29, జనవరి 2021, శుక్రవారం

సెంఛురీ దాటిన పెట్రోలు ధర – భండారు శ్రీనివాసరావు

 

 

పెట్రోలుకు మండే గుణం వుంది. గులాబీ సువాసన గులాబీ ముల్లుకు అంటినట్టు ఈ మండే గుణం పెట్రోలుతో పాటు దాని ధరకు కూడా అబ్బింది. అందుకే  పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా పెట్రో మంటలు అని మీడియాలో చమత్కరిస్తుంటారు.

పెట్రోలు ధర వంద రూపాయలు దాటిందని ఓ వార్త చక్కర్లు కొడుతోంది. ఇంకా పెరగడానికి అవకాశం ఉన్న నిత్యావసర వస్తువుల్లో ఇదొకటి. అంచేత ఆశ్చర్యం అనిపించలేదు.

పెట్రో ధరలు పెరిగినప్పుడల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని విమర్శించడం పరిపాటి. నిజానికి ఈ ధరవరల వ్యవహారం ప్రభుత్వం చేతిలో లేకపోయినా ఆ నింద మోయక తప్పదు. ఎందుకంటే ఎంత చేతిలో లేని సంగతి అయినా, ప్రభుత్వం తలచుకోకుండా ఇలాంటివి జరగవు అని స్కూల్లో చదివే పిల్లాడు కూడా చెబుతాడు.

గతంలో ప్రభుత్వాలు ఈ విమర్శలు ఎదుర్కున్నాయి. ఇప్పటి ప్రభుత్వానికీ తప్పని తల నొపప్పే.

ఈ విమర్శకులు సాధారణంగా తమ వాదనకు మద్దతుగా చెప్పే విషయం ఒకటుంది. అది క్రమంగా ఓ పడికట్టు పదంగా మారిపోయింది. అదేమిటంటే అంతర్జాతీయ చమురు ధరలు, తగ్గుతున్నప్పుడు, లేదా మనం దిగుమతి చేసుకుంటున్న ముడి చమురు ధరలు పడిపోతున్నప్పుడు, పెట్రో ధరలు ఎందుకు పెరుగుతున్నాయి ఎలా పెరుగుతున్నాయి? ఎవరూ వంక పెట్టడానికి వీల్లేని వాదన.

ఒకానొక కాలంలో (అప్పటికే ఈ ఆటోమేటిక్ ధరవరల విధానం అమల్లోకి వచ్చింది, ఇదేమీ కొత్త విషయం  కాదు) అంటే నేను రేడియోలో విలేకరిగా పనిచేస్తున్నప్పుడే నేనూ ఇలాంటి వాదన నెత్తికెత్తుకుని పెట్రోలియం శాఖలో పనిచేసే ఓ ఉన్నతాధికారిని అడిగాను.

ఆయన ఏం చెప్పారు అంటే:

“దేశం ఇప్పుడు పెట్రో ఉత్పత్తుల స్వయం సమృద్ధి సాదా దిశలో వెడుతోంది. ముడి చమురు వెలికి తీయడానికి, దాన్ని శుద్ది చేయడానికీ ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నాయి. ఈ పెంచిన ధరల్లో కొంత మొత్తాన్ని ఆ కార్యక్రమాలకు వెచ్చిస్తున్నారు. ఒక్కసారి ఈ లక్ష్యం నెరవేరితే ఇక దిగుమతుల భారం లక్షల కొట్లలో తగ్గే అవకాశం వుంటుంది”

అంటే అప్పటిదాకా ప్రజలు ఈ పెంచిన ధరలు భరిస్తూ కొంత త్యాగం చేయాల్సి వుంటుంది.

‘బాగానే వుంది మీరు చెప్పిన సంగతి. కానీ భారతీయ పెట్రో సంస్థలు వ్యయ నియంత్రణ పాటిస్తున్నట్టు కనపడదు. పలానా బ్రాండు చమురు (వాహనాల్లో వాడేది) కొనండి అని పత్రికల్లో, మీడియాలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇస్తుంటారు. ఆ ఖర్చు అవసరమా! ఏ ప్రచారం లేకపోయినా, అవసరానికి  కొనే ఉత్పత్తులు అవి. ఇది సరే! ఇంత పేద దేశంలో ఇన్ని రకాల ప్రభుత్వ సంస్థలు అవసరమా! చైర్మన్లు, మేనేజింగ్ డైరెక్టర్లు, డైరెక్టర్లు సిబ్బంది, ఇవన్నీ వ్యయాన్ని పెంచేవే కదా!’

ఆ అధికారి నుంచి మందహాసం తప్ప సమాధానం లేకపోవడంతో నేను కాస్త రెచ్చిపోయాను.

‘పెట్రోలు బ్యాంకుల ఆధునీకరణ పేరుతొ చాలా డబ్బులు ఖర్చు చేస్తున్నారు. చైర్మన్లు మారినప్పుడల్లా లోగోలు దేశ వ్యాప్తంగా మారుస్తున్నారు. ఇవన్నీ అవసరమా! పెట్రో ధరలు పెంచడానికి ఇలాంటి అనవసరపు ఖర్చులు కారణం అని ఎవరైనా అనుకుంటే తప్పు పట్టగలరా”

సరే! ఆయన మాత్రం ఏం చెప్పగలరు?  

పదేళ్ల క్రితం అంటే 2010 లో ఒక పత్రికలో వచ్చిన నా వ్యాసంలో పేర్కొన్న మరికొన్ని విషయాలు. 

పెట్రో ధరలు మరోసారి పెరిగాయి. కాదు పెంచారు. వడ్డన కూడా కొంత భారీగానే వుంది.ఒక్క పెట్రోలుతో సరిపెట్టకుండా, పనిలో పనిగా డీసెలు, కిరోసిన్, గ్యాస్ ధరలను కూడా ఒకేసారి పెంచి అనేకసార్లు ఆందోళనలకు దిగే పని లేకుండా ప్రతిపక్షాలకు కొంత వెసులుబాటు కల్పించారు. టీవీ ఛానల్లకే కొంత నిరాశ. పలుమార్లు చర్చలకు అవకాశం లేకుండా పోయింది. ఈ ధరల పెరుగుదల ఈ నాలుగింటితో ఆగిపోదు, ఈ ప్రభావం పలురంగాలపై పడుతుందన్నది అందరికి తెలిసిందే. ఏతావాతా సామాన్యుడి జీవితం, అలాగే అదనపు ఆదాయానికి ఏమాత్రం అవకాశంలేని స్తిర వేతన జీవుల జీవితం అస్తవ్యస్తమవుతాయి. అసలు ఆదాయాలే ఎరుగని నిరుపేదలకు ఈ ధరల పెరుగుదల గొడవే పట్టదు. పొతే, ఈ విషయంపై హోరాహోరి చర్చలు జరిపిన వాళ్ళు, తమ తమ పార్టీల విధానాలకు అనుగుణంగా విమర్శలు, ప్రతివిమర్శలు చేసినవాళ్ళు యధావిధిగా టీవీ స్తుడియోలకు ఏసీ కార్లలో వెళ్ళివస్తుంటారు. ధర్నాలు, రాస్తా రోఖోలు ఎటూ తప్పవు. ధరల పెరుగుదలతో వాస్తవంగా దెబ్బతినే కష్ట జీవులను ఈ ఆందోళనలు మరింత కష్టపెడతాయి. కానీ, ఇది ఎవరికీ పట్టదు.

 

ధరలు పెంచినప్పుడల్లా ప్రభుత్వం తను చెప్పాల్సిన లెక్కలు చెబుతుంది. ఎందుకు పెంచాల్సి వచ్చిందో, ఏ పరిస్థితుల్లో పెంచాల్సి వచ్చిందో వివరిస్తుంది. దరిమిలా, పాలక పక్షానికి చెందిన ప్రతినిధులు టీవీ తెరలపై వాలిపోయి, ఇప్పుడు ఇలా అడ్డగోలుగా విమర్శిస్తున్న ప్రతిపక్షాలు అధికారంలో వున్నప్పుడు ఎన్నిసార్లు పెంచిందీ, యెంత ఎక్కువగా పెంచిందీ గణాంకాలతో సహా వివరించి వారి నిర్వాకాన్ని ఎండగట్టడం ఆనవాయితీగా మారింది. విపక్షాలు కూడా ఇదే అదనని, ఎడ్ల బళ్ళు, రిక్షా బళ్ళు ఎక్కి వూరేగింపులు నిర్వహిస్తూ తమ నిరసనను ఒకటి రెండు రోజుల్లో ముగిస్తారు. ఏనాడూ మార్కెట్ కు వెళ్ళి కూరగాయలు, వెచ్చాలు కొనని ఆడంగులు కొందరు బుల్లి తెరలపై ప్రత్యక్షమై, ‘ఏమీ తినేట్టు లేదు-ఏమీ కొనేట్టులేదుఅంటూ సన్నాయి నొక్కులు నొక్కుతారు. పెట్రోలు బంకుల దగ్గర టీవీ చానళ్ళకు ఇంటర్వ్యూ లు ఇచ్చేవాళ్ళు ఇదే ఆఖరుసారి బైకు పై తిరగడంఅన్న తరహాలో మాట్లాడుతారు. ఆటోవాళ్ళు మాత్రం ఇదేమీ పట్టించుకోరు. ప్రయాణీకుల ముక్కు పిండి, పెరిగిన ధరలకు రెండింతలు చార్జీలు వసూలు చేస్తారు.

 

ధరలు పెరిగినప్పుడల్లా ఇదే తంతు. తెల్లారితే మళ్ళీ అన్ని వాహనాలు రోడ్లమీదే. ట్రాఫిక్ జాములు మామూలే. ప్రత్యక్షంగా భారం పడ్డవాళ్ళు పది రోజుల్లో మరచిపోయి మామూలుగా మనుగడ సాగిస్తుంటారు. పరోక్షంగా భారం పడ్డవాళ్ళు మౌనంగా భరిస్తుంటారు. ప్రతిదీ రాజకీయం చేసేవాళ్ళు ప్రజలభారం అంతా మోస్తున్నట్టు నటిస్తుంటారు. పెంచి కూర్చున్న సర్కారువారు మాత్రం అంతా అదే సర్దుకు పోతుందిలే అన్న నిర్వికార ధోరణి ప్రదర్శిస్తూవుంటారు.

 

ఇదంతా ఎందుకు జరుగుతోంది ?

 

మన చేతుల్లో వున్నదాన్ని పక్కవాళ్ళ చేతుల్లోపెట్టి బాధ్యత నుంచి తప్పించుకోవాలనుకోవడంవల్ల.

 

వున్న దానితో సర్దుకుపోవడం మాత్రమె కాకుండా ఎంతో కొంత వెనకేసుకునే పాత తరం నుంచి, వున్నదంతా ఖర్చుచేసుకుంటూ జల్సాగా బతకాలనే మరో తరం నుంచి, ఖర్చులకు తగ్గట్టుగా సంపాదన పెంచుకోవాలనే ఇంకో తరం నుంచి, అలా పెంచుకోవడానికి అడ్డదారులతో సహా ఏ దారయినా సరయిన దారే అని అనుకునే ప్రస్తుత తరం దాకా విషయాలను విశ్లేషించుకోగలిగినవారికి ఇదేమంత వింతగా తోచదు. అమ్మేటప్పుడు ధర పలకాలి, కొనేటప్పుడు చవుకగా దొరకాలి అనే తత్వం నుంచి బయటపడగాలి. ధరలన్నీ చుక్కలు తాకుతున్నాయి, ఎగష్ట్రా ఇవ్వకపోతే యెట్లా అనే ఆటో డ్రైవర్ సిటీ బస్సుల స్ట్రయిక్ అనగానే చార్జీలు అమాంతం పెంచడం అందరికీ తెలిసిందే. అంటే, అవకాశం దొరికితే ఏదో ఒక విధంగా డబ్బు సంపాదించడం తప్పుకాదనే ధోరణి ప్రబలుతోంది. ఇది సమాజం లోని అన్ని వర్గాలకు వర్తిస్తుంది, కాణీకి టిఖానా లేని దరిద్రనారాయణులకు తప్ప. (25-06-2010)

 

1 కామెంట్‌:

Zilebi చెప్పారు...


సందులో సడే మియా అని‌ రుపీ డాలర్ తో గట్టి పడి పోతోంది. ౬౩ రూపాయలకు వెళ్తుందంట ఓ డాలరు పాపం :) అప్పుడు పెట్రో ధరలెట్లా వుంటాయో :)

There is a uniform jack up of price raise across every thing around 20% already since covid opening up. One may not get surprised if it goes to 30 to 40% raise too ?

ఏమంటారు ?


జిలేబి

జిలేబి