జీవన స్రవంతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
జీవన స్రవంతి లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

21, ఏప్రిల్ 2011, గురువారం

జీవనస్రవంతి- భండారు శ్రీనివాసరావు

జీవనస్రవంతి- భండారు శ్రీనివాసరావు




జాతి వైరం కుక్కలకు సహజం. ఒక కుక్కని చూస్తే మరో కుక్కకు గిట్టదు. కొంపలంటుకు పోయినట్టు మొరగడం మొదలు పెడతాయి. ఈ సంగతి తెలిసికూడా పంజాబులో ఇద్దరు సర్దార్జీలు కోరి తెచ్చుకున్న కొట్లాట పుణ్యమా అని పోలీసు కేసులో చిక్కుకున్నారు.

ఆ ఇద్దరూ ఇరుగుపొరుగూ వారే. కానీ వారి పెంపుడు కుక్కలకు మాత్రం ఏమాత్రం పొసగదు. కనబడగానే కాట్ల కుక్కల్లా పోట్లాడుకుంటాయి. గయ్యి గయ్యిమని మొరుగుతాయి. ఈ వ్యవహారం ఆ యజమానులకు సుతరామూ నచ్చలేదు. అక్కడితో ఆగితే పోయేది. ఎదురుపడగానే కుక్కల మొరుగుడు గుర్తుకువచ్చి గిల్లి కజ్జా పెట్టుకునేవారు. అంతటితో ఆగితే ఏ పేచీ లేదు. చేతులు లేపారు. చేతులు సరిపోక ఇనుప కమ్మీలతో దొమ్మీలకు దిగారు. అంతదాకా తీరిగ్గా అంతా చూసిన పోలీసులు సమయం చూసి రంగంలోకి దిగి ఇద్దర్నీ స్టేషనుకు పట్టుకుపోయి అక్కడ చేయాల్సిన సన్మానం చేశారు. అప్పటికి కానీ ఆ యజమానులిద్దరు శాంతించలేదు. వాళ్ళు తాత్కాలికంగా రాజీపడి చేతులు కలిపినా కుక్కలు మాత్రం ఇళ్ళల్లో కూర్చుని తాపీగా మొరుగుడు కార్యక్రమాన్ని కొనసాగిస్తూనే వున్నాయి.(17-02-1983 నాడు రేడియోలో ప్రసారితం)







వొండివార్చే పని లేకుండా వడ్డించే విధానాన్ని డాక్టర్ విగ్మూర్ అనే విదేశీ వనిత కనుక్కుంది. కాయగూరలను వొండకుండా ఎలావున్నవాటిని అలానే కొరుక్కుని తినాలన్నది ఆవిడ గారి థియరీ. నిజానికి ఇది కొత్త విద్యేమీ కాదు. వెనుక పురాణాల్లో విన్న కంద మూలాల కధే. కానీ చెప్పేది విదేశీ అమ్మడు కాబట్టి నమ్మినా నమ్మకపోయినా వినకతప్పదు కదా! ఇలా తింటే వంట తంటా తప్పడమే కాకుండా వొంటికి సరిపడే పుష్టి బ్రాండ్ ఆహారం దొరుకుతుందని ఆవిడ చెబుతోంది. వండడం వల్ల కూరగాయల్లో వుండే సహజమయిన విటమిన్లు తగ్గిపోతాయని హెచ్చరిస్తోంది. పచ్చి కూరగాయల్ని పచ్చి పచ్చిగా తినడం మొదట్లో కొంత కష్టంగా వున్నా పోను పోను అలవాటయి ఇష్టంగా మారుతుందని ఆవిడ ఢంకా బజాయించి చెబుతోంది.


విగ్మూర్ చెప్పే మాటలు కరక్టే అనే వ్యక్తి మనదేశంలోనే ఒకాయన వున్నారు. పచనం ప్రసక్తి లేకుండా పచ్చి కూరలు తింటూ, పళ్ళరసాలు తాగుతూ పెటపెటలాడుతూ తిరిగే ఆ ఆసామీ మామూలు మనిషేమీ కాదు. పేరుమోసిన క్రికెట్ వీరుడు విజయ్ మర్చంట్. వొండిన ఆహార పదార్ధాల జోలికి పోకుండా పచ్చివాటినే భోంచేస్తున్న విజయ్ మర్చంట్ గురించి మరో ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే గత పదిహేనేళ్ళుగా ఆయన చుక్క పచ్చి మంచినీళ్ళయినా ముట్టలేదట.

ఈ పచన రహిత భోజనాలవల్ల ఎంతో సమయం కలిసొస్తుందని, వంట ఖర్చు ఆదా అవుతుందనీ, వొంటింటిని వొదిలేస్తే ఎలాటి జబ్బులు వొంటి జోలికి రావనీ, పైపెచ్చు వొంటింటి కుందేళ్ళన్న అపప్రధ ఆడవాళ్ళకు తప్పుతుందనీ ఈ వాదనని సమర్ధించేవాళ్ళ ఉవాచ. గాస్ అయిపోయిందే అన్న దిగులు లేకుండా, నూనె ధర పెరిగిందే అన్న బెంగ లేకుండా రోజులు వెళ్లదీయవచ్చునట. (1983 జనవరిలో రేడియోలో ప్రసారితం)

  

31, ఆగస్టు 2010, మంగళవారం

విన్నంతలో- కన్నంతలో అమెరికా - 6 - భండారు శ్రీనివాసరావు

విన్నంతలో- కన్నంతలో అమెరికా - 6     - భండారు శ్రీనివాసరావు
“అంటరాని వాడు
అని నీవనుకుంటున్నవాడు
అంటుకున్నాడో
ఇక అది
ఆరని మంటే!”
వివక్ష అనేది ఏ రూపంలో ఎక్కడవున్నా అది సహించరానిది.

గాంధీ తో గోరా

అంతే కాదు వివక్షకు గురయ్యేవారు తిరగబడిన రోజున అది తిరుగులేని తిరుగుబాటే అవుతుందని –
గోరాగారి సాహచర్యంలో మసలిన మా పెద్దన్నయ్య కీర్తిశేషులు పర్వతాలరావు గారు చెబుతుండేవారు.
కానీ ఈ నాడు అమెరికాలో పరిణామాలను గమనిస్తూ - గతాన్నీ, వర్తమానాన్నీ  కలగలిపి ఆలోచిస్తుంటే - కులాలకూ, మతాలకూ యేవో గట్టి మూలాలే వున్నాయనిపిస్తోంది.
రష్యా కమ్యూనిష్టుల ఏలుబడిలోకి వచ్చిన తరవాత ఏడు దశాబ్దాల పై చిలుకు కాలం ఆ దేశంలో మతమన్నది కనబడలేదు, వినబడ లేదు. అయితే, “మతం మత్తు మందు” అని నమ్మిన కమ్యూనిస్టు పాలకులు కూడా ఆ దేశంలో ఏ చర్చినీ , మసీదునీ కూలగొట్టలేదు. సరికదా -
 పైపెచ్చు వాటికీ ఏటేటా రంగులూ, సున్నాలూ కొట్టి ముస్తాబుచేసి తాళాలు వేసి వుంచేవారు. గోర్భచెవ్ కాలంలో మేము అక్కడ వున్నప్పుడయితే - విదేశాలనుంచి వచ్చే గౌరవ ప్రభుత్వ అతిధులకి వాటిని ఎంతో గౌరవంగా చూపించేవారు కూడా.

లెనిన్ స్కీ ప్రాస్పెక్త్

 ఇక్కడ అప్రస్తుతం కాదనుకుంటే మరో విషయం ముచ్చటించుకోవాలి. మాస్కోలోని లెనిన్ స్కీ ప్రాస్పెక్త్ (లెనిన్ పేరు పెట్టిన ప్రధాన రహదారి) నిర్మాణ సమయంలోనో, ఆ రోడ్డును వెడల్పుచేసే సమయంలోనో - పాతకాలం నాటి ఒక చర్చి అడ్డం వచ్చిందట. దాన్ని కూలగొట్టడం లేదా కొన్ని లక్షల రూబుళ్ళు ఖర్చు బెట్టి ఆ చర్చి భవనాన్ని పక్కకు జరపడం అనే రెండు ప్రత్యామ్నాయాలు అధికారుల ముందు నిలిచాయి. మతం పొడగిట్టని కమ్యూనిస్ట్ పాలకులకు, ఆ చర్చిని వున్నపలాన పడగొట్టడం చిటికెలో పని.

మాస్కో చర్చి

 అయినా వారు ఆ పని చేయకుండా చర్చి భవనం చుట్టూ కందకం మాదిరిగా తవ్వి- భూగర్భం లోనే దానికింద చక్రాల ఉక్కు పలకను ఉంచి అంగుళం అంగుళం చొప్పున నెమ్మది నెమ్మదిగా ఆ మొత్తం చర్చిని ఏమాత్రం దెబ్బతినకుండా వున్నదాన్ని వున్నట్టుగా దూరంగా జరిపి రోడ్డు పని పూర్తిచేశారని చెప్పుకునేవారు.

మాస్కో చర్చిలో పూర్వవైభవం
వారు అలా వాటిని ఎందుకు వుంచారో తెలియదుకానీ, ఇప్పుడు అవన్నీ పూర్వ వైభవంతో కళకళ లాడుతున్నాయని వింటున్నాము.

మాస్కో మసీదు

 డెబ్బయి ఎనభై సంవత్సరాలపాటు మతానికి సంబంధించిన పేర్లనుకూడా బహిష్కరించి, దాని తాలూకు సంప్రదాయాలను సమాధి చేసి, మతం గురించిన ప్రస్తావన కూడా లేకుండా చేసిన నాటి సోవియట్ యూనియన్ ముక్కలు చెక్కలయిన తరవాత, మళ్ళీ ఇన్నాళ్ళకు అక్కడ మతాలూ, మత సంప్రదాయాలు వెల్లివిరుస్తున్నాయని కూడా వింటున్నాము.

మాస్కో మసీదులో ప్రార్ధనలు

మాస్కో జనాభాలో ఇప్పుడు ప్రతి అయిదుగురిలో ఒకరు ముస్లిం అని కూడా వింటున్నాము.

“మత మన్నది మన కంటికి మసకయితే – మతం వద్దు గతం వద్దు మారణ హోమం వద్దు” అని ప్రవచించిన కమ్యూనిష్టుల రాజ్యమే ఆ విధంగా అంతమయిన వైనం గమనించినప్పుడు – జనంలో మతానికి వున్న గట్టి పట్టు ఎలాటిదో బోధపడుతున్నది.
 ఈ నేపధ్యంలో - వర్తమానాన్ని ఓ మారు అవలోకిస్తే -

ప్రమాణస్వీకారం చేస్తున్న ఒబామా

శ్వేత జాతీయులకు వర్ణ వివక్ష ఎక్కువ అనే అపప్రదని సమూలంగా తొలగించుకుంటూ అమెరికా దేశీయులు బరాక్ హుస్సేన్ ఒబామాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నప్పుడు యావత్ ప్రపంచం ఎంతగానో పులకించిపోయింది.

