“ఢిల్లీలో
ఏడిద గోపాలరావు గారని వుంటారు, ఆయన్ని
కలవండి”
ఇప్పటి
పరిస్తితులు వేరు కానీ డెబ్బయ్యవ దశకంలో ఎవరైనా పనిపడి ఢిల్లీ వెళ్ళాల్సివస్తే
ముందు వినవచ్చే ఉచిత సలహా ఇది.
ఆ మాట
విన్నవాడి పంట పండినట్టే. ఒక్కసారి ఆయన్ని కలిస్తే చాలు మళ్ళీ ఢిల్లీ వదిలి వెళ్ళే
వరకు వాళ్ళ బాధ్యతను, అవసరాలను ఆయన
స్వచ్చందంగా, ఆనందంగా
భుజానికి ఎత్తుకుంటాడు అని, ఢిల్లీ లో చాలా కాలం వున్న ప్రముఖ జర్నలిస్టు ఆదిరాజు
వెంకటేశ్వరరావు గారు చెబుతుండేవారు. ఆయన మాట అక్షరాలా నిజం.
ఒక్కమాటలో
చెప్పాలంటే ఆ రోజుల్లో ఢిల్లీలో తెలుగువాడి కేరాఫ్ అడ్రస్ ఏడిద గోపాలరావు అంటే
అతిశయోక్తి కాదు.
ఆయన
పనిచేసేది ఆల్ ఇండియా రేడియో తెలుగు వార్తావిభాగంలో. ఉద్యోగం తెలుగు న్యూస్ రీడర్.
ముప్పూటలా వార్తలు అనువదించె/ చదివే డ్యూటీ వుంటుంది. మరి ఈ ప్రజాసేవకు టైం ఎలా
సర్దుబాటు చేసుకునే వారో ఆ దేవుడికే తెలియాలి.
1975 లో
నేను రేడియోలో చేరిన చాలా కాలం తర్వాత ఆయన్ని కలుసుకునే అవకాశం చిక్కింది. ఒక రోజు
నేను సచివాలయం బీట్ పూర్తిచేసుకుని రేడియో స్టేషన్ కు వచ్చేసరికి న్యూస్ రూములో
ఎవరో సూటూ బూటుతో ఒక కొత్తమనిషి కనిపించారు.
వెంకట్రామయ్య
గారు ఆయన్ని నాకు పరిచయం చేశారు. ఆయనే ఏడిద
గోపాలరావుని అప్పుడు తెలిసింది. వార్తల్లో
పేరు వినడమే కానీ ఎప్పుడూ చూడలేదు. సూటు, టై మినహాయిస్తే (ఢిల్లీలో ఈ ఆహార్యం తప్పనిసరి అని తర్వాత తెలిసింది)
చాలా సింపుల్ గా కానవచ్చారు. ఆప్యాయంగా పలకరించారు. ఢిల్లీ వస్తే కలవమని తన
విజిటింగ్ కార్డు ఇచ్చారు. కాసేపు వుండి ఢిల్లీ కబుర్లు చెప్పి వెళ్ళిపోయారు.
ముందే
చెప్పినట్టు గోపాలరావు అనే వ్యక్తి రేడియో వార్తలు చదివేవాడిగా ఎంతటి పేరు
సంపాదించుకున్నాడో అంతకంటే ఎక్కువ పేరు ప్రఖ్యాతులు రంగస్థల నటుడిగా
మూటగట్టుకున్నారు. దానికి తోడు దేశ రాజధానిలోని వివిధ తెలుగు సాంస్కృతిక సంఘాలు,
సంస్థలకు నడుమ
ఒక వారధిగా పనిచేశారు.
శంకరాభరణం వంటి
అత్యద్భుత చిత్రాలను రూపొందించిన ఏడిద నాగేశ్వరరావు, గోపాలరావుకు స్వయానా సోదరుడు.
సాంస్కృతిక కార్యక్రమాలు, నాటకాల
పట్ల ఆయనలో అభిరుచి పెంపొందడానికి బహుశా ఈ కుటుంబ నేపధ్యం కూడా దోహదపడి వుంటుంది.
నాకంటే
ముందు మాస్కోలో,
రేడియో మాస్కోలో చాలా కాలం పనిచేశారు. మాస్కోలో కూడా ఆయన వదిలివెళ్ళిన ముద్ర
సామాన్యమైనది కాదు. సాంస్కృతిక పరమైన గోష్టులకు, సమావేశాలకు ఆయన నివాసం ఒక కేంద్రంగా
వుండేదని చెప్పుకునేవారు. ముందే చెప్పినట్టు ఏడిద గోపాల రావు గారు తన పరిధిని కేవలం
ఉద్యోగానికి పరిమితం చేసుకోలేదు. ఆ పరిధిని దాటి కార్యకలాపాలను విస్తరించుకోవడం
ఆయన నైజం. 'సరస
నవరస' అనే నాటక,
సాంస్కృతిక
సంస్థను స్థాపించి రెండు దశాబ్దాలు పోషించారు. వందకు పైగా నాటకాలు ఆ సంస్థ ద్వారా
ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ నాటక అకాడమీ గౌరవ సభ్యులుగా కొంతకాలం పనిచేశారు. 'ధియేటర్ ఆర్ట్స్'లో డిప్లొమా పొందారు.
రేడియో ఉద్యోగ
పర్వం పూర్తి అయిన పిదప గోపాల రావు ఢిల్లీ జీవితానికి స్వస్తి పలికి హైదరాబాదు
వచ్చి స్థిరపడ్డారు. పదవీ విరమణ అనంతరం పెద్ద వయసులో కూడా ఆయన తన సాంస్కృతిక
కార్యక్రమాలను కొనసాగించారు. రంగస్థలంపై మహాత్మా గాంధీ వేషం కట్టి రంగస్థల గాంధీగా
పేరు తెచ్చుకున్నారు. రవీంద్ర భారతిలో పన్నెండు గంటల పాటు నిర్విరామంగా వార్తలు చదివి
లిమ్కా బుక్ రికార్డులకెక్కారు.
రేడియో
వార్తలు చదవడంలో తనదైన ముద్ర వేసిన శ్రీ గోపాలరావు 83 వ ఏట హైదరాబాద్ లో 2020 లో కన్నుమూశారు.
కింది
ఫోటో
ఏడిద
గోపాల రావు
(ఇంకా
వుంది)
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి