అరవైయేళ్ళ క్రితం వార్తాపత్రికలు చదివే
అలవాటు ఉన్న వారికి పీ ఎల్ 480 అనే పదంతో పరిచయం వుండేవుంటుంది.
Public Law 480 అనే ఈ పధకం అమెరికన్ ప్రభుత్వానికి
సంబంధించింది. 1954లో అప్పటి ప్రెసిడెంట్ ఐసెన్ హోవర్
హయాములో ఈ చట్టం అమల్లోకి వచ్చింది. వ్యవసాయ, వాణిజ్య అభివృద్ధి కోసం ఉద్దేశించిన
ఈ పధకానికి 1961లో ప్రెసిడెంట్ జే.ఎఫ్. కెనెడీ,
శాంతికోసం ఆహారం (Food for Peace) అనే కొత్త పేరు పెట్టారు.
ఆ రోజుల్లో అమెరికా నుంచి ఈ పధకం కింద దిగుమతి
చేసుకున్న గోధుమలు, పాలపొడిని ఉచితంగా స్కూలు పిల్లలకు, గ్రామీణ పేదలకు పంపిణీ
చేసేవారు. వీటిని కొందరు దళారీలు నల్ల బజారుకు తరలించి లక్షలు అక్రమంగా
సంపాదించారు. కొందరు ఆ డబ్బుతో రాజకీయ రంగప్రవేశం చేసి అంచలంచెలుగా పైకి ఎదిగారు.
అమెరికా సదుద్దేశ్యంతో మొదలు పెట్టిన ఈ
పధకం వల్ల నిజమైన లబ్ధిదారులకు ఏం ప్రయోజనం జరిగిందో లెక్కలు లేవు కాని, లాభం
పొందాలని ప్రయత్నించినవారికి మాత్రం ఏమాత్రం నష్టం జరగలేదు.
ఆ రోజుల్లో మరో విషయం వింతగా
చెప్పుకునేవారు. అమెరికాలో ధాన్యం దిగుబడి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోయిన సందర్భాలలో
ధరలు పడిపోయి రైతులు నష్టపోకుండా, గోధుమలను
ఓడల్లో నింపి నడిసముద్రంలో పారబోసేవారని, ఇంకా మిగులు వుంటే ఇలా ఇటువంటి పధకాలతో
పేద దేశాలకు సరఫరా చేసేవారని వార్తలు ప్రచారంలో ఉండేవి.
