21, అక్టోబర్ 2023, శనివారం

రోల్ మోడల్ - భండారు శ్రీనివాసరావు

 మీ రోల్ మోడల్ ఎవరు? అనే ఈ ప్రశ్న మా కుటుంబంలో ఎవర్ని అడిగినా దాదాపు ఒకే సమాధానం వస్తుంది, రావులపాటి సీతా రాం రావు అని. సీనియర్ ఐ.పి.ఎస్. అధికారిగా రిటైర్ అయ్యారు. అయితే మా వాళ్ళు ఎవరూ ఆయన్ని, ఆయన మీద వున్న గౌరవంతో పేరుతొ పిలవరు, బావా అనో, మామయ్యా అనో. బాబాయ్ అనో పిలుస్తుంటారు.  ఈ మధ్య తాతయ్యా అని కూడా అంటున్నారు. నన్నే అలా అంటున్నప్పుడు నాకంటే మూడు నాలుగేళ్లు పెద్ద అయిన ఆయన్ని అనడంలో ఆశ్చర్యం ఏముంది?

ఇటు అధికార గణంలో, అటు  పాఠకలోకంలో ఆయన పేరు చిరపరిచితం. పోలీసు ఉద్యోగంలోకి రాకముందు నుంచి కూడా ఆయనకు  రచనలు చేయడం అలవాటు. నిజానికి అది ఆయన ప్రవృత్తి. సీనియర్ ఐ.పి.ఎస్. అధికారిగా రిటైర్ అయిన తర్వాత లాఠీ పక్కన పడేసినా, కలాన్ని మాత్రం వదలకుండా పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాస్తున్నారు, ఆధ్యాత్మిక సంబంధ మైన రచనలు చేస్తున్నారు. పుస్తకాలు ప్రచురిస్తున్నారు. రాయడంతో పాటు చదవడం ఆయనలో ఉన్న మరో సుగుణం. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఆయన నిరంతర అధ్యయనశీలి.  రచయితలు రాస్తారు కానీ ఇతరులవి చదవరు అనే అపప్రథ వుంది. అది అపప్రథ కాదు, నిజమే అంటాడు మిత్రుడు జ్వాలా.

ఈ ఉపోద్ఘాతానికి కారణం రావులపాటి సీతారామారావు గారు స్వయంగా రాసి, ( ఈమాట ఎందుకు అంటున్నాను అంటే ఆయన కాగితాల బొత్తి తొడపై పెట్టుకుని, కలంతో రాస్తారు, కంప్యూటర్ వాడరు)  సాహితి ప్రచురణలు ప్రచురించిన ‘పోటీ నీకే జయం నీదే’ అనే నూరు పేజీల పుస్తకం.      

ఇది నా చేతికి వచ్చి వారం, పది రోజులు దాటింది. చదవడం తొందరగానే అయిపోయింది. కానీ ఏమి రాయాలి అనేదే మీమాంసగా మిగిలిపోయింది.  ఆయన ఈ పుస్తకాన్ని నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రోజుల్లోనే రాసిఉంటే ఎంత బాగుండేదో అని చాలాసార్లు అనిపించింది.  పోలీసు ఆఫీసరుగా ఆయన్ని రోల్ మోడల్ గా తీసుకున్నామే కానీ అంతకు మించి మా తరం ఏమీ చేయలేక పోయాము. దానికి కారణం, స్పూర్తి కలిగించే ఇటువంటి  పుస్తకాలు తెలుగులో అప్పుడు అందుబాటులో లేకపోవడం. ఇదే పుస్తకం ఆయన ఆ రోజుల్లో రాసిఉంటే, మేమందరం కూడా ఆయన లాగా అయివుండేవాళ్ళం అని చెప్పే ధైర్యం చేయను కానీ, జీవితంలో మరింత ఎదిగి వుండేవాళ్ళం కనీసం మానసికంగా అయినా  అని గట్టిగా  చెప్పగలను. అంత సుబోధకంగా,  సరళంగా, ఉత్తేజితంగా ఆయన ఈ పుస్తకం రాశారు. తన జీవితంలోని, తనకు తారసపడిన కొందరు ఉన్నతాధికారుల జీవితాల్లోని వాస్తవ సంఘటనలను ఆయన సోదాహరణంగా ఇందులో అక్షరబద్ధం చేశారు. తన అపజయాలు గురించి కూడా నిబద్ధతతో నిజాయితీగా రాసారు.  అవన్నీ ఈ సమీక్షలో రాయడం కంటే ఈ పుస్తకంలోని ప్రతి పేరాను  తిరిగి రాయడం సులభం అనిపించింది. అంతకంటే కూడా ఎవరికి వారు అంటే ముఖ్యంగా ఈనాటి యువతరం, మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు తమకు తాముగా చదివి తెలుసుకోవడం మంచిది అని కూడా అనిపించింది.

పోటీ పరీక్షలకు హాజరు అయ్యేవారికోసం ఈ పుస్తకంలో అనేక సలహాలు, సూచనలు వున్నాయి. ఇది చదివి ఆచరణలో పెట్టుకోగలిగితే లక్ష్య సాధన సులభం అవుతుంది. అయితే రచయితే స్వయంగా ఇందులో పేర్కొన్నట్టు, విజయం సాధించాల్సింది మాత్రం  పోటీ పరీక్షను ఎదుర్కుంటున్న అభ్యర్ధే!

ఇంతవరకు కధలు, నవలల పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంధాలు రాసిన రావులపాటి సీతారాంరావుగారు, భవిష్యత్ తరానికి మార్గ నిర్దేశనం  చేసే ఇటువంటి ఉపయుక్తమైన పుస్తకం రాయడం ముదావహం.



(పోటీ నీకే! జయం నీదే! పోటీ పరీక్షల గైడ్, రచన: శ్రీ రావులపాటి సీతారాం రావు, వెల: తొంభయ్ రూపాయలు, సాహితి ప్రచురణలు, విజయవాడ. ఫోన్: 8121098500           

బంధాలు అనుబంధాలు – భండారు శ్రీనివాసరావు

 ఇల్లంతా నిశ్శబ్దం. కొడుకు, కోడలు, మనుమరాలు పండక్కి ఊరు వెళ్ళారు.  అయినా టైముకు అన్నీ జరిగిపోతున్నాయి. వండి పెట్టే వలలి,  వేళకు వచ్చి  టిఫిను, భోజనం సిద్ధం చేస్తుంది. అయినా ఏదో లోటు. అనుక్షణం ఇల్లంతా తిరుగుతూ మధ్య మధ్య నా గదిలోకి వచ్చి తాతా అని పిలిచే మనుమరాలు లేకపోయేసరికి ఇల్లంతా బావురుమంటోంది. అప్పుడప్పుడు ఫోన్ చేసి పలకరిస్తుంటారు. మొన్న వీడియో కాల్ చేశారు. తాతా అంటూ మనుమరాలు జీవిక లైన్లోకి వచ్చేసరికి ప్రాణం లేచి వచ్చింది.

నిన్న ఉదయం అర్బన్ క్లాప్సో అర్బన్ కంపెనీనో -  ఒకడు యూనిఫాంలో వచ్చాడు. తన ప్రవర చెప్పుకుంటుంటే ఎవరు బుక్ చేశారు అని అడిగాను. నా పేరు చిరునామా కరక్టుగానే చెప్పాడు. ఒక్క అభ్యంగన స్నానం మినహా,  నాలుగు రోజులుగా మాసిన గడ్డాన్ని, కొన్ని రోజులుగా  పెరిగిన జుట్టును  సరిచేసి వెళ్ళాడు. గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేసేసరికి మరోసారి ప్రాణం లేచి వచ్చింది.

తరువాత తీరిగ్గా ఆలోచిస్తే లైటు వెలిగింది.

మొన్న వీడియో కాల్ చేసినప్పుడు నా చింపిరి జుట్టు, పెరిగిన గడ్డంతో ఉన్న నా  అవతారాన్ని కోడలు గమనించినట్టు వుంది. ఇంకేముంది అక్కడ బుక్ చేస్తే ఇక్కడ క్షౌరం చేసి వెళ్ళాడు.  

దగ్గర లేరే అనే బాధ చప్పున మాయం అయింది.

(21-10-2023)   

19, ఆగస్టు 2023, శనివారం

ఫోటో – భండారు శ్రీనివాసరావు

 

నా చిన్ననాటి స్నేహితుడు, సహాధ్యాయి ప్లస్ మేనల్లుడు అయిన తుర్లపాటి సాంబశివరావు (శాయిబాబు) దగ్గర ఒక డబ్బా డొక్కు కెమెరా వుండేది. అది పనిచేసేదా కాదా తెలుసుకోవాలి అంటే పదో పదిహేనో రూపాయలు కావాలి. రీలు కొనడానికి ఓ పది, కడిగించి ప్రింట్లు వేయడానికి మళ్ళీ కొంతా ఇల్లాగన్న మాట.  అంత మొత్తం మాదగ్గర ఎలాగూ వుండదు కాబట్టి, అదో టాయ్ కెమేరాలాగా శాయిబాబు వద్ద చాలా కాలం ఉండిపోయింది.

ఒకరోజు దాని అవసరం వచ్చింది. అప్పటికి చదువు  పూర్తి కాకుండా, ఉద్యోగం సద్యోగం కనుచూపుమేరలో లేదన్న సంగతి నిర్ధారణగా తెలిసిన రోజుల్లో, పక్కింటి అమ్మాయితో (అంటే తదనంతర కాలంలో మా ఆవిడ) నా ప్రేమ వ్యవహారం నిరాఘాటంగా సాగిపోతున్న అద్భుత కాలంలో నాకు ఆ కెమెరా కావాల్సి వచ్చింది. కృష్ణా  బ్యారేజి దాకా నడుచుకుంటూ వెళ్లి అక్కడి నుంచి గూడు రిక్షాలో మంగళగిరి పానకాల స్వామి దర్శనం చేసుకుని రావాలనేది నా ప్లాను. మరో మేనల్లుడు రామచంద్రం మన కూడా వస్తేనే నేను వస్తానని నాకు కాబోయే ఆవిడ  షరతు పెట్టడంతో,  ముగ్గురం కలిసి వెళ్ళాము.  దర్శనం అదీ అయిన తర్వాత అక్కడి కొండపై ఇదిగో ఈ కింది ఫోటో దిగాము. తీసింది రామచంద్రం. కెమెరా ఇచ్చేటప్పుడే చెప్పాడు. రీల్లో ఆల్రెడీ తీసిన ఫోటోలు కొన్ని వున్నాయి. డబ్బులు లేక కడిగించలేదు, కాబట్టి ఒకటీ లేదంటే రెండు, అంతే అంతకంటే ఎక్కువ దిగకండి అని. దాంతో ఒక్కటంటే ఒక్క ఫొటోనే దిగి కెమెరా తిరిగి ఇచ్చేశాను. 

ఆ రీలు కడిగించే డబ్బులు కూడ బెట్టడానికి మరి కొన్ని నెలలు ఆగాల్సివచ్చింది. వీరన్న స్టూడియోలో ఇచ్చాము. రెండు రోజుల తర్వాత చూస్తే రీల్లో చాలా ఫోటోలు  ప్రింటుకు పనికిరానివని తేలింది. చివరికి ఐదో ఆరో బాగున్నాయి. కానీ అన్నీ ప్రింటు వేయించాలి అంటే డబ్బులు సరిపోవు. అంచేత ఓ మూడు వేయించాము. అందులో ఇదొకటి.



పెళ్ళికి ముందు ఫోటో కదా! అదో స్వీట్ మెమొరి.

(ఈరోజు, ఆగస్టు 19, వరల్డ్  ఫోటోగ్రఫీ డే అట కదా!)

6, ఆగస్టు 2023, ఆదివారం

రష్యన్ కనెక్షన్ – భండారు శ్రీనివాసరావు

 మిహాయిల్ గోర్భచెవ్ లక్ష్మణ కుమార్

అరవై పడిలో పడిన వారికి గోర్భచెవ్ ఎవరో తెలిసే వుండొచ్చు. కానీ లక్ష్మణకుమార్ అనే అచ్చ తెలుగు పేరున్న కన్నడిగుడైన వ్యక్తికి ఏం సంబంధం?
తొంభయ్యవ దశకంలో రేడియో మాస్కోలో పనిచేస్తూ వున్నప్పుడు ఆ అయిదేళ్ళ పాటు సోవియట్ ప్రైం టైం టీవీలో అస్తమానం ప్రముఖంగా కనిపించే వ్యక్తులు ఎవరయ్యా అంటే సోవియట్ యూనియన్ అధినాయకుడు మిహాయిల్ గోర్భచెవ్, ఆయనతో పాటు ఇదిగో ఈ లక్ష్మణకుమార్ గారు. మాస్కోలోని భారత రాయబార కార్యాలయంలో పనిచేసే సిబ్బంది పిల్లల చదువు సంధ్యల కోసం ఎంబసీ వారు నెలకొల్పిన ఇండియన్ సెంట్రల్ స్కూల్లో యోగా టీచర్. అలనాటి అంటే దాదాపు ముప్పయ్ ఆరేళ్ల క్రితమే సోవియట్ పౌరులకు యోగాలో శిక్షణ ఇచ్చేందుకు వారానికి ఒకరోజు సోవియట్ ప్రైం టైం టీవీ ఛానల్ లో నిర్విరామంగా ఒక గంటకు పైగా యోగా పాఠాలు చెబుతూ కానవచ్చే వారు. బహుశా ఒక విదేశీ ప్రైం ఛానల్లో ప్రముఖంగా కనిపించే అవకాశం సకృత్తుగా కొందరికే లభిస్తుందేమో. అలాంటిది సోవియట్ యూనియన్ వంటి ఇనుపతెరల దేశంలో ఇది మరీ అసాధ్యం. అలాంటి అరుదైన మహత్తర అవకాశం లక్ష్మణ కుమార్ గారికి అయాచితంగా దొరికింది.
మా ఇద్దరు పిల్లలు మాస్కోలో అదే కేంద్రీయ పాఠశాలలో చదువుతున్నప్పుడు లక్ష్మణకుమార్ గారి పిల్లలు గిరిజ, గీతేశ్ మా పిల్లలు సందీప్, సంతోష్ క్లాస్ మేట్స్.
సరే! మా జీవితంలో ఒక అద్భుత ఘట్టానికి, సోవియట్ యూనియన్ అంగ వంగ కళింగ దేశాల మాదిరిగా విడిపోవడానికి ఒకేసారి తెర పడింది. దాంతో ఎక్కడివాళ్ళం అక్కడ తట్టా బుట్టా సర్దుకుని స్వదేశానికి తరలి వచ్చాం.
మాస్కోలో కలిసి మెలిసి ఉన్న మా రెండు కుటుంబాలు మళ్ళీ కలవడం అన్నది పాతికేళ్ళ తర్వాత ఒకసారి జరిగింది. ఏదో పనిమీద హైదరాబాదు వచ్చిన లక్ష్మణ కుమార్ దంపతులు మా ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. అప్పుడు మా ఆవిడ వుంది. మళ్ళీ నిన్న కలిశాము ఆవిడ లేకుండా. చాలా బాధ పడ్డారు విషయం తెలిసి. ఏమీ చేయగలిగింది లేదు వాళ్ళు, నేనూ కూడా.
ఆయనకు 88, మనిషిలో తేడా లేదు, కొంచెం వినికిడి శక్తి తగ్గింది. నాకు 78. చిన్నప్పటి నుంచి ఎవరి మాటా వినే అలవాటు లేదు. అంచేత నాకూ చెవుడే. కులాసాగా పాత కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేశాము. భోజనం చేస్తూ పాత విషయాలు నెమరేసుకున్నాము.
తోకటపా
డెక్కన్ సేరాయ్ స్టార్ హోటల్ వాళ్ళు అతి ఖరీదైన డిష్ వడ్డించారు. అదే టమాటా పప్పు.
కింది ఫోటోల్లో : లక్ష్మణకుమార్ దంపతులను శాలువాలతో సత్కరిస్తూ నేను, గూపు ఫోటోలో అందరం. ఈ ఫోటోలో ఓ రష్యన్ గృహిణి వున్నారు. అపోలో ఆసుపత్రిలో పనిచేసే గుండె వైద్యుడు డాక్టర్ సతీష్ గారి నాన్నగారు భారత మిలిటరీలో అధికారి. రష్యన్ యువతి జోయా (ZOYA) అప్పుడు వారి నాన్నగారి ఉద్యోగ రీత్యా (ఆయన గారు కూడా రష్యన్ మిలిటరీ అధికారే, సోవియట్ ఎంబసీలో అధికారి) ఢిల్లీలో వుండగా పరిచయం. గుండె డాక్టర్ కదా, సతీష్ గారు, ఆవిడా గుండెలు మార్చుకుని ప్రేమించుకుని మరీ పెళ్లి చేసుకున్నారు. 1992 నుంచి ఇక్కడే వుంటూ తెలుగు బాగా నేర్చుకుని తెలుగు జోయా గారు అయిపోయారు. అదన్న మాట.






(04- 08- 2023)

20, జులై 2023, గురువారం

అన్ని రోడ్లు అటువైపే - భండారు శ్రీనివాసరావు


ఈ కింది సంభాషణలు చిత్తగించండి:
ఇంటర్వ్యూ బోర్డ్ సభ్యుడు:
“ఐ.ఐ.టి. టాపర్ మీరు. ఐ.ఏ.ఎస్. కావాలని ఎందుకు అనుకుంటున్నారు?”
“ఐ.ఏ.ఎస్. అధికారిగా ప్రజలకు ఎక్కువ సేవ చేయడానికి వీలుంటుందని భావించాను”
విలేకరి:
“మీరు ఒక ఐ.ఏ.ఎస్. అధికారి అయివుండి ఎందుకు రాజీనామా చేసి రాజకీయాల్లో చేరదామని అనుకుంటున్నారు?”
“రాజకీయాల్లో వుంటే మరింత ఎక్కువగా ప్రజాసేవ చేయడానికి అవకాశం ఉంటుందనే నమ్మకంతో రాజీనామా చేసి రాజకీయాల్లో చేరుతున్నాను”
విలేకరి:
“రాజకీయాల్లోకి వచ్చారు సరే! కొత్తగా ఒక పార్టీ పెట్టాలనే ఆలోచన ఎందుకు వచ్చింది?”
“అలా అయితేనే మనం అనుకున్న విధంగా ప్రజాసేవ చేయవచ్చని నాకు గట్టిగా అనిపించింది”
విలేకరి:
“దేశంలోనే కాదు ప్రపంచంలోనే మీరు పెద్ద పారిశ్రామికవేత్త. అనేక స్వచ్చందసంస్థలకు కోట్ల రూపాయలు భూరి విరాళాలు ఇస్తుంటారు. మరి రాజకీయ ప్రవేశం చేయాల్సిన అవసరం ఏమివచ్చింది”
“మనం కోరుకున్న విధంగా ప్రజాసేవ చేయాలంటే రాజకీయాలను మించిన మార్గం లేదు కనుక”
విలేకరి:
“సినిమా రంగంలో మిమ్మల్ని కొట్టేవాళ్ళు లేరు. ఒక్కసారి మిమ్మల్ని తాకితే చాలు, జన్మ ధన్యం అనుకునే అభిమానులు మీకు లక్షల్లో వున్నారు. ఏ సినిమా వేసినా కాసుల వర్షం కురుస్తుంది. ఈ వయసులో ఎండ అనకా, వాన అనకా ప్రజాసేవ కోసం అంటూ ఈ తిరుగుళ్ళు ఏమిటి?”
“ఎంత సంపాదించినా, ఎంతమంది అభిమానుల్ని సంపాదించుకున్నా సమాజానికి తిరిగి ఎంతోకొంత ఇవ్వాలని ఈ మార్గం ఎంచుకున్నా. నా దృష్టిలో ప్రజాసేవ చేయాలంటే ఇదొక్కటే మార్గం”
విలేకరి:
“మీ నాన్నగారు రాజకీయ రంగంలో పేరెన్నిక కన్నవారు. మీరేమో విదేశాల్లో ఉన్నత చదువులు చదివారు. గొప్ప కంపెనీకి సీ.ఈ.ఓ. వృత్తి పరంగా అనేక దేశాలు అలవోకగా చుట్టి వస్తుంటారు. ఆ జీవితం వదులుకుని ఇప్పుడు రాజకీయ అరంగేట్రం ఎందుకు చేసినట్టు”
“నాన్నగారికి రాజకీయ వారసుడిగా కాదు, ఆయన ఆలోచనలకు, తలపెట్టిన ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చాను. ప్రజాసేవకు ఇది ఉత్తమ మార్గంగా నాకు తోచింది”
విలేకరి:
“మీరు గొప్ప జర్నలిష్టు. పెద్ద పెద్ద రాజకీయ నాయకులకు మీ మాట శిరోధార్యం.అలాంటిది మీరు కూడా రాజకీయ తీర్థం పుచ్చుకోవడం ఆశ్చర్యంగా వుంది”
“మనం ఎన్ని రాసినా, ఎన్ని హితోక్తులు చెప్పినా సమాజాన్ని మార్చాలి అంటే రాజకీయాలు తప్పిస్తే వేరే దోవ కనిపించలేదు. అందుకే ఈ మార్గం పట్టాను”
ఇలాంటి సంభాషణలు తరచుగా వింటున్నప్పుడు సామాన్యుడికి కలిగే అభిప్రాయం ఒక్కటే!
చివరికి ప్రజాసేవ కూడా సోషలిజం లాగా అర్ధంపర్ధం లేకుండా వాడే పదంగా మారిపోయిందని.
తోకటపా:
తపస్సు చేసుకోవడానికి అడవుల్లోకి వెళ్ళనక్కరలేదు. ఉన్నచోట వుండే భగవధ్యానం చేసుకోవచ్చు.

19, జులై 2023, బుధవారం

మౌనమే నీభాష – భండారు శ్రీనివాసరావు

 మొన్న జ్వాలా ఫోన్ చేశాడు.

‘ ఎప్పుడూ మేము చేయడమేనా! నువ్వు ఫోన్ చేయవా?

నిజమే! కాల్ లిస్టు తీసి చూస్తే అవుట్ గోయింగ్ ఒకటి రెండు కూడా లేవు. అన్నీ ఇన్ కమింగే.

సాయంత్రం అన్నయ్య కుమార్తె వేణి ఖమ్మం నుంచి ఫోన్ చేసింది.

ఏమిటి విశేషం అన్నాను మామూలుగా.

అదే బాబాయ్ నేను చెబుదామని అనుకున్నది. విశేషం ఉంటేనే ఫోన్ చేయాలా! మామూలుగా  ఫోన్ చేసి క్షేమ సమాచారాలు కనుక్కుంటే చాలా బాగుంటుంది అన్నది. అంతే కాదు చిన్నతనం నాటి ఒక వృత్తాంతం  చెప్పింది. అన్నయ్య ఉద్యోగ రీత్యా వైజాగ్ లో వున్నప్పుడు పోస్టాఫీసు నుంచి ఓ డజన్ కార్డులు కొనుక్కు వచ్చి వేణి చేతికి ఇచ్చి చెప్పాడుట. ‘అడ్రసు కూడా రాసి పెట్టాను. నువ్వు చేయాల్సింది అల్లా వారానికి ఒక కార్డు కంభంపాడులో ఉన్న బామ్మకు పోస్టు చేయి. పెద్ద విశేషాలు రాయక్కరలేదు. మేము క్షేమం, మీరు కులాసాగా వున్నారని భావిస్తాను అని రాయి చాలు. పల్లెటూళ్ళో ఉంటున్న ఆమెకు ఈ సమాచారం ఎంతో ఊరట ఇస్తుంది. మనమంతా తనకు మానసికంగా దగ్గరగా వున్నామనే భావన పెద్దవాళ్లకు చాలా సంతోషం కలిగిస్తుంది. ఈ వయసులో వారికి కావాల్సింది ఇంతకంటే ఏమీ వుండదు అని.

‘నాన్న చెప్పింది నా మనసులో ముద్ర పడింది. అందుకే మీ వంటివారికి తరచుగా ఫోన్  చేసి మాట్లాడాలని నిర్ణయించుకున్నాను’

 మంచి నిర్ణయం వేణీ అన్నాను.

జ్వాలా చెప్పింది, వేణి చెప్పింది ఒకటే.

నిజానికి ఇలాంటి మాటలు అన్నీ నేనే ఒకప్పుడు ఫేస్ బుక్ లో పోస్టు చేస్తూ వచ్చాను.

‘మధ్య మధ్య కలుస్తూ వుంటేనే కుటుంబ బంధాలు, మధ్య మధ్య  మాట్లాడుకుంటూ వుంటేనే స్నేహ సంబంధాలు’ అంటూ గొప్పగా నీతులు చెప్పాను. కానీ నేను చేస్తున్నది ఏమిటి?

పక్కవారికి చెప్పేటందుకే నీతులు వున్నాయి  అనుకోవాలా!

చేతిలో ఫోన్ అస్తమానం వుంటుంది. వెనుకటి మాదిరిగా గుండె గుభిల్లుమనే చార్జీల బాధ లేదు. మరి ఎందుకీ నిర్లిప్తత.

నాకూ చిన్నతనం గుర్తుకు వచ్చింది. సొంతంగా ఇంట్లో ఫోన్ లేకపోయినా మిత్రులతో, చుట్టాలతో మాట్లాడాలని తాపత్రయ పడేవాళ్ళం.  పుట్టిన రోజు సందర్భాల్లో  ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలుపుకునే వాళ్ళం. ఇప్పుడూ చెబుతున్నాం. ఫేస్ బుక్ లోనూ, వాట్సప్ లోనూ  మొక్కుబడిగా షరా మామూలు గ్రీటింగ్ పెట్టి ఊరుకుంటున్నాం. అదీ ఫేస్ బుక్ వాడు గుర్తు చేస్తేనే సుమా. వాళ్ళు చూస్తారో తెలియదు. ఒక పని అయిపొయింది అనుకుంటాం. అలా కాకుండా ఆ ఒక్కరోజు ఫోన్ చేసి శుభకామనలు తెలియచేస్తే ఎంత బాగుంటుంది.

అంత తీరికలేని పనులు ఏమీ లేవు కదా!

కానీ ఇంత చిన్న చిన్న పనులు ఎందుకు చేస్తాం!    



Courtesy Cartoonist

 

శ్రీ రమణ ఇక లేరు

 1975 లో ఆంధ్ర జ్యోతి నుంచి నా నిష్క్రమణ అనంతరం ఎడిటర్ నండూరి రామమోహనరావు గారి కోరికపై శ్రీ రమణ గారు జ్యోతిలో చేరారు. తర్వాత కాలంలో శ్రీ రమణ గారు హైదరాబాద్ వచ్చారు. వారిని ఐ. వెంకట్రావు గారు నాకు మహా టీవీలో పరిచయం చేశారు. రాతల్లో వుండే శ్లేష, వ్యంగం ఆయన మాటల్లో కూడా తొంగి చూసేది. నేనంటే ఇష్టపడేవారు. అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం. నిజానికి ఆయన మాట్లాడేవారు నేను వింటూవుండేవాడిని. అలా వినడం నాకు ఇష్టం. ఇక మిధునం విడుదల అయినప్పుడు హైదరాబాద్ లో వున్న పది కుటుంబాల వాళ్ళం కట్టకట్టుకుని ఫస్ట్ డే ఫస్ట్ షో కి వెళ్ళాం. బహుశా శంకరా భరణం తర్వాత అలా ఇంటిల్లపాది కలిసి చూసిన చిత్రం మిథునం మాత్రమే. ఆ సినిమాకు నేను ఫేస్ బుక్ లో రాసిన రివ్యూ చదివి శ్రీ రమణ గారు నాకు ఫోన్ చేసి అభినందించడం గర్వంగా ఫీలవుతాను. బాపు గారి చూసి రాతతో పబ్లిష్ చేసిన మిథునం పుస్తకాన్ని కానుకగా ఇచ్చారు.

పొద్దున్నే V Chowdary Jampala గారు శ్రీ రమణ గారు చనిపోయారు అని పెట్టిన పోస్టు చూసి నిర్ఘాంత పోయాను. అంత నిశ్శబ్దంగా దాటి పోవడం ఆయనకే చెల్లు. బాపు రమణల సాన్నిధ్యంలో స్వర్గంలో ఆయనకు ఏ లోటు వుండక పోవచ్చు. కానీ ఆయన లేని లోటు తెలుగు పాఠకులకే.
వారికి సద్గతులు కలగాలని కోరుకుంటున్నాను 🙏🙏🙏