25, జనవరి 2022, మంగళవారం

"కాలు"క్షేపం – భండారు శ్రీనివాస రావు

 తొంభయ్ అయిదులో నా స్కూటర్ నా మీదనే పడి నా ఎడమ కాలు విరిగింది. ఆరోజుల్లో యాక్టివ్ జర్నలిష్టుని కదా! వీ ఐ పీ డాక్టరు ఒకాయన వీఐ పీ ఆపరేషన్ చేసిన కారణంగా కోలుకోవడానికి మామూలు కంటే నాలుగయిదు నెలలు ఎక్కువ పట్టింది. అన్ని రోజులూ ఆసుపత్రిలో ఎంచక్కా విరిగిన కాలుతో 'కాలుక్షేపం' చేసాను. ఆ డాక్టరు గారు కూడా నా రోజువారీ ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించడం కోసం  నా రూములోనే విడిగా ఒక ఫోను పెట్టించాడు. అప్పటికింకా ఇంత విస్తృతంగా మొబైల్స్ రంగ ప్రవేశం చేయలేదు.

డిశ్చార్జ్ అయి ఇంటికి చేరిన తర్వాత,  మా రేడియో డైరెక్టర్, న్యూస్ ఎడిటర్ పుణ్యమా అని ఆ రోజుల్లోనే ఇంటి నుండి వర్క్ ఫ్రం హోం చేసే మహర్జాతకం నాకు పట్టింది. ఇంటినుంచే  సచివాలయం  ప్రెస్ రూమ్ కి ఫోన్ చేసేవాడిని. చేసి పలానా మంత్రితో ఈరోజు ప్రెస్ కాన్ఫరెన్స్ వుంది అనే విషయం తెలుసుకోగానే, ఆ పలానా  మంత్రికే నేరుగా ఫోన్ చేసి, మీ టైం నా టైం కుదరడం లేదు, ఆ చెప్పే మాటేదో ఇప్పుడే చెప్పేస్తే మధ్యాన్నం ఒకటీ పది వార్తల్లో ఇవ్వడానికి వీలుంటుంది అనేవాడిని. ఆ మంత్రిగారు చెప్పిన మూడు ముక్కలు ముక్కున పెట్టుకుని, మళ్ళీ  రేడియోకి ఫోన్ చేసి చెప్పేవాడిని. ఆ  తర్వాత కాలు మీద విరిగిన  కాలు వేసుకుని సాయంత్రం వార్తల వరకు కాలక్షేపం చేసేవాడిని.

ఇలా  కొన్ని రోజులు గడిచిన తర్వాత.  

నా కాలక్షేపం కోసం, జ్వాలా పూనికతో, ఎంసీఆర్ హెచ్ ఆర్డీ డైరెక్టర్ జనరల్ పీవీఆర్కే ప్రసాద్ గారు, తెలుగు మాతృభాష కాని ఐఏఎస్ ట్రైనీలకి తెలుగు బోధించే పని ఒప్పచెప్పారు. కాలు విరిగిన మనిషిని, కదల లేని మనిషిని కాబట్టి,  మా ఇంటికి దగ్గర్లోనే గ్రీన్ లాండ్స్ గెస్టు హౌస్ (ఇప్పుడు వున్నట్టు లేదు) లో ఉంటున్న ఆ ఉత్తరాది యువ అధికారులు ఉదయం, సాయంత్రం మా ఇంటికే వచ్చి నా వద్ద తెలుగు నేర్చుకుని వెళ్ళేవాళ్ళు. నేను నేర్పిన తెలుగేమో కానీ, మా ఆవిడ చేసిపెట్టే తెలుగు చిరుతిండ్లకు మాత్రం వాళ్ళు బాగా అలవాటు పడ్డారు.

వారిలో ఒకరు తదనంతర కాలంలో విజయవాడ సబ్ కలెక్టర్ అయ్యారు. అప్పట్లో కూడా ఇసుకకు బాగా గిరాకీ వుండేది. ఆ మాఫియాకు ఈ అధికారి గొంతులో వెలక్కాయ కావడంతో బదిలీ తప్పలేదు. మంచి అధికారి, నా దగ్గర తెలుగు నేర్చుకున్నాడు అనే భావనతో నా అంతట నేనే వెళ్లి ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చెప్పాను. ఆయన రవీంద్రభారతిలో జరిగే ప్రజాప్రతినిధులు, మునిసిపల్ అధికారుల సమావేశానికి వెళ్ళే హడావిడిలో వున్నారు. ఆ సమావేశంలో ప్రసంగిస్తూ ముఖ్యమంత్రి చెప్పారు.

ఇంతవరకు మునిసిపల్ కమీషనర్లుగా ఐఏఎస్ అధికారులను నియమించలేదు. మునిసిపాలిటీలలో పరిస్తితులను మెరుగుపరచడానికి ఇప్పుడాపని చేద్దామనుకుంటున్నాను. ముందు ఏలూరుతో మొదలెడతాను. సంజయ్ అని సమర్దుడయిన అధికారిని ఏలూరు మునిసిపల్ కమీషనర్ గా వేస్తున్నాను”

సబ్ కలెక్టర్ గా పనిచేసిన ఆ అధికారికి మునిసిపల్ కమీషనర్ పదవి ఇష్టమో కాదో నాకు తెలవదు. కానీ, మంచి పనులు చేయడానికి ఆ ఉద్యోగం కూడా పనికి వస్తుంది అని తెలుసు. పైగా సిఎం అంతటి వాడే ‘సమర్ధుడు’ అని ఇచ్చిన కితాబు ఇంకా గొప్పది కదా!

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

బదిలీ మాత్రం తప్పలేదు ..
సమర్థుడు అన్న ముసుగేసి , మున్సిపాలిటీ కి దించేశారు . ఒక దెబ్బకి రెండు బాల్స్