12, మే 2014, సోమవారం

కారాలే కారాలు

టీవీల్లో కారాలు మిరియాలు
ఇంట్లో కొత్తావకాయ కారాలు



ఈసారి సుస్తీ చేసి కోలుకుంటున్న మా ఆవిడకు సాయంగా మా వొదినె గారు విమలాదేవి, మేనకోడలు వనం విజయలక్ష్మి - ఓహ్! ఒక్క రోజు కష్టానికి ఏడాది పాటు హాయిగా లొట్టలు వేసుకుంటూ తినొచ్చు. కానీ ఆడవారి కష్టానికి ఖరీదు కట్టే షరాబు ఏడీ! 

విజేతలకు అభినందనలు.

గతం నిజం, వర్తమానం వాస్తవం. భవిష్యత్తు వూహ.
ఇలా జరిగింది నిజం. ఇలాజరుగుతోంది వాస్తవం. ఇలా జరుగుతుంది వూహ.
మునిసిపల్  ఎన్నికల్లో తెలుగుదేశం విజయం వాస్తవం. ఈ నిజాన్ని అంగీకరించి తీరాలి.
'ఇలా జరిగింది కాబట్టి ఇలానే జరుగుతుంది, ఇలా జరిగే వీలే లేదు' ఈ వాదనలన్నీ వూహాజనితాలు.
ఒక్కొక్కటిగా ప్రజాతీర్పు బయటకు వస్తుంది. వచ్చిన తీర్పును గౌరవించడం ప్రజాస్వామ్య ప్రియుల కర్తవ్యం. మన ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా అన్నీ జరగాలని అనుకోవడం అత్యాశే అవుతుంది.
ఎన్నికల్లో విజేతలకు అభినందనలు.   

11, మే 2014, ఆదివారం

ఇలానే మొదలవుతుంది


బోధి చెట్టు కింద కూర్చోకుండానే ఒక సత్యం బోధపడింది.
పోలింగుకు ఓట్ల లెక్కింపుకు మధ్య  రోజుల తరబడి వున్న వ్యవధానాన్ని కూడా కొంతమంది ఇబ్బడిముబ్బడిగా డబ్బు సంపాదించడానికి వాడుకుంటున్నారని.


మనకో ఎస్ ఎం ఎస్  వస్తుంది. పలానా సర్వే ప్రకారం పలానా పార్టీకి ఇన్ని సీట్లని.
మనకో మెయిల్ వస్తుంది. అచ్చం అలాగే.
ఇంకేముంది. మనకో విషయం అందరికంటే ముందే తెలిసిపోయింది అన్న  ఆత్రుతలో ఆ మెసేజ్ వేరెవరికో తెలిసిన వాళ్లకి, వాళ్ళు వాళ్లకి తెలిసిన వాళ్లకి ఫార్వార్డ్ చేసేస్తాం. అంతే. అది వేరే ఎవరో బెట్టింగులు నడిపే వాళ్లకి నాలుగు రాళ్ళు పోగేసిపెడుతుంది. బెట్టింగులు కాసేవాళ్ళకి తిరుక్షవరం చేస్తుంది.
ఈ వూహాగానాలన్నీ, కోట్లు చేతులు మారే  ఈ ఆటలో భాగమే అని తెలిసి నివ్వరపోవడం మన వంతవుతుంది.

హలో! లక్ష్మణా!!

ఏరీ! వారేరీ! కనరారేమీ! 
"ఏ కష్టం వచ్చినా  మీ వెంటే వుంటాం. మీ వెన్నంటే వుంటాం. ఏ అవసరం వచ్చినా సరే,  ఓ చిటికేస్తే చాలు  చిటికెలొ మీ వద్దకు వస్తాం" నిన్న మొన్నటి వరకు ఇలాటి మాటలే రాజకీయ నేతల నోటివెంట జల్లులా కురిసాయి.

అకాల వర్షాల తాకిడితో ఆరుగాలం  కష్టం ఆవిరైపోతున్న వేళ, వాననీటిలో పంటలు మునిగి, ధాన్యం తడిసి,  పండు రాలి, గుండె పగిలి,  రైతన్నలు కన్నీరు మున్నీరై పోతూ విలవిలలాడిపోతున్న విషాద తరుణంలో -

ఏరీ! వారేరీ! ఒక్కరూ కనరారేమీ!  

10, మే 2014, శనివారం

అమ్మ

  


అమ్మ అన్న దేవత లేకపోతే-
ఇది రాస్తున్న నేనూ లేను. చదువుతున్న మీరూ వుండరు.


రోజూ తలచుకోవాల్సిన ఈ దేవతను ఏదో ఒకనాడయినా  తలచుకునేందుకు ఈ నాటి నాగరికత మనకో రోజును ఇచ్చింది.
అదే  మదర్స్ డే   మాతృమూర్తి దినోత్సవం.
దేశదేశాల్లో ఈ ఉత్సవాన్ని జరుపుకోవడం ఇప్పుడు ఆనవాయితీగా తయారయింది.
అయితే, భారత దేశంతో సహా అనేక దేశాలలో ఈనెలలోనే  అదీ రెండో ఆదివారం నాడే    ఉత్సవాన్ని జరుపుకుంటూ తమకు జన్మ ఇచ్చిన మాతృదేవతలను స్మరించుకుంటున్నారు. కానుకలిచ్చి కన్నరుణం తీర్చుకుంటున్నారు.
తల్లులను ఏడాదిలో ఒకరోజయినా గుర్తుంచుకుని పండగ చేసుకునే ఈ సంప్రదాయ మూలాలు మనకు విదేశాలనుంచే దిగుమతి అయ్యాయి.
సంవత్సరంలో ఒక రోజుని మదర్స్ డే గా గుర్తింపు సాధించడానికి  దాదాపు నూట ఇరవై ఏళ్ళ క్రితమే అమెరికాలో ఒక మహిళ ఏళ్ళ తరబడి పోరాటం చేయాల్సి వచ్చిందంటే  తల్లులపట్ల సమాజానికి వున్న చిన్న చూపు ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.
అన్నా జార్విస్ అనే ఈ అమ్మడు  1890  లోనే తాను నివసిస్తున్న   గ్రాఫ్టన్ నగరం వొదిలి  ఫిలడెల్ఫియాకు మకాం మార్చుకున్నది. నవమాసాలు మోసి జన్మనిచ్చిన తల్లికి గుర్తింపు తీసుకురావాలనే  ఏకైక లక్ష్యంతో వొంటరి పోరాటం ప్రారంభించింది. 1905 లో తన తల్లిని ఖననం చేసిన స్మశాన వాటికలో అమ్మ సమాధి ఎదుట నిలబడి  చనిపోయిన లేదా జీవించివున్న మాతృమూర్తులపట్ల గౌరవపురస్సరంగా ఏడాదిలో ఒక రోజుకి  మదర్స్ డే గా గుర్తింపు తీసుకువస్తానని ప్రతిన పూనింది. దీనికో బలమయిన కారణం వుందని కూడా చెప్పుకుంటారు. ఈవిడ తల్లి  అన్నా రీవేస్ జార్విస్ మరణానికి ముందు ఏదో ఒక విషయంలో తల్లీ కూతుళ్ళ నడుమ వాదులాట జరిగిందట. ఆ తరవాత కొద్దిసేపటికే తల్లి మరణించడం - కూతురు అన్నా జార్విస్ కి తీరని మనస్తాపాన్ని కలిగించిందట. ఇందులో నిజానిజాల సంగతి ఎలావున్నా  ఆ తరవాత రోజుల్లో జార్విస్ సాగించిన పోరాటం చరిత్రలో ఒక అధ్యాయంగా మారింది.

ఈ క్రమంలో ఆమె చేస్తున్న ఉద్యోగాన్ని  వొదిలిపెట్టింది. రాజకీయ నాయకులకు, చర్చి అధికారులకు, ప్రభుత్వంపై వొత్తిడి తీసుకురాగల అవకాశం వున్న బడా పారిశ్రామిక వేత్తలకు ఉత్తరాలు  రాసింది. విజ్ఞప్తులు చేసింది. దరిమిలా వెస్ట్ వర్జీనియా ప్రభుత్వం ముందుగా స్పందించి ఆ రాష్ట్రంలో మదర్స్ డే అధికారికంగా జరపడానికి అంగీకరించింది. ఆ తరవాత 1914 లో  అమెరికా కాంగ్రెస్ కూడా మెట్టుదిగివచ్చి  ఈ దిశగా ఒక తీర్మానం ఆమోదించడం  ఆనాటి ప్రెసిడెంట్ ఉడ్రో విల్సన్ సంతకం చేయడం చకచకా జరిగిపోయాయి. అన్నా జార్విస్ పట్టుదలపై అమల్లోకి వచ్చిన ఈ మదర్స్ డే ఉత్తర్వులో ఒక విశేషం వుంది.  మొత్తం కుటుంబం శ్రేయస్సుకు అనుక్షణం పాటుపడే అమ్మకే ఈ గౌరవం దక్కాలన్నది జార్విస్  ఆకాంక్ష. అందుకు అనుగుణంగానే  ప్రజా రంగంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మహిళామణులను మాత్రమె గౌరవించుకునే రోజుగా  కాకుండా  అమ్మలగన్న అమ్మలందరికీ కృతజ్ఞతలు తెలిపే రోజుగా మదర్స్ డే ని జరుపుకోవడమే అందులోని విశిష్టత. అందుకే ఇంగ్లీషులో మదర్స్ డే రాసేటప్పుడు  ఏకవచనంలో అంటే తల్లి దినోత్సవంగా పేర్కొంటారు.
మదర్స్ డే సాధించాలన్న అన్నా జార్విస్ పట్టుదల అయితే నెరవేరింది కానీ ఆమె కన్న మరికొన్ని కలలు మాత్రం కలలుగానే మిగిలిపోయాయి. మదర్స్ డే నాడు తల్లులకు కానుకలుగా పూలూ గ్రీటింగ్ కార్డులూ పంపకండి, ఆమె పట్ల మీ ప్రేమానురాగాలు వ్యక్తం చేస్తూ సొంత దస్తూరీతో నాలుగు వాక్యాల ఉత్తరం ముక్క రాయండన్న అన్నా జార్విస్ వేడుకోలు గాలిలో కలిసిపోయింది. గ్రీటింగ్ కార్డుల్లో వ్యక్తమయ్యేది  మొక్కుబడి ప్రేమేననీ, సొంతంగా ఉత్తరం రాస్తే తల్లికి కలిగే తృప్తి వేరనీ -  జార్విస్ చేసిన  విజ్ఞప్తులన్నీ  తల్లి పాలను సయితం లాభాలకు అమ్ముకోవాలనే మార్కెట్ శక్తుల ఎత్తుగడలముందు వెలతెలా పోయాయి. మాతృమూర్తి దినోత్సవం కోసం నిర్విరామగా పోరాడిన అన్నా జార్విస్  పిల్లలు లేకుండానే, తల్లి కాకుండానే  1948 లో చేతిలో చిల్లిగవ్వ లేకుండా దిక్కుమాలిన  పరిస్తితుల్లో కన్నుమూసింది. ఏ తల్లి కోసం ఆమె అంతగా పోరాడిందో  ఆ తల్లి సమాధి చెంతనే అన్నా  జార్విస్ ని    ఖననం చేయడం ఒక్కటే ఆమెకు దక్కింది.
అన్నా జార్విస్ కోరుకున్నట్టుగా  మదర్స్ డే జరుపుకోవడం అనేది ఒక మొక్కుబడి వ్యవహారం కాకుండా చూడాలంటే కొన్ని నిర్ణయాలు తీసుకోవడమే కాదు వాటిని ఆనాడు అమలుపరచాలి.
మదర్స్ డే నాడు  తల్లి దగ్గరకు వెళ్లి ఆ రోజల్లా  ఆమెతో గడపగలిగితే అంతకు మించిన సార్ధకత వుండదు. ఒక రోజు మొత్తం తల్లితో గడిపి, సొంతంగా వంట చేసి  ఆమెతో తినిపించగలిగితే మాతృరుణాన్ని ఏదో కొంతయినా తీర్చుకున్నట్టే.     అలా కుదరని పక్షంలో  గ్రీటింగ్ కార్డుతో పాటు స్వయంగా అమ్మకు  రాసిన ఉత్తరాన్ని కూడా జతపరచాలి. తల్లి మనసు తెలుసుకుని ఆమె కోరుకున్న విధంగా పనిచేస్తున్న స్వచ్చంద సంస్తలకు విరాళం పంపాలి. తల్లీ తండ్రి లేని అనాధ

పిల్లలను చేరదీయాలనే నిర్ణయం తీసుకోగలిగితే అంతకు మించిన కానుక ఏ తల్లీ ఆశించదు.

అమ్మ ఎవరికయినా అమ్మే!

(మే 11 - మన దేశంలో మాతృమూర్తి దినోత్సవం)
(మనసును తాకే కధఅనే  ఈ కధను సందీప్ కుమార్ పోస్ట్ చేసారు. చాలామంది చదవడానికి వీలుంటుందని దాన్ని తెలుగు లిపిలోకి మార్చి ఇస్తున్నాను.- భండారు శ్రీనివాసరావు)   
ఇక చదవండి.


బస్సు నుంచి దిగి  నా జేబులో చేయి పెట్టి చూస్తే పర్సులేదు. ఎవరో కొట్టేసారు. గుండె గుభిల్లుమంది.
పర్సులో నూట యాభయ్ రూపాయలు, అమ్మకి రాసిన ఉత్తరం ఉన్నాయి. ఆ ఉత్తరం రాసిపెట్టి మూడు రోజులయింది కాని పోస్ట్ చేయడానికి మనస్సు రాలేదు. వున్న ఉద్యోగం పోయింది అని రాయాలంటే ఎలాగో అనిపించింది. నూట యాభై రూపాయలు పెద్ద మొత్తం కాకపోవచ్చు కాని ఉద్యోగం లేదుకదా. మళ్ళీ దొరికేదాకా వున్నదానితోనే నెట్టుకు రావాలి. ఉత్తరంలో అదే రాసాను. ప్రతినెలా పంపించే  అయిదు వందలు ఇకనుంచి పంపడం కుదరకపోవచ్చు అని.
కొన్ని రోజుల తరువాత అమ్మ నుంచి ఉత్తరం వచ్చింది.  అందులో ఏం రాసి వుంటుంది. డబ్బు అందలేదు త్వరగా పంపించమని రాసి ఉంటుంది.
కాని ఆ ఉత్తరం చూసిన తరువాత నోటమాట రాలేదు.
బాబూ! నువ్వు పంపిన అయిదు వందల రూపాయల మనియార్డర్ అందింది. నువ్వు ఎలా అయినా డబ్బు పంపిస్తావని తెలుసు.కానీ,  ఎవరా మనియార్డర్ పంపించింది అన్న విషయం మాత్రం  అర్ధం కావడం లేదు.
కొన్ని రోజుల తరువాత మరో ఉత్తరం వచ్చింది. రాత గజిబిజిగా వుంది.

అన్నా! నీ పర్స్ కొట్టేసిన వాడిని నేనే. మీ అమ్మకు పంపిన డబ్బులో  నూట యాభై నీది. మరో 350  నేను కలిపి మనియార్డర్ చేసాను. అమ్మ ఆకలితో పస్తు పండుకోకూడదు.  అమ్మ ఎవరికయినా అమ్మే.

NOTE: Courtesy Image Owner) 

రుచి తగ్గింది


'
"అదేవిటో! పేపర్లు తిరగేయడమే కానీ పూర్తిగా చదవాలని అనిపించడం లేదు"  
"అదేమరి! పచ్చడి తిన్న నాలుక్కి చప్పిడి మెతుకులు ఏం రుచిస్తాయి"