికి నిరసనగా ఆనాడు వెంగళరావు మంత్రివర్గం నుంచి కార్మిక మంత్రి టి.అంజయ్య రాజీనామా చేసిన సంగతిని ఆయన గుర్తు చేసుకున్నారు.
నర్సారెడ్డి గారితో నాకు ఓ పర్సనల్ టచ్ వుంది.
నేను రేడియో విలేకరిగా హైదరాబాదు వచ్చిన కాలంలో ఆయన రెవెన్యూ మంత్రి. నగరానికి కొత్తగా వచ్చాను కనుక రేషన్ కార్డు అవసరం పడింది. ఆ రోజుల్లో ఇన్నిన్ని సంక్షేమ కార్యక్రమాలు లేకపోయినా రేషన్ కార్డు అవసరం అనేది అన్ని వర్గాలకు వుండేది. పాస్ పోర్టు కావాలన్నా రేషన్ కార్డు కావాలి. అంచేత ఆ కార్డు కోసం నా స్థాయిలో అన్ని ప్రయత్నాలు చేశాను. తహసీల్ దారు (మధ్యలో ఎమ్మార్వో గా మారి మళ్ళీ ప్రభుత్వాలు మారినప్పుడు పూర్వ నామం వచ్చినట్టుంది) ఆఫీసు చుట్టూ అనేక సార్లు తిరిగి వేసారి, చివరకు రెవెన్యూ మంత్రి నర్సారెడ్డి గారికి విషయం చెప్పాను. ఆయన నన్ను కూర్చోమని చెప్పి, పియ్యేకు ఏం చేయాలో చెప్పారు. కాసేపట్లో ఆ అధికారి ఉరుకులు పరుగుల మీద మంత్రి పేషీకి వచ్చారు. ముందే చెప్పడం వల్ల ఆయన తన ఆఫీసు స్టాంపు, స్టాంపు ప్యాడ్ తో సహా వచ్చారు. అక్కడికక్కడే నా వివరాలు తీసుకుని రేషన్ కార్డు మంజూరు చేస్తూ సంతకం చేశారు. మర్నాడు నేను ఆఫీసుకు వెళ్ళే సరికి రేషన్ కార్డు పుస్తకం టేబుల్ మీద వుంది.
కొన్ని నెలల క్రితం క్రితం మళ్ళీ ఒక రెవెన్యూ మంత్రి ఇంటికి వెళ్ళాల్సిన అవసరం వచ్చింది. కలం కూలీ జి.కృష్ణ గారి గురించి నేను సభ్యుడిగా వున్నవయోధిక పాత్రికేయ సంఘం వారు ఒక పుస్తకం వేశారు. దాని ఆవిష్కరణ కోసం మంత్రిని కొందరం వెళ్లి కలిశాము. ఆయన రాజకీయాల్లో రాకముందు నుంచీ నాకు తెలుసు.
మంత్రి నివాసం సందర్శకులతో కిటకిట లాడుతోంది. వచ్చిన విషయం సంబంధిత సిబ్బందికి తెలియచేసి బయట ఆవరణలో తచ్చాడుతున్నాం. నేను ఎక్కువసేపు నిలబడ లేక, బయట ఫుట్ పాత్ పై కూలపడ్డాను. లోపలనుంచి కబురు లేదు. ఎందుకు వుంటుంది. అందరం రిటైర్డ్ హర్ట్ పాత్రికేయులం.
ఎట్టకేలకు కలిశాము.
మాజీ మంత్రి నరసారెడ్డి గారితో పోల్చుకుని నయమే అనుకున్నాను. మమ్మల్ని వెయిట్ చేయించినందుకు నొచ్చుకున్నారు. విషయం చెప్పాము. ఈ మధ్యకాలంలోనే పనిచేసిన సీనియర్ పాత్రికేయులతోనే ఆయనకు పరిచయం లేదు. ఎప్పుడో జవహర్ లాల్ నెహ్రూ, దామోదరం సంజీవయ్య, నీలం సంజీవరెడ్డి వంటి వారితో సన్నిహిత పరిచయం వున్న జీ కృష్ణ గారు తెలిసే అవకాశమే లేదు.
అయినా కలిసారు, మాట్లాడారు,. ‘మీరంతా పెద్దవాళ్లు, చల్లగా వుండండి’ అని చెప్పి పంపేశారు. జర్నలిస్టులు అందులో వయోధికులు, అల్ప సంతోషులు కదా! అంత మాత్రానికే సంతోషించి వెనక్కి వచ్చేశాము.
తోకటపా:
కృష్ణగారి పుస్తకావిష్కరణ ఇంతవరకు జరగలేదు. వ్యక్తిగత పరిచయాలు, వృత్తిగత పరిచయాలు కూడా ‘మనకేమిటి ఇందులో’ అనే దగ్గరే ఆగిపోతున్నాయి.
(ఇంకా వుంది)

17, సెప్టెంబర్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (218): భండారు శ్రీనివాసరావు

 ఇల్లాలి ముచ్చట్లు

 

చిన్న స్థాయి జర్నలిస్టులకు కొత్త ఏడాది రావడానికి కాస్త ముందుగానే డైరీలు,  కాలెండర్లు గిఫ్టులుగా ఇచ్చేవాళ్ళు. వాటిల్లో అట్ట మందంగా  వున్న డైరీలో మా ఆవిడ ఇంటి పద్దులు రాసేది. బోడి మూడు వందలు, అందులో కోతలు పోను  చేతికి వచ్చేది రెండువందలకంటే తక్కువ. ఇంతమాత్రం దానికి జమాఖర్చులు రాయడం ఎందుకు అనేది నా వాదన. ఆఫీసులోనే ఒక జీవితానికి సరిపడా రాసి ఇంటికి వచ్చే వాళ్లకు ఇక డైరీల్లో రాసుకునే విషయాలు ఏముంటాయి కనుక.  

అయితే  డైరీల్లో ఇంటి  ఖర్చుల లెక్కలతో పాటు తన మనోభావాలు కూడా కొన్ని  రాసుకునేది అనే విషయం నాకు మొన్న మొన్నటి వరకూ తెలియదు. ఇతరుల డైరీలు చదవడం మర్యాద కాదని తెలుసు. కానీ ఆ రాసిన మనిషే ఇప్పుడు లేదు.  

అక్కడక్కడా కనిపించిన కొన్ని ముచ్చట్లు. నాతో  చెప్పినవి కాదు, బహుశా  నాతొ చెప్పాలనుకున్న సంగతులు కావచ్చు. పెళ్ళికి ముందు గలగలా మాట్లాడుతుందని మా ఆవిడకు పేరు. ఘలఘలా మాట్లాడుతాడని నాకో పేరు. ఇద్దరూ ఇలా మాట్లాడుకుంటే పొరుగు వాళ్లకు కాలక్షేపం అనుకుందో ఏమో తాను మాట్లాడడం బాగా తగ్గించింది.

మా ఆవిడ రాసుకున్న ఆ డైరీల్లో కొన్ని పేజీలు :

 

“1968 ప్రాంతాల్లో నేను (అంటే మా ఆవిడ నిర్మల) బెజవాడ మాంటిసోరి స్కూల్లో చదివేదాన్ని. (అప్పటికి మా పెళ్ళికాలేదు) సరస్వతి వొదినె గారి పిల్లలు సత్యవతి, విజయ అంతా ఆ స్కూలే. ఆ స్కూల్లో పిల్లల్ని చదివించడం అనేది ఆ రోజుల్లో చాలా గొప్పగా వుండేది. దానికి కారణం ప్రిన్సిపాల్  కోటేశ్వరమ్మగారు. బెజవాడ కనకదుర్గమ్మ మాదిరిగానే  కోటేశ్వరమ్మ పేరు కూడా అంతే ప్రసిద్ధి.

తుర్లపాటి  హనుమంతరావు అన్నగారి మనుమడు, విజయ కుమారుడు (కార్తీక్) పుట్టినప్పుడు బారసాలకు కోటేశ్వరమ్మగారు కూడా వచ్చారు. మేమంతా ఆవిడ  స్టూడెంట్లం కాబట్టి భోజనాల సమయంలో (ఆ రోజుల్లో ఎవరొచ్చినా నేల మీదనే భోజనాలు, పీటలు వేసి వడ్డించేవారు) ఆమె చుట్టూ కూర్చున్నాం. చాలా ఏళ్ళ తరువాత కలిసినా, ఆవిడ పేరు పేరునా అందర్నీ ఆప్యాయంగా పలకరించారు.

ఏం చేస్తున్నావని’  నన్నడిగితే,  హైదరాబాదులో ‘అమ్మవొడి’ పేరుతొ చిన్నపిల్లల కోసం  కేర్ సెంటర్ నడుపుతున్నాను’ అని చెప్పా. బహుశా ఆమె దగ్గర చదువుకున్నవాళ్ళల్లో  చదువులో ఎక్కిరానిదాన్ని నేనే అనుకుంటా. కానీ ఆవిడ మాత్రం నన్ను అభినందించారు. ‘స్త్రీలు స్వతంత్రంగా ఏదో ఒకటి చేయడం చాలా అవసరమ’ని చెప్పారు. నేను ఏదో మా అవసరాలకు కేర్ సెంటర్  పెట్టుకుంటే, ఆవిడ పెద్ద మనస్సుతో ఆశీర్వదించిన విధానం నేను మరిచిపోలేను.

"ఇంకో విషయం. తెలుగు సినిమా రంగంలో హాస్య బ్రహ్మగా పేరు తెచ్చుకున్న ‘జంధ్యాల’ (జేవీడీఎస్ శాస్త్రి) కూడా మాంటిసోరి స్కూల్లో నా  క్లాసుమేటు. దీనికి కొనసాగింపు లాంటి ముగింపు ఏమిటంటే జంధ్యాల తదనంతర కాలంలో బెజవాడ ఎస్సారార్ కాలేజీలో మూడేళ్ళు బీకాంలో మా వారికీ క్లాసుమేటు."

 

“అప్పుడు మేము చిక్కడపల్లి త్యాగరాయ గానసభ దగ్గర్లో  పర్చా కిషన్ రావు గారింట్లో అద్దెకు ఉంటున్నాము. మా వారికి రేడియోలో ఉద్యోగం. ఇద్దరు పిల్లలు. దగ్గరలో ఉన్న  సెంట్ ఆంథోని స్కూల్లో చేర్చాము. రానూ పోనూ నెలవారీగా రిక్షా మాట్లాడాము.

“ఆ రోజుల్లో ఆదాయ వ్యయాలు ఎలా ఉండేవి అంటే  జీతానికిజీవితానికీ పొంతన వుండేది కాదు. అంచేత కరెంటు బిల్లు (అప్పట్లో రెండు నెలలకోమారు వచ్చేది) కడితేఆ నెల ఇంటి రెంటు బాకీ పడేది. పాపం ఆ పెద్దాయన  ప్రతి నెలా  మొదటివారంలో తను ఉంటున్న బర్కత్ పురా ఇంటి నుంచి చేతికర్ర  పొడుచుకుంటూజాగ్రత్తగా  నడుచుకుంటూ చిక్కడపల్లి వచ్చేవారు అద్దె వసూలు కోసం.  మళ్ళీ ఉసూరుమంటూ వెళ్ళిపోయేవారుసమయానికి  అద్దె కట్టలేని మా పరిస్థితి చూసి కొంత జాలిపడిమరికొంత చీకాకు పడి.

“ఈ నేపధ్యంలో మరో దారి కనపడక ఈ అమ్మఒడి దారి ఎంచుకున్నాను.

“ఉన్న రెండు గదుల్లో ఒకదాన్ని ఈ కేర్ సెంటర్ కోసం కేటాయించాము. బయటరోడ్డు మీద వెళ్ళే వారికి కనబడేటట్టు ‘తల్లి ఒడి విడలేని చిన్నారుల బడి’ అనే ట్యాగ్  లైన్ తో  ‘అమ్మవొడిచైల్డ్ కేర్ సెంటర్’ అనే బోర్డు రాయించాము.

“రెండు వారాలు గడుస్తున్నా  అమ్మ ఒడిలో తమ పిల్లల్ని చేర్చడానికి ఎవరూ ముందుకు రాలేదు. పిల్లలకు కావాల్సిన ఆట వస్తువులు కానీఉయ్యాలలు  కానీ లేవు. కనీసం ఆయా కూడా లేదు. అలాంటి సెంటర్ లో ఎవరు మాత్రం తమ పిల్లల్ని వదిలి వెడతారుకానీ అవన్నీ అమర్చడానికి ఆర్ధిక వనరులు లేవు.

“అలా ఎదురు చూస్తుంటే ఒక రోజు ఉదయం ఇంకా ఎనిమిది కూడా కాలేదు ఒక జంట హడావిడిగా వచ్చి నా  చేతిలో వాళ్ళ నెలల పిల్లవాడినిఓ పాలసీసాను పెట్టి, ‘ఇప్పుడు టైము లేదుసాయంత్రం ఆఫీసు నుంచి వచ్చినప్పుడు వివరాలు చెబుతామంటూ’ అంతే హడావిడిగా వెళ్ళిపోయారు.

