24, అక్టోబర్ 2021, ఆదివారం

ప్రజలు గమనిస్తున్నారు - భండారు శ్రీనివాసరావు

 

(Published in Andhra Prabha Daily today, SUNDAY)
“ఏవిటండీ ఈ రాజకీయ నాయకులు మాట్లాడే భాష రోజురోజుకూ ఇలా దిగజారిపోతోంది?”
అన్నారు ఆకాశవాణి పూర్వ సంచాలకులు డాక్టర్ పీ.ఎస్. గోపాలకృష్ణ పొద్దున్నే ఫోను చేసి.
ఆయన మృదు స్వభావులు. సున్నిత మనస్కులు. ఆకాశవాణి హైదరాబాదు కేంద్రం డైరెక్టర్ గా పనిచేశారు. రేడియో కార్యక్రమాల్లో ఏదైనా అప్రాచ్యపు పదం ఒక్కటి పొరబాటున దొర్లినా విలవిలలాడేవారు. ఇక నేటి రాజకీయుల ఇష్టారాజ్యపు మాటల తూటాలు టీవీల్లో వింటూ ఇంకా యెంత మధన పడుతున్నారో అర్ధం చేసుకోవచ్చు.
అనకూడని మాట, అనదగ్గ మాట అనే తేడా లేకుండా పోతోందని ఆయన బాధ. కానీ చేయగలిగింది ఏముంది? ఆయనంటే త్రేతాయుగం నాటి మనిషి.
త్రేతాయుగం అంటే జ్ఞాపకం వచ్చింది. ఆ కాలంలో కూడా ఇలా ప్రల్లదనపు మాటలు మాట్లాడేవాళ్ళు లేకపోలేదు. సీతను అపహరించుకుని పోయి లంకలో అశోకవనంలో బంధించిన రావణుడు సీతమ్మ వారితో అంటాడు.
“చనిపోయాడో, బతికున్నాడో తెలియని నీ మొగుడు రాముడి కోసం ఇలా అస్తమానం బాధపడుతూ నీ నిండు జీవితాన్ని ఎందుకిలా, ఎన్నాళ్ళిలా పాడు చేసుకుంటావు. నువ్వు ఊ అను, నా భార్యగా చేసుకుని లంకకు రాణిగా చేస్తా. జీవితంలో కనీ వినీ ఎరుగని భోగాలు అనుభవించేలా చేస్తా!” అంటూ పరాయి స్త్రీతో అనకూడని మాటలు అంటాడు.
దానికి సీత జవాబుగా అన్నట్టు అక్కడ కనపడ్డ ఒక గడ్డిపోచను తనకూ, రావణుడికీ నడుమ ఉంచుతుంది, ‘నా దృష్టిలో నువ్వు తృణప్రాయం’ అనే సంకేతం ఇస్తూ.
ఇక ద్వాపర యుగంలో ఉచితానుచితాల అన్వయం మరింత రూపు మార్చుకుంది.
నిండు కొలువులో ఏకవస్త్ర అయిన ద్రౌపదిని వలువలు ఊడ్చే ముందు, దుర్యోధనుడు ఆమెకు తన వామాంకాన్ని చేతితో చూపుతూ, ‘రా! వచ్చి ఇక్కడ కూర్చో!’ అని సైగ చేస్తాడు. సభలో ఉన్న భీష్మ ద్రోణాదులు సిగ్గుతో మెలికలు తిరుగుతారు.
ఇక కలియుగం సంగతి చెప్పేది ఏముంది!
విలువల పతనం అనేది శంభుని శిరంబందుండి....అన్నట్టుగా అతివేగంగా సాగుతోంది. ఇక ఔచిత్యం, అనౌచిత్యం అనే తేడా లేకుండా పోతోంది. అందరూ ఔనని తలూపుతున్నప్పుడు ఇక ఈ తేడాపాళాల ప్రసక్తి ఏముంది?
పూర్వం కవులు తమ రచనల అవతారికలో ఒక విన్నపం చేసుకునేవారు.
“అనౌచిత్యంబు పరిహరించుచు, ఔచిత్యంబు పాటించుచు, ఈ రచన చేసాను” అని పేర్కొనేవారు, తెలిసీ తెలియక ఏమైనా రాయకూడని పదాలు వాడామేమో అనే శంకతో.
ఇప్పుడా కుశంకలు దివిటీ పెట్టి వెతికినా కనబడవు.
మంచీచెడులను అభివ్యక్తీకరించే సమయంలో మహా కవులు కొన్ని ఔచిత్యాలను పాటించేవారు. అంటే ఎక్కడ ఆకట్టునేలా ఎక్కడ ఎలా చెప్పాలో, ఎక్కడ కర్రుకాల్చి వాత పెట్టాలో వారికి వెన్నతో పెట్టిన విద్య.
