నా నలభయ్ అయిదేళ్ళ వైవాహిక జీవితంలో రెండే రెండు సార్లు మా ఆవిడకు చీరెలు కొన్న సందర్భాలు వున్నాయి.
అంటే ఇన్నేళ్ళుగా ఆవిడ ఆ రెండు చీరెలతోనే నెట్టుకొచ్చిందని అర్ధం కాదు. నేను మళ్ళీ ఎప్పుడూ నాకు నేనుగా చీరెలు కొన్న పాపాన పోలేదని మాత్రమే దీని తాత్పర్యం. ఆ రెండు సందర్భాలు బాగా గుర్తుండి పోవడానికి కూడా కారణాలు వున్నాయి.
చాలా ఏళ్ళక్రితం ఒక బ్యాంకు తాలూకు మనిషి పనికట్టుకుని మరీ మా ఆఫీసుకువచ్చి వివరాలు అడిగి తీసుకుని పోస్టులో ఓ క్రెడిట్ కార్డు పంపించాడు. క్రెడిట్ కార్డులు అప్పుడే రంగ ప్రవేశం చేస్తున్న రోజులవి. అది నా గొప్పదనం అనుకున్నాకాని, నేను చేస్తున్నది సెంట్రల్ గవర్నమెంటు నౌఖరీ కాబట్టి ఆ బ్యాంకు అంత ఉదారంగా ఆ కార్డు మంజూరు చేసిందన్న వాస్తవం అప్పట్లో నాకు బోధపడలేదు.
కార్డు చేతికి వచ్చింది కానీ దాన్ని వాడి చూసే అవకాశం మాత్రం వెంటనే నాకు రాలేదు.
అప్పట్లో ఇప్పట్లా ఏటీఎం లు లేవు. ఏదయినా వస్తువు కొనుగోలు చేసినప్పుడు మాత్రమే కార్డు వాడే వీలుండేది. ఓసారి బెజవాడ టూర్ వెళ్ళినప్పుడు మా ఆవిడకోసం బీసెంటు రోడ్డు షాపులో అయిదారొందలు పెట్టి, ఆ క్రెడిట్ కార్డు వాడి, ఓ చీరె కొన్నాను. అంత వరకు బాగానే వుంది.
మరుసటి నెల నుంచీ ఆ బ్యాంకు తాఖీదులు రావడం, ఆ కిస్తీ కట్టే బ్యాంకు ఎక్కడో సికిందరాబాదులో వుండడం, అంతంత దూరాలు పోయి ఓ వందో, యాభయ్యో చెల్లు వేసి రావడానికి సహజ బద్ధకం అడ్డం రావడం ఇత్యాది కారణాలతో నాకూ ఆ బ్యాంకుకూ నడుమ సంబంధ బాంధవ్యాలు పూర్తిగా చెడిపోయాయి.
చీరె తాలూకు అప్పు మొత్తం వడ్డీలతో పేరుకు పోయి, అయిదారువేలకు చేరడం, చివరికి ఆఫీసులో పీఎఫ్ అడ్వాన్సు తీసుకుని ఆ అప్పు తీర్చి కార్డు ఒదిలించుకోవడం ఓ వ్యధాభరిత అధ్యాయం. అయిదారువందల నెల జీతగాన్ని పెళ్ళానికి అయిదారువేల రూపాయల (అసలు వడ్డీలతో కలిపి) చీరె కొనగలిగానన్న తృప్తితో ఆ మొదటి చీరె అంకం అలా ముగిసిపోయింది.
అలాగే మరోసారి ఆఫీసు పనిమీద ఢిల్లీ వెళ్లి, తిరిగి వచ్చే రోజు పాలికా బజారులో నచ్చిన చీరె సెలక్టు చేసి, వచ్చీరాని హిందీలో, గీసి గీసి బేరం చేస్తున్న సమయంలో, అప్పటివరకు శుద్ధ హిందూస్తానీలో మాట్లాడుతున్న షాపు వాడు అచ్చ తెలుగులోకి తిరిగిపోయి ‘అందరికీ నూట ఇరవై, మీకొక్కరికే అరవై సాబ్’ అంటూ నన్ను మారుమాట్లాడనివ్వకుండా మొహమాట పెట్టి ఆ చీరె పొట్లం చేతిలో పెట్టాడు. హైదరాబాదు వచ్చిన తరువాత ఎందుకయినా మంచిదని యాభయ్ రూపాయలకే కొన్నట్టు ఫోజు పెట్టి నా ప్రయోజకత్వాన్ని ప్రదర్శించాను. చీరె రేటు చెబుతున్నప్పుడు మా ఆవిడ ‘అలాగా’ అంటూ చిన్నగా నవ్వుకున్న సంగతి గమనించలేకపోయాను. తరువాత ఇరుగు పొరుగు ఆడంగుల మాటలు చెవిన పడ్డప్పుడు కానీ అసలు విషయం బోధపడలేదు. అదేమిటంటే అరవై రూపాయలకు నేను కొన్న చీరె లాంటిది, మూడు నెలసరి వాయిదాలలో నలభయ్ రూపాయలకే అమ్మే షాపులు చిక్కడపల్లిలో అయిదారు వున్నాయట.
దాంతో బోధి చెట్టుతో అవసరం లేకుండానే తత్వం తలకెక్కింది. ఇక అప్పటి నుంచి ఆ తర్వాత ఎప్పుడూ మా ఆవిడకు చీరె కొనే ప్రయత్నం మళ్ళీ చేయలేదు.
నడిచి వచ్చిన జీవితం బాగా గుర్తుంది అని చెప్పడం పెద్ద అబద్ధం కాకపోయినా మన మనస్సుని మోసం చేసుకోవడమే.
1975 లో హైదరాబాదు వచ్చిన కొత్తల్లో చిక్కడపల్లిలోని మా ఇంటికి రెండు ఫర్లాంగుల దూరంలో మెయిన్ రోడ్డుమీద, సుధా హోటల్ వద్ద సిటీ బస్ స్టాపు వుండేది. అక్కడి నుంచి నేరుగా రేడియో స్టేషన్ కు కాని, సెక్రెటేరియేట్ కు కానీ వెళ్ళాలంటే రామ్ నగర్ నుంచి విజయనగర్ కాలనీకి వెళ్ళే 139 నెంబరు బస్సు ఒక్కటే దిక్కు. ఒక్కటే అవటాన దానికి టెక్కు సహజం. అంచేత దాని రాకపోకలు అనూహ్యం. కావున, మన రూటుది కాకపోయినా మరో బస్సును పట్టుకుని ప్రయాణం చేయడం తప్పనిసరి. పైగా జేబులో ‘అన్ని సిటీ రూట్లలో ఉచిత ప్రయాణానికి సర్కారు (ఆర్టీసీ) వారిచ్చిన జర్నలిస్టు పాసు సిద్ధంగా వుండేది. అలా నిత్యం బస్సుల్లో తిరిగే రోజుల్లో సిటీ బస్సు ప్రయాణీకుల పాట్లు బాగా అర్ధం అయ్యేవి.
ఆ తరువాత కొన్నాళ్ళకు ఆటో శరణ్యం అయింది. అప్పుడు కానీ నాకు ఆటో బాధలు (ఆటో వారితో ప్రయాణీకుల బాధలు అన్నమాట) అర్ధం కాలేదు. రమ్మన్న చోటుకు రావడం వాళ్లకు ఇష్టం వుండేది కాదు. వాళ్ళు అలా రాననడం నాకు నచ్చేది కాదు. వాళ్ళతో ప్రతిరోజూ నా పొట్లాటలు మా ఆవిడకు నచ్చేవి కావు. సినిమాకని బయలుదేరి, ఆటోవాడు రానంటే, అతడు చెప్పిన చోటుకే తీసికెళ్ళమని అందులో ఎక్కి కూర్చుని మధ్యలో పోలీసు స్టేషన్లకు వెళ్ళిన సందర్భాలు కూడా ఉండేవి. రోడ్డు మీద మన మాట చెల్లకపోయినా, పోలీసుల దగ్గర విలేకరిగా చెల్లుబాటయ్యేవి. ఇంతా చేసి మనం అడిగే ఫేవర్ ఒక్కటే, మీటరు మీద వచ్చే ఆటో మాట్లాడి పెట్టమని. వాళ్ళకది చిటికెలో పని. ఆ విధంగా ముందుకు పోతూ, కొంతమంది ఆటో డ్రైవర్ల లైసెన్సులు రద్దు చేసేంతవరకు నా చేష్టలు శృతిమించడంతో, మా ఇంటిల్లిపాదీ స్కూటర్ కొనుక్కోవడం ఒక్కటే దీనికి తరుణోపాయమని ఒక ఏకగ్రీవ తీర్మానం చేసారు.
కొన్నాళ్ళకు ఆ ముచ్చటా తీరింది. స్కూటర్ నడపడం మొదలెట్టాక, ఇక ద్విచక్ర వాహనదారుల కడగండ్లన్నీ కళ్లకు కట్టినట్టు కనిపించడం మొదలయింది. హెల్మెట్ ఉదంతంతో ఆ అధ్యాయమూ ముగిసింది.
జీవితం అన్నాక ఒక్కోమెట్టు నింపాదిగానో, హడావిడిగానో ఎక్కుతుంటాం.
మరి అదేమి చిత్రమో, చూపు ఎక్కే పైమెట్టు మీదనే కానీ, ఎక్కివచ్చిన కింది మెట్టు మీద వుండదు.
కొసమెరుపు
1975 లో ఆంధ్రజ్యోతి దినపత్రికలో నేను రోజు వారీ రాసి వడ్డించిన వాక్టూన్లలో ఒక వంటకం:
చీరే మేరే సప్నే
(ఇంకావుంది)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి