వై ఎస్ ఆర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
వై ఎస్ ఆర్ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, జూన్ 2016, శుక్రవారం

బస్సులో వచ్చిన మనిషి హెలికాప్టర్ ఎలా సంపాదించాడు?


నిన్న మరణించిన మిత్రుడు విష్ణుమూర్తి గురించిన మరి కొన్ని జ్ఞాపకాలు:
నాయుడమ్మ అవార్డు  తీసుకునేవాడు అల్లాటప్పా మనిషి కాకూడదు అనేది విష్ణుమూర్తి మొదటి షరతు. దానికి కట్టుబడే ఇరవై నాలుగుమందికి ఏడాదికి ఒక్కరి చొప్పున ఇన్నేళ్ళుగా తెనాలిలో ఇస్తూ వస్తూనే వున్నారు.
ఇక ముఖ్య అతిధి సంగతి, ఆయన ముఖ్యమంత్రి అయినా, గవర్నర్ అయినా తెనాలి రావాల్సిందే. ఈ షరతు కారణంగా కొందరు రావడానికి ఒప్పుకుని కూడా రాలేని పరిస్తితి. వారిని తప్పుపట్టడానికి కూడా వీల్లేదు.
ఒకసారి సామ్  పెట్రోడా కి ఇవ్వాలనుకున్నారు. కానీ ఆయన్ని ఒప్పించడం ఎలా! సోమసుందర్ ఇత్యాది బృందం తలలు పట్టుకున్నారు. చివరికి ఓ మార్గం దొరికింది. ప్రముఖ  చిత్రకారుడు ఎస్వీ రామారావు గారు చికాగోలో వుంటారు. ఆయనకీ, పెట్రోడా గారికీ స్నేహం. ఆయన్ని పట్టుకుని పెట్రోడా మహాశయుల్ని ఒప్పించారు. అక్కడికి ఒక సమస్య తీరింది. అవార్డు కార్యక్రమం రోజున ఆయన ఢిల్లీ నుంచి హైదరాబాదు వస్తారు. ఆయన్ని రోడ్డు మార్గంలో కాకుండా అదేరోజు తెనాలి తీసుకుపోవాలంటే హెలికాప్టర్ కావాలి. మరెలా! మళ్ళీ మిత్ర బృందం ద్వారకలో భేటీ అయి మరోసారి తలలు పట్టుకుంది. అంతే! ఓ ఐడియా తలుక్కున మెరిసింది. హెలికాప్టర్ సదుపాయం వున్న ముఖ్యమంత్రిని ముఖ్య అతిధిగా పిలిస్తే!
ఇక్కడ తెనాలి, తెనాలి వరస కుదిరింది. పొలోమని వెళ్లి రోశయ్యగారికి చెప్పుకోవడం, ఆయన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిని ముఖ్య అతిధిగా ఒప్పించడం చకచకా జరిగిపోయాయి. అప్పుడు మరో అవాంతరం. అది బయట వాళ్ళనుంచి కాదు, ఏకంగా విష్ణుమూర్తి గారి నుంచి. చెప్పాకదా! ఆయనో సీతయ్య. హెలికాప్టర్ వెలుతురు వున్నప్పుడే తెనాలి నుంచి టేకాఫ్ అవ్వాలి. ప్రోగ్రాం ని కాస్త ముందుకు జరపమంటే విష్ణు మూర్తి గారికి అభ్యంతరం. మొత్తం మీద కాస్త పట్టు సడలించేలా  చేయడానికి ద్వారకలో (హోటల్లో మిత్రులతో) కాస్త ఎక్కువ సమయం గడపాల్సి వచ్చింది.
ఇక శుభం కార్డు వేయొచ్చు అనేంతలో వై ఎస్ ఆర్ ఆ కార్యక్రమానికి హాజరు కాలేని అర్జంటు పనేదో పడింది. అయితే ఆ సమస్యను ఆయనే తెలివిగా పరిష్కరించారు. రోశయ్యగారయితే ప్రసంగాలు చేయడంలో దిట్ట నా బదులు ఆయన వస్తారని చెప్పి మొత్తం మీద టెన్షన్  తగ్గించారు. ముఖ్య అతిధిగా రోశయ్యగారు, అవార్డు గ్రహీతగా సామ్  పెట్రోడా గారు హెలికాప్టర్ లో హైదరాబాదునుంచి తెనాలి వెళ్లి వచ్చారు.
ఇన్నిన్ని పనులు చక్కబెట్టాలంటే ఆ వ్యక్తీ వెనుక యెంత వుండాలి?

విష్ణుమూర్తి గారి వెనుక ఏమీ లేదు, కేవలం పట్టుదల తప్ప.        

21, మార్చి 2014, శుక్రవారం

కలత పెట్టే జ్ఞాపకం


అంజయ్య గారి లాగే చనువుగా మసలిన ముఖ్యమంత్రులు మరో ఇద్దరు వున్నారు. ఒకరు చంద్ర బాబు, మరొకరు రాజశేఖరరెడ్డి. వీరిద్దరూ అంజయ్య గారి మంత్రివర్గంలో సభ్యులు. ముందు వై ఎస్ ఆర్ చేరారు. ఆతరువాత విస్తరణలో చంద్రబాబుకు చోటు దొరికింది. వీరిద్దరూ మంచి మిత్రులు. దానికి నేనే సాక్ష్యం. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తరువాత  రాజకీయంగా వీరి దారులు వేరయ్యాయి. బాబు ముఖ్యమంత్రి అయిన తరువాత అఘాధం మరింత పెరిగింది. ఆ క్రమంలో అసెంబ్లీ సాక్షిగా చోటుచేకున్న వాదప్రతివాదాలు గమనించినప్పుడు - ఈ దూరం కేవలం రాజకీయం వల్లకాదు, వ్యక్తిగతం అనికూడా అనిపించింది. ఒకప్పుడు వీరిద్దరి నడుమ వున్న స్నేహాన్ని దగ్గరగా చూసిన వాడిగా 'ఆదూరం' నన్ను ఎంతో బాధ పెట్టింది. అయినా ఇద్దరితో నా పరిచయం అలాగే కొనసాగింది. ఒకరి సంగతులు మరొకరికి మోయడం అనే సద్గుణం లేకపోవడం వల్ల అని అనుకుంటున్నాను. ఒకసారి స్కూటరు నుంచి పడి కాలు విరిగి ఆసుపత్రిలో పడి వుంటే ఉధృతమైన ఎన్నికల ప్రచారంలో తలమునకలై వుండి కూడా వీరు తమ స్నేహ వాత్సల్యాన్ని నాపై ప్రదర్శించారు. ముఖ్యమంత్రిగా వుంటూ ఓ ప్రైవేటు ఆసుపత్రికి వచ్చి పరామర్శించాల్సిన అవసరం చంద్రబాబుకు వుందనుకోను. అలాగే ప్రతిపక్ష నేత వై ఎస్ ఆర్.


వెళ్ళి పిలవకపోయినా మా పిల్లవాడి పెళ్ళికి ఎస్ ఎం ఎస్ పిలుపుతో హాజరయిన గొప్పతనం వారిది. వారి దారులు వేరయి, వైరి పక్షాలుగా మారడం నన్ను ఎప్పుడూ కలత పెట్టే విషయం. వీరిలో ఒకరు లేకుండా పోయారు. మరొకరిని కలుసుకునే వీలు లేదు.



విలేకరులు ఏమీ సంపాదించుకోకపోయినా ఇలాటి అనుభవాలు వారికే సొంతం.               

