24, మార్చి 2014, సోమవారం

ముఖ్యమంత్రిగా జలగం వెంగళరావు గారి వ్యవహారశైలి

నేను 1975 లో పుట్టి 1985 లో చనిపోయాను. 
అంటే ప్రభలు విరజిమ్మిన విలేకరిగా నా జీవితం అంతలో ముగిసిందన్నది నా కవి హృదయం. విలేకరిగా ఒక వెలుగు వెలిగింది నిజానికి ఆ పదేళ్లే..
రేడియోలో చేరింది ఎమర్జెన్సీ రోజుల్లో. జనం నమ్మినా నమ్మకున్నా, ఆదరించినా ఏవగించుకున్నా వార్తలకోసం రేడియో వినక తప్పని పరిస్తితి. పత్రికలపై సెన్సార్ షిప్ వుండేది. ప్రతి రోజూ వార్తల కంపోజింగ్, పేజీ మేకింగ్ పూర్తయిన తరవాత సమాచారశాఖ అధికారికి చూపించి ఏవార్త వుంచాలో, దేనిని తీసివేయాలో అనుమతి తీసుకోవాల్సిన పరిస్తితి. సెన్సార్ అయిన వార్తల స్తానంలో అప్పటికప్పుడు కొత్తవార్తలను పెట్టే వీలుండదు కాబట్టి ఆ ఖాళీని అలాగే వుంచేసి పత్రికలను ప్రింట్ చేసేవారు. సెన్సార్ పట్ల పత్రికల అసమ్మతిని పాఠకులకు పరోక్షంగా తెలియపరచడానికి కొంతవరకు  'ఆ ఖాళీ పేజీలుఉపయోగపడ్డాయి. ప్రభుత్వం కావాలని కొన్ని వార్తలు ప్రచురణ కాకుండా అడ్డుకుంటోదన్న అభిప్రాయం ఆ ఖాళీలను చూసినప్పుడు ప్రజలకు సహజంగా కలిగేది. రాజకీయంగా ప్రభుత్వాన్ని వ్యతిరేకించే కొన్ని పత్రికలు కావాలని కొన్ని పేజీలను ఖాళీగా వుంచేసి ప్రజల్లో దురభిప్రాయం పెంపొందింప చేస్తున్నాయన్న అనుమానం రాగానే, అలా ఖాళీలతో పత్రికలు ప్రచురించరాదని సర్కార్ హుకుం జారీ చేసింది. ఈ నేపధ్యంలో నాకు హైదరాబాదు ఆకాశవాణిలో విలేకరిగా ఉద్యోగం వచ్చింది. 1975 నవంబర్ 14 తేదీన అందులో చేరాను.


(జలగం ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఒక సభలో మాట్లాడుతున్న వై ఎస్ ఆర్)  
అప్పుడు ముఖ్యమంత్రి జలగం వెంగళరావు గారు. సమర్దుడయిన పాలకుడిగా పేరు. ఎమర్జెన్సీ ఆయనకు కలసివచ్చింది. రాజకీయంగా ఎదురు లేకపోవడం, లేనిపోని విమర్శలకు ఆస్కారం వుండకపోవడం, ప్రభుత్వ అధికారులు, సిబ్బందీ భయభక్తులతో నడుములు వంచి బుద్ధిగా పనిచేయడం - ఇవన్నీ ముఖ్యమంత్రిగా ఆయనకు కలసివచ్చిన అంశాలు.
వెంగళరావు గారు ఖమ్మంజిల్లా పరిషత్ అద్యక్షుడిగా వున్నప్పటినుంచే అధికారులతో మంచిగా వుంటూ పనులను త్వరత్వరగా పూర్తి చేయించడం నాకు తెలుసు. ముఖ్యమంత్రి అయిన తరవాత ఆయన ఇదే విధానాన్ని కొనసాగించారు. త్వరితగతిన పూర్తయ్యే చిన్న, మధ్య తరహా సేద్యపు నీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇచ్చేవారు. శంకుస్థాపన చేసిన చేతులతోనే ఆయన ఆయా ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు చేయడం కళ్ళారా చూసాను. గ్రామాల్లో చెరువులకు మరమ్మతులు సకాలంలో చేయిస్తే రైతులకు అవసరమయిన తరుణంలో సాగు నీటి కొరత లేకుండా చేయవచ్చని ఆయన చెబుతుండేవారు. చెప్పిందే చేసి చూపెడుతూవుండేవారు. ఆయన కేంద్రమంత్రిగా, పీసీసీ ప్రెసిడెంటుగావున్నప్పుడు ఖమ్మం జిల్లాలో ఓసారి జరిపిన పర్యటనలో నన్ను ఆయన తన కారులోనే వెంటబెట్టుకుని తీసుకు వెళ్లారు. నా మేనల్లుడు కౌటూరి దుర్గాప్రసాద్ ఆ రోజుల్లో ఖమ్మం టౌన్ కాంగ్రెస్ ప్రెసిడెంట్. ఖమ్మం జిల్లాలో జరిగిన అన్ని అభివృద్ధి పనుల్లో ప్రతి ఇటుక మీదా తన పేరే రాసివుంటుందని వెంగళరావు గారు సగర్వంగా చెప్పుకోవడం నాకు ఇప్పటికీ గుర్తు.
వెంగళరావుగారి వ్యవహార శైలి చాలా విలక్షణంగా వుండేది. సమయపాలనకు ఆయన పెట్టింది పేరు. పంజాగుట్ట - ద్వారకాపురి కాలనీలోని ఇంటినుంచి ఆయన సచివాలయానికి బయలుదేరారంటే చాలు - గడియారాల్లో టైం సరిచేసుకోవచ్చని చెప్పుకునేవారు. అంత ఖచ్చితంగా రోజూ ఒకే సమయానికి బయలుదేరడం, తిరిగి ఇంటికి చేరడం వెంగళరావు గారికే చెల్లింది. తదనంతర కాలంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు సమయపాలన పాటిస్తామని ప్రకటనలు చేయడమే కానీ కానీ నిలబెట్టుకున్నవాళ్ళు లేరు. మాజీ ముఖ్యమంత్రిగా కూడా ఆయన ఈ నియమాన్ని ఎన్నడూ వొదులుకోలేదు. హైదరాబాద్ పొలిమేరల్లోవున్న ఫాం హౌస్ కు వెళ్లడం, తిరిగి రావడం అంతా కూడా అయిదు నిమిషాలు అటూ ఇటూ తేడా లేకుండా ప్రతి రోజూ ఒక నియమిత సమయంలో జరిగేలా ఆయన ఎంతో శ్రద్ధ తీసుకునేవారు. వెంగళరావుగారు చనిపోయినప్పుడు ఆయన దహన సంస్కారాలు ఆ తోటలోనే జరిపారు.
రేడియో విలేకరిగా వెంగళరావుగారి పద్దతులు నాకు బాగా నచ్చాయి. ఎందుకంటె, ఆయన విలేకరుల సమావేశాలను చాలా క్లుప్తంగా ముగించేవారు. రేడియో వార్తలకు తప్ప ఆ రోజుల్లో మరెవరికీ టైం కు సంబంధించిన డెడ్ లైన్లువుండేవి కావు. చెప్పాల్సింది చెప్పేసి, లేచి నిలబడి - మంచిది వెళ్ళిరండిఅనేవారు. విలేకరులతో మాట్లాడే ఆ కొద్దిసమయంలో కూడా రొటీన్ ఫైల్స్ పై సంతకాలు పెడుతూనే వుండేవారు. అలాగని ఆయనకు విలేకరులతో సత్సంబంధాలు లేవని కాదు. జ్యోతి వెంకట్రావు గారు, హిందూ రాజేంద్రప్రసాద్ గారు వంటి వారితో తానే స్వయంగా ఫోనుచేసి మాట్లాడడంనాకు తెలుసు.
వెంగళరావు గారితో నాకో చిన్న పర్సనల్ టచ్ వుంది.
బెజవాడ నుంచి హైదరాబాద్ వచ్చానన్న మాటే కానీ ఇక్కడి ఇళ్ళ అద్దెలు నన్ను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో ఎవరో చెబితే రెంట్ కంట్రోల్ ఆక్ట్ కింద ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకుని ఆ కాపీ ముఖ్యమంత్రికి ఇచ్చాను. గంటలో రెవిన్యూ అధికారులనుండి కబురు, వెంటనే దోమలగుడా వెళ్లి పలానా ఇంటిని స్వాధీనం చేసుకోమని. నేనూ మా ఆవిడా సంబరపడుతూ దోమలగూడాలో వున్న ఆ ఇంటికి ఎగురుకుంటూ వెళ్ళాము.. అప్పుడు మేము అద్దెకు వుంటున్న ఇంటితో పోలిస్తే అది చాలా పెద్ద ఇల్లు. కిరాయి మాత్రం అందులో నాలుగోవంతు కూడా లేదు. ఆహా ఏమి అదృష్టంఅనుకునే లోపల భోరున ఏడుపులు వినవచ్చాయి. ఇంటివాళ్ళట. ఆ ఒక్క ఇల్లూ రెంటు కంట్రోలు కిందకు పోతే వాళ్ల పని అంతే అట. మాకు ఏం చెయ్యాలో అర్ధం కాలేదు. ఇటు చూస్తె అధికారులు తొందరపెడుతున్నారు. అటు చూస్తె వాళ్ల ఏడుపులు గాభరా పెడుతున్నాయి. చివరికి ఆ ఇల్లు మాకు అక్కరలేదని అధికారులతో చెప్పాము. ముఖ్యమంత్రి పేషీ తో వ్యవహారం కుదరదంటే కుదరదన్నారు.  చివరికి ఆ ఇల్లు మాకు నచ్చలేదని నాచేత కాగితం రాయించుకుని వెళ్ళిపోయారు.

గవర్నమెంట్ కేటాయించిన ఇంట్లోనే వుంటున్నానని బహుశా వెంగళరావుగారు అనుకుండేవారేమో! ఎప్పుడయినా కనబడ్డప్పుడు ఇల్లు వసతిగా వుంది కదా!అనేవారు. నేను అవుననీ కానీ, కాదనీ కానీ అనకుండా తలపంకించి వూరుకుండేవాడిని. (09-09-2010)

22, మార్చి 2014, శనివారం

ఆకాశమే హద్దురా!

 
"ప్రియమైన వోటరు దేవుళ్ళలారా! ఈరోజు నుంచి లెక్కపెట్టుకోండి. (గుర్తుపెట్టుకోకండి). ఇవాల్టి నుంచి ఎన్నికల ప్రచార గడువు ముగిసే వరకు రోజుకో కొత్త వాగ్దానం చేస్తానని మీకు వాగ్దానం చేస్తున్నాను"




NOTE: COURTESY CARTOONIST
 

జగన్ - బాబు

ఇది నా అభిప్రాయం కాదు ఓ అంచనా మాత్రమే.
దీనితో ఏకీభవించనక్కర లేదు. విభేదించనక్కరలేదు.
అయినా ఎవరిష్టం వారిది.

చంద్రబాబు నాయుడికి 'విశ్వసనీయత' యెంత సమస్యో, అదే ఆయనకు ఒక రకంగా శ్రీరామరక్ష. చంద్రబాబు విషయంలో సోషల్ మీడియాలో  ఏమాత్రం అనుకూలంగా ఎవరు రాసినా హర్షించేవారు, ప్రతికూలంగా ఏమి రాసినా ఆహ్వానించేవారు దాదాపు సరిసమానంగా కనిపిస్తున్నారు. కొంతమందిలో ఆయనపట్ల అపనమ్మకం ఎంతగా పేరుకుపోయిందో, మరికొందరికి చంద్రబాబు శక్తి సామర్ధ్యాల పట్ల అంతకుమించిన నమ్మకం అంతే గట్టిగా వుంది. ఇక ఈ మీడియా  అందుబాటులో లేని జనాలను దృష్టిలో పెట్టుకుంటే సీమాంధ్రలో తెలుగు దేశంతో పోటీపడుతున్న జగన్ పార్టీ గురించి వీటి ఆధారంగా  ఓ అంచనాకు రావడం సహేతుకంగా వుండదు కాని మొత్తం మీద అక్కడ 'జగన్ లేదా  నో జగన్' అనే నినాదమే వినబడుతోంది. బాబు విషయంలో, జగన్ విషయంలో కూడా 'ఈ రెండు విభాగాల మధ్య వ్యత్యాసమే' వారి తల రాతలను మారుస్తుంది. కొత్త పార్టీలు, కొత్తగా పుట్టుకొచ్చే పార్టీలు, సరికొత్త పాత పార్టీలు ఈ సమీకరణాల మార్పులో కొంత పాత్ర పోషిస్తాయి.

21, మార్చి 2014, శుక్రవారం

"నో వర్రీ మేడం! మోడీ వచ్చే చాన్స్ లేదు"


(గుంటూరి నాగేశ్వరరావు గారు షేర్ చేసిన ఇంగ్లీష్ జోక్కి అనువాదం, వారికి కృతజ్ఞతలతో)
పాడు ప్రపంచాన్ని చూసి చూసి దేవుడికి వొళ్ళు మండిపోయింది. దీన్ని దేవుడు కూడా మార్చలేడు  అవటా అనుకుని ఏమైనా సరే ఈ  ప్రపంచానికి  భరత వాక్యం పలకాలని నిర్ణయించేశాడు. అయితే ఈ నిర్ణయాన్ని అమలుచేసేముందు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలా ఓ సమావేశం ఏర్పాటుచేసి తాను ముఖ్యులు అనుకున్న ఓ ముగ్గురు దేశాధినేతలను దానికి రమ్మని ఆహ్వానించాడు. పిలుపుల మేరకు అమెరికా అధ్యక్షుడు ఒబామా, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్, భారత ప్రధాని మన్మోహన్ సింగ్ వెళ్లారు. దేవుడు ఆట్టే సమయం వృధా చేయకుండా ప్రపంచాన్ని అంతం చేయబోతున్నట్టు ప్రకటించి 'పోయి మీ వాళ్లకు చెప్పుకోండ'ని ఆదేశించాడు.
ఒబామా వెంటనే టీవీల ద్వారా ప్రత్యక్ష ప్రసారం ఏర్పాటుచేసి తన దేశప్రజలతో చెప్పాడు.
'మీ అందరికీ ఓ శుభ వార్త. ఓ చెడు వార్త. మంచి వార్త ఏమిటంటే మనం అందరం విశ్వసిస్తున్న దేవుడు నిజంగానే వున్నాడు. దుర్వార్త  ఏమిటంటే ప్రపంచాన్ని అంతం చేయబోతున్నట్టు ఆయనే నాతొ స్వయంగా చెప్పాడు'
చైనా అధ్యక్షుడు తన దేశపౌరులను ఉద్దేశించి మాట్లాడాడు.
'ప్రియమైన కామ్రేడ్స్! ఒక దుర్వార్త ఏమిటంటే మనం దేవుడు లేడని ఇన్నాళ్ళు చెబుతూ వచ్చాం. అది నిజం కాదు. ఆయన్ని ఇప్పుడే కలుసుకున్నాను. దానికంటే మించిన చెడు వార్త ఒకటి వుంది. ఈ యావత్ ప్రపంచాన్ని కమ్యూనిస్ట్ ప్రపంచంగా మార్చాలనే మన ఆశయం నెరవేరేటట్టులేదు. ఎందుకంటే ఆ పాడు దేవుడు దీన్ని అంతం చేయాలని ఓ నియంతలా  ఆకస్మిక నిర్ణయం తీసుకున్నాడు"
మన్ మోహన్ సింగ్ దేశ ప్రజల జోలికి పోలేదు. ముందు మేడం సోనియాకు ఫోను చేసాడు.
'మేడం. ఓ శుభవార్త. దానికితోడు దాన్ని మించిన మరో మంచి వార్త. ఇన్నాళ్ళు నేనొక పనికి రానివాడినని పేపర్లలో కార్టూన్లు వేస్తుంటే నిజమే కాబోసు అని బాధపడేవాడిని. కాని మేడం ! ఆ దేవుడు నా ప్రతిభని గుర్తించాడు. అమెరికా, చైనా అధ్యక్షులతో పాటు నన్ను కూడా ఆహ్వానించాడు' అన్నాడు గడ్డం మాటున  ముసి ముసి నవ్వులు దాచుకుంటూ.
'మీ  సంగతి సరే! ఇంతకీ  ఆ మంచి వార్త ఏమిటో చెప్పండి'
'అదా మేడం. దేవుడు ఈ లోకానికి తక్షణం చరమగీతం పాడాలని నిర్ణయించేసాడు. మోడీ ప్రధాని అయిపోతాడేమోనన్న  భయం అక్కరలేదు మేడం'

కలత పెట్టే జ్ఞాపకం


అంజయ్య గారి లాగే చనువుగా మసలిన ముఖ్యమంత్రులు మరో ఇద్దరు వున్నారు. ఒకరు చంద్ర బాబు, మరొకరు రాజశేఖరరెడ్డి. వీరిద్దరూ అంజయ్య గారి మంత్రివర్గంలో సభ్యులు. ముందు వై ఎస్ ఆర్ చేరారు. ఆతరువాత విస్తరణలో చంద్రబాబుకు చోటు దొరికింది. వీరిద్దరూ మంచి మిత్రులు. దానికి నేనే సాక్ష్యం. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత  రాజకీయంగా వీరి దారులు వేరయ్యాయి. బాబు ముఖ్యమంత్రి అయిన తరువాత అఘాధం మరింత పెరిగింది. ఆ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా చోటుచేకున్న వాదప్రతివాదాలు గమనించినప్పుడు - ఈ దూరం కేవలం రాజకీయం వల్లకాదు, వ్యక్తిగతం అనికూడా అనిపించింది. ఒకప్పుడు వీరిద్దరి నడుమ వున్న స్నేహాన్ని దగ్గరగా చూసిన వాడిగా 'ఆదూరం' నన్ను ఎంతో బాధ పెట్టింది. అయినా ఇద్దరితో నా పరిచయం అలాగే కొనసాగింది. ఒకరి సంగతులు మరొకరికి మోయడం అనే సద్గుణం లేకపోవడం వల్ల అని అనుకుంటున్నాను. ఒకసారి స్కూటరు నుంచి పడి కాలు విరిగి ఆసుపత్రిలో పడి వుంటే ఉధృతమైన ఎన్నికల ప్రచారంలో తలమునకలై వుండి కూడా వీరు తమ స్నేహ వాత్సల్యాన్ని నాపై ప్రదర్శించారు. ముఖ్యమంత్రిగా వుంటూ ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చి పరామర్శించాల్సిన అవసరం చంద్రబాబుకు వుందనుకోను. అలాగే ప్రతిపక్ష నేత వై ఎస్ ఆర్.


వెళ్ళి పిలవకపోయినా మా పిల్లవాడి పెళ్ళికి ఎస్ ఎం ఎస్ పిలుపుతో హాజరయిన గొప్పతనం వారిది. వారి దారులు వేరయి, వైరి పక్షాలుగా మారడం నన్ను ఎప్పుడూ కలత పెట్టే విషయం. వీరిలో ఒకరు లేకుండా పోయారు. మరొకరిని కలుసుకునే వీలు లేదు.



విలేకరులు ఏమీ సంపాదించుకోకపోయినా ఇలాటి అనుభవాలు వారికే సొంతం.               

20, మార్చి 2014, గురువారం

సోల్డ్ అవుట్


ఇంట్లో వొంట్లో బాగా బలిసిన ఓ అరబ్  షేక్ గారు విమానంలో ఎయిర్ హోస్టెస్  చూసి మనసు పారేసుకున్నారు. వెంటనే క్యాబిన్ లో కెప్టెన్ ని కలిసి ఆ ఆమ్మడ్ని కొనుక్కుంటాను ధర ఎంతో చెప్పమన్నాడు.
అక్కడినుంచి వారిద్దరి మధ్య సంభాషణ ఇలా నడిచింది.
"కుదరదు. ఎయిర్ హోస్టెస్ మా విమాన సిబ్బందిలో ఒకరు. అలా కొనేసుకుంటాను అంటే అసలు కుదరదు."
"ఐయితే విమానమే  కొంటాను దాని ధర  ఎంతో చెప్పండి"
"ఈ విమానం ఎయిర్ ఇండియాది.'
"అలా అయితే ఎయిర్ ఇండియాని కొంటాను."
"మీరిలా ఎయిర్ ఇండియాలు, ఇండియన్ ఎయిర్ లైన్స్ లూ కొంటానంటే మా దేశంలో వీలుండదు. అవి భారత ప్రభుత్వానివి."
"అలానా. అయితే ఆ ప్రభుత్వం ఎంతకు అమ్ముడవుతుందో చెప్పు. ఇప్పుడే చెక్కు రాసిస్తాను"
"మీరు చాలా ఆలస్యం చేశారు. మా ప్రభుత్వం అంబానీలకు అమ్ముడుపోయి చాలా కాలం అయ్యింది."
(నెట్లో సంచారం చేసే ఇంగ్లీష్ జోక్కి స్వేచ్చానువాదం)

సంస్కారం


సంస్కారం అనేది జన్మతః రావాలని అంటారు. కానీ, చూసి నేర్చుకోవడం, నేర్పించడం ద్వారా కూడా సంస్కారం అలవడుతుంది అనడానికి అనేక దృష్టాంతాలు వున్నాయి.
సంస్కారం మన పొరుగున వున్న కన్నడిగుల్లో ఎక్కువేమో అనే అభిప్రాయం కూడా వుంది. కన్నడ సాహిత్యానికి చక్కటి గుర్తింపు తెచ్చిన యు.ఆర్. అనంతమూర్తి ఏకంగా 'సంస్కార' పేరుతొ ఒక నవల రాశారు కూడా.
సంస్కారం గురించిన ముచ్చట పాత్రికేయ మిత్రుడు సత్యమూర్తి దగ్గర వచ్చింది.
వాళ్ళబ్బాయి కన్నడ దేశంలోని ఒకానొక వైద్య కళాశాలలో చదువు పూర్తిచేసుకుని డాక్టర్ పట్టా పుచ్చుకున్నాడు. ఓ జర్నలిస్టు కొడుకు చదువులో ఇలా ఎదిగిరావడమే  అదృష్టం అనుకుంటే సత్యమూర్తి డబల్ ధమాకా కొట్టాడు. వాళ్ల అమ్మాయి కూడా రేపోమాపో డాక్టర్ కాబోతోంది.
అది సరే. సంస్కారం గురించికదా చెప్పుకుంటున్నాం.


(పుత్రోత్సాహము)

కాన్వొకేషన్ కు రమ్మని ఆ వైద్య కళాశాల నుంచి సత్యమూర్తి దంపతులకు ఆహ్వానం అందింది. భార్యను, డాక్టర్ తనయుడినీ, కాబోయే దాక్టరమ్మను  అందర్నీ వెంటబెట్టుకుని 'చిత్ర  దుర్గం' కాబోలు వెళ్లారు. అక్కడి ఏర్పాట్లు వారికి దిగ్భ్రాంతిని కలిగించాయి. పట్టా పుచ్చుకునే పట్టభద్రుల తలిదండ్రులందరికీ ముందు వరసల్లో వాళ్ల పేర్లు రాసి  మరీ సీట్లు రిజర్వ్ చేశారు. పట్టా ప్రదానం సమయంలో పలానా వారి తలితండ్రులని అందరికీ పరిచయం చేశారు. పట్టాలపై కూడా 'పలానా వారి అబ్బాయి' అని తండ్రి పేరుతో బాటు తల్లిపేరు కూడా ముద్రించారు. 'ఈ తలిదండ్రుల కడుపున  పుట్టడం వల్లనే మీరు ఇలా సమాజంలో నలుగురికీ సేవ చేసే భాగ్యం పొందగలిగార'ని పిల్లలకు  చెప్పారు. తలిదండ్రుల గొప్పతనం గురించి తెలియచేసే రెండు షార్ట్ ఫిలిమ్స్ ప్రదర్శించారు.ఇక సంస్కారం అలవాడక ఏం చేస్తుంది చెప్పండి.అందుకే చెప్పింది. సంస్కారం జన్మతః అబ్బుతుంది. అలాగే నేర్పడం ద్వారా అలవడుతుంది.
ఆవిధంగా సత్యమూర్తి దంపతులది 'ట్రిపిల్ ధమాకా!'

19, మార్చి 2014, బుధవారం

ఇప్పుడు - అప్పుడు


చూశారా! ఇటీవల రాష్ట్రపతి హైదరాబాదు వచ్చినప్పుడు స్థానిక జర్నలిస్టులను బొలారం లోని రాష్ట్రపతి నిలయంలో కలిశారు. జర్నలిస్టులకు వారికీ మధ్యవున్న 'వేరు బంధం' గమనించారా?



గతంలో నేను రేడియోలో పనిచేస్తున్నప్పుడు నాటి రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ అదే భవనంలో విలేకరులను కలుసుకున్నారు. మేమందరం హాయిగా ఆయనతో కరచాలనం చేయగలిగాము.



అప్పటికీ ఇప్పటికీ ఇదీ తేడా!

చంద్రబాబు నాయుడు గారు నవ్వుతారా?


ఇదేమీ టీవీల్లో ఎస్ఎంఎస్ ప్రశ్న కాదు. అందుకు సందేహం అక్కరలేదు. ఆయన నవ్వుతారు. కాకపొతే నవ్వించాలి.
ఆయన ముఖ్యమంత్రిగా వున్న తొమ్మిదేళ్ళ పైచిలుకు కాలంలో 'నేను నిద్రపోను, మిమ్మల్ని నిద్రపోనివ్వన'ని ఉద్యోగులని వెంటబడి తరుముతూ పనిచేయిస్తున్న కాలంలో, నవ్వుతూ వుంటే ఆ మాటలకు సీరియస్ నెస్ రాదని మానేసారేమో కాని ఆయనా నవ్వుతారు. దీనికి ప్రత్యక్ష సాక్షిని నేనే!


(చంద్రబాబునాయుడు ఆర్ధికమంత్రిగా వున్నప్పుడు మా వూరునుంచి మా అన్నయ్య కీర్తిశేషులు భండారు వేంకటేశ్వర రావు వచ్చి బాబుగారిని చూడాలంటే సచివాలయానికి తీసుకువెళ్ళాను. ఆ సమయంలో అక్కడ వున్న విలేకరులతో కలిపి తీసిన  ఫోటో. ఇందులో నేను లేకపోవడానికి కారణం ఫోటో తీసింది నేను కావడమే) 

చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తొలిరోజుల్లో జూబిలీ హాలులో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. పనిలో పనిగా 'డిన్నర్ ఫాలోస్' అని దానికో టాగ్ లైన్. ఆరోజు ప్రాంతీయ వార్తలు సమాప్తం అనగానే నడుచుకుంటూ రేడియో స్టేషన్ కు ఎదురుగా వున్న జూబిలీ  హాలుకు బయలుదేరాను. పబ్లిక్ గార్డెన్ గేటు దగ్గర  పోలీసుల హడావిడి కనిపించింది. లోపలకు వెడితే సీఎం పేషీ అధికారులు కొందరు కనిపించారు. విలేకరుల సంఖ్య చాలా పలుచగా వుంది. నేనంటే ఎదురుగా వున్నాకనుక వెంటనే వచ్చాను మిగిలిన వాళ్లు నెమ్మదిగా వస్తారులే అనుకున్నా. ఈలోపల సీపీఆర్వో విజయ్ కుమార్ వచ్చాడు. విలేకరుల  సంఖ్య చూసి ఆయనా నిరుత్సాహపడ్డట్టున్నాడు. కొందరికి ఫోన్లు చేసి గుర్తుచేసే పనిలో పడ్డాడు. ఈలోగా సచివాలయం నుంచి ఫోన్లు, సీఎం బయలుదేరి రావచ్చా అని. మొత్తం మీద కొంత కోరం పూర్తయింది. చంద్రబాబు వచ్చేశారు. విలేకరులు పలుచగా వుండడం ఆయన కూడా గమనించారు.
'దీనికి మూడు కారణాలు వున్నాయి' అన్నాను ఆయన పక్కనే కూర్చుని.
అవేమిటో చెప్పమని అడిగారు.
'నెంబర్ వన్. ఈరోజు వాతావరణం చల్లగా వుంది. చినుకులు పడతాయా అన్నట్టుగా వుంది'
'అయితే...'
'నెంబర్ టూ. ఈరోజు టీవీలో ఇండియా పాకిస్తాన్, డే అండ్ నైట్  వన్ డే మ్యాచ్ వస్తోంది'
'వూ..'
'లాస్ట్ వన్. ఇది జూబిలీ హాలు. ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన డిన్నర్. ఇక్కడేమి  వుంటుంది. మా ఆఫీసు దగ్గర్లో లేకపోతే నేను కూడా డుమ్మా కొట్టేవాడినే'
ఆయనకు అర్ధం అయింది. అర్ధం కాగానే హాయిగా నవ్వేసి నా భుజం తట్టారు.

చదువుకున్న వోటర్లకు ఓ విజ్ఞప్తి


సగటు భారతీయ వోటరు అంటే నాకు తగని గౌరవం. దీనికి కారణం వుంది.
అనేక దశాబ్దాల నుంచి ఎన్నికలు చూస్తూ వస్తున్నాను. కాడిజోడెడ్లు (కాంగ్రెస్) కంకీ కొడవలి (కమ్యూనిస్ట్) ప్రమిదె (జనసంఘం) ఇలా పోలింగు కేంద్రంలో గుర్తులు అతికించిన బ్యాలెట్ డబ్బాలు (నిజంగానే డబ్బాలు, ఖాళీ కిరసనాయిలు డబ్బాలు అనుకుంటాను) పెట్టేవాళ్ళు. ఏపార్టీకి వచ్చిన వోట్లు విడిగా లెక్కబెట్టి ఫలితాలు ప్రకటించేవాళ్ళు. తరువాత కాలంలో కాంగ్రెస్ గుర్తు ఆవూ దూడా, ఆ పిదప హస్తం ఇలా మారిపోయింది. కమ్యూనిస్ట్ పార్టీలు రెండుగా విడిపోయాయి. జనసంఘం భారతీయ జనతా పార్తీగా పేరుతో బాటు, గుర్తును కమలంగా మార్చుకుంది. అభ్యర్ధుల పేర్లు లేకుండా గుర్తులతో బ్యాలెట్ పేపర్లు వచ్చాయి. ఎలక్ట్రానిక్ వోటింగి యంత్రాలు రంగ ప్రవేశం చేసాయి. చదువుకున్న పోలింగు సిబ్బంది కొంత గందరగోళపడ్డారు కాని నిరక్షరాస్యుడయిన సగటు వోటరు మార్పుకు తేలిగ్గా అలవాటుపడ్డాడు. మనతోబాటే స్వతంత్రం తెచ్చుకున్న ఇరుగుపొరుగు దేశాలు ఎప్పుడో ఒకప్పుడు సైనిక పాలనలోకి జారిపోయాయి కాని మనదగ్గర మాత్రం ప్రభుత్వాలు కేవలం వోటుతోనే మారుతూ వచ్చాయి.


(దయచేసి ఇలా సగటు వోటర్ని అవమానించవద్దు. ఈ వొట్టినీతులు కట్టిపెట్టి,  చేతనయితే పోలింగు రోజు టీవీలకు, కంప్యూటర్లకు అతుక్కుపోకుండా వెళ్ళి వోటు వేసి అందరికీ ఆదర్శంగా నిలవండి.)

అలాటి చరిత్ర కలిగిన సగటు వోటర్ని డబ్బుకు మద్యానికి అమ్ముడుపోవద్దని నీతులు చెబుతున్నప్పుడు చాలా బాధ వేస్తుంది. నిజానికి వాళ్ళే ప్రతిఎన్నికలో చురుగ్గా పాల్గొని వోటు హక్కు వినియోగించుకునే వాళ్లు. ఎండయినా వానయినా పోలింగు కేంద్రాల వద్ద క్యూలల్లో వేచి  నిలబడి వోటు వేసేవాళ్ళు. చదువుకున్నవాళ్ళలో ఇలాటి చొరవ కనబడదు. పైపెచ్చు వాళ్లు డబ్బుకు గడ్డి తిని వోటేస్తున్నారని ఎద్దేవా చేస్తుంటారు. ఇది వాళ్లని అవమానించడమే. నిజానికి అధికారానికి భయపడి  వోటేస్తే ఎమర్జెన్సీ తరువాత ఇందిరాగాంధి వోడిపోయేదా ? డబ్బుకు కక్కుర్తి పడి  వోటేస్తే   డబ్బున్నఖామందులందరూ గెలుస్తూ వుండేవారు కదా!
రాజకీయ పార్టీలు డబ్బున్నవాళ్లకు టిక్కెట్లు ఇస్తే వాళ్లు ప్రచారానికి ఇబ్బడిముబ్బడిగా ఖర్చు చేస్తారు. నామినేషన్ వేయడానికి వాళ్లు చేసే హడావిడి చూసి ఎవ్వరు మాట్లాడరు. ప్రత్యేక విమానాల్లో, హెలికాఫ్టర్లలో నాయకులు తిరుగుతుంటే ఆ డబ్బెక్కడిది అని అడిగేవాళ్ళు వుండరు. వోటరు దగ్గరకు వచ్చేసరికి అందరూ నీతులు చెప్పేవాళ్ళే!
ఎన్నికల్లో అభ్యర్ధులు ముట్టచెప్పే డబ్బు తీసుకుంటున్నారేమో కాని ఖచ్చితంగా వోటు మాత్రం వాళ్లు అమ్ముకోవడం లేదు. ఇది నిష్టూరంగా ధ్వనించే సత్యం. 

18, మార్చి 2014, మంగళవారం

సంజాయిషీ కాదు వివరణ మాత్రమే.


తిరుపతి అనుభవాలను గురించి కరకుగా రాయడాన్ని కొందరు తప్పుపట్టారు. సరయిన ఏర్పాట్లు జరక్కపోవడం వల్ల అలా రాశానన్నది వారి అభిప్రాయంగా తోచింది. అందుకే ఈ నాలుగు విషయాలు.
ముందే రాశాను తిరుపతి పోయింది తక్కువసార్లే కాని పెట్టిపుట్టుకున్న వాళ్ల తరహాలో తేలిగ్గా దర్శనాలు చేసుకున్న సందర్భాలే  ఎక్కువని.  ఎన్నికల కోడ్ కారణంగా కొన్ని మార్పులు వచ్చాయి. అందుకే ఎవరినీ ఏమీ అడగకుండా మామూలుగా వెళ్ళి రావడం జరిగింది. ప్రస్తుతం ఈవో గా వున్న శ్రీ ఎమ్జీ గోపాల్, ఖమ్మం  కాలేజీలో మా హిందీ లెక్చరర్ శర్మ గారి కుమారుడు.  అప్పటినుంచి తెలుసు. కెరియర్ రీత్యా సీనియర్ కాని వయసు రీత్యా జూనియర్. అందరికీ సాయపడాలనే తత్వం వున్నమనిషి.  'సమర్ధులైన అధికారులే ఈవోలు గా పనిచేశారు, చేస్తున్నారు' అని కూడా రాయడం ఇందుకోసమే. అలాగే పాలకమండలి చైర్మన్ శ్రీ కనుమూరి బాపిరాజు. హైదరాబాదులో మా బోటి వారందరికీ చిరపరిచితులు. ఆయన చైర్మన్ అయిన కొత్తలో తిరుపతి వెడితే దూరం నుంచే గమనించి 'ఏం సీనూ బాగున్నావా' అని కావలించుకున్నారంటే  ఆయనతో వున్న సాన్నిహిత్యాన్ని అర్ధం చేసుకోవచ్చు. మనిషి భోలా శంకరుడు. ఆయన భార్య ఆయన కంటే నాలుగాకులు ఆధ్యాత్మికపరురాలు. ఆ భార్యా భర్తలు ఇద్దరూ, వారి ఇంటికి వెళ్ళినప్పుడు వద్దని వారించినా  మా ఆలుమగలకు  కాళ్ళకు దణ్ణాలు పెట్టేవాళ్ళు. ఆవిడ నిమ్స్, కేన్సర్ ఆసుపత్రులకు వారం వారం వెళ్ళి పళ్ళూ వగైరా పంచిపెడుతూ వుండడం మాకు తెలుసు. వాళ్లింట్లో హోమాలు అవీ జరిగితే మేము వెళ్ళి వస్తుండేవాళ్ళం. ఇన్ని పరిచయాలు వున్నప్పటికీ మామూలుగా వెళ్ళి ఒకసారి దర్శనం చేసుకుని రావాలన్న అభిలాష ఇంతపని చేయించింది. అప్పుడు కళ్ళ బడ్డ సంగతులే పూసగుచ్చి రాశాను.
జర్నలిష్టులకు వర్తించే సామెత ఒకటుంది.
'ఎక్కడయినా బావ కాని వంగతోట దగ్గర కాదు'

కడుపు నిండిన కబుర్లు


"ఏమిటి మీ విషయం. పెట్టి పుట్టినట్టున్నారు. అందుకే తీరిగ్గా కూర్చుని ఇలా ఎడాపెడా రాసేస్తున్నారు' అని అడిగారొక ఫేస్ లెస్ బుక్ మిత్రుడొకరు.
పెట్టి పుట్టిన బాపతు కాకపోయినా పుట్టి పెట్టిన సంగతి కొంత నిజమే. 'ఇన్నేళ్ళు ఉద్యోగాలు చేసి ఒక్క ఇల్లు కూడా ఏర్పరచుకోలేదా' అని ఎద్దేవా చేస్తుంటాడు నా పత్రికా మిత్రుడు నందిరాజు రాధాకృష్ణ  కూడా, అక్కడికి  తానో (సొంత) ఇంటివాడయినట్టు.
కొందరు ఆస్తుల్ని కూడబెట్టుకుంటారు. అదేమిటో చిత్రం నేను ఆస్తుల్ని కన్నాను, ఇద్దరు కొడుకుల రూపంలో. చిన్నతనంలో వాళ్లకు ఏం చేసామో యేమో గుర్తు లేదు (అసలు ఏమన్నా చేస్తే కదా గుర్తు వుండడానికని మా ఆవిడ సన్నాయి నొక్కులు). కానీ, ఇప్పుడు మా పెద్దతనంలో మాత్రం కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇక ఇళ్ళూ వాకిళ్ళూ లేవని బెంగ యెందుకు?
అందుకే ఇలా తిని కూర్చుని తీరిగ్గా 'కడుపు నిండిన కబుర్లు' చెప్పడం.

అర్ధం అయిందా ఫేస్ లెస్ (నేమ్ లెస్) బుక్ స్నేహితుడు గారూ!.     

అయోమయం పార్టీలు


గెలుపు తధ్యం అంటారు. ఎదుటి పార్టీలు తుడిచిపెట్టుకుపోతాయంటారు. ప్రజలు తమకు పట్టం కట్టడానికే సిద్ధమైపోయారని చెబుతారు. రాబోయే రాజ్యం తమదే అని కాబోయే సీఎం  తామే అని బల్లగుద్ది చెబుతుంటారు. అన్ని పెద్దపార్టీలదీ దాదాపు ఇదే వరస. మరి అంత భరోసా వుంటే పక్క గూటి పక్షులు వచ్చి చేరుతుంటే అంత సంతోషపడడాలు, కండువాలు కప్పి ఫోటోలు తీయించుకోవడాలు, పత్రికల్లో వేయించుకోవడాలు   ఎందుకో అర్ధం కాదు. ఎన్నికల ముహూర్తం దగ్గర పడే సమయంలో కంచె దూకుతున్న జంపు జిలానీలు పార్టీలకి బలుపా వాపా. ఏవిటో అంత వరదలో కొట్టుకుపోతున్నట్టుగా వుంది. నిలబడి ఆలోచించే తీరిక వోపిక ఎవరికీ వున్నట్టు లేవు.       

17, మార్చి 2014, సోమవారం

బతికి పోయాం

వార్త : "........పద్నాలుగు రోజుల రిమాండ్ "
వ్యాఖ్య : "రాష్ట్రపతి పాలన పుణ్యం. లేకపోతే వాళ్లు ఈపాటికి మన పక్కవీధి బారులో చిందులేస్తూ వుండేవారు."

పాతికేళ్ళనాటి మాస్కో - 23


మాస్కోలో మెక్ డొనాల్డ్ 

1990 వ సంవత్సరం ప్రారంభంలో కాబోలు మాస్కోలో మొట్టమొదటి మెక్ డొనాల్డ్ రెస్టారెంట్ మొదలయింది. అప్పుడు చూడాలి తమాషా. మాస్కో నగరంలో వున్న పిల్లలు,  యువతీ యువకులు అందరికీ అదొక అడ్డాగా మారిపోయింది.  అంటే హైదరాబాదులో ఒకప్పుడు ఇరానీ కఫేలు చాలామందికి రోజూ పరస్పరం కలుసుకునే ప్రదేశాలుగావుండేవి. అక్కడ కూర్చుని సమోసాలు, టై బిస్కెట్లు  తింటూ వేడి వేడి చాయ్ తాగుతూ, దక్కన్ క్రానికల్ పేపర్లో స్పోర్ట్స్ న్యూస్ చదువుతూ కుర్రకారు భలేగా  కాలక్షేపం చేసేవారు.  అయితే మాస్కో మెక్ డొనాల్డ్ విషయంలో కాసింత తేడా వుంది. అక్కడ కూర్చుని కబుర్లు చెప్పుకునే సావకాశం వుండేది కాదు. ఎప్పుడు చూసినా కిలోమీటర్ల పొడుగునా క్యూలు దర్శనమిచ్చేవి. మా పిల్లలు అక్కడికి వెళ్లి పిజ్జా తిని కోక్ తాగిరావాలంటే ఒక పూటకు పైనే  పట్టేది.
 ఆ రెస్టారెంట్ కు కొద్ది దూరంలోనే  లెనిన్ సమాధి వున్న రాతి పలకలు పరచిన  మైదానం వుండేది. ఈ మెక్ డొనాల్డ్ వచ్చిన తరువాత అక్కడ క్యూలు పలచబడ్డవని హాస్యోక్తిగా చెప్పుకునే వారు.
ఇనుప తెర దేశంగా పేరు పొందిన సోవియట్ రష్యా లో గోర్భచెవ్ సంస్కరణల పుణ్యమా అని తలుపులు బార్లా తెరవడంతో మెక్ డొనాల్డ్ వంటి పాశ్చాత్య రెస్టారెంట్లకు అక్కడ కాలుమోపే అవకాశం దొరికింది.
మాస్కో మెట్రో సింబల్  ఇంగ్లీష్ అక్షరం ‘M’ని పోలివుంటుంది. సరిగ్గా దానిలాగే వుండే మెక్ డొనాల్డ్ సింబల్ కూడా మాస్కో యువతరాన్ని అమితంగా ఆకర్షించింది.
మెక్ డొనాల్డ్ రెస్టారెంట్లలో బాగా అమ్ముడుపోయే బిగ్ మాక్ మాస్కో రెస్టారెంట్ లో బల్షోయీ మాక్ అనేవారు. రష్యన్లో బల్షోయీ అంటే పెద్ద అని అర్ధం. అప్పట్లో బిగ్ మాక్ ధర  రెండు రష్యన్ రూబుళ్లు. అంటే అమెరికా కరెన్సీలో చెప్పాలంటే మూడు  డాలర్ల ముప్పయ్ ఎనిమిది సెంట్లు. సగటు రష్యన్ పౌరుడి నెల జీతంలో వందో వంతు. కాకపొతే ఇవన్నీ గతకాలపు ముచ్చట్లు సుమా!
మాస్కో పౌరులను మంత్ర ముగ్ధులను చేసిన ఈ మెక్ డొనాల్డ్ కధాకమామిషూ ఏమిటంటే-
1940 మే 15 వ తేదీన మొట్టమొదటి మెక్డొనాల్డ్ రెస్టారెంట్ ను- డిక్, మాక్ మెక్డొనాల్డ్ అనే సోదరులు కలసి కాలిఫోర్నియాలోని సాన్  బెర్నార్డినో అనే చోట ఏర్పాటుచేశారు. అలా మొదలయిన ఈ ఫాస్ట్ ఫుడ్ చైన్ రెస్టారెంట్లు కాలక్రమంలో 122  దేశాలకు ఎగబాకి మొత్తం ముప్పై వేల పైచిలుకు రెస్టారెంట్లతో యావత్ ప్రపంచ ప్రజానీకాన్ని తమదయిన  రుచులతో అలరించే  స్తాయికి చేరుకున్నాయి.
ఇక అమెరికాలో మెక్ డొనాల్డ్ ప్రభ యెలా వెలుగుతున్నదో తెలుసుకోవాలంటే కొన్ని గణాంకాలు అవసరం. 1970 లో మెక్డొనాల్డ్ అమ్మకాలు మొత్తం అమెరికాలో ఆరు బిలియన్ డాలర్లు వుండగా 2001 నాటికి అవి 110 బిలియన్ డాలర్లకు పెరిగాయి. అంటే ఆ దేశంలో ఉన్నత విద్య పైనా, కంప్యూటర్లు, మోటారు కార్లు, సినిమాలు, మాగజైన్లు, పుస్తకాలు, వీడియోలు వీటన్నిటి పైనా కలిపి ఆ దేశస్తులు ఖర్చు పెట్టే మొత్తం కంటే ఇది చాలా చాలా  ఎక్కువ.

 (20-03-2012)

16, మార్చి 2014, ఆదివారం

జనమే దేవుడికి సమస్య


దేవుడు లేడని ఆయన్ని నమ్మనివాళ్ళంటారు.
వున్నాడని నమ్మేవాళ్ళంటారు.
దేవుడు పేరు చెప్పి సొమ్ములు పోగేసుకుంటున్నారని నాస్తికులు ఆరోపిస్తుంటే, దేవుడు లేడని చెబుతూ డబ్బులు దండుకుంటున్నారని వారి ప్రత్యర్ధులు అంటుంటారు.
దేవుడ్ని నమ్మినా నమ్మకపోయినా నమ్మినట్టు నటించడం వల్ల కొన్ని ప్రయోజనాలు వున్నట్టే, దేవుడ్ని నమ్ముతున్నా నమ్మనట్టు బూకరించడం వల్ల కూడా కొన్ని లాభాలు వున్నాయి. ఈ రెండు తరగతులవారు నిత్యం అందరికీ తారసపడుతూనే వుంటారు కాబట్టి వీరు కనబడడం కోసం ప్రత్యేకంగా తపస్సులు చేయనక్కరలేదు. ఏదో ఒక అంశంపై టీవీ తెరలపై అనునిత్యం దర్శనం ఇస్తూనే వుంటారు.
వీరుకాక మరో రెండు తరగతులవారు వున్నారు. దేవుడే సాక్షాత్తు దిగివచ్చినా దేవుడ్ని నమ్మని వారు ఒక బాపతు. కానీ ఆ విషయం పైకి టముకు వేసుకోరు. మనసా వాచా కర్మణా పూర్తిగా నమ్మేవారు రెండో రకం. వీరు కూడా భగవంతుడిని బజారుకు లాగరు. గుండెల్లోనే గుడికట్టుకుని వుంచుకుంటారు. కానీ, నమ్మకం లేని ఆ భగవంతుడూ నమ్మని వీళ్ళను కనుక్కోడు. నమ్మిన ఆ దేవుడూ నమ్మేవాళ్లను పట్టించుకోడు. హీనపక్షం టీవీ ఛానళ్ళ కూడా వారికి కూడా వీరి అయిపూ ఆజా పట్టదు. ఎందుకంటె వారి రేటింగులకు కావాల్సినట్టు దేవుడు గురించి ఎద్దేవాగా మాట్లాడడం, దేవుడికోసం పోట్లాడడం వీరికి, వారికి బొత్తిగా తెలియదు కాబట్టి.
దేవుడున్నాడో లేదో తెలియదు కానీ దేవుడున్నాడా లేడా అన్న ప్రశ్న మాత్రం అనాదినుంచి వుంటున్నదే. ఆస్తికులు, నాస్తికుల మధ్య దేవుడిని గురించిన చర్చ కూడా అనాదినుంచి సాగుతున్నదే. ఈ ఎడతెగని చర్చకు దేవుడి మాదిరిగానే అంతం అంటూ లేదు.
తొక్కితే రాయి  మొక్కితే సాయి. అంతా నమ్మకం.
దేవుడ్ని నమ్మడం ఎంత నమ్మకమో నమ్మకపోవడం కూడా అంతే నమ్మకమని నా నమ్మకం.

దేవుడు పేరు చెప్పి మోసం చేయడం ఎంత ద్రోహమో దేవుడు లేడంటూ పనికిమాలిన చర్చలు లేవదీయడం కూడా అంతే దారుణం. ఎందుకంటె దేవుడనే వాడు నా దృష్టిలో వ్యక్తిగతం. నాకంటే గొప్పవాడు, శక్తిమంతుడు మరొకడు వున్నాడని ఒప్పుకోవడానికి నామోషీ పడనక్కరలేదు. ఇతరులలోని గొప్పదనం గుర్తించేవారు వారు నాస్తికులయినా సరే భగవంతుడనే సర్వ శక్తిమంతుడు మరొకడు వుండేవుంటాడని అనుకుంటే పేచీ లేదు. అలాగే దేవుళ్ళని నమ్మేవాళ్ళు కూడా. భగవంతుడు వున్నాడని పూర్తిగా విశ్వసించే గజేంద్రుడే మొసలినోట చిక్కి విలవిలలాడుతున్నప్పుడు కలడు కలండనెడివాడు కలడో లేడో?’ అని అనుమానపడతాడు. పరీక్ష పెట్టికానీ మార్కులు వేసే అలవాటులేని ఆ దేవదేవుడు పందొమ్మిదో రీలు తరువాత కానీ ఏనుగు రక్షణకు రాడు.
దేవుళ్ళను చూస్తే జాలి వేస్తుంది. వాళ్లు చెప్పిన మాట వాళ్ల భక్తులు కూడా వినరు. బుద్దుడు విగ్రహారాధన వద్దంటే శిష్యులు మాట వింటేనా. బహుశా అంతంత పెద్ద విగ్రహాలు ప్రపంచంలో మరే దేవుడుకి లేవేమో. (బుద్దుడు దేవుడా అంటే అది మరో చర్చ)
నేను సర్వవ్యాపితుడిని. ఎందెందు వెదకి చూసిన అందందే వుంటానని ఎంత మొత్తుకున్నా వినేదెవరు?
చెట్టులో,పుట్టలో అంతటా నేనే అన్నా విన్నదెవరు? చిన్నదో పెద్దదో ఓ గుడికట్టి అక్కడే కట్టిపడేశారు.
ఇక ఇప్పుడో! పూజ రూమ్ వుందా?’ అన్నది ఫ్లాట్ కొనేముందు అడిగే మొదటి ప్రశ్న.

పూర్వం పిల్లలకు తల వెంట్రుకలు తీయించడానికి ఏడాదికో, రెండేళ్లకో తిరుపతి వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు పరీక్షలకు ముందు, తరువాత, రిజల్ట్స్ రాకముందు వచ్చిన తరువాత - అన్ని కుటుంబాల వాళ్లు పోలో మంటూ తిరుపతి యాత్రలే. మరి రద్దీ పెరిగిందంటే పెరగదా!
దేవుడ్ని నమ్మేవాళ్ళు ఆ నమ్మకాన్ని తమవరకే పరిమితం చేసుకోవాలి.
నమ్మని వాళ్లు అదేదో అంతర్జాతీయ సమస్య  అన్నట్టు అదేపనిగా దేవుళ్ల మీద ఒంటికాలు మీద లేవడం కూడా మంచిదికాదు. బాధాసర్పద్రష్టులను ఉద్దరించడానికి ఇంకా సవాలక్ష మార్గాలున్నాయి. దేవుడ్ని నమ్మేవారిని వారి మానానికి వొదిలేసి తమపని తాము చూసుకుంటే సగం వాతావరణ (శబ్ద) కాలుష్యం తగ్గిపోతుంది.


సమాజం ఇప్పుడు ఎదుర్కుంటున్న సమస్యలు ఎన్నో వున్నాయి. వాటి ముందు దేవుడు ఒక సమస్యే కాదు. నిజానికి మనమే ఆయనకు సమస్య.

అద్భుతః


అద్భుతాల కోసం వెతుక్కుంటూ పోవాల్సిన అవసరం లేదు. చూసే కళ్ళు, ఆస్వాదించే హృదయం వుండాలే మన చుట్టూనే వున్నాయి  ఎన్నో ఎన్నెన్నో అద్భుతాలు.
ఈ పాడు ప్రపంచంలోకి ఏడుస్తూ వచ్చిన పాపాయి కొద్ది రోజుల్లోనే తన బోసి నోటితో ముసి ముసి నవ్వులు నవ్వడం చూడండి. అంతకంటే అద్భుతం ఏముంటుంది.



కుండీలో వున్న పూల మొక్క మారాకు వేసి  పూతపూసి మొగ్గ తొడిగి పూవు విచ్చుకోవడం గమనించండి. యెంత అద్భుతంగా వుంటుందో ఆ దృశ్యం.
మండు వేసవిలో పెనంలా మారిన వాతావరణం. వున్నట్టుండి చెప్పాపెట్టకుండా  ఒక్క వాన కురుస్తుంది. వేల ఎయిర్ కండిషనర్లు కూడా ఇవ్వలేని చల్లదనం ఒక్కసారిగా అనుభవంలోకి వస్తుంది. యెంత గొప్ప అద్భుతం.

ఇలాటి ఎన్నో అద్భుతాల మధ్యనే మన జీవితాలు గడిచిపోతున్నాయి. అయినా ఇంకా మరేదో అద్భుతం చూడాలని  వెంపర్లాట.

"చేతిలో చెయ్యేసి చెప్పు ......"

వార్త - వ్యాఖ్య
బహు చిత్రమైన రాజకీయం నడుస్తోంది.
రాజకీయాల్లో మాట ఇవ్వడమే కాని నిలబెట్టుకునే సంప్రదాయం లేదని చరిత్ర చెబుతోంది.
కానీ ఇప్పుడు ప్రతి రాజకీయ నాయకుడు ఇచ్చిన మాట నిలబెట్టుకునేవాడే.


ఉదాహరణకు సోనియాగాంధీ. తెలంగాణా ఇస్తా అని కే సీ ఆర్ కి మాట ఇచ్చింది. మరోపక్క పార్టీ తుడిచిపెట్టుకు పోతున్నా ఇచ్చిన మాట నిలబెట్టుకుంది. ఇది ఆ పార్టీ వాళ్ళే గొప్పగా చెప్పుకుంటున్న మాట.
'కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి ప్రజారాజ్యం పార్టీని పునరుద్దరించాలని అభిమానులు, కార్యకర్తలనుంచి నాపై తీవ్రమైన వొత్తిడి వుంది. అయినా సరే సోనియా గాంధీకి ఇచ్చిన మాట మేరకు కాంగ్రెస్ లో కొనసాగుతున్నాను' అని చిరంజీవి దిగ్గీరాజాతో అన్నట్టు ఈరోజు  పత్రికల్లో వచ్చింది.

కలికాలం కాకపొతే రాజకీయ నాయకులేమిటి?  మాట నిలబెట్టుకోవడాలు ఏమిటి?