3, నవంబర్ 2020, మంగళవారం

ఆధార్ విషయంలో అక్కడ లేని అభ్యంతరం ఇక్కడెందుకు?

 కొన్నేళ్ళ క్రితం (అప్పటికి  రాష్ట్రం విడిపోలేదు) నేను అమెరికా వెళ్లాను. మా అబ్బాయికి తెలిసిన తెలుగువాళ్లు అక్కడే ఇళ్ళూ ఆస్తులూ కొనుక్కుంటున్నారు. హైదరాబాదులోనో లేదా తెలిసిన వేరే ఏదైనా ప్రాంతంలోనో కొనుక్కోవచ్చు కదా అని అడిగాను.

‘అదీ అయింది. మళ్ళీ జన్మలో మన దగ్గర ఇల్లు, ఆస్తి కొనకూడదని అనిపించే అనుభవం అయింది. లక్షలు పోసి కొన్నాము.  కొని రిజిస్టర్  చేయించుకుని అమెరికా తిరిగి వచ్చే రోజున ఆ స్థలం మాదంటూ ఎవరో లాయర్ నోటీసు పంపారు. అక్కడ వుండి పరిష్కారం  చేసే వ్యవధానం లేదు. చివరికి వాళ్ళు అడిగిన డబ్బిచ్చి పనిచేయించుకున్నాము. కానీ ఇప్పటికీ ఏదో ఒక లిటిగేషన్. ఇక అది మాది కాదు అనుకుని వదిలేసాము. అదే ఇక్కడ చూడండి. నెట్లో చూసి వేరే ఎక్కడో రాష్ట్రంలో అపార్ట్ మెంటు కొన్నాము. అంతా ఆన్ లైన్లోనే పని అయిపొయింది. ఏదైనా ఇక్కడ నమ్మకంగా పనులు అవుతాయి. కిరికిరి వ్యవహారాలు, లిటిగేషన్లు వుండవు అని భగవద్గీత చెప్పాడాయన.

మరో మాట కూడా అన్నాడు. ‘ఇక్కడిలాగా మనదగ్గర కూడా నమ్మకంగా ఆస్తులు కొనగలమనే ధీమా మన ప్రభుత్వాలు ఇస్తే ఇక్కడ ఎవ్వరూ ఆస్తులు కొనరు, అక్కడే ఇన్వెస్ట్  చేస్తారు

మళ్ళీ ఇన్నాల్టికి తెలంగాణా ప్రభుత్వం ధరణి పోర్టల్ రూపొందించి అలాంటి భరోసా ఇద్దామనే ప్రయత్నం చేస్తోంది. ఈలోగా ఎవరో కోర్టు కెక్కారు.

ఆధార్ కోసం వత్తిడి  చేయవద్దని ఆర్డరు వేశారు అంటున్నారు. వ్యక్తిగత వివరాలు బహిరంగం కాకూడదట. మరి తిరుపతి వంటి పుణ్య క్షేత్రాలకు వెళ్ళినప్పుడు బాజాప్తాగా ఆధార్ జిరాక్స్ అడిగి తీసుకుంటున్నారు. ఎయిర్ పోర్టుల్లో ఇస్తున్నాము. అక్కడ  లేని అభ్యంతరం ఇక్కడ ఎందుకు?

ఇదంతా చూస్తుంటే రియల్ ఎస్టేట్ మాఫియా ఎంతటి బలవత్తరమైనదో అర్ధం అవుతోంది.

(నాకు లీగల్ విషయాల్లో  పరిజ్ఞానం అంతగా లేదు. నాకు సొంతంగా  ఇళ్ళూ వాకిలి అంటూ లేవు.  నేను రాసింది కేవలం పౌరుల కోణం నుంచే)    


1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

అవును చాల ఆశ్చర్యం . నిజంగా ఇది చాల మంచి ఉద్దేశ్యం . అన్ని ఒక కొలిక్కి వస్తాయి , భవిష్యత్తు లో ఒక్క గొడవ కూడా రాదు . అసలు కోర్ట్ ఈ విషయం లో అభ్యంతరం చెప్తుంది అనుకోలేదు . భూమి రిజిస్టర్ చేసేటప్పుడు ఆధార్ ఇవ్వాలి ( అనుకుంటున్నా ). ఇక్కడ ఆధార్ ఎందుకు ఇవ్వకూడదో అర్ధం కావడం లేదు . సమస్తం ఆధార్ మీద నడుస్తుంది , ఇక్కడ మాత్రం కాదు . వ్యవసాయేతర ఆస్తులు వద్దంట , అంటే బ్లాక్ మనీ అంత ఇప్పుడు అపార్ట్మెంట్ లు , ఇళ్ళు కి వెళ్ళిపోతుంది . సామాన్యుడు కి ఏ అభ్యంతరం లేదు , తను నిజాయితీ గా ఉండాలని అనుకుంటాడు . తెలంగాణ జనాభా లో కేవలం పది శాతం ( ??? ) ఉన్న కోటీశ్వరులు , ఎన్ని కోట్లు ఖర్చుబెట్టారో ??