18, జనవరి 2014, శనివారం

ఇద్దరు అధికారులు – ఒకే పాఠం


(నా వ్యాపకాల జ్ఞాపకాలనుంచి)
ఎంత అల్పులమో తెలుసుకోవడానికి అనుదినం ఎదురయ్యే సంఘటనలను కొంత నిశితంగా పరిశీలిస్తే చాలని నా  అనుభవమే నాకు మరోసారి తెలియపరిచింది.
దూరదర్శన్ సప్తగిరి ఆధ్వర్యంలో హైదరాబాదు రవీంద్రభారతిలో ‘స్వర సమరం’ అనే సంగీత పోటీ జరిగింది. గవర్నర్ శ్రీ నరసింహన్ ముఖ్య అతిధి. సతీసమేతంగా హాజరయి శాస్త్రీయ సంగీతం పట్ల తమ మక్కువను చూపారు. ఆద్యంతం తెలుగులో ప్రసంగిస్తూ ఇలాటి అద్భుత కార్యక్రమాలను నిర్వహించే శక్తి కేవలం దూరదర్శన్ కు మాత్రమే వుందని ఉద్ఘాటిస్తూ, ఆ సంస్థ ఇటువంటి కార్యక్రమాలను మరిన్ని నిర్వహించడం ద్వారా శాస్త్రీయ  సంగీతాన్ని ప్రోత్సహించాలని ఉద్బోధించారు. సరే అసలు విషయం ఇది కాదు.
మాజీ పోలీసు డైరెక్టర్ జనరల్ శ్రీ ఆర్.ప్రభాకర రావు, వారి శ్రీమతి వేదవతి  సంగీతం మీద వున్న ఆసక్తితో ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.   శ్రీ ప్రభాకర రావు పోలీసు శాఖలో అనేక ఉన్నత పదవులను నిర్వహించి సమర్ధుడైన అధికారిగా నిరూపించుకున్నారు. ఆయన్ని గుర్తుపట్టిన దూరదర్శన్ సిబ్బందిలో కొందరు వారిని మొదటి వరుసలో కూర్చోవాల్సిందిగా అభ్యర్ధించారు. అయినా సున్నితంగా తిరస్కరించి సాధారణ ప్రేక్షకుల మాదిరిగానే వారిద్దరూ వెనుక వరుసలోనే కూర్చుని కార్యక్రమాన్ని ఆసాంతం తిలకించారు.
గవర్నర్ పాల్గొంటున్న దృష్ట్యా రవీంద్రభారతి ఆవరణలో కట్టుదిట్టమయిన పోలీసు బందోబస్తు చేశారు. కార్యక్రమం ముగిసిన తరువాత  రంగస్థలం మీద కళాకారులను అభినందిస్తూ  నరసింహన్ దంపతులు  కొద్దిసేపు అక్కడే వుండిపోయారు. ప్రభాకరరావు దంపతులు ఈలోగా బయటకు వెళ్ళడానికి ప్రయత్నించగా ద్వారం వద్దవున్న పోలీసు అధికారులు అడ్డగించారు. కొత్తగా ఉద్యోగంలో చేరి విధులు నిర్వహిస్తున్న ఆ సిబ్బందికి తాము అభ్యంతరం చెబుతున్న వ్యక్తి కొన్ని సంవత్సరాల క్రితం తమ శాఖకు అత్యున్నత అధికారిగా పనిచేశారన్న విషయం తెలిసివుండక పోవచ్చు. మధ్యలో ఎవరో కల్పించుకుని ఆయన ఎవరో చెప్పబోతుంటే శ్రీ ప్రభాకర రావు వద్దని సైగచేసారు. వారి డ్యూటీ వారిని చేయనీయండిఅంటూ మళ్ళీ వెనక్కు వచ్చి హాలులో కూర్చుండిపోయారు.
రోజు తిరగకుండా మరో సారి మళ్ళీ ఇదేమాదిరి సంఘటన అనుభవంలోకి వచ్చింది. మర్నాడు  ఆదివారం గవర్నర్ శ్రీ నరసింహన్ పుట్టినరోజు. రాజభవన్ లో అనేకమంది వారిని కలుసుకుని శుభాకాంక్షలు తెలియచేసారు. శ్రీ నరసింహన్ పూర్వాశ్రమంలో పోలీసు అధికారిగా పనిచేసినందువల్లనేమో లోగడ పోలీసు శాఖలో ఉన్నత పదవుల్లో పనిచేసిన అనేకమంది గవర్నర్ ను అభినందించడానికి రాజ్ భవన్ కు వచ్చారు. గతంలో రేడియోలో పనిచేసి నప్పుడు సన్నిహితంగా మెలిగిన అనేకమంది  అధికారులను చాలా సంవత్సరాల తరువాత అక్కడ కలుసుకోవడం జరిగింది. వారిలో శ్రీ రామస్వామి ఒకరు. ఆయన హైదరాబాదు పోలీసు కమీషనర్ గా  పనిచేశారు. నిబంధనల ప్రకారం తన సెల్ ఫోనును కారులో బయటే వుంచేసి లోపలకు రావడం చూసి ఆ విషయాన్ని ఆయనతో ప్రస్తావిస్తే పోలీసుశాఖలో ఇన్నేళ్ళు పనిచేసి మేమే రూల్స్ పాటించకపోతే యెట్లాఅన్నట్టు చిరునవ్వే సమాధానం.
ఎదిగినకొద్దీ వొదగమని ఓ సినీ కవి  చక్కని పాట రాశారు. విన్నప్పుడల్లా యెంత చక్కని పాట అని ఎన్నోసార్లు అనుకుంటాం. కాని సందర్భం వచ్చినప్పుడు మాత్రం గుర్తురాదు. ఉద్యోగం ద్వారా సమకూడిన హోదా ఒక్కటే గుర్తుంటుంది.
ఒక రోజు తేడాతో చూసిన ఈ రెండు సంఘటనలు మనసుపై మంచి ముద్రవేశాయి. అలా వుండగలిగితే  యెంత బాగుండు ఒక్క క్షణం అనిపిస్తుంది. కాని మనసు కోతి లాటిది. దానికి తోడు,  పాడు అహం ఆ ఆలోచనను అనుక్షణం చంపేస్తూనే వుంటుంది. ఏం చేస్తాం! (05-11-2012)  

17, జనవరి 2014, శుక్రవారం

నో మోర్ 'గ్యాస్ ట్రబుల్'

ఎన్నికల ప్రచార రుతుపవనాలు ఢిల్లీని తాకాయి. మొదటి జల్లు పడింది.



వంట గ్యాస్ సిలిండర్ల సంఖ్యను తొమ్మిది నుంచి పన్నెండుకు పెంచాల్సిందని రాహుల్ గాంధీ ఏఐసీసీ సమావేశంలో ప్రధానమంత్రికి విజ్ఞప్తి చేసిన కొద్ది నిమిషాల్లోనే సంబంధిత మంత్రిగారి నుంచి తదనుగుణమైన క్యాబినెట్ నోట్ గింగిరాలు తిరుగుతూ వచ్చిందని స్క్రోలింగులు బుల్లి తెరలపై పరుగులు తీశాయి. (యువ)రాజు తలచుకుంటే సిలిండర్లకేమి కొరత? సెహభాష్.
మరి ఇది కుదరని పని అని నిన్నగాకమొన్న మంత్రిగారు చేసిన ప్రకటనలు ఏ గాలికి ఎగిరిపోయాయో!

(17-01-2014) 

ప్లస్ లూ మైనస్ లూ


“కాంగ్రెస్ కి మైనస్ పాయింట్ రాహుల్. రాహుల్ కి ప్లస్ పాయింట్ కాంగ్రెస్
“బీజేపీకి ప్లస్ పాయింట్ మోడీ. మోడీకి మైనస్ పాయింట్ బీజేపీ”
ఈ వ్యాఖ్యను వ్యాఖ్యన సహితంగా వివరించే వ్యవధానం నాకు లేకపోవడంతో, రాత్రి  టీవీ – 5 ‘హాట్ టాపిక్’  చర్చలో నా పక్కన కూర్చున్న బీజేపీ అధికార ప్రతినిధి శ్రీ ఎన్.వీ.ఎస్.ఎస్. ప్రభాకర్ కాస్త అసహనంగా ఫీలయినట్టు నాకనిపించింది. ఢిల్లీ నుంచి పాల్గొంటున్న కాంగ్రెస్ రాజ్యసభ సభ్యులు శ్రీ రాపోలు  ఆనంద్ భాస్కర్ ఏమనుకున్నారో తెలియదు.
కార్యక్రమం ముగింపులో ఈ ప్లస్ లూ, మైనస్ ల వ్యవహారం ఎత్తుకోవడంవల్లా, వివరణకు ఆట్టే అవకాశం లేకపోవడం వల్లా – ఇప్పుడు ఇక్కడిలా  కవి హృదయం ఆవిష్కరించుకోవాల్సివస్తోంది.

