2, మే 2017, మంగళవారం

పీ ఎల్ 480 – ఓ పాత జ్ఞాపకం

అరవైయేళ్ళ క్రితం వార్తాపత్రికలు చదివే అలవాటు ఉన్న వారికి పీ ఎల్ 480 అనే పదంతో పరిచయం వుండేవుంటుంది. Public Law 480 అనే ఈ పధకం అమెరికన్ ప్రభుత్వానికి సంబంధించింది. 1954లో అప్పటి ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్ హయాములో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. వ్యవసాయ, వాణిజ్య అభివృద్ధి కోసం ఉద్దేశించిన ఈ పధకానికి 1961లో ప్రెసిడెంట్ జే.ఎఫ్. కెనెడీ, శాంతికోసం ఆహారం (Food for Peace) అనే కొత్త పేరు పెట్టారు.

ఆ రోజుల్లో అమెరికా నుంచి ఈ పధకం కింద దిగుమతి చేసుకున్న గోధుమలు, పాలపొడిని ఉచితంగా స్కూలు పిల్లలకు, గ్రామీణ పేదలకు పంపిణీ చేసేవారు. వీటిని కొందరు దళారీలు నల్ల బజారుకు తరలించి లక్షలు అక్రమంగా సంపాదించారు. కొందరు ఆ డబ్బుతో రాజకీయ రంగప్రవేశం చేసి అంచలంచెలుగా పైకి ఎదిగారు.
అమెరికా సదుద్దేశ్యంతో మొదలు పెట్టిన ఈ పధకం వల్ల నిజమైన లబ్ధిదారులకు ఏం ప్రయోజనం జరిగిందో లెక్కలు లేవు కాని, లాభం పొందాలని ప్రయత్నించినవారికి మాత్రం ఏమాత్రం నష్టం జరగలేదు.

ఆ రోజుల్లో మరో విషయం వింతగా చెప్పుకునేవారు. అమెరికాలో ధాన్యం దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన సందర్భాలలో ధరలు పడిపోయి రైతులు నష్టపోకుండా,  గోధుమలను ఓడల్లో నింపి నడిసముద్రంలో పారబోసేవారని, ఇంకా మిగులు వుంటే ఇలా ఇటువంటి పధకాలతో పేద దేశాలకు సరఫరా చేసేవారని వార్తలు ప్రచారంలో ఉండేవి.      

7 కామెంట్‌లు:

శ్యామలీయం చెప్పారు...

కాంగ్రెస్ గడ్డి అనే కలుపుమొక్క కూడా భారతదేశంలోనికి ఈ పి.యల్. 480 పధకం గోధుమలతో పాటే దిగుమతి ఐనదని కూడా అంటారు.

భండారు శ్రీనివాసరావు చెప్పారు...

@శ్యామలీయం : అవునండీ నేనూ విన్నాను. కాంగ్రెస్ గడ్డి, కాంగ్రెస్ ముళ్ళ కంప అలా పిలిచేవాళ్ళు. ఒకచోట పీకి పారేస్తే, పారేసిన చోట మళ్ళీ మొలిచేది.

Arun చెప్పారు...

సదరు కాంగ్రెస్ గడ్డి/స్థానికులు పిలిచే క్రాబ్ గ్రాస్ ఇంకా మా దుంప తెంచుతూనే ఉందండి అమెరికాలో. మోన్ శాంటో వాడి రౌండప్ చల్లితే కానీ అది చావదంట, మాకేమో అది పిల్లలకి, పెద్దలకి, పర్యావరణానికి, ఇతర మొక్కలకి, పెంపుడు జంతువులకి హాని చేస్తుందని వాడటం ఇష్టం లేదు.

sarma చెప్పారు...

కాంగ్రెస్ గడ్డి అసలు పేరు పార్థీనియం, ప్రమాదకర కలుపుమొక్క,దీనికి చావులేదు. దీనిపైనుండి వచ్చేగాలికే అనారోగ్యంపాలవుతారు. మేక ఆకు ఏది కనపడినా మేస్తుంది. ”మేక మెయ్యని మొక్క” అనేది ఉంది, దానిని మందుగా వాడతాము. ఈ పార్థీనియం దరిదాపుల్లోకి కూడా మ్,ఏక చేరదు. ఈ శతాబ్దంలో అమెరికా పేద దేశాలకిచ్చిన గొప్ప బహుమతి :(

Jai Gottimukkala చెప్పారు...

ముందుగా సహావ్యాఖ్యాతలు శ్యామలీయం, అరుణ్ & శర్మ గార్లకు ధన్యవాదాలు. మీతో ఏకీభవిస్తూనే మరికొంత లోతుగా నా అభిప్రాయం రాస్తున్నాను.

"కాంగ్రెస్ కలుపు" అన్నది పీఎల్ 480 యొక్క అనుబంధ ఉత్పత్తే, ఈ రెంటినీ వేరు చేసి చూడలేము.

ఈ శతాబ్దంలో అమెరికా మనకు & ఇతర "పేద" దేశాలకు ఇచ్చిన "బహుమతులలో" అతి పెద్దది & ముఖ్యమయినది "సహాయం" (foreign aid). ఇదే ముసుగులో ఆయుధాలను ఇచ్చి మనం కొట్టుకొని చస్తుంటే లాభాలను దండుకున్నారు.

"హరిత విప్లవం" అనబడ్డ ప్రక్రియ పీఎల్ 480 లాంటి పథకాలకు కొనహాయింపు. వందలాది ఏళ్ళుగా ప్రజలకు ఆహారం & రైతుకు రాబడి ఇస్తూ వచ్చిన భారత సంప్రదాయ వ్యవసాయానికి స్వస్తి చెప్పడంతో కలిగిన అనర్ధాలు ఎన్నెన్నో. ఏకోపయోగ విత్తనాలు, కృత్రిమ రసాయన ఎరువులు, సంకుచిత జన్యు విస్తరణ & సాగు నీటి దుబారా వల్ల భూసారం మంట కలిసింది, బక్కరైతులు వలస కూలీలయ్యారు. ధాన్యాన్ని పశుగ్రాసాన్ని ఒకవైపు పంటను పశువులను మరోవైపు వేరు చేయడం అనేక కులవృత్తులను ధ్వంసం చేయడమే కాక పశువులను కబేళాలకు మళ్లించింది.

హై హై నాయకా చెప్పారు...

మీతో నూటికి నూటయాభై శాతం ఏకీభవిస్తున్నాను జైగారు. అమెరికా ఏ ప్రపంచీకరణ గొయ్యితో మూడో ప్రపంచదేశాల రైతుల వెన్నుముక విరగ్గొట్టిందో అదే ప్రపంచీకరణ, మితిమీరిన రసాయనాల బారిన పడి ఇప్పుడు కునారిల్లుతున్నది. ఇప్పటి అమెరికా సమాజంలో పంటలపై కృత్రిమ రసాయనాల బారిన పడి వింతవింత రోగాలు పుట్టుకొస్తున్నాయి; వాటికి మూల కారణాలు తెలియక ఆ రసాయనాలను తయారు చేసే (ఫార్మా) కంపెనీల మందులు వాడి ఇంకాస్త గోతిలో పడుతున్నారు. ఆటిజం, డిమెన్షియా, అల్జైమర్స్, తదితర కొత్త రకం జబ్బులు ఈ రసాయనాల వల్లనే వస్తున్నాయి, వాటికి తోడు, వ్యాక్సీన్లు కూడా తమ వంతు సాయం చేస్తున్నాయి.
దురద్రుస్టం ఏమిటంటే మనవాళ్ళూ అమెరికాకి వచ్చాక మన పద్దతులు మర్చిపోయి ఆ రసాయనలు నిండిన తిండికే అలవాటు పడి ఆ దుష్పరిణామాలు ఎదుర్కొంటున్నారు.

హై హై నాయకా చెప్పారు...

మీతో నూటికి నూటయాభై శాతం ఏకీభవిస్తున్నాను జైగారు. అమెరికా ఏ ప్రపంచీకరణ గొయ్యితో మూడో ప్రపంచదేశాల రైతుల వెన్నుముక విరగ్గొట్టిందో అదే ప్రపంచీకరణ, మితిమీరిన రసాయనాల బారిన పడి ఇప్పుడు కునారిల్లుతున్నది. ఇప్పటి అమెరికా సమాజంలో పంటలపై కృత్రిమ రసాయనాల బారిన పడి వింతవింత రోగాలు పుట్టుకొస్తున్నాయి; వాటికి మూల కారణాలు తెలియక ఆ రసాయనాలను తయారు చేసే (ఫార్మా) కంపెనీల మందులు వాడి ఇంకాస్త గోతిలో పడుతున్నారు. ఆటిజం, డిమెన్షియా, అల్జైమర్స్, తదితర కొత్త రకం జబ్బులు ఈ రసాయనాల వల్లనే వస్తున్నాయి, వాటికి తోడు, వ్యాక్సీన్లు కూడా తమ వంతు సాయం చేస్తున్నాయి.
దురద్రుస్టం ఏమిటంటే మనవాళ్ళూ అమెరికాకి వచ్చాక మన పద్దతులు మర్చిపోయి ఆ రసాయనలు నిండిన తిండికే అలవాటు పడి ఆ దుష్పరిణామాలు ఎదుర్కొంటున్నారు.

PS: Above comment with name Arun is also mine (from another Google account).