2, సెప్టెంబర్ 2011, శుక్రవారం

అర్ధం కాని విషయం


అర్ధం కాని విషయం

అజ్ఞాని : మాకు తెలియని ఎన్నెన్నో ఊసులు చెబుతున్నారు. చాలా సంతోషం. వింటున్నకొద్దీ వినాలని వుంది గురూ గారూ.
విజ్ఞాని: విషయాలేవీ తెలియవంటున్నావు. కొంపతీసి వైయస్సార్ మాట విని ఆ రెండు పేపర్లు చదవడంలేదా! అందుకే కాబోలు ఇలా అజ్ఞానిగా వుండిపోయావు.
అ: ఇంతకీ జగన్ మోహన్ రెడ్డి చరిత్ర ముగిసిపోయిందంటారు.
వి: అవును శిష్యా. అతగాడికి భవిష్యత్తే కాదు వర్తమానం కూడా లేనట్లే.
అ: ఏం జరగబోతోందని మీ అంచనా?
వి: ఏముంది? అతడి చుట్టూ ఉచ్చు బలంగా బిగుసుకుంటోంది. ఇవ్వాళో రేపో అరెస్ట్ చేస్తారు. బ్యాంకు అక్కౌంట్స్ సీజ్ చేస్తారు. పొట్లంలో బెల్లం లేదని తెలిసాక చుట్టూ చేరిన చీమలన్నీ తప్పుకుంటాయి. హీనపక్షం పదేళ్లన్నా జైల్లో వుండక తప్పదు. ఇక అలాటి వాడిని నమ్ముకుని ఎవరు వెనకాల వేళ్ళాడుతారు చెప్పు.
అ: ఇవన్నీ ఆ రెండు పేపర్లూ చాన్నాళ్ళ నుంచి రాస్తూనే వున్నాయి. ఇందులో కొత్తేమీ లేదు గురూ గారూ. ఏదయినా సరి కొత్త సంగతి చెప్పండి.
వి: ప్రతి రోజూ కొత్త విషయం ఎక్కడనుంచి వస్తుంది. పాత విషయాన్నే మార్చి మార్చి రాస్తుండాలి. చెబుతుండాలి. అయినా అడిగావు కాబట్టి చెబుతున్నా. జగన్ పోట్లాటెట్టుకుంది ఎవర్తో. సాక్షాత్తు కాంగ్రెస్ అధిష్టాన దేవతతో. ఢిల్లీ లో, గల్లీలో అధికారం చేతిలోవున్న కాంగ్రెస్ పార్టీ తో. ఎదురు తిరక్కుండా, నీ బాన్చెను అంటూ మోచేతినీళ్ళు తాగే ఎంతమందినయినా, వాళ్లు ఎంత లంచగొండులయినా సరే అధిష్టానం చూసీ చూడనట్టు వొదిలేస్తుంది కానీ ఎదురుతిరిగిన వాళ్ళను మాత్రం వూరికే వొదిలిపెట్టదు. పార్టీలో కింద నుంచి పైదాకా ఇది అందరికీ తెలిసిన విషయమే. కానీ, పిల్లోడు పార్టీకి కొత్తకదా. వాళ్ల నాయనలాగే ఉడుకు రక్తం. అందుకే అలా ఆవేశపడిపోయి ఢిల్లీ పెద్దలతో గిల్లికజ్జా పెట్టుకున్నాడు. గిల్లి వూరుకున్నా అదో సంగతి. ఏకంగా అధినేత్రి పైనే నోరు చేసుకున్నాడు. కాంగ్రెస్ వాళ్లు వాళ్ల పెళ్ళాలనన్నా ఎవరన్నా ఏమన్నా అంటే వూరుకుంటారేమోకానీ, సోనియాపై పల్లెత్తు మాట తూలినా చాలు వొంటి కాలు మీద లేస్తారు. తమ ఇంట్లో వోట్లు కూడా నమ్మకంగా తమకు వేయించుకోలేని కొందరు నాయకులు కేవలం ఈ ఒక్క లక్షణం కారణంగానే ఢిల్లీలో ఇన్నేళ్ళుగా నెగ్గుకువస్తున్నారు.
అ: కొత్త విషయం అంటూ మళ్ళీ ఆ పేపరోళ్లలాగానే పాతపాటే పాడుతున్నారు. మీరంటే ఆ రెండు పేపర్లు తెగ చదివేసి ఇలా విషయాలన్నీ ఇడమరచి చెబుతున్నారు. ఇన్ని ఇన్నాక కూడా ఓ సంగతి మాబోటోళ్లకు అర్ధం కావడం లేదు. మొన్న రేత్రి మా పక్కింటికి పోలీసోడు వచ్చి ఏవో రాసుకుపోయాడు. అంతే. ఉప్పుకీ, పప్పుకీ
పక్కింటి తలుపు తట్టే మా ఇంటిది కూడా మర్నాడు ఆ యింటి మొహం చూస్తే వొట్టు. పోలీసు బయం అంటే అల్లాగుంటది. అలాటిది జగన్ బాబు మీద అదేదో సెంటర్ పోలీసోళ్లు దిగిపోయారు. మీరన్నట్టు, ఆ రెండు పేపరోళ్ళు రాస్తున్నట్టు ఈ పొద్దో, రేపటిసందో ఆ బాబుని పట్టుకెళ్ళి చర్లపల్లి జెయిల్లో వేస్తారు. అల్లాగే,  బ్యాంకుల్లో ఆయన డబ్బు చెలామణీ కాకుండా చూస్తారు. మరి, ఆయనదగ్గర మరేటి వుంటాదని పాతికమందో, ముప్పయిమందో ఎమ్మెల్యేలు ఆయన వెంట వెడుతున్నట్టు. సీటు పోయిందని టీవీల్లో రాతలు వచ్చీ రాకముందే మన వెనకున్నోళ్లు అయిపు ఆజా లేకుండా పోయే రోజులివి. పోనీ, సొమ్ములకు కక్కుర్తి  పడ్డారనుకుంటే ఇవతల ఇంకా రెండేళ్ళ అధికారం వుందాయె. పదవిలో వుంటే పది పనులు చేసుకుని పది కాలాల పాటు కాలు మీద కాలు వేసుకుని దర్జాగా బతకొచ్చు. అంకెల మీద రోజులు వెళ్ళదీసే సర్కారు తన అవసరానికి అందించే తాయిలాలకు ఆశ పడే వాళ్ళుంటారు కానీ, జగన్ ఎప్పుడో సీ ఏం అవుతాడని, అప్పుడు ఆదుకుంటాడని, వున్నదాన్ని వూడగొట్టుకునే వాళ్ళుంటారా ఎక్కడయినా. పదవిని వొదులుకుని, సర్కారు చేసే సాయాలు వొదులుకుని ఏం బావుకుందామని జగనెంట ఇంతమంది వెడుతున్నట్టు? మాకర్ధం కాని ఈ ఒక్క విషయం అర్ధం అయ్యేలా చెప్పండి గురువు గారూ. (02-09-2011)