తిలకిస్తున్న అశేష జన సందోహం

వొంటి రంగు మూలంగా పాశ్చాత్య దేశాలలో అదేమాదిరి వివక్షను ఎంతోకొంత ఎదుర్కొంటున్న భారతీయులు సయితం ఒబామా విజయాన్ని తమ గెలుపుగా భావించి పండగ చేసుకున్నారు. ఒబామాను అమెరికా అధ్యక్షుడిగా ఆ దేశ ప్రజలు ఎన్నుకుని ఇంకా రెండేళ్లు కూడా పూర్తికాలేదు. అప్పుడే టీవీల్లో ఆయన మతం గురించిన చర్చ ప్రారంభమయింది. ఒబామా ఏ మతానికి చెందినవాడో తేల్చి చెప్పడానికి అన్ని చానళ్ళు శక్తివంచనలేకుండా కార్యక్రమాలు ప్రసారం చేస్తున్నాయి.

ఇస్తాంబుల్ మసీదులో ఒబామా

నిరుడు ఫిబ్రవరిలో అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకరించిన వెంటనే  ఏప్రిల్ లో టర్కీ వెళ్ళిన ఒబామా, అక్కడ ఒక మసీదుకు వెళ్లి ప్రార్ధనలు జరిపిన ఉదంతాలను ఉదహరిస్తున్నారు.ఆయన  ఏదో ఒక మతానికి చెందినవాడయినా ప్రజలు ఆయనని ఎన్నుకున్నది ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగానే.  కానీ,  గతంలో అధ్యక్షుడు బుష్  తరచుగా  చర్చికి వెళ్లినట్టు  ఒబామా వెళ్లడం లేదని, అందువల్ల ఆయన అసలు సిసలు క్రిష్టియన్ కాదనీ చర్చ మొదలయింది.  దైవ ప్రార్ధన అనేది వ్యక్తిగతమనీ, దానికోసం ప్రత్యేకంగా ప్రార్ధనాలయాలకు వెళ్ళాల్సిన అవసరం లేదనే వాదన ఆయనను సమర్ధించే వారినుంచి వినబడుతోంది. ఇదంతా, నవంబర్లో జరగనున్న సెనేట్ ఎన్నికల్లో పైపట్టు సాధించడానికి ఒకరిపై మరొకరు రాజకీయంగా చల్లుకుంటున్న బురద అని కొందరు చెప్పారు.

నా బాధ అది కాదు. ఒబామా మతం పలానా అని  తేల్చగలిగినప్పుడు  - కులాల కట్టుబాట్లను కాలదన్ని, కావాల్సిన వాళ్ళను కాదనుకుని – ఎన్నో కడగండ్లనూ, కష్టాలను ఆహ్వానిస్తూ కులరహిత సమాజాన్ని కోరుకున్న అనేకమంది అభ్యుదయవాదులు  నమ్ముకున్న సిద్దాంతాల మాటేమిటి?
అప్పుడు-
కులమతాలకు అతీతంగా వాళ్ళు  ఇన్నాళ్ళుగా చేస్తూ వచ్చింది ఏమవుతుంది?
 ఏమవుతుంది?
రష్యాలో ఎనభై ఏళ్ళక్రితం ఏం జరిగిందో – తరవాత ఏం జరిగిందో అదే అవుతుంది. అంతే కదా! (30-08-2010)

NOTE:All images in the blog are copy righted to respective owners

30, ఆగస్టు 2010, సోమవారం

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు

వ్యాపకాల జ్ఞాపకాలు - భండారు శ్రీనివాసరావు


రాసేవాళ్ళు చాలామంది వుంటారు. వాళ్ళల్లో మంచిగా రాసేవాళ్ళు కొద్దిమందయినా వుంటారు. కానీ వేసేవాళ్ళు వుండరు. ఇంతెందుకు- చాలా సంవత్సరాలక్రితం పురాణం గారు ఆంద్ర జ్యోతి వారపత్రిక సంపాదకులుగా వున్నప్పుడు అంతగా పేరు తెలియని రచయిత ఒకరు తన నవలను ప్రచురణార్ధం పంపారు. ఏళ్ళు పూళ్ళు గడుస్తున్నా తన రచనకు అతీగతీ లేకపోవడంతో - ‘తన నవలను తనకు భద్రంగా ఒప్పచెప్పాలనీ, లేనిపక్షంలో న్యాయపరమైన చర్యలు తీసుకోవాల్సి వుంటుందనీ’ అతగాడు లీగల్ నోటీసు ఇచ్చాడు. దాంతో, పురాణం గారు - అప్పుడు అక్కడ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్న నేనూ కలసి, అలమరాలన్నీ గాలించి, పాత కట్టలన్నీ దులిపి ఎట్టకేలకు ఆ నవలను పట్టుకున్నాము. ఆ విషయం రచయితకు తెలియచేద్దామనుకుంటూనే - పురాణం గారు యధాలాపంగా ఆ నవలలోని కొన్ని పేజీలు తిరగేసారు. ఆయన కళ్ళల్లో ఇసుమంత ఆశ్చర్యంతో కూడిన కాంతి కనిపించింది. వెంటనే ఆర్టిస్టుని పిలిపించి అప్పటికప్పుడే ప్రోమో రాయించడం, ఆ నవలను ధారావాహికంగా ప్రచురించేందుకు ముహూర్తం (తేదీ) నిర్ణయించడం, ఆ విషయాన్ని పత్రికాముఖంగా ప్రకటన రూపంలో ప్రచురించడం అన్నీ చక చకా జరిగిపోయాయి. దానితో తెలుగు సాహితీ లోకానికి మరో కొత్త రచయిత పరిచయమయ్యాడు. తెలుగు నవలా సాహిత్యాన్ని మరో మలుపు తిప్పిన ఒక గొప్ప రచయిత పాఠకులకు దొరికాడు. ఆయన ఎవ్వరో కాదు, కీర్తిశేషులు- వడ్డెర చండీదాస్ (అసలు పేరు చెరుకూరి బ్రహ్మేశ్వర రావు గారు) ఆ నవల – తెలుగు నవలల్లో ఇప్పటికీ స్వయం జ్వలిత జ్వాలగా భాసిల్లుతున్న –“హిమజ్వాల”-

కీర్తిశేషులు వడ్డెర చండీదాస్

స్వయంగా రచయిత అయిన పురాణం సుబ్రమణ్య శర్మ గారు వారపత్రిక సంపాదకుడిగా మరెందరో రచయితలను వెలుగులోకి తెచ్చారు. తన సంపాదకత్వంలోని ఆంద్ర జ్యోతి వారపత్రికకు ఒక ప్రత్యేకతనూ, ప్రాముఖ్యాన్ని సమకూర్చిపెట్టారు. ఒక పక్క రచయితగా, మరో పక్క సంపాదకుడుగా రెండు భాధ్యతలను సమర్ధంగా నిర్వహించి పాఠకజనసామాన్యంచేతా, పత్రికాయాజమాన్యం చేతా సెహభాష్ అనిపించుకున్నారు.

కీర్తిశేషులు శ్రీ పురాణం


సంపాదకుడనే వాడు స్వయంగా సుప్రసిద్ధ రచయిత కావడం అనేది పత్రికకు ఎంతగానో మేలుచేస్తుందనడానికి పురాణం సుబ్రమణ్యశర్మగారే ఉదాహరణ. అయితే, కాస్తో కూస్తో అక్షరజ్ఞానం, అంతో ఇంతో భాషా పరిజ్ఞానం సంపాదకుడికి వుంటే చాలు, ఆ పత్రిక బతికి బట్టకట్టడమే కాదు అమ్మకాల్లో దిట్ట అనిపించుకోగలదని ప్రస్తుతం తెలుగు పత్రికారంగాన్ని ఏలుతున్న దినవారపత్రికలని చూస్తె తెలిసిపోతుంది. మంచి రచనలు చేసేవాడు, కొత్త రచయితలు చేసే మంచి రచనలని అంత తేలిగ్గా ఎంపిక చేసుకోలేడన్నది ఇక్కడి తాత్పర్యం. ఈగోలు, ఇతరత్రా కారణాలు పనిచేసి- తాము చేసే పనికి న్యాయం చేయలేరన్నది ఇందులోని ప్రతి పదార్ధం. (29-08-2010)

NOTE: All images in the blog are copy righted to respective owners

25, ఆగస్టు 2010, బుధవారం

ట్రాఫిక్ జామ్ లో పది రోజులు - భండారు శ్రీనివాసరావు

హైదరాబాదులో కార్లమీద వెళ్లే వాళ్ళకీ – కాళ్ళీడ్చుకుంటూ వెళ్లే వాళ్ళకీ ట్రాఫిక్ జామ్ అనేది ఒకేరకమయిన సమస్య. ఆబిడ్స్ అయినా, అమీర్ పేట్ అయినా - రోడ్లమీద పరిస్తితి అదే . రాత్రయినా పగలయినా తేడా వుండదు. వీళ్ళందరికీ ఎంతో ఉపశమనం కలిగించే ఒక సమాచారం మీడియా ద్వారా వెల్లడయింది.   బ్రేకింగ్ న్యూస్ అనుకునేరు ఈ న్యూస్ బ్రేకయి చాలారోజులయింది. దీనివల్ల  - రాత్రికి  రాత్రే  ఏదో జరిగిపోయి ఈ  జటిల సమస్య పరిష్కారమై పోతుందని కాదు. ఈ విషయంలో మనల్ని మించిన నగరాలు వున్నాయని తెలియరావడమే ఆ శుభవార్త. మన ఇంట్లో కరెంట్ పొతే పక్క ఇంట్లోకి తొంగి చూసి అక్కడా లేకపోతె కలిగే పైశాచిక ఆనందంలాటిదని అనుకుందాం పోనీ. అయితే , అంతకు ముందు కొంత  వెనకా ముందూ చూద్దాం.

శ్రీమతి ఇందిరాగాంధీ

ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో - ఆకాశవాణి, దూరదర్శన్ లు మాత్రమె రాజ్యమేలుతున్న రోజుల్లో – వాటిని ఇందిరా వాణి అనీ, రాజీవ్ దర్శన్ అనీ గిట్టని వాళ్ళు ముద్దుగా పిలిచేవారు. వాటిమీద, అవి ప్రసారం చేసే కార్యక్రమాలమీద ఏలినవారి పెత్తనం, సర్కారువారి ముద్ర అంతగా వుండేవని చెప్పడం అందులోని శ్లేష.

రాజీవ్ గాంధి

 ఆ తరవాత రేడియో మాస్కోలో పనిచేయడానికి మాస్కో వెళ్ళినప్పుడు - అక్కడి దేశాధినేత అనండీ , పార్టీ నేత అనండీ - మిహాయిల్ గోర్బచెవ్ – టీవీ తెరపై గంటలు గంటలు కనబడే తీరు చూసిన తరవాత కానీ ఈ విమర్శలు అర్ధం పర్దం లేనివన్న సంగతి అర్ధం కాలేదు. మేము అలా అనుకుంటూ ఆ కార్యక్రమాలు చూస్తూ ప్రశాంతంగా రోజులు గడుపుతున్న రోజుల్లో ఒకానొక రోజున ఇరాన్ నుంచి నాకు తెలిసిన ఒక మిత్రుడు ఏదో పని మీద మాస్కో వచ్చి – మా ఇంట్లో రష్యన్ టీవీ ప్రోగ్రాములు  చూస్తూ  ఎంతగానో రిలీఫ్ ఫీలవడం చూసి  మాకు మతి పోయినంత పనయింది.

మిహాయిల్  గోర్భచెవ్ 

కదిలిస్తే అతగాడు చెప్పిన కధ – అర్జున విషాద యోగాన్ని తలపించింది. ఆ దేశంలో టీవీ తెరపై - ఉదయం నుంచీ రాత్రి పడుకునే వరకూ బోధనలు ఇస్తూ, సూక్తులూ ప్రవచిస్తూ ఒకేఒక్క పెద్దమనిషి అస్తమానం దర్శనం ఇస్తాడట.

 ఆ ప్రోగ్రాములు చూసి చూసి వచ్చిన ఆ పెద్దమనిషికి రష్యన్ టీవీ కార్యక్రమాలు చల్లని వేళలో ప్రియురాలి వెచ్చని కౌగిలిలా ఎంతో ఉల్లాసాన్ని కలిగించాయిట. కాబట్టే  అన్నారు మనుషుల బాధలన్నీ సాపేక్షం (రిలెటివ్) అని.  అందుకే కాబోలు - ఇతరులతో పోల్చి చూసుకుంటే బాధ సగం తగ్గిపోతుందంటారు. ఇప్పుడు చెప్పబోతున్నది కూడా అదే.

అయతుల్లా ఖొమేని

చైనాలో ఆ మధ్య జరిగిన ఒక విషయం ఈ మధ్య వెలుగు చూసింది. మరి అక్కడ మన మాదిరిగా ‘ఏ టు జడ్’ టీవీ చానళ్ళు లేవుకదా. అదన్న మాట సంగతి.

బీజింగ్ దగ్గర ట్రాఫిక్ జామ్

ఇంతకీ అసలు కధాకమామిషూ ఏమిటంటే – ఈ ఆగస్ట్ పదునాలుగో తేదీన బీజింగ్ సమీపంలో ఒక ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇందులో పెద్ద విశేషం ఏముందని అనుకుంటారేమో. కానీ ఈ ట్రాఫిక్  జామ్ తరహానే వేరు.  రోడ్డు విస్తరణ కారణంగా బీజింగ్ – టిబెట్ ఎక్స్ ప్రెస్ వే మీద మొదలైన ఈ ట్రాఫిక్ జామ్ లో కేవలం   వందంటే వంద కిలోమీటర్ల మేర మాత్రమే  వాహనాలు నిలిచిపోయాయి.  గంటో రెండు గంటలో కాదు, పూటో రెండు పూటలో కాదు ఏకంగా పదిరోజుల పాటు ఈ జామ్ ‘ఝాం ఝాం ‘ గా కొనసాగింది. రోడ్డు నిర్మాణం పనులు సెప్టెంబర్ పదమూడుదాకా జరుగుతాయి కనుక  ప్రజలందరూ  ఎప్పటిమాదిరిగానే సంయమనంతో సహకరించాలనీ, వాహనాల రాకపోకలు మరికొద్ది రోజుల్లో సాధారణ స్తితికి చేరుకుండే అవకాశాలు లేకపోనూ లేవనీ – మొన్న ఆదివారం నాడు తొలిసారిగా ఈ అసాధారణ ట్రాఫిక్ జామ్ గురించి చైనా నేషనల్ రేడియో అతి సాధారణంగా ప్రజలకు తెలియచేసింది. ‘యధా రాజా తధా ప్రజా’ అన్నట్టు ఆ ట్రాఫిక్ జామ్ లో దారీతెన్నూ కానకుండా అన్నన్ని రోజులు చిక్కుకుపోయిన వాహనదారులు కూడా అదేమీ పట్టనట్టు -' నట్టిల్లు  అయితే యేమిరా! నడి రోడ్డు అయితే యేమిరా!' అని మిట్ట వేదాంత గీతాలు పాడుకుంటూ,  పేకాట  ఆడుకుంటూ కాలక్షేపం చేసారు. వారికి కోపం రాలేదని కాదు. వచ్చింది. అదీ దేనికటా! ఆ పది రోజులూ తమకు తిండీ తిప్పలు కనుక్కుని పెట్టిన ఇరుగు పొరుగు గ్రామాల వారు - తాము కొనుక్కుని తిన్న ఆ తినుబండారాలకు గాను ఒకటికి నాలుగు రెట్లు రేట్లు అదనంగా వసూలు చేసారన్నదే  వారి అభియోగం. ప్రభుత్వం మీదా అధికారుల మీదా వారు నోరు విప్పలేదు సరికదా అంతంత అభివృద్ధి పనులు జరుగుతున్నప్పుడు ఆ మాత్రం ఇబ్బందులు సహజమే కదా అని సన్నాయి నొక్కులు నొక్కారు.

అంతటి సహనశీలులను చూసి నిజానికి  మనమూ మన మీడియా ఎంతో నేర్చుకోవాలి.  అలాగే-  అలా, అంతగా అడక్కుండానే సర్డుకుపోయే ప్రజలుండడం అక్కడి పాలకుల అదృష్టం కదా అని మన పాలకులు  మధన పడాలి.

ఇక - పనిలో పనిగా ‘నవ చైనా’ గురించిన మరికొన్ని విశేషాలు కూడా ముచ్చటించుకోవడం భావ్యంగా వుంటుందేమో.


బీజింగ్ నగరంపై 'కారు మేఘాలు' 

నిరుడు మొత్తం అమెరికాలో అమ్ముడుపోయిన కార్ల కంటే ఎక్కువ కార్లు చైనాలో అమ్ముడుపోయాయి. చైనా రాజధాని బీజింగ్ నగరవాసులు పోటీ పడి రోజూ రెండువేల కొత్త కార్లు కొంటున్నారు. ఈ లెక్కన ఒక్క బీజింగ్ లోనే కార్ల సంఖ్య మరో అయిదేళ్ళలో డెబ్భయి లక్షలకు చేరుకుంటుందని అంచనా. రోడ్లపై వాహనాల రద్దీ తగ్గించడానికి - ప్రైవేట్ కార్లు వారానికి ఒక్క రోజయినా రోడ్ల మీదకు రాకూడదన్న నిబంధనలు ఇప్పటికే అమలులో వున్నాయి. అయినా చైనా రాజధానిలో వాహనాల వేగం చాలా వేగంగా తగ్గిపోతూ వుండడం అక్కడి అధికారులకు ఆందోళన కలిగిస్తోంది. అందుకే చాలా ముందుగా ప్రణాళికలు సిద్ధం చేసి రోడ్ల వెడల్పును భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా పెంచుకుంటూ వస్తున్నారు.

మౌలిక వసతుల అభివృద్ధి పధంలో చైనా

వీటన్నిటి వల్ల - ముందు ముందు మంచి జరగబోతున్నదన్న నమ్మకం ప్రజల్లో అంతగా వుండడం వల్ల - తాత్కాలిక ఇబ్బందులను  శాశ్వితంగా  పట్టించుకోకుండా జనం అంతగా సర్డుకుపోతున్నారని ప్రభుత్వ వర్గాలవాళ్ళు నమ్మకంగా సెలవిస్తున్నారు. అయితే బీజింగ్ సమీపంలో ఏర్పడ్డ ట్రాఫిక్ జామ్ పూర్తిగా తొలగించడానికీ, వాహనాల రాకపోకలను మునుపటి మాదిరిగా  పునరుద్ధరించడానికీ - యెట్లా లేదన్నా - మరో నెల రోజులు పట్టగలదని పేరు చెప్పడానికి ఇష్ట పడని మరో అధికారి వున్న విషయం చల్లగా బయట పెట్టాడు.
(24-08-2010)

NOTE:All images in the blog are copy righted to respective owners

21, జులై 2010, బుధవారం

జీవన స్రవంతి - భండారు శ్రీనివాస రావు

జీవన స్రవంతి - భండారు శ్రీనివాస రావు


(ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో రేడియోలో ప్రసారితం)




జీవనస్రవంతి - 1


'ఉప్పంటే ఏమిటి? దాని రుచి ఎలా వుంటుంది?' అంటే తెలియదు-

'రెండో ప్రపంచ యుద్ధం ఎప్పుడు జరిగిందంటే అదీ తెలియదు.

ఇవి ఏ ఇంటర్వ్యూ లోనో అడిగిన షరా మామూలు ప్రశ్నలు - జవాబులు కావు.


యెంతో అభివృద్ధి జరిగిందని జగమంతా అనుకుంటున్న సోవియెట్ రష్యా లాంటి దేశంలోని ఒక మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న ఒకానొక తెగవారు గత నలభై సంవత్సరాలనుంచి ఉప్పు రుచి ఎరగరు. రెండో ప్రపంచ యుద్ధం జరిగిన సంగతే వారికి తెలియదు.

ఈ మధ్య దారితప్పిన ఓ పరిశోధకుల బృందం - దారి తెలియక ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు తెలియవచ్చిన విషయాలు ఇవి.




జీవన స్రవంతి -2


పశ్చిమ బెంగాల్ లోని పోలిసులు పాగా వేసి ఓ పాగా లేని పెద్ద మనిషిని పట్టుకున్నారు. అతని దగ్గర పోలితిన్ సంచీ ఒకటి వారికి దొరికింది. దాంట్లో రెండు పుర్రెలు బయట పడ్డాయి. ఈ పుర్రెల సంగతి చెబుతావా? నీ బుర్ర రామకీర్తన పాడించమంటావా అని పోలీసులు సుతారంగా బెదిరించేసరికి, పాపం ఆ పుర్రెల షావుకారు జావకారిపోయి అసలు సంగతి ఒప్పేసుకున్నాడు. పుర్రెల్ని కలకత్తాలో హెచ్చు ధరలకు కొనే బడా వ్యాపారులున్నారన్న రహస్యం బయటపెట్టి వారి పుట్టి ముంచేసాడు. దాంతో పోలీసులు కలకత్తాలో కూడా దాడులు చేసి పుర్రెల వ్యాపారం చేసే వారిని పట్టేసుకుని కటకటాల వెనక్కు నెట్టేశారు.

జీవన స్రవంతి -3

దేశంలోని గూడ్స్ రైళ్లన్నీ కలసి ఏటా ఎంత సరుకుని రవాణా చేస్తున్నాయో - అంత కంటే ఎక్కువగా ఎడ్ల బండ్లపై సరుకుల రవాణా జరుగుతోందని ఆ మధ్య ఓ సర్వేలో తేలింది. ఇప్పుడా ఎడ్ల బండి మరోసారి వార్తల్లోకి ఎక్కింది.


 భారత దేశం తయారు చేసిన ఒక ఉపగ్రహాన్ని అర్జంటుగా అడంగుకి చేర్చడానికి ఎడ్ల బండిని ఉపయోగించిన వైనం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పంతొమ్మిదివందల ఎనభయి ఒకటిలో ఆ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపడానికి ముందు- కొన్ని పరీక్షలు జరపడానికి దాన్ని ఎడ్లబండిపై తీసుకు వెళ్ళారట. విదేశాల్లో ఈ పనికి ఎంతో పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేయాల్సి వచ్చేది. అయితే మనవాళ్ళు మాత్రం యాభయి రూపాయలకు ఒక ఎడ్లబండిని మాట్లాడి పనిపూర్తి చేశారు.

జీవన స్రవంతి -4

ఒక్కో దేశంలో జనాన్ని ఒక్కోరకమైన వింత రోగాలు పట్టి పీడిస్తుంటాయి.


