12, జనవరి 2014, ఆదివారం

చదివించే ‘గుణకారుడు’


 ''ప్రతి తెలుగు బాలుడూ నూరు పద్యాలు నేర్చుకోవాలి. పద్యాల్లో ఉండే నీతి, విలువలు జీవితానికి ఉపయోగపడడమే కాక, అతడికి తెలుగు భాషా ప్రాచీన ఔన్నత్యాన్ని తెలియజేసినవాళ్ళమవుతాం. జీవితాన్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవడానికి ఈ తరం పిల్లలతో పద్యాలు చదివించాలి'' అంటారు దేవినేని మధుసూదనరావు.
పిల్లలకూ, వారికి మార్గదర్శనంచేసే పెద్దలకూ ఉత్తమ గ్రంథాలను పంపిణీ చేయడం ద్వారా నీతి, విలువలు, తెలుగు భాషా ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు ఆయన శ్రీకారం చుట్టారు. కృష్ణాజిల్లా తెన్నేరు గ్రామానికి చెందిన దేవినేని మధుసూదనరావు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించినప్పటికీ ఛార్టర్డ్‌ అక్కౌంటెన్సీ చదివారు. హైదరాబాద్‌లో 'ఎపి రేయాన్స్‌', 'విజరు ఎలక్ట్రికల్స్‌' తదితర కంపెనీల్లో పదేళ్లపాటు ఛార్టర్డ్‌ ఎక్కౌంటెంట్‌గానూ పనిచేశారు. తనకు 60 ఏళ్లు పూర్తయిన తరువాత  సతీమణితో సహా స్వగ్రామంలో శేష జీవితాన్ని గడుపుతూ.. చిన్నతనంలో తన ఉన్నతికి దోహదపడిన అంశాలను ఈ తరానికి అందించేందుకు కృషి చేస్తున్నారు. ఇందుకు ఆయన ఎంచుకున్న ఆయుధం - విలువలు పెంచే పుస్తకాలను పంపిణీ చేయడం. ఈ పనిలో ఎంతో ఆనందం పొందుతున్నారాయన.
“దురదృష్టవశాత్తూ, ఇవాళ సమాజంలో పుస్తకాలు చదివే అభిరుచి బాగా తగ్గిపోయింది. కొనుక్కుని చదవగలిగే స్థోమత ఉన్నవారు సైతం పుస్తకాలు చదవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత మంచిని పంచే పుస్తకాలు చదివించి, వారిలో మార్పు తీసుకురావచ్చని భావించా. అందుకే పద్యాలను నేటితరం పిల్లల దగ్గరకు తీసుకు వెళుతున్నాను.
“అందుకే పుస్తకాలు కొని.. వాటిని స్నేహితులతో పంచు కుంటున్నా. నేనిచ్చిన పుస్తకాలను వారితో చదివింపజేయడం హాబీగా మార్చుకున్నా.
2010
లో మా అమ్మాయి పెళ్లి జరిగింది. ఇక్కడో కొత్త ప్రక్రియ ప్రవేశపెట్టాను. 2010లో వెలువరించిన కథల సంకలనమొకటి పెళ్లికొచ్చిన వారందరికీ పంపిణీ చేశాను. అందరూ సంతోషించారు. దీంతో నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేయడం, స్నేహితులు, ఇష్టమైనవారికి ఇవ్వడం, వారితో చదివింపజేయడం చేస్తున్నాను. ఇది నాతోపాటు నా శ్రీమతికి కూడా అలవాటైంది.
2011లో విజయవాడలో నా స్నేహితుడు ఫణి ప్రసాద్‌ షష్టి పూర్తి సందర్భంగా శ్రీరమణ రచించిన 'మిథునం' పుస్తకాన్ని అచ్చు వేయించి, 1500 కాపీలను అక్కడికి వచ్చిన అతిథులందరికీ పంపిణీ చేశాను. 2012లో నా స్నేహితుడు 'శాంతా బయోటెక్‌' వరప్రసాద్‌రెడ్డి నూతన గృహప్రవేశం సందర్భంగా ఐదారు కథలతో సంకలనం వేయించి, అక్కడకొచ్చిన అతిథులందరికీ ఇచ్చాను. నా భార్య చెల్లెలి కుమార్తె పెళ్లి సందర్భంగా  కూడా పెళ్లి, పిల్లలు, జీవితానికి సంబంధించిన ఐదు కథలతో సంకలనం వేసి రెండు వేల కాపీలను పంచిపెట్టాను. దీనికి మంచి స్పందన వచ్చింది.
ఇక పిల్లలకు పద్యాలు నేర్పించాలనే ఉద్దేశంతో 2012 మార్చి నుంచి శతకాలు పంపిణీ చేయడం ప్రారంభించాను. ఈ రెండేళ్లలో దాదాపు 45 వేల పుస్తకాలు ('పద్య పారిజాతాలు, బాలగేయాలు') పంచిపెట్టాను. 2013 మార్చిలో నీతి కథలకు సంబంధించి 25 పుస్తకాలు వచ్చాయి. వీటిన్నిటినీ కలిపి 'కథా చిత్రాలు', 'బతుకు పాఠాలు' పేరుతో 2 వేల కాపీలు ముద్రించి పంపిణీ చేశాను. చిత్తూరు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు ఎనిమిది రకాలు పుస్తకాలు ముద్రించి, చిత్తూరు సబ్‌ జైలులో పంపిణీ చేశారు. ఇలాంటి మంచి ప్రయత్నాన్ని అందరూ అభినందించాలి. నాకు తెలిసినంతర వరకూ ఈ రెండు పుస్తకాలు 20 వేల వరకూ ముద్రించి, పంపిణీ చేశా.
కడపలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న డాక్టర్వేంపల్లి గంగాధర్‌ రాసిన 'తెలుగులో తొలి శాసనం' పుస్తకం, అలాగే తెలుగు భాష ప్రాచీన ఔన్నత్యాన్ని తెలియజేసే పలు పుస్తకాలను నా తల్లిగారి పేరు మీద నెలకొల్పిన 'దేవినేని సీతారావమ్మ పౌండేషన్‌' పేరిట ప్రచురించాం.
ఇలా పిల్లల్లో విలువలు పెంచేందుకు ఎంతైనా కృషి చేయాల్సిన అవసరముంది. ఇది అందరూ గుర్తించాలి. ఇదో ఉద్యమంగా సాగాలి. తెలుగు భాష ఔన్నత్యాన్ని నిలబెట్టాలి. అదే నేను కోరుకునేది.''
(-
యు. రామకృష్ణ, 12-01-2014 - ప్రజాశక్తి  దినపత్రిక)

కామెంట్‌లు లేవు: