21, ఫిబ్రవరి 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (90 ) – భండారు శ్రీనివాసరావు

రేడియో అన్న మూడక్షరాలు కాలగర్భంలో కలిసి పోయాయేమో అన్న అనుమానాలన్నీ రేడియో గురించి రాసిన పోస్టులపై వచ్చిన అనూహ్య స్పందన చూసి పటాపంచలయిపోయాయి. గుర్తున్నంతవరకే కాకుండా, గుర్తు తెచ్చుకుని మరీ రాయాలనీ, అవసరమయితే రేడియో గురించి తెలిసిన ప్రతి ఒక్కర్నీ తట్టిలేపయినాసరే ఇంకా ఇంకా రాయాలని నిర్ణయించుకున్నాను. ఈ విషయంలో అందరి సహకారాన్నీ మనస్పూర్తిగా కోరుతున్నాను. తప్పులు దిద్దుకోవడంలో, రాసిన విషయాలను మరింత సమగ్రం చేసుకోవడంలో, ఎప్పటికప్పుడు సమాచారాన్ని క్రోడీకరించు కోవడంలో ఈ సహకారం ప్రయోజనకారిగా వుండగలదని నమ్ముతున్నాను.
ఒక వార్త సేకరించడానికి, ఆ వార్తలను క్రోడీకరించి ఒక బులెటిన్ గా రూపొందించడానికి ఆకాశవాణి వార్తా విభాగంలో విలేకర్లు, ఎడిటర్లు ఎవరెంత కష్టపడినా, చివరికి శ్రోతల చెవిలో చేరేది న్యూస్ రీడర్ల నోటి మీదుగానే. వారి ఉచ్ఛారణ, స్వర మాధుర్యం, చదివే తీరు ఇవన్నీ కలిసి వార్తకు ప్రాణం పోస్తాయి. శ్రోతలను వినేలా ఆకట్టుకుంటాయి.
అలాంటి తెలుగు రేడియో న్యూస్ రీడర్లు గురించిన కొంత సమాచారం.
న్యూఢిల్లీ నుంచి:
కపిల కాశీపతి, కలపటపు రామగోపాలరావు, వారణాసి సుబ్రహ్మణ్యం, కొంగర జగ్గయ్య, పన్యాల రంగనాధరావు, కొత్తపల్లి సుబ్రహ్మణ్యం, దుగ్గిరాల పూర్ణయ్య, జె.మంగమ్మ, తిరుమలశెట్టి శ్రీరాములు, మామిళ్ళపల్లి రాజ్యలక్ష్మి, కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు, వావిలాల రాజ్యలక్ష్మి. సూర్యదేవర ప్రసన్నకుమార్, రాజశ్రీ, బుచ్చిరెడ్డి (అతి స్వల్పకాలం)
ప్రముఖ రచయిత శ్రీపతి (అసలు పేరు పుల్లట్ల చలపతిరావు) కూడా దాదాపు దశాబ్దంపాటు ఢిల్లీలో కాజువల్ న్యూస్ రీడర్ గా పనిచేశారు.
పెద్ద విశేషమేమిటంటే, మహాకవి శ్రీ శ్రీ సయితం కొద్దికాలం ఢిల్లీ ఆకాశవాణి తెలుగు విభాగంలో పనిచేశారు. ఆయన కూడా తెలుగులో వార్తలు చదివినట్టు అనౌన్స్సర్ల సంఘం వాచస్పతి పేరుతొ ప్రచురించిన ప్రత్యేక సంచికలో పేర్కొన్నారు.
నిర్వహణ కారణాల రీత్యా న్యూఢిల్లీ నుంచి ప్రసారం అయ్యే తెలుగు వార్తలను కూడా హైదరాబాద్ కేంద్రానికి బదిలీ చేయడం వల్ల అక్కడి న్యూస్ రీడర్లు కూడా ప్రస్తుతం హైదరాబాద్ నుంచే వార్తలు చదువుతున్నారు.
హైదరాబాద్ నుంచి ఢిల్లీ వార్తలు చదువుతున్నది- యండ్రపాటి మాధవీ లత, సమ్మెట నాగమల్లేశ్వర రావు (రిటైర్డ్) గద్దె దుర్గారావు, తురగా ఉషారమణి.
విజయవాడ కేంద్రం నుంచి: జ్యోత్స్నాదేవి (తరువాత హైదరాబాదుకు మారారు), ప్రయాగ రామకృష్ణ, కొప్పుల సుబ్బారావు ఈ ముగ్గురు పర్మనెంట్ న్యూస్ రీడర్లు. వీరిలో జ్యోత్స్నాదేవి అమెరికాలో సెటిల్ కాగా, ప్రయాగ రామకృష్ణ రిటైర్ అయ్యారు. కొప్పుల సుబ్బారావు రిటైర్ అయిన కొద్ది కాలానికే మరణించారు.
ప్రస్తుతం ఆ కేంద్రంలో పర్మనెంట్ న్యూస్ రీడర్లు వున్నట్టు లేదు, అందరూ క్యాజువల్ న్యూస్ రీడర్లే అని తెలిసింది. పొతే విజయవాడ నుంచి చాలామంది క్యాజువల్ అంటే అప్పుడప్పుడు వార్తలు చదివినవారిలో రెంటాల కల్పన (ప్రస్తుతం అమెరికా నివాసి), ఓంకార్, సాధన, గారపాటి నరసింహారావు వున్నారు. హైదరాబాద్ లో కాజువల్ న్యూస్ రీడర్ గా వున్న జీడిగుంట నాగేశ్వరరావు కొంతకాలం ప్రతివారం బస్సులో విజయవాడ వెళ్లి ఆదివారం ఉదయం వార్తలు చదివేవారు. విజయవాడ నుంచి వార్తలు చదివిన వారిలో, అరుణ, ఆరవల్లి జగన్నాధస్వామి, తూములూరి రాజేంద్రప్రసాద్. వీళ్ళలో జగన్నాధస్వామి ప్రస్తుతం హైదరాబాద్ స్టేషన్ లో ఎఫ్.ఎమ్.న్యూస్ కి క్యాజువల్ ఎడిటర్ గా పనిచేస్తున్నారని విన్నాను. ఒక టీవీ ఛానల్ లో వార్తలు చదువుతున్న రామకృష్ణ, మరో టీవీలో వాయిస్ ఓవర్ చెపుతున్న శ్యామ్ కూడా విజయవాడ నుంచి వార్తలు చదివారు.
ఇక హైదరాబాదు నుంచి – నళినీమోహన్, డి.రాధాకృష్ణారావు, తిరుమలశెట్టి శ్రీరాములు, డి. వెంకట్రామయ్య, జ్యోత్స్నాదేవి, మాడపాటి సత్యవతి, భండారు శ్రీనివాసరావు (అప్పుడప్పుడు, అసలు న్యూస్ రీడర్లు లభ్యం కాని రోజుల్లో అవసరార్థం వార్తలు చదవాల్సి వచ్చేది. అలాగే అయిదేళ్ళు రేడియో మాస్కో- మాస్కో నుంచి తెలుగు వార్తలు. నాకంటే ముందు కందుకూరి సూర్యనారాయణ, అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు రేడియో మాస్కోలో పనిచేశారు. లిదా స్పిర్నోవా, విక్టర్ అనే తెలుగు తెలిసిన రష్యన్లు కూడా వార్తలు చదివేవారు. ఆ రోజుల్లో రాదుగ (విదేశీ భాషల రష్యన్ ప్రచురణ సంస్త) లో పనిచేసే ఆర్వీయార్ (ప్రముఖ రచయిత, రాళ్ళభండి వెంకటేశ్వరరావు) అప్పుడప్పుడు వార్తలు చదివేవారు) ఎం.ఎస్. లక్ష్మి (హైదరాబాదు ఎ ఐ ఆర్ కరస్పాండెంట్)
పోతే, హైదరాబాద్ నుంచి క్యాజువల్ న్యూస్ రీడర్ల విషయానికి వస్తే,
సీనియర్ జర్నలిస్ట్, ఆంధ్రప్రభ మాజీ సంపాదకులు, ప్రెస్ అకాడమి మాజీ చైర్మన్ పొత్తూరి వెంకటేశ్వరరావు గారు కూడా హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు కొద్దికాలం చదివారు. అలాగే, ఉషశ్రీ (పురాణపండ సూర్యప్రకాశ దీక్షితులు గారు) రేడియోలో చేరక పూర్వం అతి కొద్దికాలం వార్తలు చదివారు.
కాజువల్ న్యూస్ రీడర్లలో మరికొందరు: పీ ఎస్ ఆర్ ఆంజనేయ శాస్త్రి, సురమౌళి, గుడిపూడి శ్రీహరి, మృణాలిని, పార్వతీ ప్రసాద్, వేదగిరి రాంబాబు, చంద్రమోహన్ (ప్రముఖ క్రీడా విశ్లేషకులు), జీడిగుంట నాగేశ్వర రావు, కృష్ణమోహన్ (జర్నలిస్ట్), జె. చెన్నయ్య, (ఓపెన్ యూనివర్సిటీ మాజీ ప్రధాన పౌర సంబంధ అధికారి), షర్ఫుద్దీన్ (షరీఫ్), రామ్మోహన్ నాయుడు, జొన్నలగడ్డ రాధాకృష్ణ, బుద్ధవరపు రామకృష్ణ (జర్నలిస్టులు), ప్రసాదరెడ్డి, అయాచితుల రవికిషోర్ (ఆంధ్రజ్యోతి), పొణంగి బాలభాస్కర్, చుండూరి వెంకట రంగారావు, అక్కరాజు నిర్మల్, పోపూరి మురళీకృష్ణ, వెంపటి కామేశ్వరరావు, సీహెచ్ రామఫణి, లలితారెడ్డి, భమిడిపాటి జ్యోత్స్న, ముదిగొండ సీతా శైలజ, అద్దంకి రాం కుమార్, మునిపల్లి వీణ
జీవన స్రవంతి చదివిన వారు : 1975 లో ఈ కార్యక్రమం మొదలు పెట్టిన దాదిగా 1987 లో మాస్కోవెళ్ళేంత వరకు నేనే చదివేవాడిని. తదనంతర కాలంలో చాలా కాలం వనం జ్వాలా నరసింహారావు, బుద్ధవరపు రామకృష్ణ, రాంపా, క్రొవ్విడి వెంకట రాజారావు, తిప్పారెడ్డి లక్ష్మారెడ్డి, వేదగిరి రాంబాబు, విద్యారణ్య. అద్దంకి రాం కుమార్.
ఇక ఈ జాబితా చివర్లో ప్రథముడు ఎవరయ్యా అంటే అద్దంకి రాం కుమార్.
మహాత్మా గాంధి, జవహర్ లాల్ నెహ్రూ. లాల్ బహదూర్ శాస్త్రి ఇలా ఎవరి స్వరాలు కావాల్సివచ్చినా, ఆ క్యాసెట్లకు కేరాఫ్ అడ్రసు రాం కుమార్. గోదావరి వంతెన మీద నుంచి రైలు వెడుతున్న చప్పుడు కావాలంటే రాం కుమార్. తుపాను గాలి హోరు, పారే నీటి గలగలలు, గుర్రపు డెక్కల చప్పుడు, నాకు తెలిసి ఇలాంటి రికార్డులు అన్నీ అతడి వద్ద సిద్ధంగా ఉండేవి. ఒకసారి ఒక ముఖ్యమంత్రి గారి కార్యాలయం వారికి శంఖం ఊదుతున్నశబ్దంతో పనిపడింది. అప్పుడు కూడా శ్రీరాంకుమార్ సాయం కావాల్సి వచ్చింది. ఈ అమూల్య సంపదను డిజిటలైజ్ చేసాడో లేదో తెలియదు. ఇతడు ఢిల్లీ నుంచి హైదరాబాదు బదిలీ అయివచ్చిన తర్వాత న్యూస్ యూనిట్ లో కొందరికి పని లేకుండా పోయింది అంటే విడ్డూరం కాదు. ఆల్ రౌండర్. తనది కాని పనులు చేయడంలో ముందుంటాడు. రేడియో ఒక వ్యసనం. ఆ వ్యసనం వల్ల అతడికి మంచే జరిగింది. గొప్ప గొప్ప అవార్డులు లభించాయి. 2004 లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ ఎలక్ట్రానిక్ జర్నలిస్టుగా లక్ష రూపాయల నగదు అవార్డుతో సత్కరించింది. ప్రమోషన్ మీద రిటైర్ అయ్యాడు. నేను రిటైర్ అవడానికి కొన్ని సంవత్సరాలు ముందు అతడు మా యూనిట్ లో చేరాడు. ఆ కొద్ది కాలంలోనే అతడిలోని విభిన్న కోణాలను నేను చూడగలిగాను. పేరుకు మాత్రమే ప్రొడక్షన్ అసిస్టెంట్. కానీ రేడియోలో అతడికి తెలియని విద్యలేదు. అవుట్ డోర్ రికార్డింగు, ఎడిటింగ్ తో పాటు, వార్తలు చదవడం, జీవన స్రవంతి, వార్తావ్యాఖ్య, వార్తావాహిని ఇది అది అని లేకుండా అన్నిట్లో అతడి ముద్ర వుంది. అద్దంకి మన్నార్ గారి అబ్బాయి కదా!. వారసత్వంగా అబ్బిన లక్షణాలు.
(నేను రిటైర్ అయి ఇరవై ఏళ్ళుదాటింది. లబ్ధ ప్రతిష్టులు, తమ స్వరంతో రేడియో వార్తలకు, కార్యక్రమాలకు జీవం పోసిన తెలుగు న్యూస్ రీడర్లలో కానీ, క్యాజువల్స్ లో కానీ ఎవరయినా ఈ జాబితాలో కనిపించకపోతే, నూటికి నూరుపాళ్ళు ఆ తప్పు నాదే!)

కింది ఫోటో:
అద్దంకి శ్రీ రాం కుమార్



(ఇంకా వుంది)






2 కామెంట్‌లు:

అజ్ఞాత చెప్పారు...

అంతా బామ్మల మయంగా వుంది ఆకాశవాణి

అజ్ఞాత చెప్పారు...


బోధ గురూజీకి మళ్ళీ కోపమొచ్చింది

అహంకారం సామాన్య జనులు తగ్గించుకోవాలి అని గురువుల బోధ. మంచిదే.

మరి గురూజీలకు అహంకారం ఉండవచ్చా ?
అందరినీ తూలనాడవచ్చా ?