ఈ మధ్య ఇంగ్లాండ్ లో జనం విపరీతంగా వొళ్ళు పెరిగిపోయి తెగ బాధ పడిపోతున్నారట. కాస్త కండ పట్టి, వొళ్ళు చేసి నిగ నిగలాడుతూవుంటే . బాగానే వుంటుందికాని, పెరిగే వొళ్ళు పెరిగిపోతూనేవుంటే ఏం బాగుంటుంది చెప్పండి ? ఇలా వొళ్ళు పెరిగిపోయే జబ్బు - రోజు రోజుకు పెరిగి పోతూ వుండడంతో .- జనంలో ఆందోళన కూడా అదే మోతాదులో పెరిగిపోతోందని అక్కడి రాయల్ వైద్య కళాశాల నివేదికలో పేర్కొన్నారు. పెద్దవారిలో ముప్పయి శాతం- పిల్లల్లో అయిదు శాతం ఊబకాయంతో లబ లబ లాడుతూ వున్నారట. గున్న ఏనుగుల్లా బలిసిన చిన్న పిల్లలు గున గున తిరుగుతూ- బరువు తగ్గడమెలా అన్న బెంగతో మంచమెక్కి - మరింత వొళ్ళు చేస్తున్నారట.

జీవన స్రవంతి -5

గుండె భద్రం తమ్ముడూ అంటున్నారు డాక్టర్లు.


  గుప్పెడు గుండెకాయపై గుండిగెలకొద్దీ భారాలనూ, బాధలనూ, భయాలనూ రుద్దకండీ- పిచ్చి గుండె గభాల్న ఆగి ఊరుకుంటుందని హెచ్చరిస్తున్నారు. మీ కోపం - మీకంటే - మీ గుండెకు ప్రధాన శత్రువని ఉచిత సందేశం కూడా ఇస్తున్నారు. మనసులో కక్షలూ, కార్పణ్యాలూ పెంచుకుంటూ పొతే- ఆ ప్రభావం గుండె మీదపడి గుండె జబ్బులకు దారి తీయగలదని గుండె మీద చేయి వేసుకుని మరీ చెబుతున్నారు. సిగరెట్ తాగడం గుండెకు ఎంత హాని చేస్తుందో- కోపతాపాలు కూడా గుండెని అంతే బలహీనం చేస్తాయని వారంటున్నారు. అంతేకాదు- నవ్వూ నవ్వించూ అంటూ నవ్వే భోగం- నవ్వే యోగం అనే ఫిలాసఫీతో జీవితాన్ని తేలిగ్గా తీసుకునేవారి గుండె మాత్రం నిక్షేపంగా వుంటుందట.
అయితే గుండె గురించి గుండె చెరువు అయిపోయే విషయాలు వీళ్ళిలా చెబుతుంటే- అమెరికాలోని ఫ్లోరిడా వైద్య కళాశాలలో పనిచేసే శాస్త్రవేత్తలు - చెప్పాపెట్టకుండా ఆగిపోయే గుండెని ఎన్నాళ్ళు నమ్ముకుంటామని ఏకంగా ఒక నకిలీ గుండెనే తయారుచేసారు. హృదయ చలనం ఆగిపోయిన రోగికి ఈ అయస్కాంతంతో రూపొందించిన ఈ నకిలీ గుండెని అమరిస్తే- గుండె చేసే పనులన్నీ అదే చేసేస్తుందట.

జీవన స్రవంతి -6



చాదస్తం మొగుడు చెబితే వినడు- కొడితే ఏడుస్తాడు అన్నట్టయింది పంజాబులో ఓ భర్తగారి పరిస్తితి.
అమృతసర్ దగ్గర ఓ ఊళ్ళో ఒక పెద్దమనిషి ఇంటి విషయాలు ఏమాత్రం పట్టించుకోకుండా - కేవలం వొంటికి మందు పట్టించడంలోనే ఎక్కువ సమయాన్నీ, డబ్బునూ ఖర్చు చేస్తూ వుండేవాడు.
 ఇంటి ఇల్లాలుకి ఇంటి ఖర్చులకింద ఏమీ ఇవ్వకుండా- సంపాదన అంతా తాగుడికే తగలేస్తూవుండడం ఆవిడకు సుతరామూ నచ్చేదికాదు.
నచ్చని సంగతి నయాన చెప్పింది. ఏడుస్తూ చెప్పింది. వేడుకుంటూ చెప్పింది. అయితే- మందు తలకెక్కిన ఆ పెద్దమనిషికి పెళ్ళాం మాటలు మాత్రం మనసుకు ఎక్కలేదు. పైపెచ్చు- ఇంట్లో గొడవలన్నింటికీ మందే మందు అని ధృడంగా నమ్మేసి తన మందు గొడవలోనే కూరుకుపోయాడు.
దానితో ఆ ఇల్లాలుకి చిర్రెత్తుకొచ్చింది.
భర్త పని చేసే దుకాణం ముందు ధర్నా ప్రారంభించింది. చోద్యం చూస్తున్నవారందరికీ తన మొగుడి నిర్వాకాన్ని తెలియచెప్పింది. ఆ విధంగా భాద్యత తెలియని భర్తలందరికి బుద్ధి చెప్పింది.

జీవన స్రవంతి -7

'అడుక్కోవాల్సిన ఖర్మ నాకేం పట్టింది- అప్పిచ్చే వాళ్ళు న్నంతకాలం.' అన్నాడొక అప్పారావు.
నిజమే. వూరికే ధర్మం చేసాడా- అప్పిచ్చాడు కాని - అని ఆనక బుకాయించవచ్చు- ఎంచక్కా అప్పు తీసేసుకుని.
 పంజాబు నేషనల్ బ్యాంకు వారు అడుక్కునేవాళ్ళకి అప్పులిచ్చిచూద్దామని ఆలోచన చేసి - కొందరు బిచ్చగాళ్ళకు రుణాలు మంజూరు చేశారు.


 బిలబిలమంటూ వచ్చి అప్పు తీసుకున్న భిక్షకులు ఆ డబ్బుతో స్వయం ఉపాదులు ఏర్పాటుచేసుకుని, రాబట్టుకున్న రాబడిలో కొంత మొత్తం బాకీ కింద బ్యాంకుకు చెల్లు వేసారు. దర్జాగా అప్పులుచేసి మొగం చాటేసి ఎగ్గొట్టే బడాబాబులకంటే పూటకు గతిలేని బిచ్చగాళ్ళే నయమన్నది సదరు బ్యాంకు వారి ఉవాచ.  