“వాళ్లెవరో తెలియదు. ఎక్కడ ఉద్యోగాలు చేస్తున్నారో తెలియదు. ఆ పిల్లవాడి పేరేమిటో తెలియదు. గంటలు గడిచిపోతున్నాయిసాయంత్రం అయింది. మా పిల్లలు స్కూలు నుంచి వచ్చారు. మా వారు కూడా ఆఫీసు నుంచి వచ్చారు.  ఏడుస్తున్న పిల్లవాడిని ఒడిలో పెట్టుకుని  సముదాయిస్తూ  ఒక్కత్తినీ  అలా కూర్చుని వున్నాను. రాత్రి తొమ్మిది దాటుతోంది. కానీ ఆ తలితండ్రుల జాడ తెలియదు. మా వారు నా పరిస్థితి చూసి ‘పోలీసులకు చెప్పనా!’ అన్నారు.  తల అడ్డంగా ఊపాను. ‘వద్దు. వాళ్ళ మొహాలు చూస్తే మంచివాళ్ళుగానే అనిపించారు. ఏమి ఆటంకం వచ్చిందో తెలవదు కదా! చూద్దాం. మీరు అన్నట్టు రేపటికి కూడా రాకపోతే ముగ్గురు పిల్లలు అనుకుని వీడిని కూడా మన పిల్లలతో పాటే పెంచుతాను’ అన్నాను  స్థిరంగామరో మాట లేదన్నట్టు.

“అన్నట్టే వాళ్ళు చాలా మంచివాళ్ళు. రాత్రి పదిన్నరకు వచ్చారుబోలెడు క్షమాపణలు చెప్పుకుంటూ. ఆయనకి  ఆఫీసు ఆరుకే అయిపోయిందట. కానీ ఆమెకు పెండింగ్ ఫైల్స్ పని పడి పొద్దు పోయిందట. ఈ సంగతి చెబుదామంటే మా ఫోను నెంబరు పొద్దున్న హడావిడిలో తీసుకోవడం కుదరలేదట.

“బాబు పేరు జేమ్స్. మా అమ్మఒడిలో చేరిన  మొదటి పిల్లవాడు.

“తరువాత కొన్ని రోజులకి మరో పిల్లవాడు. అలా రెండు నెలలు తిరిగేసరికి పనిపిల్లను పెట్టుకునే స్థాయిలో పిల్లల సంఖ్య పెరిగింది. పని భారము పెరిగింది. పని మనిషి  రాని రోజున చూడాలి అవస్థ. పదిమంది తల్లుల పాత్రలతో ఏకపాత్రాభినయం చేయాలి. కావాలని కోరి ఎంచుకున్న మార్గం కాబట్టి కష్ట నష్టాలులాభ నష్టాలు చూసుకోలేదు. ఎవరినీ ఇంత కావాలని అడిగింది లేదు. ఇచ్చినది పుచ్చుకోవడమే. కొందరు పద్దతిగా ఇచ్చేవాళ్ళు కాదు. కానీ ఏమీ అనేదాన్ని కాదు.

“మేమూ అంతేగా! నెలనెలా  అద్దె కట్టడానికి ఇబ్బంది పడడం లేదా. వాళ్ళూ అలాగే. ఖర్చులకు సరిపోకనే కదాఇద్దరూ ఉద్యోగాలు చేసేది.

“అలా మొదలైన అమ్మఒడి క్రమంగా పేరు పెంచుకుంటూ పెరుగుతూ వచ్చింది. చిక్కడపల్లిలో ఒక లాండ్ మార్కుగా మారింది. మేము 1987లో మాస్కో వెళ్ళిన తర్వాత అమ్మఒడి బాధ్యతలు  మా వారి  మేనకోడలు ఫణి కుమారి తన భుజాలకు ఎత్తుకుంది.

“అమ్మఒడిలో పెరిగిన పిల్లలు చాలా మంది ఇప్పుడు విదేశాల్లో పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళ తలితండ్రులు వచ్చి వాళ్ళ పిల్లల పెళ్లిళ్లకు పిలుస్తుంటే  చాలా సంతోషంగా వుండేది.

“అలా మొత్తం మీదఅనాథాశ్రమంలో నర్స్  కావాలనుకున్న నా చిన్ననాటి కోరిక  అమ్మఒడి ద్వారా కొంత తీరింది”

ఇలాంటివన్నీ చదువుతున్నప్పుడు నా  కంట నీరు తిరగాలి. కానీ బండ రాతిలో నీటి ఊటని ఎప్పుడైనా చూసామా!

నేనూ అంతే!

కింది ఫోటో:



(ఇంకా వుంది)