15, మార్చి 2014, శనివారం

తిరుపతికి వెళ్ళొద్దాం రండి! - 2


తిరుమల దివ్య క్షేత్రాన్ని అనుదినం వేలాదిమంది సందర్శిస్తుంటారు. వారిలో అధిక సంఖ్యాకుల కోరిక ఒక్కటే. దేవుడ్ని లిప్తకాలం పాటయినా దర్శించి సేవించుకోవాలని. కొద్దిమంది మాత్రం కోరుకునేది వేరే. ఎలాటి ఇబ్బంది లేకుండా సుఖంగా వెళ్ళి కళ్ళారా దేవుడ్ని కావాల్సినంత సేపు చూసి హారతి తీసుకుని మళ్ళీ అంతే సుఖంగా కడుపులో చల్ల కదలకుండా తిరిగిరావాలని. వీలయితే మరోమారో, ముమ్మారో అదేవిధంగా దర్శనం చేసుకోవాలని. వారిలో చాలామందికి ఆ కోరికా తీరుతుంది. ఎందుకంటే ఆ మేరకు ముందుగానే ప్రయత్నం చేసుకువస్తారు కాబట్టి.


తిరుమలవాసుడి దర్శనానికి అనేక మార్గాలు వున్నాయి. సర్వదర్శనం. కాలిబాట భక్తుల దర్శనం, మూడువందల రూపాయల శీఘ్రదర్శనం. ఇవికాక కంకణ దర్శనం. వృద్ధులు, వికలాంగులకోసం మహాద్వార దర్శనం. ఇవే కాక చాలా వున్నాయి కాని పైకి చెప్పరు. సమాచార హక్కు చట్టం కూడా తమకు వర్తించదని చెప్పే అధికారులు వున్నారు కాబట్టి ఆ రహస్య దర్శనాలు గురించి మాట్లాడకపోవడమే మంచిది.
తిరుమల వెళ్ళి వచ్చిన వాళ్లకు ఒక్క విషయం మాత్రం అర్ధం అవుతుంది. అక్కడ ప్రతి ఏర్పాటు, ప్రతి సౌకర్యం భక్తుల కోణం నుంచి ఆలోచించి అమలుచేస్తున్న దాఖలా లేదు. ప్రభుత్వంలో వివిధ విభాగాల్లో ఎంతో మంచి పేరు, సమర్ధత కలిగిన అధికారులు ఎంతో మంది టీటీడీ  ఈవోలుగా  పనిచేశారు. చేస్తున్నారు కూడా. వీరిలో చాలామందితో  నాకు వ్యక్తిగత పరిచయం వుంది. కొందరితో స్వేచ్చగా మాట్లాడే చనువు కూడా వుంది. వారి హయాంలో కూడా ఇదే వరస. ఎందుకో ఆ కుర్చీలో కూర్చున్న తరువాత వారి వరసే మారిపోతుంది. ఒకాయన అయితే ఏకంగా ఒక వ్యాఖ్య చేశారు. "ఇక్కడికి ప్రతిరోజూ కొన్ని వేల మంది వస్తుంటారు. వారిలో చాలామంది సిఫారసులతో వస్తారు. వారి కోరికలు తీర్చడమే గగనంగా వుంటే ఇక సామాన్యులను పట్టించుకునే తీరిక ఎక్కడ వుంటుంది. అయినా సామాన్య భక్తులకు ఇవన్నీ పట్టవు. వారికి ఏదో ఒకవిధంగా దర్శనం అయితే చాలు. తిట్టుకున్నా కొండ దిగగానే మరిచిపోతారు. ఇక మిగిలింది ఓ రెండు వేలమంది. వారిలో కూడా రోజూ రెండువందలమందిని కనిపెట్టి చూసుకుని వసతి, దర్శన ఏర్పాట్లు చక్కగా చూసుకుంటే చాలు. మమ్మల్ని అడిగేవాళ్ళు వుండరు."
(ఇంకా వుంది)

1 కామెంట్‌:

hari.S.babu చెప్పారు...

గోవింద నామాలు మాత్రమే వినపడాల్సిన చోట "జై జగన్" అనే అప్రాచ్యపు కూతల్ని సహిస్తున్నపూదే, జగన్ అనే దున్నపోతు చెప్పు లేసుకుని పచార్లు చేస్తుంటే వాడి చెప్పులు మోసుకుంటూ తిరుగుతున్నప్పుడే అనుకున్నా ఇక తిరుపతి వెళ్ళఖ్ఖర్లేదని?!