22, అక్టోబర్ 2021, శుక్రవారం

నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య......


పిన్ డ్రాప్ సైలెన్స్
సూది కింద పడ్డా వినబడేంత నిశ్శబ్దం అని దీనికి అనువాదం చెప్పుకోవచ్చు. ఇలాటిది ఎప్పుడయినా అనుభవంలోకి వచ్చిందా?
ఫీల్డ్ మార్షల్ శామ్ బహదూర్ మానెక్ షా. ఒకానొక కాలంలో స్వతంత్ర భారత దేశానికి సర్వ సైన్యాధ్యక్షుడు. ఆయన ఒక సారి గుజరాత్ లోని అహమ్మదాబాదులో సభలో మాట్లాడుతున్నారు. మానెక్ షా ఇంగ్లీష్ లో మాట్లాడ్డం సభికులకు నచ్చలేదు. గుజరాతీ భాషలోనే ప్రసంగించాలని పట్టుబట్టారు. అసలే సైన్యాధ్యక్షుడు. క్రమశిక్షణకు పెద్ద పీట వేసే రకం. ఆయన ఒక్క నిమిషం సభికులని తేరిపార చూసి ఇంగ్లీష్ లోనే ప్రసంగం కొనసాగిస్తూ ఇలా చెప్పారు.
“నేను అనేక యుద్ధాల్లో పాల్గొన్న మనిషిని. సైన్యం అంటే ఏ ఒక్క భాష మాట్లాడేవాళ్ళో వుండరు. అనేక ప్రాంతాలవాళ్ళు సైన్యంలో చేరతారు. సిఖ్ రెజిమెంట్ లో పనిచేసే వారి నుంచి పంజాబీ నేర్చుకున్నాను. మరాఠా రెజిమెంటులో చేరిన వారి నుంచి మరాఠీ భాష నేర్చుకున్నాను. అలాగే మద్రాసు సాపర్స్ నుంచి తమిళ భాష బెంగాలీ సాపర్స్ నుంచి బెంగాలీ నుడికారం పట్టుకున్నాను. బీహార్ రెజిమెంటు నుంచి హిందీ, ఘూర్ఖా రేజిమెంటు నుంచి నేపాలీ భాష నేర్చుకున్నాను. దురదృష్టం, గుజరాతీ భాష నేర్చుకుందాం అంటే అదేమిటో గుజరాత్ నుంచి ఎవ్వరూ సైన్యంలో చేరడం లేదు, అందరూ వ్యాపారాల పట్ల మక్కువ చూపే వాళ్ళే!’
అంతే! సభ మొత్తం ‘పిన్ డ్రాప్ సైలెన్స్!’

తోకటపా:

ఫీల్డ్ మార్షల్ మానెక్ షా అంటే ఆషామాషీ కాదు. అప్పటి రక్షణ మంత్రి కృష్ణ మీనన్ కు నో అని మొహం మీదనే చెప్పగలిగిన ధీశాలి. ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వెంట ఆయన కుమార్తె ఇందిరా గాంధి సైనిక స్థావరాల్లోకి ప్రవేశించడానికి అనుమతించని గొప్ప సైనికాధికారి.





కామెంట్‌లు లేవు: