కేటీఆర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
కేటీఆర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, అక్టోబర్ 2023, శనివారం

రోల్ మోడల్ - భండారు శ్రీనివాసరావు

 మీ రోల్ మోడల్ ఎవరు? అనే ఈ ప్రశ్న మా కుటుంబంలో ఎవర్ని అడిగినా దాదాపు ఒకే సమాధానం వస్తుంది, రావులపాటి సీతా రాం రావు అని. సీనియర్ ఐ.పి.ఎస్. అధికారిగా రిటైర్ అయ్యారు. అయితే మా వాళ్ళు ఎవరూ ఆయన్ని, ఆయన మీద వున్న గౌరవంతో పేరుతొ పిలవరు, బావా అనో, మామయ్యా అనో. బాబాయ్ అనో పిలుస్తుంటారు.  ఈ మధ్య తాతయ్యా అని కూడా అంటున్నారు. నన్నే అలా అంటున్నప్పుడు నాకంటే మూడు నాలుగేళ్లు పెద్ద అయిన ఆయన్ని అనడంలో ఆశ్చర్యం ఏముంది?

ఇటు అధికార గణంలో, అటు  పాఠకలోకంలో ఆయన పేరు చిరపరిచితం. పోలీసు ఉద్యోగంలోకి రాకముందు నుంచి కూడా ఆయనకు  రచనలు చేయడం అలవాటు. నిజానికి అది ఆయన ప్రవృత్తి. సీనియర్ ఐ.పి.ఎస్. అధికారిగా రిటైర్ అయిన తర్వాత లాఠీ పక్కన పడేసినా, కలాన్ని మాత్రం వదలకుండా పుంఖాను పుంఖాలుగా వ్యాసాలు రాస్తున్నారు, ఆధ్యాత్మిక సంబంధ మైన రచనలు చేస్తున్నారు. పుస్తకాలు ప్రచురిస్తున్నారు. రాయడంతో పాటు చదవడం ఆయనలో ఉన్న మరో సుగుణం. ఒక్క ముక్కలో చెప్పాలి అంటే ఆయన నిరంతర అధ్యయనశీలి.  రచయితలు రాస్తారు కానీ ఇతరులవి చదవరు అనే అపప్రథ వుంది. అది అపప్రథ కాదు, నిజమే అంటాడు మిత్రుడు జ్వాలా.

ఈ ఉపోద్ఘాతానికి కారణం రావులపాటి సీతారామారావు గారు స్వయంగా రాసి, ( ఈమాట ఎందుకు అంటున్నాను అంటే ఆయన కాగితాల బొత్తి తొడపై పెట్టుకుని, కలంతో రాస్తారు, కంప్యూటర్ వాడరు)  సాహితి ప్రచురణలు ప్రచురించిన ‘పోటీ నీకే జయం నీదే’ అనే నూరు పేజీల పుస్తకం.      

ఇది నా చేతికి వచ్చి వారం, పది రోజులు దాటింది. చదవడం తొందరగానే అయిపోయింది. కానీ ఏమి రాయాలి అనేదే మీమాంసగా మిగిలిపోయింది.  ఆయన ఈ పుస్తకాన్ని నేను గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన రోజుల్లోనే రాసిఉంటే ఎంత బాగుండేదో అని చాలాసార్లు అనిపించింది.  పోలీసు ఆఫీసరుగా ఆయన్ని రోల్ మోడల్ గా తీసుకున్నామే కానీ అంతకు మించి మా తరం ఏమీ చేయలేక పోయాము. దానికి కారణం, స్పూర్తి కలిగించే ఇటువంటి  పుస్తకాలు తెలుగులో అప్పుడు అందుబాటులో లేకపోవడం. ఇదే పుస్తకం ఆయన ఆ రోజుల్లో రాసిఉంటే, మేమందరం కూడా ఆయన లాగా అయివుండేవాళ్ళం అని చెప్పే ధైర్యం చేయను కానీ, జీవితంలో మరింత ఎదిగి వుండేవాళ్ళం కనీసం మానసికంగా అయినా  అని గట్టిగా  చెప్పగలను. అంత సుబోధకంగా,  సరళంగా, ఉత్తేజితంగా ఆయన ఈ పుస్తకం రాశారు. తన జీవితంలోని, తనకు తారసపడిన కొందరు ఉన్నతాధికారుల జీవితాల్లోని వాస్తవ సంఘటనలను ఆయన సోదాహరణంగా ఇందులో అక్షరబద్ధం చేశారు. తన అపజయాలు గురించి కూడా నిబద్ధతతో నిజాయితీగా రాసారు.  అవన్నీ ఈ సమీక్షలో రాయడం కంటే ఈ పుస్తకంలోని ప్రతి పేరాను  తిరిగి రాయడం సులభం అనిపించింది. అంతకంటే కూడా ఎవరికి వారు అంటే ముఖ్యంగా ఈనాటి యువతరం, మరీ ముఖ్యంగా పోటీ పరీక్షలకు సిద్ధం అయ్యే అభ్యర్ధులు తమకు తాముగా చదివి తెలుసుకోవడం మంచిది అని కూడా అనిపించింది.

పోటీ పరీక్షలకు హాజరు అయ్యేవారికోసం ఈ పుస్తకంలో అనేక సలహాలు, సూచనలు వున్నాయి. ఇది చదివి ఆచరణలో పెట్టుకోగలిగితే లక్ష్య సాధన సులభం అవుతుంది. అయితే రచయితే స్వయంగా ఇందులో పేర్కొన్నట్టు, విజయం సాధించాల్సింది మాత్రం  పోటీ పరీక్షను ఎదుర్కుంటున్న అభ్యర్ధే!

ఇంతవరకు కధలు, నవలల పుస్తకాలు, ఆధ్యాత్మిక గ్రంధాలు రాసిన రావులపాటి సీతారాంరావుగారు, భవిష్యత్ తరానికి మార్గ నిర్దేశనం  చేసే ఇటువంటి ఉపయుక్తమైన పుస్తకం రాయడం ముదావహం.



(పోటీ నీకే! జయం నీదే! పోటీ పరీక్షల గైడ్, రచన: శ్రీ రావులపాటి సీతారాం రావు, వెల: తొంభయ్ రూపాయలు, సాహితి ప్రచురణలు, విజయవాడ. ఫోన్: 8121098500           

19, ఆగస్టు 2016, శుక్రవారం

మారుతున్న తరాలు

మారుతున్న తరాలు

“తనకు అందరూ తెలుస్తారు. కానీ తనెవరో అందరికీ  తెలియదు.
అందర్నీ తను గుర్తుపడతాడు, గుర్తుంచుకుంటాడు, కానీ తానెవరో వారికి గుర్తుండకపోవచ్చు.”
ఈ పొడుపు కధకు సమాధానం ‘జర్నలిష్టు’. మరీ ఖచ్చితంగా చెప్పాలంటే మాజీ జర్నలిష్టు. అంటే రిటైరయిన జర్నలిష్టు.
అతడికి ఎప్పటికీ మిగిలేవి జ్ఞాపకాలే.
జర్నలిష్టుగా వున్న రోజుల్లో వృత్తి రీత్యా  అనేకమందితో ముఖపరిచయం సహజం. మరి  కొందరితో అతి పరిచయం కూడా అంతే సహజం.
బాగా పాత తరానికి చెందిన జలగం వెంగళరావు, అంజయ్య, నేదురుమల్లి జనార్ధన రెడ్డి, రోశయ్య మొదలయిన వారితో చాలా సాన్నిహిత్యం వుండేది.  మరో ముగ్గురు ముఖ్యమంత్రులు  చంద్రబాబు, వైయస్సార్ లతో  చెప్పుకోదగ్గ పరిచయం వుండేది. కేసీఆర్ గతంలో మంత్రిగా వున్నప్పుడు మిగిలిన జర్నలిష్టులతో పాటే నాకూ ఆయనతో మంచి పరిచయమే వుండేది.
వీరి వారసులు, నేటి తరం యువ నాయకులు  జగన్, కేటీఆర్, లోకేష్ లతో ముఖ పరిచయం కాదుకదా ఎన్నడూ ఎదురుపడి  కలుసుకోవడం కూడా జరగలేదు. ప్రెస్ క్లబ్ పుణ్యమా అని కేటీఆర్ ని ఓసారి  కలిసాను. జగన్ మోహన రెడ్డిని  టీవీల్లో చూడడమే.  చంద్రబాబు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు లోకేష్ చిన్న పిల్లవాడు. జూబిలీ హిల్స్  లోని  వాళ్ళ ఇంటికి  తరచూ వెడుతూ వున్న రోజుల్లో బయట  కనబడేవాడు. పెద్దయి రాజకీయాల్లోకి వచ్చిన తరువాత కలిసే సందర్భం ఎన్నడూ  తారసపడలేదు.
రాత్రి జనార్ధన్ అమ్మాయి పెళ్ళిలో కనబడ్డారు. టీడీపీ నాయకుడు  దినకర్, ఎన్టీవీ రుషినీ, నన్నూ  పలానా అని ఆయనకి పరిచయం చేశారు.
అంత హడావిడిలో కూడా ఆయన మా దగ్గర కాసేపు  ఆగి,  ‘అమరావతికి ఎప్పుడు వస్తున్నారు అని రుషిని ప్రశ్నిస్తూ  నా వైపు చూసి, టీవీ ఎనలిష్టు  అంటూ చిరునవ్వుతో పలకరించి ముందుకు వెళ్ళిపోయారు.
మూడు దశాబ్దాలకు పైగా పనిచేసిన రేడియో, డీడీ ‘చెవులు’ ఎటుపోయాయో, కొత్తగా వచ్చిన ఈ టీవీ ఎనలిష్టు ‘కొమ్ములు’ ఏవిటో! ముందు బోధపడలేదు.
ఆలోచిస్తే  అర్ధం అయింది. నిజమే. నేనూ  ఇలా ప్రవర్తించిన వాడినే.
నాకంటే  పాతతరం వాళ్ళు  ఎప్పుడూ నాగయ్య, నారాయణరావు, శ్రీ రంజని గురించి మాట్లాడుతుండేవాళ్ళు. అప్పటికే ఏ యెన్ ఆర్, ఎన్టీఆర్  తరం వచ్చేసింది. నాగయ్య  అనగానే  మంచం మీద దగ్గుతూ, గెడ్డం నెరిసిన మనిషే  కళ్ళల్లో మెదిలేవాడు. గతంలో ఆయన తారాపధంలో  ఓ వెలుగు వెలిగిన సంగతులు  మా  పాత తరం వాళ్లకు  తెలుసు కానీ  మాకు తెలియవు. అలాగే  నేటి తరం అస్తమానం తలచుకుండే తారలని  సినిమాల్లో చూసినా  గుర్తు పట్టలేని  పరిస్తితి  మా తరానిది.
ఈ సత్యం బోధపడితే  తరాల  అంతరాల్లో తేడాలని సరిగ్గా అర్ధం చేసుకోవచ్చు. లేకపోతే మిగిలేవి అపార్ధాలే!