31, అక్టోబర్ 2025, శుక్రవారం

అయాం ఎ బిగ్ జీరో (239) : భండారు శ్రీనివాసరావు

 రేపు మనది కాదు

అక్టోబర్, నవంబరు.

దేశంలో కోట్లాది మంది ప్రభుత్వ పెన్షనర్లు ఈ రెండు నెలల్లో బతికుండి మళ్ళీ పుడతారు. పుడతారో లేదో కానీ, తాము బతికే వునట్టు వున్నట్టు ఒక సర్టిఫికేట్ ఇవ్వాలి. ఇస్తే కాని మరుసటి నెల నుంచి పెన్షన్ రాదు. అంచేత ముసలీ ముతకా అందరూ తమకు పెన్షన్ వున్న/వస్తున్న బ్యాంకుకు బారులు తీరతారు. ప్రభుత్వాలు జీవన్ ప్రమాణ్ వంటి యాప్స్ ప్రవేశపెట్టి, ఇంటి నుంచే తాము బతికే వున్నట్టు బ్యాంకుకు తెలిపే వెసులుబాటు కల్పించారు. అయితే ఇందుకు కొంత ఫేస్ రికగ్నిషన్ వంటి సాంకేతిక ప్రజ్ఞ అవసరం.

సరే! బాగానే వుంది.

కానీ ఈ బతుకు సర్టిఫికేట్ కు, రేపు మనది కాకపోవడానికి ఏమిటి సంబంధం? వుంది.

ముందీ కధ చిత్తగించండి.

పెసిమిజం అనుకోకండి. నిజంగా రేపనేదే లేదు. నిన్న చరిత్ర. నేడు నిజం. రేపు అనుమానం.

చాలా ఏళ్ళ క్రితం మా ఇంటికి ఓ పెద్ద మనిషి వచ్చారు. నిజంగా ఆయన అన్నింట్లో పెద్దమనిషే. సందేహం లేదు. రిటైర్ అయ్యేనాటికి సొంత ఇల్లు వుంది. పిల్లల పెళ్ళిళ్ళు అయిపోయాయి. ఇంట్లో ఉండాల్సిన అన్ని సౌకర్యాలు వున్నాయి.

ఒక రోజు ఆ పెద్దమనిషి గారి భార్య మొగుడ్ని ఓ కోరిక కోరింది, డ్రాయింగు రూములో మాదిరిగానే బెడ్ రూమ్ లో కూడా ఓ ఏసీ పెట్టించమని. ఓస్ అదెంత పని అనుకున్నాడు. ఓ షాపుకు వెళ్లి మాట్లాడాడు. మరుసటి రోజు ఉదయం కల్లా పెడతానన్నాడు. విధి మరోలా తలచింది.

ఎలాటి రోగం రొష్టు లేని ఆయన భార్య ఆ రాత్రే విపరీతమైన గుండెపోటు వచ్చి కన్ను మూసింది.

మా ఇంట్లో ఏసీ గదిలో కూర్చోమంటే ఆయనకు మనస్కరించ లేదు. సెల వేసినట్టు భార్య అడిగిన ఆఖరు కోరిక గుర్తు చేసుకోవడమే ఆయనకు ఓ చేదు జ్ఞాపకంలా మిగిలి పోయింది.

రాత్రి వరకు కబుర్లు చెప్పిన మనిషి మరునాడు లేదు. ఇక రేపు వుందనే నమ్మకం ఏమిటి? అది ఓ భ్రమ’ అన్నాడాయన.

నిజమే అనిపించింది.

అందుకే ఏ పనీ రేపు చేద్దాం అనుకోవద్దని కూడా ఆ క్షణంలో అనిపించింది. ఈ రోజే మనది. ఎవరికన్నా సాయం చేద్దాం అనే మనసుంటే ఆలస్యం చేయకుండా వెంటనే చేయాలన్న మాట.

ఎందుకంటే రేపు మనది కాదు.

ఇది గుర్తుకు రాగానే బ్యాంకుకు బయలుదేరాను. ఈరోజు అక్టోబరు 31.

మతి మరపు కదా! లైఫ్ సర్టిఫికేట్ దాఖలుకు ఇవ్వాళే ఆఖరు రోజు అనుకున్నా. ఇంతలో మళ్ళీ గుర్తు వచ్చింది. ఫేస్ బుక్ స్నేహితులు రామనాద్ Ramnath Kampamalla గత ఆగస్టులో మా ఇంటికి వచ్చారు. ఆయన ఉద్యోగమే కంప్యూటర్ల సంస్థలో. లైఫ్ సర్టిఫికేట్ విషయంలో ఆయన సాయం తీసుకుని మొత్తం మీద ఆ ప్రక్రియ పూర్తి చేశాను.

తిరుగు టపాలో వచ్చినట్టు నిమిషాల్లోనే మెసేజ్ వచ్చింది.

మీ లైఫ్ సర్టిఫికేట్ డిజిటల్ పద్దతిలో జయప్రదంగా సమర్పించినందుకు కృతజ్ఞతలు. ఆ సర్టిఫికేట్ ని మీకు పెన్షన్ ఇచ్చే ఏజెన్సీ ప్రాసెస్ చేసి, పెన్షన్ విడుదల చేస్తుంది’

అమ్మయ్య! బ్యాంకుకు వెళ్ళే పని లేకుండా పోయింది అని సంతోషించి, ఆ విషయం అంతటితో మరిచిపోయాను.

మానవ మాత్రుడిని కనుక నేను మరిచిపోయాను.

ప్రభుత్వ యంత్రాంగం, సాంకేతిక వ్యవస్థలకు ఈ మతి మరపు లేదు కదా! అందుకని గుర్తు పెట్టుకుని గుర్తు చేసాయి, నా అక్టోబర్ పే స్లిప్ లో. ‘మీరు వయసులో పెద్దవారు కాబట్టి నవంబరు లోపు దాఖలు చేయండి’ అని హుకుం లాంటి అభ్యర్ధన. మరి ఆగస్టులో దాఖలు చేసింది ఏమైంది?

తప్పదు. బ్యాంకుకు వెళ్లి ఆరా తీయక తప్పదు. మా ఇంటికి దగ్గరే. మరీ దగ్గర కాదు మరీ దూరం కాదు, యూసుఫ్ గూడా ఎస్.బి.ఐ. బ్రాంచి. పదిన్నరకు తెరుస్తారు. వాళ్లకు కాణీ ఆదాయం లేని పని నాది. పొద్దున్నే ఇలాంటి బోణీ ఎందుకని పదకొండు ప్రాంతంలో వెళ్లాను. కస్టమర్లు పలచగానే వున్నారు. సిబ్బంది కూడా మరింత పలచగా వున్నారు. మా రేడియోతో సహా చాలా చోట్ల రిటైర్ అయిన ఉద్యోగుల స్థానంలో ఖాళీలను పూరించకుండా వున్న సిబ్బందితోనే నెట్టుకు వస్తున్నారు. బహుశా బ్యాంకుల పరిస్థితి కూడా అదేనేమో!

రిసెప్షన్ అని రాసి వున్న చోట నీరజ అనే అమ్మాయి నిలబడే పనిచేస్తోంది. వెళ్లి వచ్చిన పని చెప్పాను. అందుకు సంబంధించిన పెద్ద అధికారి, చిన్న అధికారి ఇద్దరూ బ్యాంకు ఏటీఎం పనిలో వున్నారు, కొంచెం టైం పడుతుంది, వెయిట్ చేయండి' అన్నది చాలా మర్యాదగా.

ఇప్పుడు బ్యాంకులు వెనుకటి మాదిరిగా లేవు. కార్పొరేట్ స్థాయిలో మంచి మంచి కుర్చీలు, ఏసీ సదుపాయం. ఇంటికి పోయి చేసేది ఇదే కదా అని, అక్కడే మంచి చోటు చూసుకుని సెటిల్ అయ్యాను.

ఉన్న అయిదారుగురో, పదిమందో సిబ్బంది కూడా కాగితాలు, నోట్ల బండిళ్ళు పట్టుకుని అటూఇటూ తిరుగుతున్నారు. నాలుగో తరగతి సిబ్బంది మాత్రం వాళ్ళ స్థానాల్లో సుఖాసీనులై విశ్రాంతి తీసుకుంటున్నారు. పెద్ద అధికారి, చిన్న అధికారుల జాడలేదు.

ఈ లోపున విశ్రాంతిలో వున్న నాలుగో తరగతి అధికారి మా వద్దకు వచ్చి పెద్ద సారు రావడానికి చాలా సమయం పడుతుంది అన్నాడు, ఇక దయ చేయండి అన్నట్టు.

నేను మళ్ళీ నీరజ గారి దగ్గరికి వెళ్లాను. ‘నాకు పెద్ద పనేమీ లేదు, సర్టిఫికేట్ ఆల్రెడీ జీవన్ ప్రమాణ్ ద్వారా ఇచ్చేశాను. అదేమైంది అనే నా సందేహం నివృత్తి చేస్తే వెళ్ళిపోతాను. కాదు కూడదు ఇవ్వాలి అంటే రేపు కూడా వ్యవధి వుంది కదా, వచ్చి ఇస్తాను’ అన్నాను. ఆ అమ్మాయి ఏమనుకుందో ఏమిటో, ‘వయసు ఎనభయ్, రేపు వస్తానంటున్నాడు’ అన్నట్టు నా వైపు ఎగాదిగా చూసి, ఒక కౌంటర్ లో తలెత్తి చూసే విరామం లేకుండా పనిచేస్తున్న అనూష అనే మరో ఉద్యోగిని వద్దకు తీసుకువెళ్లి, నేను వచ్చిన పని వివరాలు చెప్పింది. ‘ముందు కాసేపు ఆగండి ఆ అధికారి రాగానే మీ పని చూస్తారు’ అన్నది కాస్తా నా మాటలతో మెత్తపడి, ‘మీ పీ పీ ఓ నెంబరు చెప్పండి’ అన్నది. కీ బోర్డు మీద వేళ్ళు టకటకలాడిస్తూ, ఎదురుగా వున్న మానిటర్ లోకి చూస్తూ ‘మీరు ఆగస్టులో ఇచ్చింది ఇక్కడ డిస్ ప్లే కావడం లేదు, రేపు వచ్చి చెప్పండి, అప్పటికి అప్ లోడ్ కాకపోతే అప్పుడు చూద్దాము, రేపు ఒక్క అయిదు నిమిషాలు వస్తే చాలు, ఈ పని పూర్తి చేస్తాను’ అన్నది అనునయంగా.

నిజానికి ఇది ఆమె పని కాదు. అయినా ఆ మాత్రం భరోసా ఇచ్చింది. బ్యాంకుల సిబ్బంది పనితీరు పట్ల నీలినీడలు కమ్ముకుంటున్న సమయంలో ఇలాంటి ఉద్యోగుల అవసరం చాలా వుంది.

నిజానికి బ్యాంకుల భయం బ్యాంకులది.

ఇవ్వాళ ముప్పయి ఒకటి. రేపు నవంబరు ఒకటిన నేను బతికి వుండాలి. అప్పుడే పెన్షన్. ఈ రోజే ఆ పని చేస్తే కుదరదు. ఏమో ఎవరు చెప్పొచ్చారు? ఏం జరుగుతుందో ?

అందుకే అన్నది, రేపు మనది కాదు.

(ఇంకా వుంది)

25, అక్టోబర్ 2025, శనివారం

అయాం ఎ బిగ్ జీరో (238) : భండారు శ్రీనివాసరావు

 చిన్న మనుషులు – గొప్ప మనసులు

యాదమ్మ, స్వరూప, అంకిత , వనిత

గత మూడు దశాబ్దాల పై చిలుకు కాలంలో వివిధ దశల్లో మా జీవితాలతో ముడిపడిన వారిలో వీరున్నారు. జీతాల మీద పనిచేసిన వారే కానీ జీతాల కోసమే పనిచేయలేదు. అందుకే కుటుంబ సభ్యులు అయ్యారు.

యాదమ్మ, సంపూర్ణ ఇంటి పనిలో సహాయకులు. స్వరూప మా పెద్ద వదిన గారికి పెద్దతనంలో సహాయకురాలు, అంకిత మా మనుమరాలు జీవికకి కేర్ టేకర్, ఇక వనిత గత పదిహేను సంవత్సరాలుగా మా వలలి.

జీవితం అన్నాక కొందరు గొప్పవాళ్లు తారసపడతారు. అలాగే చాలామంది చిన్నవాళ్లు కూడా మన జీవన నౌక సాఫీగా సాగడానికి తోడ్పడతారు. నా జీవితాన్ని తరచి చూసుకునే ఇలాంటి సందర్భాలలో చిన్నా గొప్పా తారతమ్యం లేకుండా అలాంటి వారిని కూడా గుర్తు చేసుకోవడం సముచితమని నా భావన.

తెలుగువారికి గొప్ప పండుగలలో సంక్రాంతి ఒకటి. అది వెళ్ళిన మరునాడే కనుమ. అది కూడా పండగే. సంక్రాంతికి సొంతూరు వెడితే మర్నాడు కనుమ కూడా అక్కడే గడిపి రావడం ఆనవాయితీ. కనుమనాడు కాకయినా కదలదు అనే నానుడి పేర్కొంటూ ముందరి కాళ్ళకు బంధాలు వేస్తారు.

అలా ఒకసారి 2019 లో కనుమ నాడు కూడా మా ఇంట పండగ సందడి చోటు చేసుకుంది. దానికి కారణం ఎప్పుడో పుష్కరం కింద మా ఇంట్లో పనిచేసిన మల్లయ్య కుటుంబం.

ముప్పయ్ ఏళ్ళ క్రితం మేము మాస్కోనుంచి వచ్చి హైదరాబాదు పంజాగుట్ట దుర్గానగర్ కాలనీలో మళ్ళీ కొత్తగా కొత్త కాపురం పెట్టిన రోజుల్లో, మల్లయ్య కుటుంబం మా ఇంట్లో పని చేసేది. మధ్యలో మేము చాలా ఇళ్ళు మారాము. అయినా ఆ కుటుంబంతో మా బంధం కొనసాగుతూ వచ్చింది.

ఆ ఏడాది కనుమ రోజు సాయంత్రం ఎల్లారెడ్డి గూడాలోని మా ఇంటికి ఇంటిల్లి పాదీ వచ్చారు. ఆటో నడిపే మల్లయ్యకు అందరూ ఆడపిల్లలే. ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళయ్యారు. పెళ్ళిళ్ళయి పిల్లలకు తల్లులు అయ్యారు. యాదమ్మ, మల్లయ్యలకు ముగ్గురు మనుమళ్ళు నలుగురు మనుమరాండ్రు. ఎల్ కేజీ నుంచి తొమ్మిదో తరగతి దాకా చదువుతున్నారు. మల్లయ్య ఆడ సంతానం పెద్ద పండగ సంక్రాంతికి పుట్టింటికి వచ్చారు. అల్లుళ్ళు ఏరీ అని అడిగితే అందరిలోకి చిన్నమ్మాయి ( మా కళ్ళ ముందే పుట్టింది) తిరుమలమ్మ (పెళ్ళిలో రూప అని పేరు మార్చుకుందట) తటాలున జవాబు చెప్పింది. ‘మేము మా అమ్మానాన్నలను చూడడానికి మా పుట్టింటికి వచ్చాము. మా మొగుళ్ళు వాళ్ళ అమ్మానాన్నలను చూడ్డానికి వాళ్ళ పుట్టింటికి వెళ్ళారు’ అని.

వాళ్ళందరినీ చూసి మా ఆవిడ సంతోషం అంతా ఇంతా కాదు. ఆ పిల్లల్లో ఇద్దరు ముగ్గురు ఆవిడ చేతుల్లోనే పెరిగారు. వాళ్ళ చదువులు, ఫీజులు, పుస్తకాలు వగైరా దగ్గరుండి కనుక్కుంటూ వుండేది. అందుకని ఆ కుటుంబానికి మా ఆవిడ అంటే అభిమానంతో కూడిన ఆరాధన.

అంతమంది ఆడపిల్లలు గల గలా మాట్లాడుతుంటే ఆడ సంతు లేని మేము ఎంతో సంతోషించాము. ఫోటో అంటే మొహం తిప్పుకునే మా ఆవిడ ఆ రోజు అందర్నీ తన పక్కన నిలబెట్టుకుని నాతో వాళ్ళ గ్రూపు ఫోటో తీయించుకుంది.

ఇది జరిగింది జనవరిలో. ఆగస్టులో ఆమె లేదు. ఫోటో మిగిలింది.

స్వరూప.

నలభై,యాభయ్ ఏళ్ళు వుంటాయి. పేరుకు తగిన రూపం కాదు అని మొదటిసారి చూసిన వాళ్ళు అనుకుంటారు.

కానీ ఆమె మనసు ఎంతటి ఉదాత్తమైనదో తెలిసే అవకాశం ఒకసారి వచ్చింది.

మా పెద్ద వదిన సరోజిని గారు జీవించి వున్నప్పుడు చేయి విరిగింది. మా కుటుంబంలో పెద్ద. ఆమెకు సాయంగా ఉండడానికి మా అన్నయ్య కుమారుడు రాఘవ రావు ఏదో ఏజెన్సీతో మాట్లాడి ఒక సహాయకురాలిని పెట్టాడు. ఆమే ఈ స్వరూప. మా ఇంటికి దగ్గర కాబట్టి, ప్రతిరోజూ ఏదో ఒక సమయంలో వెళ్లి మా వదినను చూసి వస్తుండే వాడిని.

ఒక రోజు నేను వెళ్ళే సరికి తల వాకిలి ఓరగా వేసివుంది.

లోపల నుంచి మాటలు వినపడుతున్నాయి. ఆ గదిలో వున్న ఇద్దరూ నా రాకను గమనించలేదు. నడిచి వచ్చిన బడలిక తీర్చుకోవడానికి ఓ కుర్చీలో కూలబడ్డాను.

వదిన మంచం మీద దిండును ఆనుకుని కూర్చుని, ఎదుటి మనిషి చెబుతున్న మాటలను ఏకాగ్రతగా వింటోంది.

మా వదినను మాట్లాడనివ్వకుండా, ఆమె రెండు చేతులూ పట్టుకుని స్వరూప ఏకబిగిన చెప్పుకు పోతోంది.

నేను మౌనంగా వింటున్నాను.

అమ్మా! మీరు పెద్దవారు. ఎనభయ్ దాటాయని చెబుతున్నారు. మీ వయసులో సగం లేదు నా వయసు. మిమ్మల్ని కనిపెట్టుకుని చూడమని మా యజమాని నన్ను మీ వద్దకు పంపాడు. ఆయనకు మాట రానివ్వకుండా చూడాలి నేను. మీరేమో రాత్రుళ్లు నాకు చెప్పకుండా లేస్తున్నారు. మీ పక్కనే పడుకుంటున్నాను. ఏమాత్రం అవసరం వున్నా నన్ను లేపండి. నేను దగ్గర వుండి మిమ్మల్ని బాత్ రూముకు తీసుకు వెడతాను. మీరు నా కంటే చాలా పెద్ద. కానీ నాకంటికి నువ్వు రెండేళ్ల పిల్లవే. కన్నబిడ్డ పక్కబట్టలు ఆగం చేస్తే తల్లి శుభ్రం చేయదా! నేనూ అంతే! పక్క మీద నుంచి రాత్రి వేళ కదిలే పని లేకుండా నేనే చూస్తాను. లోగడ కొన్నాళ్ళు ఓ ఆసుపత్రిలో ఆయాగా పని చేశాను. ఇవన్నీ నాకు అలవాటే. కాబట్టి నా మాట వినండి. నేను ఈ పనులు డబ్బుల కోసం చేస్తున్నా, డబ్బొక్కటే ముఖ్యం కాదు. నాకిక్కడ మూడు పూటలా అన్నం పెడుతున్నారు. చక్కగా కనుక్కుంటున్నారు. నా పనిలో ఏదైనా తేడా వస్తే ఆ పైన దేవుడు నన్ను వదిలి పెడతాడా!

మళ్ళీ చెబుతున్నాను. ఈసారి అరిచి కసిరి చెబుతాను. పిల్లలకు తల్లి చెప్పదా! అలాగే నేనూ గట్టిగానే చెబుతాను. మనసులో పెట్టుకోకండి. మీ కట్టు విప్పి, మీ చేయి నయం అయ్యేవరకు నేను మిమ్మల్ని వదిలిపోను. తర్వాత మీ ఇష్టం. అంతవరకూ నాకు మాట రానీయకండి”

ఇదంతా విన్న తర్వాత నాకు అక్కడ ఉండాల్సిన అవసరం కనపడలేదు. ఎంత మౌనంగా వచ్చానో అలాగే బయటకు వచ్చేశాను. వదిన ఎలా వుందో చూడాలని వచ్చాను. ఆమెను పదిలంగా చూసుకునే మనిషి దొరికింది.

గుళ్ళో వుండే దేవుడు మనుషుల్లో కూడా ఉంటాడు. ఈ దేవత కొలువైన గుడి నుంచి బయలుదేరి మా ఇంటికి వెళ్ళిపోయాను.

అంకిత

ఈ అమ్మాయిని మా మనుమరాలు జీవికకు కేర్ టేకర్ గా పెట్టారు.

అప్పటికి నా కొడుకు కోడలు ఉద్యోగస్తులు. మనుమరాలిని చూసుకోవడానికి మా ఆవిడ లేదు.

అంచేత ఏదో కంపెనీని సంప్రదించి ఓ కేర్ టేకర్ ని పెట్టారు. ఆ అమ్మాయి పేరు తప్ప, వాలకం నాకు ఏమాత్రం నచ్చలేదు. గాంధీ గారి కళ్ళజోడులాంటి గుండ్రటి పెద్ద కళ్లద్దాలు. ఆధార్ కార్డు ప్రకారం వయసు 22. కానీ ఆ పిల్ల పీలగా పద్నాలుగేళ్ళ అమ్మాయిలా వుంది.

మనుమరాలు జీవికని కనిపెట్టి చూసుకోవడమే ఆ అమ్మాయి పని.

ఇంట్లోనే వుంటుంది కాబట్టి ఎప్పుడో ఒకప్పుడు నా కంట్లో పడేది. చీదరించుకున్నట్టు చూసేవాడిని.

ఈలోగా ఘోరం జరిగిపోయి మా వాడు ఆకస్మిక గుండె పోటుతో చనిపోయాడు.

నాకు ప్రపంచం యావత్తూ శూన్యంగా మారింది. ఆరోగ్యం దెబ్బతిన్నది. కను చూపు మందగించింది. మా కోడలు నిషా శ్రద్ధ తీసుకుని కంటి ఆపరేషన్ చేయించింది.

కొన్ని రోజులు గంట గంటకీ కంట్లో చుక్కలు వేయాలి. ఆ పని అంకిత చూసింది. అలారం పెట్టుకుని కరక్టు టైముకి వేసింది.

ఆ తర్వాత బీపీ షుగర్ సమస్యలు. ఎప్పటికప్పుడు మిషన్ల మీద రీడింగ్ తీసుకుని ఒక పుస్తకంలో నోట్ చేసుకుని డాక్టర్లు అడగగానే చెప్పే బాధ్యత స్వచ్చందంగా తీసుకుంది. వేళకు గుర్తు పెట్టుకొని మందులు ఇచ్చేది.

ఈ నర్సింగ్ సర్వీసుతో ఆ అమ్మాయి పట్ల నా అభిప్రాయం పూర్తిగా మారిపోయింది.

ఆడపిల్లలు లేని నాకు ఈ అమ్మాయిని ఆ దేవుడే పంపాడు అని నిర్ధారణకు వచ్చాను.

అయితే ఒక విషయం చెప్పాలి.

ఇంత మొండి పిల్లను నా జీవితంలో చూడలేదు.

పాలవాడో, పేపరు వాడో వచ్చి డబ్బులు అడుగుతాడు.

అమ్మా అంకితా వెళ్లి నా ప్యాంటు జేబులో పర్స్ తీసుకురా’ అంటే ససేమిరా వినదు. ‘హైదరాబాద్ లో ఉద్యోగానికి వచ్చేటప్పుడే మా అమ్మ ఇతరుల డబ్బు తాకవద్దు అని చెప్పి పంపింది’ అంటుంది.

నేనే చెబుతున్నా కదా’ అన్నా వినదు. తాబట్టిన కుందేటికి మూడే కాళ్ళు బాపతు.

ఈ కాలంలో ఇంత నిజాయితీ అరుదు.

సంక్రాంతి, దసరా వంటి పండుగలు, చీరలో డ్రెస్సులో కొనుక్కోమని వంటమనిషి వలలికి, (అసలు పేరు వనిత) పనిమనిషి అనితలతో పాటు డబ్బు ఇస్తే అంకిత తీసుకోదు.

'మీరు ప్రతినెలా ఒకటో తేదీన ఠంచనుగా జీతం పదిహేను వేలు లెక్క కట్టి ఇస్తున్నారు కదా! నా సంపాదనతోనే ఏదైనా కొనుక్కుంటాను, ఇక్కడ నాకు విడిగా పెట్టే ఖర్చు లేదు, నా అన్ని అవసరాలు మీరే చూసుకుంటున్నారు. ఒక వేయి నేను వుంచుకుని, మిగిలింది మా అమ్మకు జీపే చేస్తాను' అంటుంది ధీమాగా, ఎంతో బాధ్యతగా.

అందుకే ఆ అమ్మాయి ముట్టె పొగరుని సహిస్తూ, భరిస్తూ వచ్చాను. ఆమెకున్న ఆత్మాభిమానాన్ని గౌరవిస్తూ వచ్చాను.

కాంట్రాక్ట్ ముగిసింది. మనుమరాలు కటక్ లో వాళ్ళ అమ్మమ్మ గారింట్లో వుంది. నా ఆరోగ్యం కుదుట పడింది. ఏడాది ఆఖరులో వాళ్ళ కులదేవత పూజలు అవీ వున్నాయి, నెల రోజులు వుండను, వూరికి పోతాను అని ఏడాది కిందట పనిలో చేరేటప్పుడే చెప్పింది. అలాగే వెళ్ళిపోయింది.

పనివాళ్ళు దొరుకుతారేమో కానీ పనిమంతులు దొరకడం కష్టం.

తోకటపా:

మా పిల్లలలాగే అంకితకు కూడా తన ఫొటో సాంఘిక మాధ్యమాలలో పోస్టు చేయడం అస్సలు ఇష్టం వుండదు. మా మనుమరాలు జీవికతో వున్న ఫోటోల్లో తాను వుంటే, అది ఎడిట్ చేసేదాకా వూరుకోదు. అంత మొండిఘటం.

కింది ఫోటో: మల్లయ్య కుటుంబంతో మా ఆవిడ నిర్మల




(ఇంకావుంది)

22, అక్టోబర్ 2025, బుధవారం

అయాం ఎ బిగ్ జీరో (237) : భండారు శ్రీనివాసరావు


ఒకసారి తిరుమలమ్మ మా ఇంటికి వచ్చింది. పోల్చుకోవడానికి కొంత సమయం పట్టిన మాట నిజం.
ఈ అమ్మాయి ఎవరో చెప్పడానికి ముందు కొంచెం నేపధ్యం తెలపడం అవసరం.
1992 లో మేము మాస్కోనుంచి వచ్చేసి హైదరాబాదులో ఇల్లు వెతుక్కుంటున్న రోజులు. వెంట తెచ్చుకున్న అయిదారు సూటుకేసులు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారి పంజాగుట్ట క్వార్టర్ లో వదిలేసాము. కంటైనర్లో వేసిన మిగిలిన సామాను, రష్యా నుంచి ఓడలో మద్రాసు వచ్చి మళ్ళీ రోడ్డు మార్గంలో హైదరాబాదు చేరడానికి రెండు మూడు నెలలు పడుతుంది. కాబట్టి ఇల్లు వెతుకులాట కార్యక్రమం కాసింత నెమ్మదిగానే సాగింది, హడావిడి లేకుండా.
మా అన్నయ్యగారి ఇంటికి దగ్గరలోనే ఇటు పంజాగుట్ట మెయిన్ రోడ్డు, అటు రాజ భవన్ రోడ్డు నడుమ దుర్గానగర్ అనే కాలనీలో ఓ ఇల్లు దొరికింది. రెండు గదులు, పెద్ద హాలు, వంట గది, అద్దె పద్దెనిమిది వందలు. మాస్కో నుంచి వచ్చే సామాను చాలా ఎక్కువ కనుక అంత కిరాయి పెట్టక తప్పలేదు.
మాస్కో నుంచి స్వదేశం తిరిగి వెళ్లి పోయేవారి కోసం పెద్ద పెద్ద కంటైనర్లు రేడియో మాస్కో వాళ్ళే ఏర్పాటు చేస్తారు. వీటికి చెల్లించాల్సిన రుసుము అతి స్వల్పం. వాటిని లిఫ్ట్ వ్యాన్ అంటారు. ఖరీదైన కలపతో చేసినవి. ఆ కంటైనర్ రోడ్డు మీద కదలాలి అంటే ఇరవై నాలుగు టైర్ల భారీ లారీ కావాలి.
చౌకగా దొరుకుతాయని కొని పడేసిన సామాను మొత్తం వేసినా పుష్పక విమానంలా కొంత జాగా మిగలడంతో, మా దగ్గర పోగుపడిన రూబుల్స్ ఇండియాలో చిత్తుకాగితాలతో సమానం కనుక, ఇంట్లో నలుగురం నాలుగు టాక్సీలు పట్టుకుని వీధుల్లో తిరుగుతూ కంటికి కనిపించిన వస్తువులన్నీ కొని దాన్ని నింపే ప్రయత్నం చేశాము. ఇంట్లో సామాను మొత్తం వాళ్ళే ప్యాక్ చేసి కింది దించి లిఫ్ట్ వ్యాన్ ఎక్కించారు. లిఫ్ట్ వ్యాన్ వెంట మరో టాక్సీలో నేను, కొంచెం కొంచెం రష్యన్ అర్ధం చేసుకుని మాట్లాడే మా పెద్ద వాడు సందీప్ కలిసి మాస్కోలో మరో కొసలో వున్న కష్టమ్స్ కార్యాలయానికి వెళ్ళాము. తీరా అక్కడకి పొతే వాళ్ళు అడిగినవి రెండే రెండు ప్రశ్నలు. ఇందులో పాలూ, పెరుగూ ఉన్నాయా అని.
మూడు నెలల తర్వాత ఇండియా చేరే లిఫ్ట్ వ్యానులో పాలూ, పెరుగూ ఎవరు స్మగుల్ చేస్తారు? ఆ ప్రశ్నకు నవ్వు వచ్చినా బయట పడకుండా మొహం పెట్టి, నియత్ నియత్ (లేదు, లేదు) అన్నాము. అంతే! వాళ్ళు స్టాంప్ వేసి రెండే రెండు నిమిషాల్లో క్లియర్ చేశారు.
మాస్కో సామాన్లు భద్రంగా మద్రాసు చేరినట్టు కబురు వచ్చింది. అప్పటి దాకా మాస్కో సామాను రేపో మాపో వస్తుందని ఇంట్లో ఏ సామాను అమర్చుకోకుండా చాపలు, జంపఖానాలతో కాలక్షేపం చెస్తూ వస్తున్న మేము, అమ్మయ్య అనుకున్నాము. నేను ఒక్కడినే మద్రాసు వెళ్లాను. అదే నేను చేసిన పొరపాటు. మా పిల్లల్లో ఒకడిని వెంట తీసుకుని వెళ్ళాల్సింది.
మద్రాసు కష్టమ్స్ గోడౌన్ చాలా విశాలంగా వుంది. ఎటు చూసినా పెద్ద పెద్ద కంటైనర్లు. వాటి నడుమ మాదే చిన్నది అనిపించింది. మేము పలానా రోజు వస్తున్నామని తెలుసు కనుక ముందే కంటైనర్ ఖాళీ చేసి కింద పరిచి పెట్టారు. నిజానికి మేము వెళ్ళే వరకు ఆ పని చేయకూడదు. కానీ మనం ఎందుకు అని అడగకూడదు.
కష్టమ్స్ తనిఖీ చేసే అధికారుల తరపున ముందు ఒక చిన్న అధికారి వచ్చి, మేము మాస్కో నుంచి వచ్చాము అని తెలుసుకుని, పెదవి విరిచాడు. మాస్కో నుంచి వచ్చే వాళ్ళ దగ్గర వాళ్ళు పట్టుకునే సామాను కానీ, వాళ్ళు కోరుకున్న వస్తువులు అంటే మద్యం సీసాలు వగైరా దొరికే అవకాశం లేదు అని పెద్దగా చెకింగ్ చేయరు. ఒకరకంగా వాళ్ళ సమయం వృధా.
ఇంతలో ఒక పోర్టరు, బయట బ్యాంకు బ్రాంచి వుంది, వెళ్లి ఒక వంద రూపాయలకు చలానా కట్టి ఆ ఫారం పట్టుకు రమ్మన్నాడు. బ్యాంకులో ఆ విండో దగ్గర చాలామంది వున్నారు. ఆ పని పూర్తి చేసుకుని వచ్చేసరికి, సామాను హైదరాబాదు చేర్చాల్సిన భారీ లారీ బయట సిద్ధంగా వుంది. దాంతో హడావిడిగా లోపలకు వెళ్లి, తొందరగా పని పూర్తి చేసుకుని రాత్రి ఫ్లయిట్ అందుకోవాలనే ఆత్రుతతో నేనున్నాను.
మాస్కో నుంచి రోడ్డు మార్గాన సోవియట్ యూనియన్ లో మరో మూల వున్న ఓడ రేవుకు, మళ్ళీ ఓడలో మూడు నెలలు ప్రయాణం చేసి మద్రాసుకు మా సామాను చేరింది. ఒక్కటంటే ఒక్క గాజు సామాను కూడా కొంచెం కూడా దెబ్బతినలేదు. అంత చక్కగా అక్కడి వాళ్ళు వాటిని ప్యాక్ చేశారు. మద్రాసులో వాళ్ళు వాటిని ఇష్టం వచ్చినట్టు నిర్లక్ష్యంగా ప్యాకింగులు విప్పి అక్కడ నేల మీద పరిచి పెట్టారు. చెకింగ్ తర్వాత మళ్ళీ ప్యాక్ చేయడం మా పని కాదంటారు. చివరికి డబ్బులు తీసుకుని ఆ పని చేసి పెట్టారు.
బతుకు జీవుడా అని బయట పడి హైదరాబాదు విమానం ఎక్కాను.
మూడో రోజో నాలుగో రోజో ఆ భారీ లారీ హైదరాబాదు చేరింది. మేమున్న కాలనీలోకి రావడానికి ఆ లారీకి ఒక పట్టాన సాధ్యం కాలేదు. మొత్తం మీద మూడు నాలుగు గంటల విశ్వ ప్రయత్నం మీద ఇంటికి చేరింది.
మాస్కో సామాను అంటేనే భారీ. అది సోఫా కావచ్చు, టీ కప్పు కావచ్చు. ఏదైనా పెద్ద సైజే. కింగ్ సైజే! వాటిని మేము అద్దెకు తీసుకున్న మొదటి అంతస్తుకు చేర్చడానికి మరో బ్రహ్మ ప్రళయం. వాటితో మా హాలు మొత్తం నిండి పోయింది.
ఆ తర్వాత తీరిగ్గా సామాను ప్యాకింగు విప్పి చూసుకుంటే మూడో వంతు సామాను గాయబ్. ఇందుకా అవసరం వున్నా లేకపోయినా బ్యాంక్ చలాన్ తీసుకుని రమ్మని నన్ను బయటకు పంపడంలో ఆంతర్యం.
మాస్కో నుంచి వచ్చే వారిలో వారు పట్టుకునే సామాగ్రి లేకపోయినా ఖరీదైన గ్లాస్ వేర్ వుంటుందని పోర్టళ్ళకు తెలుసల్లె వుంది. మాస్కోలో రూపాయి ఖరీదు చేయని వస్తువు కూడా ఇండియాలో వేలు పలుకుతుంది (ట). ముఖ్యంగా చెకొస్లవేకియా కట్ గ్ల్లాసులు, రష్యన్ నీలిరంగు పింగాణీ వస్తువులు. నిజానికి ఈ సంగతి మాకు కూడా తెలియదు. ఆ విధంగా బంధువులకు కానుకలుగా తెచ్చిన వస్తువులు అన్నీ మద్రాసు పోర్టర్ల పరమయ్యాయి. వాళ్ళు చేసిన బ్యాడ్ ప్యాకింగ్ నిర్వాకం కారణంగా మరికొన్ని వస్తువులు దెబ్బతిన్నాయి. వెంట మా వాడిని తోడు తీసుకుని వెళ్లి వుంటే మద్రాసు పోర్టర్లకు ఈ చేతివాటం అవకాశం చిక్కేది కాదేమో!
దుర్గానగర్ లోని మా ఇంటి సందు మొదట్లో ఓ గుడిసెలో కాపురం ఉంటున్న యాదమ్మ మా ఇంట్లో పనికి కుదిరింది. మొగుడు మల్లయ్యకు సొంత ఆటో వుంది. ఆ బండే వీరి బతుకు బండికి ఆధారం.
ఈ తిరుమల అనే అమ్మాయి యాదమ్మ, మల్లయ్యల కడసారి కుమార్తె. ఆ దంపతులకు అందరూ ఆడపిల్లలే. కళ, భాగ్య, సంపూర్ణ, తిరుమల అందరూ మా ఇంట్లోనే దాదాపు పెరిగారు. బిడ్డల్ని వెంటేసుకుని యాదమ్మ పనికి వచ్చేది. వీళ్ళు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేవరకు మా ఇంట్లోనే పనిపాటులు చూస్తుండేవారు. కాలక్రమంలో మేము అనేక ఇళ్ళు మారుతూ వచ్చినా ఆ కుటుంబం మాత్రం మమ్మల్ని వదిలిపెట్టలేదు.
కళకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుడితే వారిద్దరికీ మా పిల్లల పేర్లే సందీప్, సంతోష్ అని పెట్టుకుంది. సందీప్ ప్రభుత్వ పాఠశాలలో చేరి మంచి మార్కులు తెచ్చుకుంటూ, బాగా చదువుకుంటున్న అతడికి ఒఅ ఏడాది తెలంగాణా ప్రభుత్వం పదిహేను వేల రూపాయల స్కాలర్ షిప్ కూడా ఇచ్చింది.
మరో అమ్మాయి కుమార్తెకు మంచి సంబంధం దొరికింది. ఆ అబ్బాయికి ఏదో మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం. నలభయ్ లక్షలు పెట్టి ఫ్లాటు కొనుక్కుని ఆ గృహ ప్రవేశానికి మమ్మల్ని కూడా పిలిచారు.
మా ఇంట్లో పారాడుతూ పెరిగిన తిరుమలమ్మకు కూడా పెళ్లయింది. కూకట్ పల్లిలో ప్రభుత్వం కేటాయించిన ఫ్లాటులో వుంటున్నారు. మొగుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు.
‘నువ్వేం చేస్తున్నావ’ని అడిగితే, ‘నేనిప్పుడు పూర్తిగా హౌస్ వైఫ్. ఇంట్లోనే వుండి నా పిల్లల మంచీచెడూ చూసుకుంటున్నాను’ అంది నవ్వుతూ.
పెద్ద ఆశలు పెట్టుకోకుండా పిల్లల్ని పెంచిన మల్లయ్య దంపతుల ఆశలపై వాళ్ళు నమ్ముకున్న యాదాద్రి నరసింహుడు నీళ్ళు చల్లలేదు. సరికదా, వారిని చల్లగా చూస్తున్నాడు. శుభం!
కింది ఫోటో:
2018 లో తిరుమలమ్మ మా ఇంటికి వచ్చినప్పుడు మా ఆవిడ నిర్మలతో తీసిన ఫోటో. మరుసటి ఏడాది తాను ఏ ఫోటోలో పడని దూరతీరాలకు తరలిపోయింది.



(ఇంకావుంది)

21, అక్టోబర్ 2025, మంగళవారం

హైదరాబాదు ప్రెస్ క్లబ్ ఎన్నికలు – భండారు శ్రీనివాసరావు

 

ఈసారి హైదరాబాదు ప్రెస్ క్లబ్ ఎన్నికలు రేపుతున్న దుమారం మామూలుగా లేదు, టీవీ ఛానల్స్ లో చర్చలు మినహాయిస్తే.
ఈ ఎన్నికలు, పెద్ద పెద్ద క్లబ్ ల ఎన్నికలను తలపిస్తున్నాయి అంటే ఆశ్చర్యం లేదు. ఫేస్ బుక్ వేదికగా, వాట్సప్ గ్రూపుల ద్వారా సాగుతున్న ప్రచారం కొత్త పుంతలు తొక్కుతోంది. ఈ స్థాయిలో ప్రచారం జరిగినప్పుడు ఓ స్థాయిలో ఉద్రేకాలు ప్రబలడంలో ఆశ్చర్యం లేదు.
హైదరాబాదు ప్రెస్ క్లబ్ ఆవిర్భావం గురించి మిత్రుడు బుద్ధవరపు రామకృష్ణ Ramakrishna Buddhavarapu ఇప్పటికే చక్కటి సవివరమైన పోస్టులు పెట్టాడు.
గతంలో నేను ఒకసారి క్లబ్ కార్యదర్శిగా ఎన్నికయ్యాను. మరోసారి ఓడిపోయాను.
గెలిపించింది నా క్లబ్ కుటుంబసభ్యులే. ఓడించింది ఆ కుటుంబ సభ్యులే. కాబట్టి ఆ జయాపజయాలను నేను ప్రతిష్టగా తీసుకోలేదు. హాయిగా అప్పుడప్పుడూ క్లబ్ కి వెళ్లి వస్తూనే వున్నాను. అందర్నీ పలకరిస్తున్నాను. వాళ్ళూ నేనంటే అంతే ఆప్యాయంగా, కొండొకచో గౌరవంగా కూడా వుంటున్నారు.
కావున నా మనవి, నా సలహా ఏమిటంటే అందరూ కలిసి వుండండి. అందర్నీ కలుపుకు పొండి. పదవుల్లో ఎవరు వున్నా, క్లబ్ అందరిదీ అనుకుంటే నాలుగు మంచి పనులు చేసి చూపించడానికి గొప్ప అవకాశం లభిస్తుంది.
జర్నలిష్టులకు వృత్తి రీత్యా రాజకీయ వాసనలు తప్పనిసరి. వాటిని క్లబ్ బయటే ఒదిలి లోపలకి వస్తే ఏ చిక్కూ ఉండదు.
గొప్ప క్లబ్ లో సభ్యులం అని నలుగురూ చెప్పుకుంటుంటే వినాలని కోరుకుందాం. ఆ గొప్పతనంలో వున్న మధురిమను అందరం ఆస్వాదిద్దాం.
మరో అయిదు రోజుల్లో అంటే ఈ నెల 26న ఎన్నికలు. అంటే ఆ రోజు ఈ సరికల్లా ఫలితాలు తెలుస్తాయి. హైదరాబాద్ ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏర్పాటవుతుంది.
ఈ ఎన్నికల్లో కొందరు గెలుస్తారు. వారికి అభినందనలు తెలుపుదాం. ఎన్నికలు కదా! పోటీ చేసిన అందరూ గెలవరు. ఓడిన వాళ్లకు గెలిచిన వాళ్ళు కూడా అభినందనలు తెలిపితే హుందాగా వుంటుంది. వాళ్లకు భవిష్యత్తులో అవకాశం రావచ్చు. ఇవే ఆఖరి ఎన్నికలు కావు కదా!
(21-10-2025)