19, జనవరి 2021, మంగళవారం

పీవీ హయాంలోనే వైఎస్ కి తప్పిపోయిన సీఎం ఛాన్స్

 విప్లవ తపస్వి పీవీ : రచన : శ్రీ ఏ. కృష్ణారావు    

సమీక్ష తొమ్మిదో భాగం : భండారు శ్రీనివాసరావు

 

“ఏం సార్! కోట్ల బదులు వైఎస్ ని ముఖ్యమంత్రిని చేసుంటే బాగుండేది కదా! ఆంధ్రప్రదేశ్ లో కూడా మిమ్మల్ని గెలిపించేవారు కదా!”

పీవీ ప్రధాన మంత్రి పదవి నుంచి తప్పుకున్న తరువాత రచయిత కృష్ణారావు మాజీ ప్రధాని పీవీని అడిగారు.

“వైఎస్ కు నాయకత్వ లక్షణాలు ఉన్నమాట నిజమే! కానీ కోట్ల నామీద పూర్తి ఒత్తిడి తెచ్చారు” అని పీవీ బదులిచ్చారు.

అంతే కాదు, మరో మాట అన్నారు, ‘మీడియా కూడా కోట్లకు ఉపయోగపడింది’ అని.

ఆ మాట వినేసరికి నేను దిగ్భ్రాంతి చెందాను అని కృష్ణారావు రాసుకున్నారు. ఎందుకంటే పీవీ ప్రస్తావించిన మీడియాలో ఆయన కూడా భాగం కనుక.

ఈవిషయమై రచయిత ఇంకా కొంత వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు.

“నీవు తరచూ కోట్లని కలుస్తూ వుండు. ఆయన చెప్పిందిరాయి...” అని ఉదయం దినపత్రికలో మా చైర్మన్ మాగుంట సుబ్బిరామిరెడ్డి చెప్పేవారు. కోట్ల అప్పుడు కేంద్రంలో న్యాయశాఖ మంత్రిగా వుండేవారు.

“కోట్లని కలిసినప్పుడు తనపై బాగా ఒత్తిడి వస్తోందని, పార్టీ నేతలంతా తానే  ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారని చెప్పేవారు. దీనితో నేను ‘కోట్లపై పెరుగుతున్న ఒత్తిడి అని వార్త రాస్తే దాన్ని ఉదయంలో పతాక శీర్షికలో ప్రచురించారు. ఆ వార్తను కోట్ల విజయభాస్కరరెడ్డి  ప్రధాని పీవీకి చూపించి ప్రభావితం చేశారని అంటారు.

“నిజానికి ఆ సమయంలో యువనేత అయిన వైఎస్ రాజశేఖర రెడ్డి తనను ముఖ్యమంత్రి చేస్తారు అనే నమ్మకంతో వుండేవారు. ద్రోణంరాజు సత్యనారాయణ, కొణతాల రామకృష్ణ, కణితి విశ్వనాధం వైఎస్ కు మద్దతు.

“ఒక దశలో ప్రధాని పీవీ,  వైఎస్ కు అనుకూలం అన్నట్టు సంకేతాలు అందాయి. ఒకరోజు ఆయన పీవీని కలిసి సంతోషంగా తన నివాసానికి తిరిగివచ్చారు. నేను వైఎస్ కు ఎదురుపడి, ఏం జరిగిందని అడిగాను. ’పరిస్తితులు తనకు అనుకూలంగా వున్నాయని, తాను దాదాపు సీ ఎం అయినట్టే’ అని సంతోషంగా చెప్పారు.

“అయితే తర్వాత  పరిస్థితి మారిపోయింది. కోట్ల, నేదురుమల్లి వర్గాలు ఏకమయ్యాయి. ఎమ్మెల్యేలలో అత్యధికులు వైఎస్ కు అనుకూలంగా ఉన్నప్పటికీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు.

“ఒక రోజు వైఎస్ ఢిల్లీ వచ్చారని తెలిసి ఫోన్ చేశాను. ఆయన ‘చెప్పు కృష్ణారావ్’ అన్నారు. పీసీసీ మార్పు గురించి అడిగాను. ‘నన్నెందుకు అడుగుతావయ్యా! ఆ లంబూని (ఆరడుగులవాడు) అడుగు అని కోట్లని పరోక్షంగా విమర్శించారు.

‘ఆరడుగులవాడినే అడగండి అని హెడ్డింగ్ పెట్టి వైఎస్ అన్న మాటలు గురించి రాశాను. ఇది కోట్ల, వైఎస్ నడుమ మరింత ఘర్షణకు దారి తీసింది. ఆ వార్త రాసినందుకు వైఎస్ కు నా మీద ఆగ్రహం కలిగినట్టు తెలిసింది. ‘నువ్వు వైఎస్ కి కొన్ని రోజులు కనపడకపోవడమే మంచిది అని ద్రోణంరాజు నాకు సలహా ఇచ్చారు కూడా.

“ఒకరోజు నేను ద్రోణంరాజు సత్యనారాయణతో మాట్లాడుతున్న  సమయంలో వైఎస్  ధవళ వస్త్రధారి అయి పెళ పెళలాడుతూ వచ్చారు. ఆయన రాక గమనిస్తూనే ద్రోణం నా భుజం పై చేయి వేశారు. ద్రోణంతో  నాకు సాన్నిహిత్యం వుందని తెలిసి వైఎస్ మెత్తపడ్డారు. అయినా, ‘ఏం కృష్ణారావ్ ఏమిటా వార్త అలా రాయొచ్చా’ అని ఆగ్రహంగా అడిగారు. ‘నీవు హీరోవి రాజా! చూడు ! ఆ వార్త నీకెంత ప్రాధాన్యత పెంచిందో అని ద్రోణంరాజు నన్ను సమర్థించారు. ‘చరిత్రలో కొన్ని రికార్డు చేయడం అవసరం అని నేను అనేసరికి వైఎస్ గట్టిగా నవ్వేసారు.

(ఇంకావుంది)                   

 

1 కామెంట్‌:

శ్యామలీయం చెప్పారు...

మీరు చంద్రబాబునాయుడు కారణంగా వైఎస్‌కి తప్పిపోయిన సీఎం ఛాన్స్ అని అనలేదు కాబట్టి ప్రస్తుతానికి ఆయన బ్రతికిపోయినట్లే.

అదేమిటీ అప్పట్లో చంద్రబాబు ఇంకా రంగంలో లేడూ అనో ఆయన వైయస్‌కి మిత్రుడు కదా అనో అన్నా, భవిష్యద్దర్శనం చేసుకొని వైరబుధ్ధితో బాబుగారు అలా చేసే ఉంటారు అని అనటం‌ అసాధ్యం కాదు.

చరిత్రలో ఫెరిస్తా అనే వాడు కృష్నదేవరాయలు ఫలానా బహమనీసుల్తానుకు ఓడి పారిపోయాడూ అంటూ వ్రాస్తే మనవాళ్ళు ముందు కళ్ళకద్దుకొని ప్రమాణంగా తీసుకున్నారట ముందు. కాని ఆ సంఘటనను పరిశీలించి అబ్బే రాయలు ఇంకో నూట ఇరవైయ్యేళ్ళకు కాని పుట్టలేదుగా పుట్టనివాడు ఓదిపోవటం పారిపోవటం ఎలాగూ‌ అని బాగా ఆలోచించి ఫెరిస్తాగారి సదరు కథనాన్ని బుట్టదాఖలు చేసారట. ఈ విషయం కొమఱ్ఱాజు లక్ష్మణరావు పంతులుగారి 'మహమ్మదీయ మహాయుగము' అబే చరిత్రగ్రంథంలో ఉంది. కాబట్టి కాలంతో పనిలేకుండా ఈపాపం బాబుగారి నెత్తిన వేస్తారా ఏమిటీ అనిపించింది లెండి.