రానున్న లోక సభ ఎన్నికల తరువాత అటు కాంగ్రెస్ కయినా, ఇటు బీజేపీకయినా కావాల్సిన లక్కీ నెంబరు 272. జాతీయ పార్టీలుగా వుంటూ రెండు ప్రధాన రాజకీయ కూటములకు నాయకత్వం వహిస్తున్న ఈ రెండు పార్టీలకు ఆ మేజిక్ ఫిగర్ సొంతంగా సాధించుకోగలమన్న నమ్మకం ఎట్లాగో లేదు. చిన్నా చితకా పార్టీలను కలుపుకుంటే కాని అది సాధ్యం కాదు. ఓటర్లపై  మోడీ మంత్రం ఎంతో కొంత పనిచేసి కాంగ్రెస్ కంటే కూడా ఎక్కువ స్థానాలను బీజేపీ  గెలుచుకోగలిగినా,  ఆ పార్టీ నాయకత్వంలో పనిచేయడానికి వేరే పార్టీలకి అనేక అభ్యంతరాలు అడ్డం వస్తాయి.  మోడీకి మైనస్ పాయింట్ బీజేపీ అని చెప్పడం అందుకే. (17-01-2014)

16, జనవరి 2014, గురువారం

వీఐపీ ఏకాదశి

ఓసారి తిరుపతి వెళ్ళినప్పుడు ఓ అధికారి చెప్పాడు. 'రోజూ వేలమంది వస్తుంటారు. వాళ్ళల్లో ఓ రెండువేలమందిని మా వాళ్లు జాగ్రత్తగా చూసుకుంటే చాలు. మిగిలిన వాళ్ళతో మాకు ఏం ప్రమాదం వుండదు. నాలుగు తిట్టుకుంటారు. అంతే. సర్డుకుపోతారు. మళ్ళీ వస్తారు. వీఐపీ లంటే వాళ్ళలో మీ జర్నలిష్టులు కూడా. కొండమీద గోరంత జరిగితే కొండంత చేసి రాస్తుంటారు. మళ్ళీ పాసులూ అవీ మామూలే. ఇవేవీ మాకు కొత్తకాదు. రెండు రోజులు మాట్లాడుకుంటారు. తరువాత మరిచిపోతారు. వీఐపీ లని, మళ్ళీ వాళ్ళలో కొంతమందిని జాగ్రత్తగా కనిపెట్టి చూసుకుని దర్శనం చేసి పంపిస్తే చాలు. ఇక్కడ మమ్మల్ని అడిగేవాడు ఎవ్వడూ వుండడు' ఇదీ వరస.


15, జనవరి 2014, బుధవారం

ఎవరా జర్నలిష్టు ........అని మాత్రం అడక్కండేం......


ఇది ఇప్పటి మాటకాదు. ఇది జరిగిన నాటికే ఆయన చేయి తిరిగిన పత్రికారచయిత. అంతేకాదు, బాగా ప్రాచుర్యంలో వున్న పత్రిక్కి సంపాదకుడు కూడా. అనుదినం రాసే సంపాదకీయాలతో పాటు వారం వారం కలం పేరుతొ ఆయన రాసే ప్రత్యేక వ్యాసాల పట్ల ఆకర్షితులై, అభిమానులుగా మారిన పాఠకులు ఆయనకు వేల సంఖ్యలో వుండేవారు. ఇదిలా వుంచితే....


హైదరాబాదు దూరదర్శన్ లో తెలుగు వార్తలతో పాటు వార్తాసంబంధిత కార్యక్రమాలు మొదలయిన రోజులవి. ఆ కార్యక్రమాలు పర్యవేక్షించి నిర్వహించే అధికారికి పైన పేర్కొన్న జర్నలిష్ట్ అంటే వల్లమాలిన అభిమానం. ఒక్క సారయినా ఆ జర్నలిష్టుతో ఏదో ఒక ఇంటర్వ్యూనో లేదా ఆయన పాల్గొన్న ఏదయినా కార్యక్రమాన్నో బుల్లితెరపై చూపాలన్నది ఆయన ప్రగాఢ అభిమతం. చాన్నాళ్ళకు కానీ అది నెరవేరలేదు. ఎందుకంటే ఆయనకు ఇలా టీవీల్లో కనిపించడం ఇష్టం వుండదు. మొత్తానికి డీడీ అధికారి ఎంతో బామాలి బతిమాలి ఆయన్ని స్టూడియోకు తీసుకువచ్చారు. అప్పటికింకా కలర్ టీవీ శకం మొదలు కాలేదు. స్టుడియోలో జర్నలిష్టు కూర్చున్న తరువాత లైటింగు అదీ సరిచేస్తున్న కెమెరామన్  ఆయన వేసుకొచ్చిన చొక్కా రంగు చూసి  పెదవి విరిచాడు. వెనుక వున్న బ్యాక్ గ్రౌండ్ రంగుకు ఆ చొక్కా రంగు మ్యాచ్ కావడం లేదన్నది ఆయన అభ్యంతరం. అయితే దాన్ని  సంపాదకులవారు ఏమాత్రం  లెక్కపెట్టలేదు. ఇలా టీవీ కోసం చొక్కా రంగులు, రంగుల చొక్కాలు మార్చడం తన వల్ల కాదని చెప్పి బయటకు వెళ్ళబోయారు. అదీ నిజమే. ఆయన కొన్ని దశాబ్దాలుగా తన ఆహార్యాన్ని యెంత మాత్రం మార్చుకోకుండా ఒకేరకమైన దుస్తులు ధరిస్తూ  వస్తున్నారు. ఆయనలా భీష్మించడంతో దూరదర్శన్ అధికారులే చివరకు  రాజీ పడాల్సివచ్చింది. మొత్తానికి ఏమైతేనేం ఆ కార్యక్రమం రికార్డింగు పూర్తిచేసి వూపిరిపీల్చుకున్నారు.
ఇది జరిగి ఏండ్లూపూండ్లు గడిచిపోయాయి. దూరదర్శన్ కు పోటీగా ‘ఏ టు జడ్’  ప్రైవేట్ టీవీలు రంగప్రవేశం చేశాయి. ఇరవై నాలుగ్గంటల న్యూస్ ఛానల్స్ అందుబాటులోకి వచ్చాయి. కలర్ టీవీ సెట్లు ఇంటింటా కొలువు తీరాయి. ఇప్పుడదే జర్నలిష్టు వివిధ రంగుల చొక్కాలు ధరించి వేర్వేరు ఛానళ్ళలో దర్శనమిస్తున్నారు.


ఇది రాసికూడా ‘చాలాకాలమయింది’ అని గమనించ ప్రార్ధన.

14, జనవరి 2014, మంగళవారం

కాపీ ;రైట్'



“జోకులకి కూడా కాపీ రైట్లు వుంటాయా మాస్టారూ”
“కాపీ రైట్ అంటేనే  కాపీ కొట్టే రైట్ శిష్యా!”

“ఆరంజి పండుకి యాపిల్  పండుకి వున్న తేడా ఏమిటి?”
“ఆరంజి పండు ఆరంజి రంగులో వుంటుంది. యాపిల్ పండు యాపిల్ రంగులో వుండదు”

యాదగిరి కొత్త మొబైల్ ఫోను కొని తెలిసిన వాళ్ల నెంబర్లకు 
ఎస్.ఎం.ఎస్. లు పంపాడు.
“నా ఫోను నెంబర్ మారింది. మునుపు నాది   నోకియా  3310  అయితే ఇప్పుడది నోకియా 6610  గా మారింది. దయచేసి   ఈ నెంబరు మార్పు నోటు చేసుకోండి.”

“డాక్టర్ గారు  ఫుట్ బాల్ ఆడుతున్నట్టు కలలు వస్తున్నాయి”
“అయితే ఈ రాత్రి నిద్రపోయేముందు ఈ మాత్ర వేసుకోండి. సర్దుకుంటుంది”
“రేపటి నుంచి వేసుకుంటా డాక్టర్. ఇవ్వాళే ఫైనల్ మ్యాచ్”

“నేను చనిపోయాననుకో! నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటావా”
“లేదు. నా చెల్లెలు  దగ్గరకి వెళ్ళి వుంటాను కాని, మళ్ళీ పెళ్లి చేసుకోను. మరి మీ సంగతేమిటి? నేను పోతే మీరు మళ్ళీ పెళ్లి చేసుకుంటారా?”
“లేదు లేదు. నేనూ  మీ చెల్లెలితోనే వుంటాను”
  
“రాత్రి ఇంట్లో దొంగలు పడ్డారు. ఒక్క టీవీ తప్ప అన్నీ ఎత్తుకెళ్లారు ఇనస్పెక్టర్”
“అదేమిటి టీవీ ఒక్కదాన్ని యెందుకు పట్టుకుపోలేదు”
“దొంగలు వచ్చినప్పుడు నేను టీవీ చూస్తున్నాను”

“ఎందుకలా అంతా పరిగెడుతున్నారు?”
“పరుగు పందెం. గెలిచిన వాళ్లకు మెడల్  ఇస్తారు?”
“గెలిచినవాళ్లకు  మెడల్  ఇస్తారు సరే!  కానీ మిగిలినవాళ్ళెందుకు పరిగెత్తుతున్నట్టు”

“నేను ఒకడిని హత్య చేసాను. ఈ వాక్యాన్ని భవిష్యత్ కాలంలోకి మార్చి చెప్పు”
“నువ్వు జైలుకు వెడతావ్”

“ వెళ్ళు. వెళ్ళి మొక్కలకు నీళ్ళు పొయ్యి”
“వర్షం పడుతున్నట్టుంది”
“అయితే ఏమిటట! గొడుగు తీసుకెళ్ళు”

“నా మొబైల్ బిల్లు యెంత వచ్చిందో చెబుతారా”
“దానికి నా సాయం అక్కరలేదు. మీ మొబైల్ నుంచి  121 డయల్ చేస్తే  మీ కరెంట్ బిల్లు ఎంతో ఏమిటో  మీకు వెంటనే ఎస్.ఎం. ఎస్’ వస్తుంది”
“ఏడిచినట్టే వుంది. నేను అడుగుతోంది నా మొబైల్ బిల్లు సంగతి. కరెంటు బిల్లు కాదు”

“ఆ అమ్మాయికి పుట్ట చెముడులా వుంది”
“ఏం అలా అంటున్నావు”
“ ఇందాక ఆ అమ్మాయిని కలిసి నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పా. అలా చెప్పాక కూడా ‘నా చెప్పులు కొత్తవి తెలుసా’ అంటోంది”
“నిన్ను నా  కోర్టులో మళ్ళీ మళ్ళీ  చూస్తున్నాను. మూడో సారి కూడా ముద్దాయిగా కోర్టుకు  రావడానికి నీకు సిగ్గనిపించడం  లేదా”
“యెందుకు సిగ్గు!  మీరు మాత్రం రోజూ కోర్టుకు రావడం లేదా”
 
“రాముడు, బుద్ధుడు, మహమ్మదు ప్రవక్త,  ఏసు క్రీస్తు, గాంధీ -  వీరిలో నీకు కామన్ గా కనిపించే విషయం ఏమిటి”
“అందరూ ప్రభుత్వ సెలవుదినాల్లోనే  పుట్టారు
“మిస్ నిన్న నా మొబైల్ కేమైనా ఫోను చేసారా?”
“లేదే! ఎందుకలా  అడిగారు”
“ఏమీ లేదు నా ఫోన్ లో ఒక మిస్ కాల్ వుంది.”



(ఇవన్నీ నెట్లో విహారం చేస్తున్న ఇంగ్లీష్ జోకులు. ముందే చెప్పినట్టు తెలుగులోకి కాపీ కొట్టే రైట్ కొట్టేశానన్నమాట. మొట్టమొదటిదొక్కటే అచ్చంగా నా సొంతం. పోతే ఇమేజ్ సొంతదారుకు ధన్యవాదాలు - భండారు శ్రీనివాసరావు)

జెయిల్లో సాటి ఖయిదీని గర్భవతిని చేసిన రాజకీయ ఖైదీలు ఎవ్వరు?






(తొలి వెలుగు సౌజన్యంతో)
http://www.youtube.com/watch?v=XP5Qch--DGk


(హైదరాబాదు ప్రెస్ క్లబ్ లో వయోధిక పాత్రికేయ సంఘం ఏర్పాటుచేసిన సదస్సులో ప్రసంగిస్తున్న కేంద్ర సమాచార కమీషనర్ శ్రీ మాడభూషి శ్రీధర్) 


ఆర్టీఏకి తూట్లు పొడుస్తున్న ఐఏఎస్‌లు..!
టీటీడీ ఆర్టీఏ లెక్కల్లోకి ఎందుకు రాదు..?
కొందరు జర్నలిస్టుల అనైతిక దాడికి ఆర్టీఏ కమిషనర్ల రియాక్షనేంటి..?
టీటీడీ ఫైళ్లమీద పోరాడి గెలిచిన జర్నలిస్టు..?
ఆర్టీఏ రావడానికి 20 ఏళ్లకు ముందే 'సమాచారాన్ని' రాబట్టిన జర్నలిస్టు..?
కేజ్రీవాల్ ఎంట్రీకి భయపడి 'తగలబడ్డ' ఢిల్లీ సెక్రటేరియట్ ఫైళ్లపై 'మాఢభూషి' స్పందనేంటి? (పూర్తి వివరాలకు ఈ లింకు పై నొక్కండి)

(1) RTI Commissioner Madabhushi Sridhar at Symposium on RTI and journalists.
http://www.youtube.com/watch?v=XP5Qch--DGk

13, జనవరి 2014, సోమవారం

చదవడానికెందుకురా తొందరా!


చదువుకునే రోజుల్లో ప్రతిఒక్కరికీ  ఫస్ట్ క్లాస్  మీద ఆసక్తి ఫస్ట్ క్లాస్ గా వుంటుంది. బళ్ళో లాస్ట్ బెంచీలో కూర్చునే వాళ్లకు కూడా  క్లాసులో ఫస్ట్ రావాలనే తాపత్రయం. అయితే ఈ ఫస్ట్ క్లాస్ థియరీపై  పరిశోధన చేసి ఒకాయన కనుక్కున్న సంగతులు మాత్రం వేరుగా  వున్నాయి.

చదువులో ఫస్ట్ క్లాస్  సంపాదించే వాళ్ళలో చాలామంది  టెక్నికల్ కోర్సుల్లో చేరి   డాక్టర్లో  ఇంజనీర్లో అవుతుంటారు.

ఇక సెకండ్ క్లాస్ స్టూడెంట్లు ఎంబీయే లాటి కోర్సులు ఏవో చేసి, ఐ ఎ ఎస్ లయి డాక్టర్లను, ఇంజినీర్లను ఆజమాయిషీ చేస్తుంటారు.

పోతే, థర్డ్ క్లాస్ స్టూడెంట్లు డింకీలు కొట్టి అత్తెసరు మార్కులతో పాసయినామని అనిపించుకుని  ఏ ఉద్యోగాలు దొరక్క రాజకీయాల్లో చేరి మంత్రులుగా మారి  పై ఇద్దర్నీ తమ చెప్పుచేతల్లో వుంచుకుంటారు.

ఇక ఆఖరు రకం అంటే పరీక్షల్లో పాసుకాకుండా చదువుకు స్వస్తి చెప్పి అల్లరి చిల్లరగా తిరిగేవాళ్ళు అండర్ వరల్డ్ డాన్ లుగా అవతారం ఎత్తి  పైఅందరిపై పెత్తనం చేస్తుంటారు.

కాబట్టి చదవడానికెందుకురా తొందరా! అని పాడుకోవడం మంచిదేమో.


తోక వాక్యం: ఏదో సరదాకు ఎవరో ఇంగ్లీష్ లో రాస్తే ఉబుసుపోక తెలుగులోకి మార్చి  రాసిందాన్ని  సీరియస్ గా తీసుకుని చదువులు చెడగొట్టుకోవద్దు సుమీ!

12, జనవరి 2014, ఆదివారం

నవ్వడం మరచిపోతున్నామా!


(ఎల్లుండి జనవరి పద్నాలుగు జంధ్యాల జయంతి)
మా పక్కింటి పాపాయి పది నెలల పాప నన్ను చూడగానే నోరంతా తెరిచి పలకరింపుగా నవ్వుతుంది. పుట్టెడు దిగుళ్లను సయితం మటుమాయం చేయగల మహత్తరమయిన నవ్వది. అలా హాయిగా నవ్వుకుని ఎన్నాళ్లయిందన్న బెంగ  వెంటనే మనస్సుని తొలిచివేస్తుంది.
మనిషి ఏడుస్తూ పుట్టేది నవ్వుతూ చనిపోవడానికి
ఈ వాక్యం రాసిపెట్టుకున్న కాగితాన్ని  ముప్పయ్ ఏడేళ్ళ క్రితం నేను రేడియోలో ఉద్యోగం మొదలు పెట్టిన కొత్తల్లో నా ఆఫీసు బల్ల మీది అద్దం కింద హమేషా కనబడేలా పెట్టుకునేవాడిని. దేవుడు ప్రత్యక్షమై వరం కోరుకొమ్మంటే – ‘చనిపోయినప్పుడు నా మొహం మీద చిరునవ్వు చెరగకుండా  వుందో లేదో చూసి చెబుతావా స్వామీ!అని చెప్పుకున్న రోజులవి.
నవ్వగలగడం ఒక భోగం -  నవ్వలేకపోవడం ఒక రోగంఅని నవ్వు గురించి నవ్వులరేడు, కాలేజీలో నా క్లాసుమేటు ఆ తరువాత గ్లాసుమేటు అయిన జంధ్యాల చెప్పిన ఈ సూక్తి సూర్యచంద్రులున్నంతవరకు జనం నోళ్ళలో నానుతూనే వుంటుంది. ఈ పోటాపోటీ కాటా కుస్తీ యుగంలో, ఉరుకులు పరుగులమీద సాగుతున్న జీవితాల్లో నవ్వనేది మరింత అపురూపం కాగలదన్న భయం కూడా పట్టుకుంటోంది.
నిజం. హాయిగా నవ్వలేకపోవడం ఒక రోగం. పైగా ఇది అంటు  రోగంలా అందర్నీ అంటుకుంటోంది.
విశ్వనాథవారు అన్నట్టు ఇదొక విషాదం. 

12-01-2014

చరిత్రకెక్కని చరిత్రకారులు


ఇరీనా సెండ్లర్. ఆరేళ్ళ క్రితం పోలాండ్ లోని వార్సాలో తన తొంభయ్ ఎనిమిదో ఏట చనిపోయింది.
రెండో ప్రపంచ యుద్ధకాలంలో నానా తంటాలు పడి  అధికారులనుంచి ప్లంబర్ గా పనిచేయడానికి అనుమతి సంపాదించింది. ఈ యుద్యోగం దొరకపుచ్చుకోవడంలో ఆవిడ ఉద్దేశ్యం వేరు. తన పనిముట్లు పెట్టుకునే ఒక పెట్టె అడుగున బయటకి కనబడని ఒక అర వుండేది. అందులో పసిపిల్లలను వుంచి సరిహద్దుల అవతలకు చేరవేసేది. పెద్దపిల్లలను చేరవేయడానికి తన ట్రక్కులో ఎప్పుడూ ఓ గోనె సంచీ సిద్ధంగా వుంచుకునేది. తన ‘అక్రమ’ రవాణా వ్యవహారం నాజీ సైనికుల కంట పడకుండా ఎన్నో జాగ్రత్తలు తీసుకునేది. పిల్లలు ఏడ్చిన ధ్వనులు వినబడకుండా ఒక కుక్కను వెంటబెట్టుకుని వెళ్ళేది.పిల్లలు  ఏడ్చినప్పుడల్లా ఆ కుక్క పెద్దగా మొరిగేలా దానికి శిక్షణ ఇచ్చింది. చాలాకాలంపాటు రహస్యంగా సాగించిన ఈ కార్యక్రమం ఫలితంగా మొత్తం మీద రెండు వేళ అయిదువందల పైచిలుకు పిల్లల్ని దేశ సరిహద్దులు దాటించి నాజీల బారినుంచి వారి ప్రాణాలు కాపాడింది.


(ఇరీనా స్లెండర్) 

ఒకరోజు రహస్యం బయట పడి నాజీలకు దొరికిపోయింది. వాళ్లు ఆవిడ రెండు కాళ్ళు విరగగొట్టి చిత్రహింసలకు గురిచేశారు. అయినా తాను తరలించిన పిల్లల ఆచూకీ గురించి ఒక్క మాట కూడా బయటకు పొక్కలేదు.
కాకపోతే ఆ పిల్లల వివరాలు, వారి తలితండ్రుల వివరాలను రాసిన ఒక దస్త్రాన్ని జాగ్రత్తగా ఒక గాజు జాడీలో భద్రపరచి దాన్ని తన ఇంటి పెరట్లో ఒక చెట్టు మొదట్లో ఒక గొయ్యి తవ్వి అందులో పూడ్చిపెట్టింది.
యుద్ధం ముగిసింది. నాజీల నుంచి ఇరీనాకు విముక్తి లభించింది. తన దగ్గర వున్న వివరాలతో ఆ పిల్లలని  వారి తలితండ్రులవద్దకు చేర్చాలని విశ్వప్రయత్నం చేసింది. కాని వారిలో చాలామంది నాజీల గ్యాస్ చాంబర్లలో అప్పటికే ప్రాణాలు కోల్పోయారు. పిల్లలు అనాధ శరణాలయాల్లోనో, తమను  దత్తుకు  తీసుకున్న వారివద్దనో పెరిగి పెద్దవారయ్యారు.

2007 లో ఇరీనా పేరు మళ్ళీ తెర మీదకు వచ్చింది. ఆవిడ చేసిన మానవతా దృక్పధంతో ఆవిడ చేసిన సేవకు గుర్తింపుగా ఆమె పేరు నోబుల్ పురస్కారానికి సిఫార్సు చేశారు. కానీ దురదృష్టం ఆ ఏడాది ఆమెకు  బదులు ఆల్ గొరె ను ఎంపిక చేశారు. ఆ తరువాత కూడా అదే జరిగింది. ఆయేడు బరాక్ ఒబామా ఆ పురస్కారాన్ని ఎగరేసుకుపోయారు. ఈలోగా ఆ దయార్ధహృదయురాలిని ఆ భగవంతుడే కరుణించాడు. తన ప్రాణాలను ఫణంగా పెట్టి ఎందరో పసికందుల ప్రాణాలను కాపాడిన ఆమెను తన అక్కున  చేర్చుకున్నాడు. 2008 లో ఆ కరుణామూర్తి   కన్నుమూసింది.         
NOTE: Courtesy Image Owner

చదివించే ‘గుణకారుడు’


 ''ప్రతి తెలుగు బాలుడూ నూరు పద్యాలు నేర్చుకోవాలి. పద్యాల్లో ఉండే నీతి, విలువలు జీవితానికి ఉపయోగపడడమే కాక, అతడికి తెలుగు భాషా ప్రాచీన ఔన్నత్యాన్ని తెలియజేసినవాళ్ళమవుతాం. జీవితాన్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవడానికి ఈ తరం పిల్లలతో పద్యాలు చదివించాలి'' అంటారు దేవినేని మధుసూదనరావు.
పిల్లలకూ, వారికి మార్గదర్శనంచేసే పెద్దలకూ ఉత్తమ గ్రంథాలను పంపిణీ చేయడం ద్వారా నీతి, విలువలు, తెలుగు భాషా ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు ఆయన శ్రీకారం చుట్టారు. కృష్ణాజిల్లా తెన్నేరు గ్రామానికి చెందిన దేవినేని మధుసూదనరావు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించినప్పటికీ ఛార్టర్డ్‌ అక్కౌంటెన్సీ చదివారు. హైదరాబాద్‌లో 'ఎపి రేయాన్స్‌', 'విజరు ఎలక్ట్రికల్స్‌' తదితర కంపెనీల్లో పదేళ్లపాటు ఛార్టర్డ్‌ ఎక్కౌంటెంట్‌గానూ పనిచేశారు. తనకు 60 ఏళ్లు పూర్తయిన తరువాత  సతీమణితో సహా స్వగ్రామంలో శేష జీవితాన్ని గడుపుతూ.. చిన్నతనంలో తన ఉన్నతికి దోహదపడిన అంశాలను ఈ తరానికి అందించేందుకు కృషి చేస్తున్నారు. ఇందుకు ఆయన ఎంచుకున్న ఆయుధం - విలువలు పెంచే పుస్తకాలను పంపిణీ చేయడం. ఈ పనిలో ఎంతో ఆనందం పొందుతున్నారాయన.
“దురదృష్టవశాత్తూ, ఇవాళ సమాజంలో పుస్తకాలు చదివే అభిరుచి బాగా తగ్గిపోయింది. కొనుక్కుని చదవగలిగే స్థోమత ఉన్నవారు సైతం పుస్తకాలు చదవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత మంచిని పంచే పుస్తకాలు చదివించి, వారిలో మార్పు తీసుకురావచ్చని భావించా. అందుకే పద్యాలను నేటితరం పిల్లల దగ్గరకు తీసుకు వెళుతున్నాను.
“అందుకే పుస్తకాలు కొని.. వాటిని స్నేహితులతో పంచు కుంటున్నా. నేనిచ్చిన పుస్తకాలను వారితో చదివింపజేయడం హాబీగా మార్చుకున్నా.
2010
లో మా అమ్మాయి పెళ్లి జరిగింది. ఇక్కడో కొత్త ప్రక్రియ ప్రవేశపెట్టాను. 2010లో వెలువరించిన కథల సంకలనమొకటి పెళ్లికొచ్చిన వారందరికీ పంపిణీ చేశాను. అందరూ సంతోషించారు. దీంతో నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేయడం, స్నేహితులు, ఇష్టమైనవారికి ఇవ్వడం, వారితో చదివింపజేయడం చేస్తున్నాను. ఇది నాతోపాటు నా శ్రీమతికి కూడా అలవాటైంది.
2011లో విజయవాడలో నా స్నేహితుడు ఫణి ప్రసాద్‌ షష్టి పూర్తి సందర్భంగా శ్రీరమణ రచించిన 'మిథునం' పుస్తకాన్ని అచ్చు వేయించి, 1500 కాపీలను అక్కడికి వచ్చిన అతిథులందరికీ పంపిణీ చేశాను. 2012లో నా స్నేహితుడు 'శాంతా బయోటెక్‌' వరప్రసాద్‌రెడ్డి నూతన గృహప్రవేశం సందర్భంగా ఐదారు కథలతో సంకలనం వేయించి, అక్కడకొచ్చిన అతిథులందరికీ ఇచ్చాను. నా భార్య చెల్లెలి కుమార్తె పెళ్లి సందర్భంగా  కూడా పెళ్లి, పిల్లలు, జీవితానికి సంబంధించిన ఐదు కథలతో సంకలనం వేసి రెండు వేల కాపీలను పంచిపెట్టాను. దీనికి మంచి స్పందన వచ్చింది.
ఇక పిల్లలకు పద్యాలు నేర్పించాలనే ఉద్దేశంతో 2012 మార్చి నుంచి శతకాలు పంపిణీ చేయడం ప్రారంభించాను. ఈ రెండేళ్లలో దాదాపు 45 వేల పుస్తకాలు ('పద్య పారిజాతాలు, బాలగేయాలు') పంచిపెట్టాను. 2013 మార్చిలో నీతి కథలకు సంబంధించి 25 పుస్తకాలు వచ్చాయి. వీటిన్నిటినీ కలిపి 'కథా చిత్రాలు', 'బతుకు పాఠాలు' పేరుతో 2 వేల కాపీలు ముద్రించి పంపిణీ చేశాను. చిత్తూరు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు ఎనిమిది రకాలు పుస్తకాలు ముద్రించి, చిత్తూరు సబ్‌ జైలులో పంపిణీ చేశారు. ఇలాంటి మంచి ప్రయత్నాన్ని అందరూ అభినందించాలి. నాకు తెలిసినంతర వరకూ ఈ రెండు పుస్తకాలు 20 వేల వరకూ ముద్రించి, పంపిణీ చేశా.
కడపలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న డాక్టర్వేంపల్లి గంగాధర్‌ రాసిన 'తెలుగులో తొలి శాసనం' పుస్తకం, అలాగే తెలుగు భాష ప్రాచీన ఔన్నత్యాన్ని తెలియజేసే పలు పుస్తకాలను నా తల్లిగారి పేరు మీద నెలకొల్పిన 'దేవినేని సీతారావమ్మ పౌండేషన్‌' పేరిట ప్రచురించాం.
ఇలా పిల్లల్లో విలువలు పెంచేందుకు ఎంతైనా కృషి చేయాల్సిన అవసరముంది. ఇది అందరూ గుర్తించాలి. ఇదో ఉద్యమంగా సాగాలి. తెలుగు భాష ఔన్నత్యాన్ని నిలబెట్టాలి. అదే నేను కోరుకునేది.''
(-
యు. రామకృష్ణ, 12-01-2014 - ప్రజాశక్తి  దినపత్రిక)