25, ఆగస్టు 2010, బుధవారం

ట్రాఫిక్ జామ్ లో పది రోజులు - భండారు శ్రీనివాసరావు

హైదరాబాదులో కార్లమీద వెళ్లే వాళ్ళకీ – కాళ్ళీడ్చుకుంటూ వెళ్లే వాళ్ళకీ ట్రాఫిక్ జామ్ అనేది ఒకేరకమయిన సమస్య. ఆబిడ్స్ అయినా, అమీర్ పేట్ అయినా - రోడ్లమీద పరిస్తితి అదే . రాత్రయినా పగలయినా తేడా వుండదు. వీళ్ళందరికీ ఎంతో ఉపశమనం కలిగించే ఒక సమాచారం మీడియా ద్వారా వెల్లడయింది.   బ్రేకింగ్ న్యూస్ అనుకునేరు ఈ న్యూస్ బ్రేకయి చాలారోజులయింది. దీనివల్ల  - రాత్రికి  రాత్రే  ఏదో జరిగిపోయి ఈ  జటిల సమస్య పరిష్కారమై పోతుందని కాదు. ఈ విషయంలో మనల్ని మించిన నగరాలు వున్నాయని తెలియరావడమే ఆ శుభవార్త. మన ఇంట్లో కరెంట్ పొతే పక్క ఇంట్లోకి తొంగి చూసి అక్కడా లేకపోతె కలిగే పైశాచిక ఆనందంలాటిదని అనుకుందాం పోనీ. అయితే , అంతకు ముందు కొంత  వెనకా ముందూ చూద్దాం.

శ్రీమతి ఇందిరాగాంధీ

ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో - ఆకాశవాణి, దూరదర్శన్ లు మాత్రమె రాజ్యమేలుతున్న రోజుల్లో – వాటిని ఇందిరా వాణి అనీ, రాజీవ్ దర్శన్ అనీ గిట్టని వాళ్ళు ముద్దుగా పిలిచేవారు. వాటిమీద, అవి ప్రసారం చేసే కార్యక్రమాలమీద ఏలినవారి పెత్తనం, సర్కారువారి ముద్ర అంతగా వుండేవని చెప్పడం అందులోని శ్లేష.

రాజీవ్ గాంధి

 ఆ తరవాత రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెళ్ళినప్పుడు - అక్కడి దేశాధినేత అనండీ , పార్టీ నేత అనండీ - మిహాయిల్ గోర్బచెవ్ – టీవీ తెరపై గంటలు గంటలు కనబడే తీరు చూసిన తరవాత కానీ ఈ విమర్శలు అర్ధం పర్దం లేనివన్న సంగతి అర్ధం కాలేదు. మేము అలా అనుకుంటూ ఆ కార్యక్రమాలు చూస్తూ ప్రశాంతంగా రోజులు గడుపుతున్న రోజుల్లో ఒకానొక రోజున ఇరాన్ నుంచి నాకు తెలిసిన ఒక మిత్రుడు ఏదో పని మీద మాస్కో వచ్చి – మా ఇంట్లో రష్యన్ టీవీ ప్రోగ్రాములు  చూస్తూ  ఎంతగానో రిలీఫ్ ఫీలవడం చూసి  మాకు మతి పోయినంత పనయింది.

మిహాయిల్  గోర్భచెవ్ 

కదిలిస్తే అతగాడు చెప్పిన కధ – అర్జున విషాద యోగాన్ని తలపించింది. ఆ దేశంలో టీవీ తెరపై - ఉదయం నుంచీ రాత్రి పడుకునే వరకూ బోధనలు ఇస్తూ, సూక్తులూ ప్రవచిస్తూ ఒకేఒక్క పెద్దమనిషి అస్తమానం దర్శనం ఇస్తాడట.

 ఆ ప్రోగ్రాములు చూసి చూసి వచ్చిన ఆ పెద్దమనిషికి రష్యన్ టీవీ కార్యక్రమాలు చల్లని వేళలో ప్రియురాలి వెచ్చని కౌగిలిలా ఎంతో ఉల్లాసాన్ని కలిగించాయిట. కాబట్టే  అన్నారు మనుషుల బాధలన్నీ సాపేక్షం (రిలెటివ్) అని.  అందుకే కాబోలు - ఇతరులతో పోల్చి చూసుకుంటే బాధ సగం తగ్గిపోతుందంటారు. ఇప్పుడు చెప్పబోతున్నది కూడా అదే.

అయతుల్లా ఖొమేని

చైనాలో ఆ మధ్య జరిగిన ఒక విషయం ఈ మధ్య వెలుగు చూసింది. మరి అక్కడ మన మాదిరిగా ‘ఏ టు జడ్’ టీవీ చానళ్ళు లేవుకదా. అదన్న మాట సంగతి.

బీజింగ్ దగ్గర ట్రాఫిక్ జామ్

ఇంతకీ అసలు కధాకమామిషూ ఏమిటంటే – ఈ ఆగస్ట్ పదునాలుగో తేదీన బీజింగ్ సమీపంలో ఒక ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇందులో పెద్ద విశేషం ఏముందని అనుకుంటారేమో. కానీ ఈ ట్రాఫిక్  జామ్ తరహానే వేరు.  రోడ్డు విస్తరణ కారణంగా బీజింగ్ – టిబెట్ ఎక్స్ ప్రెస్ వే మీద మొదలైన ఈ ట్రాఫిక్ జామ్ లో కేవలం   వందంటే వంద కిలోమీటర్ల మేర మాత్రమే  వాహనాలు నిలిచిపోయాయి.  గంటో రెండు గంటలో కాదు, పూటో రెండు పూటలో కాదు ఏకంగా పదిరోజుల పాటు ఈ జామ్ ‘ఝాం ఝాం ‘ గా కొనసాగింది. రోడ్డు నిర్మాణం పనులు సెప్టెంబర్ పదమూడుదాకా జరుగుతాయి కనుక  ప్రజలందరూ  ఎప్పటిమాదిరిగానే సంయమనంతో సహకరించాలనీ, వాహనాల రాకపోకలు మరికొద్ది రోజుల్లో సాధారణ స్తితికి చేరుకుండే అవకాశాలు లేకపోనూ లేవనీ – మొన్న ఆదివారం నాడు తొలిసారిగా ఈ అసాధారణ ట్రాఫిక్ జామ్ గురించి చైనా నేషనల్ రేడియో అతి సాధారణంగా ప్రజలకు తెలియచేసింది. ‘యధా రాజా తధా ప్రజా’ అన్నట్టు ఆ ట్రాఫిక్ జామ్ లో దారీతెన్నూ కానకుండా అన్నన్ని రోజులు చిక్కుకుపోయిన వాహనదారులు కూడా అదేమీ పట్టనట్టు -' నట్టిల్లు  అయితే యేమిరా! నడి రోడ్డు అయితే యేమిరా!' అని మిట్ట వేదాంత గీతాలు పాడుకుంటూ,  పేకాట  ఆడుకుంటూ కాలక్షేపం చేసారు. వారికి కోపం రాలేదని కాదు. వచ్చింది. అదీ దేనికటా! ఆ పది రోజులూ తమకు తిండీ తిప్పలు కనుక్కుని పెట్టిన ఇరుగు పొరుగు గ్రామాల వారు - తాము కొనుక్కుని తిన్న ఆ తినుబండారాలకు గాను ఒకటికి నాలుగు రెట్లు రేట్లు అదనంగా వసూలు చేసారన్నదే  వారి అభియోగం. ప్రభుత్వం మీదా అధికారుల మీదా వారు నోరు విప్పలేదు సరికదా అంతంత అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు ఆ మాత్రం ఇబ్బందులు సహజమే కదా అని సన్నాయి నొక్కులు నొక్కారు.

అంతటి సహనశీలులను చూసి నిజానికి  మనమూ మన మీడియా ఎంతో నేర్చుకోవాలి.  అలాగే-  అలా, అంతగా అడక్కుండానే సర్డుకుపోయే ప్రజలుండడం అక్కడి పాలకుల అదృష్టం కదా అని మన పాలకులు  మధన పడాలి.

ఇక - పనిలో పనిగా ‘నవ చైనా’ గురించిన మరికొన్ని విశేషాలు కూడా ముచ్చటించుకోవడం భావ్యంగా వుంటుందేమో.


బీజింగ్ నగరంపై 'కారు మేఘాలు' 

నిరుడు మొత్తం అమెరికాలో అమ్ముడుపోయిన కార్ల కంటే ఎక్కువ కార్లు చైనాలో అమ్ముడుపోయాయి. చైనా రాజధాని బీజింగ్ నగరవాసులు పోటీ పడి రోజూ రెండువేల కొత్త కార్లు కొంటున్నారు. ఈ లెక్కన ఒక్క బీజింగ్ లోనే కార్ల సంఖ్య మరో అయిదేళ్ళలో డెబ్భయి లక్షలకు చేరుకుంటుందని అంచనా. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గించడానికి - ప్రైవేట్ కార్లు వారానికి ఒక్క రోజయినా రోడ్ల మీదకు రాకూడదన్న నిబంధనలు ఇప్పటికే అమలులో వున్నాయి. అయినా చైనా రాజధానిలో వాహనాల వేగం చాలా వేగంగా తగ్గిపోతూ వుండడం అక్కడి అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. అందుకే చాలా ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసి రోడ్ల వెడల్పును భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పెంచుకుంటూ వస్తున్నారు.

మౌలిక వసతుల అభివృద్ధి పధంలో చైనా

వీటన్నిటి వల్ల - ముందు ముందు మంచి జరగబోతున్నదన్న నమ్మకం ప్రజల్లో అంతగా వుండడం వల్ల - తాత్కాలిక ఇబ్బందులను  శాశ్వితంగా  పట్టించుకోకుండా జనం అంతగా సర్డుకుపోతున్నారని ప్రభుత్వ వర్గాలవాళ్ళు నమ్మకంగా సెలవిస్తున్నారు. అయితే బీజింగ్ సమీపంలో ఏర్పడ్డ ట్రాఫిక్ జామ్ పూర్తిగా తొలగించడానికీ, వాహనాల రాకపోకలను మునుపటి మాదిరిగా  పునరుద్ధరించడానికీ - యెట్లా లేదన్నా - మరో నెల రోజులు పట్టగలదని పేరు చెప్పడానికి ఇష్ట పడని మరో అధికారి వున్న విషయం చల్లగా బయట పెట్టాడు.
(24-08-2010)

NOTE:All images in the blog are copy righted to respective owners

కామెంట్‌లు లేవు: