12, జనవరి 2014, ఆదివారం

చదివించే ‘గుణకారుడు’


 ''ప్రతి తెలుగు బాలుడూ నూరు పద్యాలు నేర్చుకోవాలి. పద్యాల్లో ఉండే నీతి, విలువలు జీవితానికి ఉపయోగపడడమే కాక, అతడికి తెలుగు భాషా ప్రాచీన ఔన్నత్యాన్ని తెలియజేసినవాళ్ళమవుతాం. జీవితాన్ని ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవడానికి ఈ తరం పిల్లలతో పద్యాలు చదివించాలి'' అంటారు దేవినేని మధుసూదనరావు.
పిల్లలకూ, వారికి మార్గదర్శనంచేసే పెద్దలకూ ఉత్తమ గ్రంథాలను పంపిణీ చేయడం ద్వారా నీతి, విలువలు, తెలుగు భాషా ఔన్నత్యాన్ని పెంపొందించేందుకు ఆయన శ్రీకారం చుట్టారు. కృష్ణాజిల్లా తెన్నేరు గ్రామానికి చెందిన దేవినేని మధుసూదనరావు మధ్యతరగతి వ్యవసాయ కుటుంబంలో జన్మించినప్పటికీ ఛార్టర్డ్‌ అక్కౌంటెన్సీ చదివారు. హైదరాబాద్‌లో 'ఎపి రేయాన్స్‌', 'విజరు ఎలక్ట్రికల్స్‌' తదితర కంపెనీల్లో పదేళ్లపాటు ఛార్టర్డ్‌ ఎక్కౌంటెంట్‌గానూ పనిచేశారు. తనకు 60 ఏళ్లు పూర్తయిన తరువాత  సతీమణితో సహా స్వగ్రామంలో శేష జీవితాన్ని గడుపుతూ.. చిన్నతనంలో తన ఉన్నతికి దోహదపడిన అంశాలను ఈ తరానికి అందించేందుకు కృషి చేస్తున్నారు. ఇందుకు ఆయన ఎంచుకున్న ఆయుధం - విలువలు పెంచే పుస్తకాలను పంపిణీ చేయడం. ఈ పనిలో ఎంతో ఆనందం పొందుతున్నారాయన.
“దురదృష్టవశాత్తూ, ఇవాళ సమాజంలో పుస్తకాలు చదివే అభిరుచి బాగా తగ్గిపోయింది. కొనుక్కుని చదవగలిగే స్థోమత ఉన్నవారు సైతం పుస్తకాలు చదవడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఎంతో కొంత మంచిని పంచే పుస్తకాలు చదివించి, వారిలో మార్పు తీసుకురావచ్చని భావించా. అందుకే పద్యాలను నేటితరం పిల్లల దగ్గరకు తీసుకు వెళుతున్నాను.
“అందుకే పుస్తకాలు కొని.. వాటిని స్నేహితులతో పంచు కుంటున్నా. నేనిచ్చిన పుస్తకాలను వారితో చదివింపజేయడం హాబీగా మార్చుకున్నా.
2010
లో మా అమ్మాయి పెళ్లి జరిగింది. ఇక్కడో కొత్త ప్రక్రియ ప్రవేశపెట్టాను. 2010లో వెలువరించిన కథల సంకలనమొకటి పెళ్లికొచ్చిన వారందరికీ పంపిణీ చేశాను. అందరూ సంతోషించారు. దీంతో నచ్చిన పుస్తకాలను కొనుగోలు చేయడం, స్నేహితులు, ఇష్టమైనవారికి ఇవ్వడం, వారితో చదివింపజేయడం చేస్తున్నాను. ఇది నాతోపాటు నా శ్రీమతికి కూడా అలవాటైంది.
2011లో విజయవాడలో నా స్నేహితుడు ఫణి ప్రసాద్‌ షష్టి పూర్తి సందర్భంగా శ్రీరమణ రచించిన 'మిథునం' పుస్తకాన్ని అచ్చు వేయించి, 1500 కాపీలను అక్కడికి వచ్చిన అతిథులందరికీ పంపిణీ చేశాను. 2012లో నా స్నేహితుడు 'శాంతా బయోటెక్‌' వరప్రసాద్‌రెడ్డి నూతన గృహప్రవేశం సందర్భంగా ఐదారు కథలతో సంకలనం వేయించి, అక్కడకొచ్చిన అతిథులందరికీ ఇచ్చాను. నా భార్య చెల్లెలి కుమార్తె పెళ్లి సందర్భంగా  కూడా పెళ్లి, పిల్లలు, జీవితానికి సంబంధించిన ఐదు కథలతో సంకలనం వేసి రెండు వేల కాపీలను పంచిపెట్టాను. దీనికి మంచి స్పందన వచ్చింది.
ఇక పిల్లలకు పద్యాలు నేర్పించాలనే ఉద్దేశంతో 2012 మార్చి నుంచి శతకాలు పంపిణీ చేయడం ప్రారంభించాను. ఈ రెండేళ్లలో దాదాపు 45 వేల పుస్తకాలు ('పద్య పారిజాతాలు, బాలగేయాలు') పంచిపెట్టాను. 2013 మార్చిలో నీతి కథలకు సంబంధించి 25 పుస్తకాలు వచ్చాయి. వీటిన్నిటినీ కలిపి 'కథా చిత్రాలు', 'బతుకు పాఠాలు' పేరుతో 2 వేల కాపీలు ముద్రించి పంపిణీ చేశాను. చిత్తూరు జిల్లాలో ఓ ఉపాధ్యాయుడు ఎనిమిది రకాలు పుస్తకాలు ముద్రించి, చిత్తూరు సబ్‌ జైలులో పంపిణీ చేశారు. ఇలాంటి మంచి ప్రయత్నాన్ని అందరూ అభినందించాలి. నాకు తెలిసినంతర వరకూ ఈ రెండు పుస్తకాలు 20 వేల వరకూ ముద్రించి, పంపిణీ చేశా.
కడపలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్న డాక్టర్వేంపల్లి గంగాధర్‌ రాసిన 'తెలుగులో తొలి శాసనం' పుస్తకం, అలాగే తెలుగు భాష ప్రాచీన ఔన్నత్యాన్ని తెలియజేసే పలు పుస్తకాలను నా తల్లిగారి పేరు మీద నెలకొల్పిన 'దేవినేని సీతారావమ్మ పౌండేషన్‌' పేరిట ప్రచురించాం.
ఇలా పిల్లల్లో విలువలు పెంచేందుకు ఎంతైనా కృషి చేయాల్సిన అవసరముంది. ఇది అందరూ గుర్తించాలి. ఇదో ఉద్యమంగా సాగాలి. తెలుగు భాష ఔన్నత్యాన్ని నిలబెట్టాలి. అదే నేను కోరుకునేది.''
(-
యు. రామకృష్ణ, 12-01-2014 - ప్రజాశక్తి  దినపత్రిక)

10, జనవరి 2014, శుక్రవారం

ఏనుగు శీర్షాసనం చూశారా!



(ఈనెల పద్నాలుగో తేదీ జంధ్యాలజయంతి)




ఆయనతో పరిచయం యెలా జరిగిందో గుర్తు రావడం లేదు. ఆయనో లాయరు. మహాకాయానికి తక్కువగా, స్తూలకాయానికి ఎక్కువగా వుండేవారు. పేరు మాత్రం కురచ. వరప్రసాద్.  వయస్సులో నాకంటే రెండు పదులు తక్కువ. బుద్ధిలో బృహస్పతి. రాజ్యాంగ శాసనాలు కొట్టిన పిండి. ప్రాచీన ధర్మ సూక్ష్మాలు, శాస్త్రీయ విషయాలు కరతలామలకం. భారత, భాగవత, రామాయణాలు ఆసాంతం  ఆపోసన పట్టిన వ్యక్తి. పద్యాలు, వేల సంఖ్యలో సంస్కృత  శ్లోకాలు కంఠతా వచ్చు. అష్టాదశ పురాణాలు తడుముకోకుండా చెప్పగల సామర్ధ్యం ఆయన సొంతం. కుతర్కంతో కాక  తర్కంతో తన వాదన నెగ్గించుకునే ఈ మహానుభావుడు సూర్యోదయానికి పూర్వమే లేచి ఎంతో నిష్టగా అనుష్టానలన్నీ పూర్తిచేసుకుని ఇంటి నుంచి బయట పడడం తరువాయి ఆయన జీవన శైలి ఈనాటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా మారిపోయేది.
ఎమర్జెన్సీ తరువాత జనతా సర్కారు ఇందిరా గాంధీపై పెట్టిన అనేక కేసులను ఆవిడ తరపున వాదించానని ఆయనే అనేకసార్లు చెప్పుకున్నారు. జ్వాలా నేనూ ఒకసారి ఢిల్లీ వెళ్ళినప్పుడు ఇందుకు దాఖలా అన్నట్టు పలువురు పెద్దలను మాకు పరిచయం చేసి, వారితో తన సాన్నిహిత్యాన్ని తెలియచెప్పారు. దేశ రాజధానిలో   అంతంత స్థాయిలో పరిచయాలు కలిగిన వ్యక్తి  హైదరాబాదులో మాత్రం లాంబెట్రా స్కూటరు మీద తిరిగే వాడు. ఆరోజుల్లో మాకు స్కూటరు సరే సైకిల్ కూడా వుండేది కాదు. కాబట్టి ఆయన్ను సందేహించే పరిస్తితి మాది కాదు. అంత పెద్ద శరీరంతో స్కూటరు మీద చిక్కడపల్లిలో మేముంటున్న ఇంటికి వస్తుంటే మా పిల్లలు వినాయకుడు ఎలక వాహనంపై వస్తున్నాడని ఆట పట్టించేవారు.
ఎక్కడ వున్నా త్రికాలసంధ్యాదులు సక్రమంగా నిర్వర్తించడం ఆయన అలవాటు. ఢిల్లీలో మేము ఆయనతో కలసి కుతుబ్ మినార్ చూసివస్తున్నప్పుడు సూర్యాస్తమయం కావొస్తుండడం గమనించి దారిపక్కన నీటి  చెలమ వున్నచోట కారు ఆపించి సంధ్యావందనం చేసివస్తుంటే టాక్సీ డ్రైవర్ కూడా ఆశ్చర్య పోయాడు.



అలా, ఆయనతో కలసి తిరుగుతూ ఓ ఫైవ్ స్టార్ హోటల్ కు వెళ్ళాము. అక్కడి బుక్ స్టాల్లో పుస్తకాలు తిరగేస్తూ మాలో మేము తెలుగులో మాట్లాడుకుంటుంటే ఒకాయన మా వైపు తెలుగు వాళ్ళా అన్నట్టు చూసారు. ఒక్క క్షణం ఆగి మీరు శ్రీనివాసరావు కదూ!అని పలకరించారు. ఆయన ఎవరో కాదు హాస్య సినీ బ్రహ్మ జంధ్యాల. బెజవాడ ఎస్సారార్ కాలేజీలో బీకాంలో క్లాసుమేటు. సినీ రంగంలో అడుగుపెట్టి బాగా పేరు తెచ్చుకుంటున్న రోజులవి. ఆయన అసలు పేరు జే.వీ.డీ.ఎస్. శాస్త్రి. ఆయన ఆ హోటల్లోనే దిగారుట. చాలా ఏళ్ళ  తరువాత కలిసిన మమ్మల్ని జంధ్యాల తమ రూముకు తీసుకు వెళ్లారు. వెళ్ళీ వెళ్ళగానే, మాతో వచ్చిన లాయరు గారు ఎలాటి మొహమాటం లేకుండా, కొత్త చోటని సందేహించకుండా ఒకసారి మీ బాత్రూం వాడుకోవచ్చాఅని అడుగుతూనే జవాబుకోసం ఎదురుచూడకుండా అందులో దూరిపోయి స్నానం చేసి బయటకు వచ్చారు. రావడం రావడమే ఆ గదిలో పరచిన తివాచీ పై తల కిందకు పెట్టి కాళ్ళు పైకి లేపి లిప్త మాత్రంలో శీర్షాసనంలో దర్శనమిచ్చారు. మా అందరికీ కళ్ళు తిరిగిపోయాయి. చిన్న తల, పెద్ద బొజ్జ, అంత భారీ కాయంతో ఆయన వేసిన ఈ ఆసనం చూసి జంధ్యాల కూడా నివ్వెర పోయారు. తరువాత వారిరువురి నడుమ సాగిన కవి పండిత చర్చ విని తీరాలి. అప్పటికే  ‘శంకరాభరణంసినిమాకి సంభాషణలు సమకూర్చిన జంధ్యాల విశ్వనాద్ గారిదే మరో సినిమా సప్తపదికి మాటలు రాస్తున్నారు. అనేకానేక అంశాలను స్పృశిస్తూ జరిగిన సంభాషణ నిజానికి ఇద్దరు పండిత శ్రేష్ఠుల మధ్య జరిగే వాదోపవాదాన్ని తలపించింది. ఏమాత్రం స్వరం పెంచకుండా, ఎదుటివారి వాదాన్ని పూర్వపక్షం చేస్తూ ఒకర్ని మించి మరొకరు అక్షర లక్షలు చేసే తర్కవిన్యాసాలు ప్రదర్శించారు. ధర్మాధర్మ విచక్షణకు సంబంధించిన వీటిలో కొన్నింటిని సప్తపదిసినిమాలో జంధ్యాల పొందుపరచినట్టున్నారు కూడా.
ఈ చర్చ సాగిన తీరు గమనిస్తే నాకు కాలేజీలో తెలిసిన శాస్త్రి, ఈ జంధ్యాల ఒకరేనా అన్న సందేహం కలిగింది. అంతటి పరిణతి ఆయనలో కనబడింది. ఆ రోజుల్లో జంధ్యాల ఒక్కడే మొత్తం కాలేజీలో కారున్న కుర్రకారు’. ప్రిన్సిపాల్ కూడా కాలేజీకి రిక్షాలో వస్తుంటే, జంధ్యాల మాత్రం సొంత కారులో వచ్చేవారు. సంధ్యారాగంలో శంఖారావంవంటి నాటకాలు రాస్తూ,వేస్తూ సరదాగా వుండేవారు. అలాటి జంధ్యాలలోని మరో కోణాన్ని ఢిల్లీలో చూడగలిగాను. అలాగే మా వెంట వచ్చిన లాయరు గారు. ఆయనకున్న విషయ పరిజ్ఞానాన్ని కళ్ళారా చూసి, చెవులారా విన్న తరువాత ఆయనపై వున్న దురభిప్రాయం దూదిపింజెలా ఎగిరిపోయింది. వినదగునెవ్వరు చెప్పినసూక్తిలోని  వాస్తవం మరోమారు  బోధపడింది.
మనం చెప్పిందే ఇతరులు వినాలన్న ఆత్రంలో యెంత నష్టపోతామో అర్ధం అయింది. సజ్జన సాంగత్యంలో వొనగూడే లాభం ఎరుకలోకి వచ్చింది.
ఇప్పుడు వారిద్దరూ లేరు. వారి జ్ఞాపకాలే మిగిలాయి. 
(అక్టోబరు 10,2010)      
NOTE: Courtesy Image Owner

9, జనవరి 2014, గురువారం

చీమ చెప్పే భగవద్గీత



ఒకానొక మానవాధముడికి జీవితం భారమై, సమస్యలు సమాహారమై, మనశ్శాంతి దూరమై దేవుడిని గూర్చి ఘోర తపస్సు మొదలు పెట్టాడు. చివరాఖరుకు ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనవాడు కళ్ళు తెరిచి తనను ఎదుర్కుంటున్న కష్టనష్టాల జాబితా ఏకరువుపెట్టి విజయసాధనకు మార్గం చూపెట్టమని మోకరిల్లాడు. దేవుడు విలాసంగా ఓ చిరునవ్వు విసిరి దీనికోసం నన్ను పనికట్టుకుని పిలవాలా! అటు చూడు! అదిగో. అటుగావెడుతున్న ఆ అల్పజీవిని చూడు. దాన్ని చూసి నేర్చుకో అనేసి చక్కాపోయాడు. ఇతగాడటు చూస్తే నెమ్మదిగా కదిలి వెడుతున్న ఒక చిన్న చీమ కనిపించింది.

అంత పెద్ద దేవుడు ఇంత చిన్న చీమ నుంచి జీవితం గురించిన పాఠాలు నేర్చుకోమని అంటున్నాడు ఇతడేమి దేవుడు అని అనుకోకండి.

దారీ తెన్నూ తెలియని స్తితిలో వున్న మనుషులకు ఒక మంచి మార్గాన్ని చూపించి వారిని కార్యోన్ముఖుల్ని చేయడంలో మోటివేషన్ గురుఅని విశ్వవ్యాప్తంగా పేరు తెచ్చుకున్న 'జిన్  రాన్' కూడా  చీమల నుంచే తన విజయ సూత్రాలకుస్పూర్తిని పొంది ఏకంగా ఒక పుస్తకమే రాసాడు. దాని పేరు యాం ట్స్' ఫిలాసఫిఅంటే చీమలు బోధించే తత్వశాస్త్రంఅని దగ్గరి అర్ధం.

చీమల జీవన సరళిని బాగా అధ్యయనం చేసిన జిన్ రాన్ మహాశయులవారు  జీవితంలో విజయాలు సాధించడానికి  కొన్ని  సూత్రాలను వాటినుంచి నేర్చుకోవాల్సి వుంటుందని సెలవిచ్చారు.



ఈ సారి సమయం దొరికినప్పుడు మీ చేతివేలును చీమ వెళ్ళే దారిలో అడ్డంగా వుంచి గమనించండి. ఆ చీమ మీ వేలును దాటివెళ్ళడానికయినా ప్రయత్నిస్తుంది లేదా మీ వేలి చుట్టూ తిరిగి వెళ్ళడానికయినా చూస్తుంది. అంతేకాని అక్కడే ఆగిపోయి బిత్తర చూపులు చూడదు. ఎందుకంటె మడమ తిప్పడం వెన్ను చూపడం దాని ఇంటా వంటా లేదు. ఓటమిని అంగీకరించడం దాని రక్తంలో లేదు.(చీమ వొంట్లో రక్తం వుంటుందా? వుంటే అది ఏ గ్రూపు అని చర్చిస్తూ కాలక్షేపం చేయడం మనుషులకే చెల్లు) అంటే ఏమిటన్న మాట. జీవితం అన్నాక మనం చేసే పనులకు అవరోధాలు ఎదురవడం సహజం. అడ్డంకులను అడ్డం పెట్టుకుని కాడి కింద పారేసి సారో సాంగులు సోలో సాంగులుమొదలు పెట్టకూడదు. ఎన్ని సవాళ్లు ఎదురయితే మనం మనస్సును అంత దృఢపరచుకుని ముందుకు సాగాలి. అప్పుడే విజయాలు వచ్చి వొళ్ళో వాలతాయి. లేదంటే చక్కా ఎగిరిపోతాయి. రెండో ప్రపంచ యుద్ధకాలంలో విన్ స్టన్ చర్చిల్ ఏమన్నాడు. సాధించేదాకా సాధన మానకండి. ప్రయత్నం వొదిలిపెట్టకండిఅని తన సైన్యాలను ఉత్తేజపరిచాడు. బహుశా చీమలనుంచే ఆయన ఈ స్పూర్తిని గ్రహించి వుంటాడు.
(09-01-2014)
NOTE: Courtesy Image Owner

8, జనవరి 2014, బుధవారం

ఏం చేస్తే తెలంగాణా వస్తుంది?



చదివి చెప్పండి అప్పటికీ ఇప్పటికీ తేడా ఏమన్నా వుందా!
( 24-09-2011 తేదీ సూర్య దినపత్రిక ఎడిట్ పేజీలో ప్రచురితం)

‘విధులకు గైర్హాజరు అవుతే తెలంగాణా వస్తుందా?’ అని హైకోర్ట్ ప్రధాన న్యాయమూర్తి కోర్టు సిబ్బందిని ప్రశ్నించినట్టు పేపర్లలో వచ్చింది.

సకల జనుల సమ్మె జరుగుతున్నా రాష్ట్రంలో పాలన సజావుగా సాగుతోందని ఏఐసీసీ అధికార ప్రతినిధి రేణుకా చౌదరి మరో పక్క కితాబు ఇచ్చారు. ఇంకో అడుగు ముందుకు వేసి, వొత్తిళ్ళ ద్వారా కేసీఆర్ తాననుకున్నది సాధించాలనుకుంటే అదెలా కుదురుతుందని ఆమె ప్రశ్నించారు. పరిస్థితులు ప్రశాంతంగా వుండి తమకు అనుకూలంగా వున్నప్పుడే నిర్ణయాలు తీసుకుంటామని అన్నట్టు కూడా పత్రికల్లో వచ్చింది. 

రాష్ట్రంలో తెలంగాణా సాధనకోసం దాదాపు వారం రోజులనుంచి దశలవారీగా సకల జనుల సమ్మె సాగుతున్న నేపధ్యంలో వెలువడిన ఈ రకమయిన వ్యాఖ్యానాలకు ఎవరికి వారు తమదయిన రీతిలో భాష్యాలు చెబుతున్నారు. రేణుకా చౌదరి ఈ వ్యాఖ్యలు పార్టీ ప్రతినిధిగా కాకుండా వ్యక్తిగత హోదాలో చేశామని మరో రోజు సమర్ధించుకోవచ్చు. ఆ సంస్కృతి ఈ నాటి రాజకీయ నాయకులకు కొత్తేమీ కాదు. కానీ, సకలజనుల సమ్మె ఓ పక్క ఉధృతంగా సాగుతున్న సమయంలో, భావోద్వేగాలు బాగా పెచ్చరిల్లి వున్న తరుణంలో - ఈ రకమయిన వ్యాఖ్యలు వెలువడ్డాయంటే కొద్దో గొప్పో అధిష్టానం మద్దతు లేకుండా ఆమె తన మనసులోని భావాలు బయట పెట్టి వుంటారని అనుకోవడానికి లేదు.

సకల జనుల సమ్మె అనుకోకుండా మొదలయింది కాదు. దీనిని గురించి కడు వివరంగా ఉద్యమకారులు చాలా ముందస్తు సమాచారం ఇచ్చే దాన్ని మొదలు పెట్టారు. అయితే, ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు తమ రివాజు ప్రకారం దీన్ని సీరియస్ గా తీసుకున్నట్టులేదు. కానీ రాష్ట్రంలోని తెలంగాణా కాంగ్రెస్ నాయకులకు ఇది మింగుడుపడని వ్యవహారంగా తయారయింది. ప్రత్యేక తెలంగాణా రాష్ట్రం ఏర్పాటు విషయంలో పార్టీ కేంద్ర నాయకత్వం ఇతమిద్ధంగా తన విధానాన్ని స్పష్టం చేయకపోయినా, అంత సానుకూలంగా వెంటనే స్పందించే అవకాశాలు మృగ్యమని అప్పడప్పుడు ఢిల్లీ నుంచి వెలువడే ఈ మాదిరి ప్రకటనలు సంకేతాలు ఇస్తున్నాయి. ప్రత్యేక తెలంగాణా విషయంలో కాంగ్రెస్ అధినాయకత్వం ఆలోచన ఏ తీరున వుందో టీఆర్ఎస్ నాయకులకు పూర్తిగా తెలియకపోయినా అది ఏ తీరున సాగుతున్నదో ఒక అవగాహనకు వచ్చినట్టు మధ్య మధ్య వారి నాయకులు చేసే ప్రకటనలను బట్టి అర్ధం చేసుకోవచ్చు. సకల జనుల సమ్మె విజయవంతంగా, ఉధృతంగా సాగుతోందని బాజా భజాయించి చెప్పగల పరిస్థితులు వున్న నేపధ్యంలో మరోసారి కేసీఆర్ నిరాహారదీక్షకు పూనుకునే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు వార్తలు వెలువడడం ఈ వాదనకు బలం చేకూరుస్తున్నాయి.

కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ గులాం నబీ ఆజాద్ ఈ నెలాఖరులో హైదరాబాద్ వస్తున్నారు. ఆయన వచ్చి ఇక్కడి పరిస్తితులను అంచనావేసి పార్టీ అధినాయకురాలికి ఇచ్చే నివేదికే ఈ మొత్తం వ్యవహారంలో కీలకం కావచ్చని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. విచిత్రం ఏమిటంటే రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాలు ఆజాద్ కు కొట్టిన పిండి. ఆయన హైదరాబాద్ పర్యటనలో కొత్తగా తెలుసుకుని నాయకురాలికి నివేదించే అంశాలు కొత్తగా ఏముంటాయన్న ప్రశ్నకు సమాధానం లేదు. సీమాంధ్ర నాయకులతో ఆయన ఇప్పటికే అనేకమార్లు సమావేశాలు జరిపారు. వారి అభిప్రాయాలు విన్నారు. తెలంగాణాకు సంబంధించి శ్రీ కృష్ణ కమిటీ నివేదికే సిద్ధంగా వుంది. రాష్ట్ర గవర్నర్ కూడా తన నివేదికలు ఎప్పటికప్పుడు పంపుతూనే వుండి వుంటారు. రాష్ట్రంలో పరిస్తితులను గురించి తాజా నివేదికలను కేంద్రానికి పంపుతుండడం గవర్నర్ల బాధ్యత కూడా. ఇన్ని వివరాలు సిద్ధంగా వున్నప్పుడు నిర్ణయం తీసుకోవడంలో జాగు చేస్తున్నారంటే ఢిల్లీ వారికి కావాల్సింది ఈ సంఖ్యలు, అంకెలు కాదని అర్ధమైపోతున్నది. వారికి కావాల్సింది మరో రెండేళ్ళ తరువాత జరిగే సార్వత్రిక ఎన్నికల్లో మరోసారి కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడానికి అవసరమయిన పార్లమెంటు సభ్యులను రాష్ట్రం నుంచి తగు మోతాదులో గెలిపించుకోవడానికి ఏమి చేస్తే సాధ్యపడుతుంది అన్నది మాత్రమే. తెలంగాణా ఇవ్వడం ద్వారా అది వీలుపడుతుందని తెలిసిన మరుక్షణం ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ పచ్చ జండా వూపుతుంది. ఇందులో సందేహం లేదు. మరో సంగతి. తెలంగాణా ఏర్పాటు ద్వారా వొనగూడే రాజకీయ లబ్ది పూర్తిగా తన ఖాతాలోకే రావాలని కూడా కాంగ్రెస్ కోరుకుంటే తప్పు పట్టాల్సింది ఏమీ వుండదు. ఏ రాజకీయ పార్టీ అయినా ఈ దృక్కోణం నుంచే పావులు కదుపుతుంది. తెలంగాణా విషయంలో ఇంత తాత్సారానికి బహుశా ఇదే కారణం అయివుంటుంది. తీసుకోవాల్సింది రాజకీయ నిర్ణయం అయినప్పుడు ఉద్యమాల ద్వారా లక్ష్య సాధనకు పోరాడుతున్న పార్టీలను లెక్క చేయాల్సిన అవసరం ఏమిటన్నది వారి వ్యూహ కర్తల ఆలోచన కావచ్చు.

‘ఇలా’ చేయడంవల్ల తెలంగాణా వస్తుందా? అని ఎద్దేవాగా అడగడంలో బహుశా అంతరార్ధం ఇదేనేమో.

వెనకటికి ఇంట్లో అమ్ముమ్మలు పిల్లలకు చెప్పే కధల్లో ఓ ముసలమ్మ బావి గట్టుమీద కూర్చుని సూదిలో దారం ఎక్కిస్తుంటే సూది బావిలో పడిపోతుంది. ‘ఊ’ కొడుతూ కధ వింటున్న పిల్లలు ‘ఊ’ అంటారు. ‘ఊ’ అంటే వస్తుందా అని కధ చెప్పే అమ్ముమ్మ ప్రశ్న. అది అర్ధం కాని పిల్లలు ‘ఆ!’ అంటారు. ‘ఆ!’ అంటే వస్తుందా అని మరో ప్రశ్న. ఆ కధ ఎప్పటికీ పూర్తవదు, ఈ లోగా కధ వినే పిల్లలు ఎంచక్కా నిద్రలోకి జారుకుంటారు. (20-09-2011)

జీవితం నేర్పే పాఠాలు


ఆసక్తి వుండాలే కాని జీవితం నుంచి ప్రతిరోజూ ఓ కొత్త పాఠం నేర్చుకోవచ్చు. వయస్సు దీనికి ఎంతమాత్రం అడ్డంకి కాదు.
ఆకాశవాణి, దూరదర్శన్ లలో పనిచేసేరోజుల్లో ప్రైవేటు టీవీ చానళ్ళ చర్చాకార్యక్రమాల్లో పాల్గొనడానికి అవకాశాలు వచ్చినా ఆసక్తి చూపలేదు. పదవీ విరమణ చేసిన అనంతరం మాత్రం గత కొద్దేళ్లుగా అనేక చానళ్ళు నిర్వహించే చర్చల్లో పాల్గొంటూ వస్తున్నాను. వీటికోసం కొన్నిరోజులు తెల్లవారుఝామునే లేచి తయారు కావాల్సివస్తోంది. నేనయితే మా ఆవిడ పొద్దున్నే లేచి ఇచ్చే కాఫీ తాగి వెడుతున్నాకాని, నన్ను స్టూడియోలకు తీసుకు వెళ్లడానికి వచ్చే ఛానల్ కారు డ్రైవర్ల సంగతి ఏమిటని ఆలోచించి అలా పొద్దున్నే వచ్చే డ్రైవర్లకు కొంత టిప్పుఇవ్వడం అలవాటు చేసుకున్నాను. ఈ డ్రైవర్లలో రకరకాల వయస్సులవాళ్ళు వుంటారు.  పొరుగుజిల్లాలనుంచి హైదరాబాదు వచ్చి స్నేహితుల గదుల్లో తాత్కాలిక ఆవాసం ఏర్పరచుకుని బతుకు బండి లాగించే వాళ్ళే వీళ్ళల్లో ఎక్కువ. వాళ్లకు టిప్పు ఇవ్వడం మెహర్బానీ గా నేను ఏనాడు అనుకోలేదు. వాళ్లు కూడా అపార్ధం చేసుకోలేదు. కొందరు యెందుకు సార్ మా డ్యూటీ మేం చేస్తున్నాంఅంటూనే మృదువుగా అనేవారు.
నిన్ననో మొన్ననో అనుకుంటా టీవీ స్టూడియో నుంచి తిరిగొస్తూ ఓ కూడలివద్ద సిగ్నల్ పడ్డప్పుడు నేను పర్సు తీసి డ్రైవర్ కు ఓ పది  నోటు తీసి ఇచ్చాను. అతగాడు  ఆ నోటు తీసుకుని జేబులో పెట్టుకోకుండా అదే చేత్తో స్టీరింగు పట్టుకుని  నడుపుతూ ఒక చోట కారు వేగం తగ్గించి రోడ్డుపక్కన ఒక ముసలి బిచ్చగత్తె చేతిలో ఆ నోటు పెట్టాడు. అతని ప్రవర్తన చిత్రంగా అనిపించి నోరు తెరిచేలోగా అతడు మాఫ్ కీజియే సాబ్అంటూ తన మనసులో మాట చెప్పాడు.
ఈ డ్రైవర్ ఉద్యోగం కోసం సిటీకి వస్తున్నప్పుడు మా అమ్మ ఓ మాట చెప్పింది. అవసరం అయితేనే ఎవరినుంచయినా డబ్బు తీసుకో. నీ దగ్గర డబ్బు వుంటే నీకంటే అవసరం ఎక్కువ వున్నవాళ్ళకు దాన్నివ్వు. తీసుకోవడం తేలిగ్గా అలవాటు అవుతుంది. ఇవ్వడం అనేదే కొద్దిగా కష్టం.  అమ్మ మాట ప్రకారం మీరిచ్చిన డబ్బు ఆమెకు ఇచ్చాను. మీరు వేరే విధంగా అనుకోకండిఅన్నాడు.

అనుకోవడానికి ఏముంది.  ఓ కొత్త పాఠం నేర్చుకునే అవకాశం జీవితం నాకిచ్చిందనుకున్నాను.             

"ఇ" లో "ఇంత" విషయం వుందా!