జీవన స్రవంతి -8

కొందరు సాహసాలు చేసి కీర్తి గడిస్తే- మరికొందరు దుస్సహాసాలకు దిగి జయిల్లో పడుతుంటారు.
ఫ్రాన్సు సైన్యంలో పనిచేస్తున్న ఓ కుర్ర ప్రేమికుడికి - కొత్తగా తళతళలాడుతున్న ఆర్మీ కారు కనిపించింది.


 అది వేసుకుకుని-తనకోసం ఎదురుచూస్తున్న ప్రేయసి వద్దకు వెడితే ఎలా వుంటుందో అని ఆలోచించడానికి అతగాడికి రెండు క్షణాలు కూడా పట్టలేదు. ఎందుకంటే- మరు క్షణంలోనే అతడు కారుని దొంగతనంగా బయటకు తీసుకువెళ్ళి- ఝామ్మున ప్రేయసి దగ్గరకు దూసుకుపోయాడు. చూసావా నా తడాఖా అంటూ ప్రియురాలితో డంబాలు పలకబోయేన్తలో - వెనుకనే వున్న పోలీసులు హఠాత్తుగా ముందుకొచ్చి కారు దొంగ చేతికి అరదండాలు తగిలించారు. వయస్సులోవున్న కుర్రాడు, కొత్త కారు చేతికి చిక్కితే - ముందుగా వెళ్ళేది ప్రేమించిన పిల్లదగ్గరికే అన్న ధర్మసూక్ష్మం తెలిసిన పోలీసులు- ఆ యువకుడికంటే ముందుగానే ఆమె దగ్గరికి వెళ్ళిపోయి, అతడికోసం కాచుకోవడంతో ఆ కుర్ర దొంగ కధ కాస్తా అడ్డం తిరిగింది. కొత్త కారులో- పాత ప్రేయసితో హాయిగా షికారు తిరుగుదామనుకున్న అతడిని ఆ కారులోనే కారాగారానికి చేర్చారు.


జీవన స్రవంతి -9

ప్రతి బియ్యపు గింజమీద తినేవాడి పేరు రాసుంటుంది అన్నది ఓ సామెత. పెళ్ళిళ్ళ విషయం కూడా అంతే అంటారు. ఎవరికెవరో ఎవరికెరుక ?
సౌదీ అరేబియాలో ఈమధ్య ఇలాంటి ఒక వివాహం - నిజం చెప్పాలంటే రెండు జరిగాయి.


ఇంట్లో వొంట్లో పుష్కలంగా వున్న ఒకానొక పెద్దమనిషి తన ఇద్దరు కుమార్తెలకీ పెళ్లి సంబంధాలు వెతికి- ఘనంగా వివాహ వేడుకలకు ఏర్పాట్లు చేసి- ఆర్భాటంగా నలుగుర్నీ పిలిచి - సరిగ్గా నిఖా సమయానికి నోరు జారి, తన కూతుళ్ళను - ముందు నిశ్చయం చేసుకున్న వరుళ్ళలో - ఒకరికి బదులు మరొకరికి ఇచ్చి పెళ్లి చేస్తున్నట్టు ప్రకటించాడు. తరువాత జరిగిన పొరబాటు తెలుసుకుని, నాలుక కరుచుకుని - , అవసరమయితే విడాకులు ఇప్పించయినా సరే - కూతుళ్ళకి ముందు నిర్ణయించిన వరులతోనే వివాహం జరిపిస్తానని మాట ఇచ్చాడు. అయితే ఆ అవసరం లేకుండా పోయింది. ఎందుకంటే- మారుపడిన మొగుళ్ళ తోనే మనువు కొనసాగిస్తామని ఆ కొత్త వధువులిద్దరూ మారు మాట లేకుండా రాజీ పడిపోయారు.


జీవన స్రవంతి -10

భార్యలమీద ప్రేమని ఒక్కొక్కరూ ఒక్కొక్కవిధంగా వెల్లడిస్తుంటారు కొందరు పెళ్ళాం మెడలో నగలు దిగవేసి తమ వగలు చూపిస్తే- మరికొందరు పట్టు చీరెలతో కట్టుకున్నవారిని ఆకట్టుకుంటూ వుంటారు. మనీలాలో- ఆర్మిడో పినేడా అనే వడ్రంగికి భార్య అంటే వల్లమాలిన ప్రేమ. ఎలాగయినా సరే- కష్టపడి కాసులు కూడబెట్టి - రెండస్తుల మేడ కట్టి- సుఖపెడతానని ఇల్లాలితో ఎప్పుడూ చెబుతుండేవాడు. పాపం- విధి వక్రించి- ఇంతలొ ఆ ఇంటావిడ కన్నుమూసింది.


ఆటను మాత్రం- భార్యనూ, ఆమెకిచ్చిన మాటనూ మరవలేదు. రేయింబవళ్ళు శ్రమించి, డబ్బులు పోగేసి- అనుకున్న ప్రకారం భార్య పేరున ఇల్లు కట్టాడు. ఆమె అవశేషాలతో ఇంట్లోనే సమాధి నిర్మించాడు. దానిపైన- భార్య చాయా చిత్రాన్ని వేలాడకట్టాడు . ఆవిడ జీవించి వుండగా ఉపయోగించిన గ్యాస్ స్టవ్ ను, పడక మంచాలను ఆ సమాధికి దగ్గరగా అమర్చాడు. అలా, గృహ ప్రాంగణం లోనూ, గృహ ప్రాంగణం లోను - ఇల్లాలి జ్ఞాపకాలను భద్రపరచుకుని రోజులు దొర్లిస్తున్నాడు.

(ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో రేడియోలో ప్రసారితం - భండారు శ్రీనివాసరావు)

NOTE: All images in this blog are copy righted to their respective owners.