(ఇది మెయిల్ చేసిన పెద్ద మనిషికి ధన్యవాదాలు)


6, జనవరి 2014, సోమవారం

మౌనమె నాభాష

   
“I get intoxication while talking” అన్నాట్ట వెనుకటికి నాలాటి వాడు. మద్యం సేవించినప్పటికంటే కంటే కూడా మాట్లాడుతుంటే నాకు బాగా ‘కిక్కు’ వస్తుందన్నది మా ఆవిడ వువాచ. ‘అది’ కూడా తోడయితే పట్టేవాళ్ళు వుండరన్నది ఆవిడ వ్యక్తిగత అభిప్రాయం.   అదేవిటో నా వదరుబోతుతనం ఇటీవలి కాలంలో బాగా తగ్గిపోయిందన్నది అచ్చంగా  నా సొంత అభిప్రాయం. మాట్లాడడానికి తగ్గ వాతావరణం వుండాలని అప్పుడే మాట బాగా పెగులుతుందని ‘వసకారుడు’ ఏనాడో చెప్పాడు.


చదువుకునే రోజులనుంచి నాకీ మాటల పిచ్చి వుందనీ అందుకే చదువు చెట్టెక్కిందనీ మా పెద్దవాళ్ళు అంటుండగా అనేకసార్లు వినే అదృష్టం నాకు కలిగింది. అయినా వేరే ఆటలకన్నా నాకు ‘మాటల ఆటలు’ అంటే వున్న వ్యామోహం ఏమాత్రం తగ్గలేదు. బహుశా రేడియోలో ఉద్యోగం ఇవ్వడానికి నాకు వున్న అనర్హతలను ఈ అదనపు అర్హత కప్పిపెట్టిందేమో అని అనుకునేవాళ్ళు కూడా లేకపోలేదు. ఎస్సారార్ కాలేజీలో నాకంటే వయస్సులోనూ, చదువులోనూ పెద్దవాళ్లయిన ఇద్దరు అక్కాచెల్లెళ్లు వుండేవాళ్ళు. కాస్త వీలు దొరికితే చాలు వెళ్ళి వాళ్ళతో ముచ్చట్లు మొదలు పెట్టేవాడిని. శ్రద్ధ, సుధ అనే పేర్లు కలిగిన వాళ్ళిద్దరూ వాళ్ల నోట్సులు రాసిపెట్టేవరకు నా మాటలు విని ఆ తరువాత ఎంచక్కా ‘మంచిది వెళ్ళి రండి’ అనేసేవాళ్ళు. అలా అని మాటల వల్ల అసలు ఏమాత్రం ఉపయోగం లేదనే  గొప్ప  అభిప్రాయానికి వెంటనే  రానక్కర లేదు. వెనుకటికి నేను రైళ్ళలో రిజర్వేషన్ లేకుండానే ఈ మాటల మంత్రంతో తేలిగ్గా ప్రయాణాలు చేసేవాడిని. నిలుచుని కాసేపు కూర్చున్న వాళ్ళతో మాటలు కలిపేవాడిని. ఆ తరువాత వాళ్లు మాటల మైకంలో పడిపోయి  ‘అదేమిటి మాస్టారు అలా నిలబడేవున్నారు వచ్చి ఇలా కూర్చోండి’ అని జాగా ఇచ్చేవాళ్ళు. కొండొకచో మరికొందరు శ్రోతలు మరీ మొహమాట పడిపోయి నా మాటలు వింటూ వాళ్లు లేచి నిలబడి నాకు కూర్చునే జాగా ఇచ్చేవాళ్ళు. రేడియో ఉద్యోగంలో చెప్పక్కర లేదు. ఆఫీసుకి  పోవడమే గగనం కాని వెళ్ళానంటే చాలు న్యూస్ యూనిట్ చిన్న సభా ప్రాంగణంగా మారిపోయేది.  
అలాటి ఘన చరిత్ర కలిగిన  నేను ఈ నడుమ యెందుకు మాటలాటలు  తగ్గించానని మా ఆవిడ సయితం అనుమానిస్తోంది. ‘వున్నట్టుండి ఈ వయస్సులో అంటే అరవై  ఎనిమిది దాటిన  తరువాత మా  ఆయనకు కాసింత పెద్దమనిషితనం కానీ  రాలేదు కదా’ అని బోలెడు బోలెడు సంతోషం కూడా  పడిపోతోందష. తెలుగు  సీరియళ్ల ప్రోత్సాహాక ఉద్యమంలో మునిగిపోయి టీవీల్లో రాజకీయ చర్చలు పట్టించుకోకపోవడంవల్ల ఆవిడకు ఈ జ్ఞానోదయం ఆలశ్యం అయిందని నా అనుమానం.
నిజమే. టీవీ చర్చావేదికల్లో ఒకరిని మించి మరొకరు  దూషణలతో కూడిన తిరస్కారాలవల్ల కలిగిన మాత్సర్యసహిత ప్రేలాపనలతో నాకు మాట పడిపోతోందన్న మాట మాత్రం నిజమే. 
అంతయు మన మేలునకే.  (06-01-2014)
NOTE: Courtesy Image Owner