ఒకసారి తెనాలి రామకృష్ణుడు లేని సమయంలో శ్రీ కృష్ణ దేవరాయలు "కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్" అనే సమస్యను పూరణకి ఇవ్వగా, సభలో ఎవ్వరూ పూరించలేకపొయారు. అది తెనాలి రామలింగడు ఎలా పూరిస్తాడా అని రాజగురువు తాతాచార్యులవారు అదే సమస్యని ఒక ద్వారపాలకుడితో అడిగిస్తాడు. దానికి తెనాలి రామలింగడి పూరణః
గంజాయి త్రాగి తురకల
సంజాతల గూడి కల్లు చవిగొన్నావా?
లంజల కొడకా ఎచ్చట
కుంజర యూథంబు దోమ కుత్తుక జొచ్చెన్
అని సమస్యను పూరించడంతో తేలుకుట్టిన దొంగల్లా తాతాచార్యులు, భట్టుమూర్తి కిక్కురు మనకుండా ఊరుకుంటారు. అయితే ఎలాగైనా రామకృష్ణుడికి బుద్ధి చెప్పాలని రాయల వారికి ఫిర్యాదు చేస్తారు. రాయల వారు వికటకవిని పిలిచి అదే సమస్యను ఇచ్చి పూరించమంటాడు. అపుడు రామకృష్ణుడు తెలివిగా ఈ క్రింది పద్యం చెబుతాడు..
రంజన చెడి పాండవులరి
భంజనులై విరటు కొల్వు పాలైరకటా!
సంజయా! విధి నేమందును
కుంజర యూధంబు దోమ కుత్తుక జొచ్చెన్ !
అది విని రాయలవారు "శభాష్! రామకృష్ణా! నీ బుద్ధి బలానికి రెండు ప్రక్కల పదునే" అని మెచ్చుకుంటాడు.
కొన్ని పదాలు నోటితో అనడానికి, చెవితో వినడానికి కూడా కంపరం కలిగిస్తాయి. అందుకే కాబోలు, బూతు బూతులా వినిపించకుండా దర్శకుడు జంధ్యాల ఓ చిత్రంలో చక్కటి సన్నివేశం సృష్టించి చూపారు.
ప్రత్యక్ష ప్రసారాల కారణంగా వాటిని అప్పటికప్పుడు ఎడిట్ చేసి ప్రసారం చేయడంలో కొంత సాంకేతిక ఇబ్బంది ఉన్నమాట నిజమే. ప్రత్యక్ష ప్రసారం వల్ల మొదటిసారి అటువంటి పదాలను తొలగించి ప్రసారం చేయడానికి వీలు ఉండకపోవచ్చు. కానీ తదుపరి ప్రసారాల్లో వాటిని పదేపదే పనికట్టుకుని అదేపనిగా పునః ప్రసారం చేయడం వల్ల గరిష్ట స్థాయిలో అవన్నీ చేరకూడని ప్రజలకు చేరిపోతున్నాయి. ఇందులో రాజకీయ నాయకుల తప్పిదం కంటే మీడియా బాధ్యతారాహిత్యమే ఎక్కువ. ఇది తగ్గించుకుంటే సమాజానికి మంచిది.
టీవీ ఛానల్ చర్చలకు వచ్చే ఒక రాజకీయ పార్టీ ప్రతినిధి నిర్మొహమాటంగా ఒకసారి నాతోనే చెప్పారు, ‘జర్నలిష్టులయినా, విశ్లేషకులయినా ఎవరయినా సరే, ఏ ఒక్కర్నీ ఉపేక్షించవద్దు, గట్టిగా తిప్పికొట్టండి, మన వాదాన్ని బలంగా వినిపించండి' అంటూ తమ నాయకుడే తమను ఆదేశించాడని. నిజానికి ఏ నాయకుడు అలా చెప్పడు. ఆ పార్టీ ప్రతినిధి అమాయకంగా చెప్పాడో, కావాలని చెప్పాడో కాని అదే నిజమయితే ఆ పార్టీ నాయకుడికి అది ఎంత అప్రదిష్ట.
రాళ్ళు కలిసిన బియ్యం వొండితే అన్నంలో రాళ్ళు పంటికి తగులుతాయి. జల్లెడ పట్టి రాళ్ళను వేరు చేస్తే వొండిన అన్నం నోటికి హితవుగా వుంటుంది. చదువూ సంధ్యాలేని గ్రామీణ ప్రాంతాల వాళ్లకు కూడా తెలిసిన ఈ నిజం నేటి రాజకీయ నాయకులు అర్ధం చేసుకోలేక పోతున్నారు. అర్ధం అయినా అర్ధం కానట్టు వుండిపోతున్నారని అనుకోవాలి. ఇదో విషాదం.
‘నైతిక హక్కు, చిత్తశుద్ధి, ప్రజలు గమనిస్తున్నారు’ ఈ మూడు ముక్కలూ రాజకీయ పార్టీల ప్రతినిధులు అలవోకగా వల్లెవేసే పడికట్టుపదాలు.
మొదటి రెండూ అన్ని పార్టీల్లో హుళక్కే. కనీసం ‘ప్రజలు గమనిస్తున్నారు’ అంటూ తరచూ తాము పేర్కొనే ఊతపదాన్ని అయినా గుర్తుంచుకుంటే అన్ని పార్టీలకీ మంచిది. ప్రజాస్వామ్యానికి మరింత మంచిది.
ఈ ‘గమనించే ప్రజల్లో’ వారికి మద్దతుగా నిలిచే కార్యకర్తలు, అభిమానులు మాత్రమే కాదు, అసలు ఏ పార్టీకి చెందనివాళ్ళు, రాజకీయాల అంటూ సొంటూ ఎరగని వాళ్ళూ ఉంటారని కూడా గమనంలో పెట్టుకోవడం ఆయా పార్టీలకి ఇంకా మంచిది.
తరాలు మారుతున్నప్పుడు, వర్తమాన తరం వెనుకటి తరాన్ని చిన్నబుచ్చడం, హేళన చేయడం తరతరాలుగా వస్తోంది. పెద్దల సుద్దులను చాదస్తంగా కొట్టివేయడం మార్పుకున్న ప్రధమ లక్షణం. ఇలా మారిపోతున్న జనాల్లోనుంచే నాయకులు పుడతారు. మేథావులు పుడతారు. కవులు, రచయితలు పుడతారు. పాఠకులు పుడతారు. శ్రోతలు పుడతారు. వీక్షకులు పుడతారు. వీళ్ళ సభ్యతా సంస్కారాల కొలబద్దలు కూడా మార్పులకి తగ్గట్టుగానే మారిపోతుంటాయి. మార్పుని అంగీకరించని మునుపటి తరం మౌనవీక్షణలో మునిగి సణుగుతుంటే, ఏది ఒప్పో, ఏది తప్పో చెప్పేవాళ్ళు లేక, చెప్పినా ఒప్పుకునే తత్త్వం లేక నవతరం ముందుకు సాగుతూ వుంటుంది. తరాల అంతరాల్లోనుంచి మొలకెత్తిన వైరుధ్యాలు, వైకల్యాల ప్రతిరూపాలే ఈనాడు సమాజంలోని అన్ని వర్గాలను ఆశ్రయించుకుని బహుముఖ రూపాల్లో బయటపడుతున్నాయి.
అందుకే, సమస్యతో సంబంధం వున్న వాళ్ళందరూ ఈ చర్చలో భాగస్వాములు కావాలి. ఎవరి పాత్ర ఎంతవరకో స్వచ్చందంగా నిర్దేశించుకోవాలి. అనారోగ్యకరమయిన సంచలన ప్రసారాలకు తమకు తామే అడ్డుకట్ట వేసుకోవాలి. సంచలనానికి సంయమనం జోడించి నిఖార్సయిన సమాచారం అందించే బాద్యతను మీడియా నెత్తికెత్తుకోవాలి.
మంచీ చెడు అనికదా మొదలు పెట్టాం, అవేమిటో చెప్పుకుని ముగిద్దాం.
ఈ ప్రపంచం పుట్టినప్పుడే మంచీ చెడు అనేవి కూడా పుట్టాయి. వాటిని ఎలా తెలుసుకోవాలి?
ఈ ప్రశ్నకు సమాధానం భారతంలో వుంది.
కృష్ణుడు, భీష్ముడు కలిసి ఇది తెలుసుకోవడానికి ఒక ఉపాయం ఆలోచించారు.
ముందు దుర్యోధనుడిని పిలిచి సూర్యాస్తమయం వరకు నగరంలో తిరిగి రమ్మన్నారు. ఎక్కడయినా ఒక మంచి మనిషి తటస్థ పడితే వెంటనే రాజసభకు వచ్చి ఆ విషయం తెలియచేయమన్నారు.
తరువాత ధర్మరాజును విడిగా పిలిచి నగర పర్యటన చేసి ఎక్కడయినా ఒక చెడ్డ మనిషి కనిపిస్తే తక్షణం ఆ సంగతి తమతో చెప్పాలని ఆదేశించారు.
పొద్దుగుంకుతున్న సమయంలో దుర్యోధనుడు తిరిగి వచ్చాడు. యెంత దూరం తిరిగినా మంచివాడు అనేవాడు ఒక్కడు కూడా తన కంటికి కానరాలేదని చెప్పాడు. కాసేపటికి యుధిష్టురుడు వచ్చాడు. అతడిదీ అదే సమాధానం. యెంత వెతికినా ఒక్క దుర్మార్గుడు కూడా ధర్మజుడుడికి తటస్థ పడలేదు.
అంటే ఏమిటి?
నాలో ఉన్న ‘నేను’ ఎలాటివాడినో, బయటి ప్రపంచంలో నాకు అలాటి వాళ్ళే కనబడతారు. నిజానికి బయట కనబడేది అంతా, మన లోపల ఉన్నదానికి ప్రతిరూపమే.



22, అక్టోబర్ 2021, శుక్రవారం

నిశ్శబ్దం నీకూ నాకూ మధ్య......


పిన్ డ్రాప్ సైలెన్స్
సూది కింద పడ్డా వినబడేంత నిశ్శబ్దం అని దీనికి అనువాదం చెప్పుకోవచ్చు. ఇలాటిది ఎప్పుడయినా అనుభవంలోకి వచ్చిందా?
ఫీల్డ్ మార్షల్ శామ్ బహదూర్ మానెక్ షా. ఒకానొక కాలంలో స్వతంత్ర భారత దేశానికి సర్వ సైన్యాధ్యక్షుడు. ఆయన ఒక సారి గుజరాత్ లోని అహమ్మదాబాదులో సభలో మాట్లాడుతున్నారు. మానెక్ షా ఇంగ్లీష్ లో మాట్లాడ్డం సభికులకు నచ్చలేదు. గుజరాతీ భాషలోనే ప్రసంగించాలని పట్టుబట్టారు. అసలే సైన్యాధ్యక్షుడు. క్రమశిక్షణకు పెద్ద పీట వేసే రకం. ఆయన ఒక్క నిమిషం సభికులని తేరిపార చూసి ఇంగ్లీష్ లోనే ప్రసంగం కొనసాగిస్తూ ఇలా చెప్పారు.
“నేను అనేక యుద్ధాల్లో పాల్గొన్న మనిషిని. సైన్యం అంటే ఏ ఒక్క భాష మాట్లాడేవాళ్ళో వుండరు. అనేక ప్రాంతాలవాళ్ళు సైన్యంలో చేరతారు. సిఖ్ రెజిమెంట్ లో పనిచేసే వారి నుంచి పంజాబీ నేర్చుకున్నాను. మరాఠా రెజిమెంటులో చేరిన వారి నుంచి మరాఠీ భాష నేర్చుకున్నాను. అలాగే మద్రాసు సాపర్స్ నుంచి తమిళ భాష బెంగాలీ సాపర్స్ నుంచి బెంగాలీ నుడికారం పట్టుకున్నాను. బీహార్ రెజిమెంటు నుంచి హిందీ, ఘూర్ఖా రేజిమెంటు నుంచి నేపాలీ భాష నేర్చుకున్నాను. దురదృష్టం, గుజరాతీ భాష నేర్చుకుందాం అంటే అదేమిటో గుజరాత్ నుంచి ఎవ్వరూ సైన్యంలో చేరడం లేదు, అందరూ వ్యాపారాల పట్ల మక్కువ చూపే వాళ్ళే!’
అంతే! సభ మొత్తం ‘పిన్ డ్రాప్ సైలెన్స్!’

తోకటపా:

ఫీల్డ్ మార్షల్ మానెక్ షా అంటే ఆషామాషీ కాదు. అప్పటి రక్షణ మంత్రి కృష్ణ మీనన్ కు నో అని మొహం మీదనే చెప్పగలిగిన ధీశాలి. ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ వెంట ఆయన కుమార్తె ఇందిరా గాంధి సైనిక స్థావరాల్లోకి ప్రవేశించడానికి అనుమతించని గొప్ప సైనికాధికారి.





21, అక్టోబర్ 2021, గురువారం

దారి ఇచ్చిన కుక్క – భండారు శ్రీనివాసరావు


ఇదేదో పరాయి దేశాన్ని పొగిడి, మన దేశాన్ని కించపరచడానికి కాదు ఈ పోస్టు. ప్రపంచంలో అన్ని దేశాలకు భారతదేశం నాగరికత నేర్పిందని చరిత్ర చెప్పే పాఠాలు నిజమే. కానీ అది గతం. ఇప్పుడెక్కడున్నాం. అదీ ఆలోచించుకోవాలి. ఆత్మ పరిశీలన చేసుకోవాలి.
అమెరికాలో కుమారుడి దగ్గర ఉంటున్న శాస్త్రి గారు పొద్దున ఫోన్ చేశారు. శాస్త్రి గారంటే వేమూరి విశ్వనాధ శాస్త్రి. వీవీ శాస్త్రి అంటే రేడియోలో పనిచేసేవారికి బాగా తెలుస్తుంది. స్టేషన్ డైరెక్టర్ గా సుదీర్ఘ కాలం పనిచేశారు.
శాస్త్రిగారు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నది దక్షిణ సాన్ ఫ్రాన్సిస్ స్కోలోని పసిఫికా అనే ప్రాంతంలో. దగ్గరలో పసిఫిక్ మహాసముద్రం బీచ్. అక్కడికి మార్నింగ్ వాక్ కోసం వెళ్ళడం అలవాటు చేసుకున్నారు. రోడ్డు పక్కన సన్నటి కాలిబాట బాగానే ఉన్నప్పటికీ దారి ఎగుడు దిగుడుగా ఉంటుందట. ఈయన గారెకి కాలు ఎత్తివేసే అలవాటు. దానికి ఆయనే అవిటి కాలు అని పేరు పెట్టుకున్నారు. వయసు ఎనభై దాటడం వల్ల అది సహజంగా వచ్చి వుంటుంది. ఆయన మెల్లగా నడిచి వెడుతున్నప్పుడు ఎదురుగా వచ్చేవారు బాట మీద నుంచి కొంచెం పక్కకు దిగి దారి ఇస్తారట. వృద్ధులకు అక్కడి వారు ఇచ్చే గౌరవం అది. మొన్న ఒక వ్యక్తి కుక్కతో సహా వాహ్వ్యాలికి వచ్చి ఈయనకు ఎదురు పడ్డాడట. కుక్క ముందు నడుస్తోంది. ఆ ఆసామీ దాని గొలుసు పట్టుకుని వెనకనే వస్తున్నాడట. చిత్రంగా ఆ కుక్క కూడా శాస్త్రి గారు ఎదురుపడగానే పక్కకు తప్పుకుని శాస్త్రి గారెకి దారి ఇచ్చిందట. ఇది చూసినప్పుడు ఆయనకు హైదరాబాదు అనుభవం గుర్తుకు వచ్చిందట.
శాస్త్రి గారెకి కృష్ణా నగర్ ఉమెన్స్ కోఆపరేటివ్ సొసైటీలో స్థలంలో సొంత ఇల్లు వుంది. రోజూ ఈవెనింగ్ వాకింగ్ కి వెళ్ళే అలవాటు. అసలే ఇరుకు రోడ్లు. పేవ్ మెంట్లు సరిగా వుండవు. పైగా వన్ వే. వాహనాలు వేగంగా దూసుకు పోతుంటాయి. ఆటోలు అడదిడ్డంగా కాలిబాటల మీదనే పార్క్ చేస్తారు. ‘కాస్త పక్కకు తీస్తావా’ అని ఒక ఆటో డ్రైవర్ ని మర్యాదగానే అడిగారట. ‘నేనెందుకు తీయాలి, మీరే దిగి రోడ్డు మీద వెళ్ళండి’ అని దురుసుగా జవాబిచ్చాడట.

వృత్తి - ప్రవృత్తి - భండారు శ్రీనివాసరావు

యాచక ప్రవృత్తి కంటే యాచక వృత్తి మేలంటారు డాక్టర్ బాలాజీ

నిజమే అనిపిస్తుంది కాస్త ఆలోచిస్తే.
యాచకుడు తన వృత్తి ధర్మంలో భాగంగా రోజల్లా అడుక్కుని ఎంతో కొంత సంపాదించి తను తినగా మిగిలినదాన్ని అవసరంలో ఉన్న తన తోటివారికి ఇస్తాడు.
యాచక ప్రవృత్తి కలిగిన వాళ్ళు అలా కాదు.
కట్టుకుపోలేము, పోయేటప్పుడు వెంట పట్టుకుపోలేము అని తెలిసి కూడా సంపాదన యావలో పడి కొట్టుమిట్టాడే వాళ్ళకి అడుక్కునే బుద్ది అంత తేలిగ్గా వదలదు. చిన్న చిన్న వాటికి కూడా కక్కుర్తి పడడం అందరూ ఎరిగినదే

20, అక్టోబర్ 2021, బుధవారం

మీడియాకు విజ్ఞప్తి – భండారు శ్రీనివాసరావు

కొన్ని పదాలు నోటితో అనడానికి, చెవితో వినడానికి కూడా కంపరం కలిగిస్తాయి. అందుకే కాబోలు, బూతు బూతులా వినిపించకుండా దర్శకుడు జంధ్యాల ఓ చిత్రంలో చక్కటి సన్నివేశం సృష్టించి చూపారు.
ప్రత్యక్ష ప్రసారాల కారణంగా వాటిని అప్పటికప్పుడు ఎడిట్ చేసి ప్రసారం చేయడంలో కొంత సాంకేతిక ఇబ్బంది ఉన్నమాట నిజమే. తెలుగునాట ప్రత్యేకించి ఆంధ్ర ప్రదేశ్ లో అనేక మంది రాజకీయ నాయకులు వాటిని యధేచ్చగా ఉచ్చరిస్తూ వుండడం అందరూ చూస్తూ వున్నారు. ఈ విషయంలో ఈ పార్టీ ఆ పార్టీ అనే తేడా లేదు. కొంచెం డిగ్రీ డిఫరెన్స్.
ఒక మీడియా మనిషిగా మీడియాకు నా సలహా ఏమిటంటే, ప్రత్యక్ష ప్రసారం వల్ల మొదటిసారి అటువంటి పదాలను తొలగించి ప్రసారం చేయడానికి వీలు ఉండకపోవచ్చు. కానీ తదుపరి ప్రసారాల్లో వాటిని పదేపదే ప్రసారం చేయడం వల్ల గరిష్ట స్థాయిలో అవన్నీ చేరకూడని ప్రజలకు చేరిపోతున్నాయి. ఇందులో రాజకీయ నాయకుల తప్పిదం కంటే మీడియా బాధ్యతారాహిత్యమే ఎక్కువ. ఇది తగ్గించుకుంటే సమాజానికి మంచిది.
(నోట్: ఇది చాలా పాత పోస్టు. ఏపీ ఉమ్మడి రాష్ట్రంగా వున్నప్పుడు ఓ సందర్భంలో రాసిన వ్యాసంలోని వాక్యాలు ఇవి. అంచేత జరిగిన, జరుగుతున్న పరిణామాల మీద మీ వ్యాఖ్య ఏమిటి అంటూ వివాదం చేయవద్దు. దారి తప్పిన రాజకీయం కంటే, దోవ తప్పిన మీడియా వల్ల సమాజానికి ఎక్కువ చెడుపు జరుగుతుందనేది నా నమ్మకం. రాజకీయుల దండాగిరి గురించి, వారి అనాగరిక చర్యలు గురించి గతంలో రాసి రాసి, రాసేవారికి, చదివేవారికి విసుగు పుడుతోంది. అంచేత వారికి నీతి బోధలు చేయడం వృధా)




NOTE: COURTESY CARTOONIST RAJU EPURI


(20-10-2021)

మంచితనానికి దైవానుగ్రహం తోడయితే..... భండారు శ్రీనివాసరావు

 మూడేళ్ల క్రితం ఇదే రోజున తిరుమలమ్మ మా ఇంటికి వచ్చింది. పోల్చుకోవడానికి కొంత సమయం పట్టిన మాట నిజం.

ఈ అమ్మాయి ఎవరో చెప్పడానికి ముందు కొంచెం నేపధ్యం తెలపడం అవసరం.
1992 లో మేము మాస్కోనుంచి వచ్చేసి హైదరాబాదులో ఇల్లు వెతుక్కుంటున్న రోజులు. వెంట తెచ్చుకున్న అయిదారు సూటుకేసులు మా పెద్దన్నయ్య పర్వతాలరావు గారి పంజాగుట్ట క్వార్టర్ లో వదిలేసాము. కంటైనర్లో వేసిన మిగిలిన సామాను, రష్యా నుంచి ఓడలో మద్రాసు వచ్చి మళ్ళీ రోడ్డు మార్గంలో హైదరాబాదు చేరడానికి రెండు మూడు నెలలు పడుతుంది. కాబట్టి ఇల్లు వెతుకులాట కార్యక్రమం కాసింత నెమ్మదిగానే సాగింది, హడావిడి లేకుండా.
మా అన్నయ్యగారి ఇంటికి దగ్గరలోనే ఇటు పంజాగుట్ట మెయిన్ రోడ్డు, అటు రాజ భవన్ రోడ్డు నడుమ దుర్గానగర్ అనే కాలనీలో ఓ ఇల్లు దొరికింది. అద్దె పద్దెనిమిది వందలు. మాస్కోనుంచి ఓడలో వచ్చే సామాను కోసం అంత కిరాయి పెట్టక తప్పలేదు.
మా ఇంటి సందు మొదట్లో ఓ గుడిసెలో కాపురం ఉంటున్న యాదమ్మ మా ఇంట్లో పనికి కుదిరింది. మొగుడు మల్లయ్యకు సొంత ఆటో వుంది. ఆ బండే వీరి బతుకు బండికి ఆధారం. ఈ తిరుమల అనే అమ్మాయి యాదమ్మ, మల్లయ్యల కడసారి కుమార్తె. ఆ దంపతులకు అందరూ ఆడపిల్లలే. కళ, భాగ్య, సంపూర్ణ, తిరుమల అందరూ మా ఇంట్లోనే దాదాపు పెరిగారు. బిడ్డల్ని వెంటేసుకుని యాదమ్మ పనికి వచ్చేది. వీళ్ళు కూడా వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యేవరకు మా ఇంట్లోనే పనిపాటులు చూస్తుండేవారు. కాలక్రమంలో మేము అనేక ఇళ్ళు మారుతూ వచ్చినా ఆ కుటుంబం మాత్రం మమ్మల్ని వదిలిపెట్టలేదు. కళకు పెళ్ళయి ఇద్దరు పిల్లలు పుడితే వారిద్దరికీ మా పిల్లల పేర్లే సందీప్, సంతోష్ అని పెట్టుకుంది. యాదమ్మ మనుమడు సందీప్ తొమ్మిదో తరగతి. ప్రభుత్వ పాఠశాలలో చేరి మంచి మార్కులు తెచ్చుకుంటూ, బాగా చదువుకుంటున్న అతడికి తెలంగాణా ప్రభుత్వం పదిహేను వేల రూపాయల స్కాలర్ షిప్ కూడా ఇచ్చింది.
మరో అమ్మాయి కుమార్తెకు మంచి సంబంధం దొరికింది. ఆ అబ్బాయికి ఏదో మల్టీ నేషనల్ కంపెనీలో ఉద్యోగం. నలభయ్ లక్షలు పెట్టి ఫ్లాటు కొనుక్కుని ఆ గృహ ప్రవేశానికి మమ్మల్ని కూడా పిలిచారు.
మా ఇంట్లో పారాడుతూ పెరిగిన తిరుమలమ్మకు కూడా పెళ్లయింది. కూకట్ పల్లిలో ప్రభుత్వం బలహీన వర్గాలకు కేటాయించిన ఫ్లాటులో వుంటున్నారు. మొగుడు మంచి ఉద్యోగం చేస్తున్నాడు. పెళ్ళికి ముందు ఏదో పెద్ద బట్టల దుకాణంలో సేల్స్ గర్ల్ గా పనిచేసేది.
నువ్వేం చేస్తున్నావని తిరుమలమ్మను అడిగితే, ‘నేనిప్పుడు పూర్తిగా హౌస్ వైఫ్. ఇంట్లోనే వుండి నా పిల్లల మంచీచెడూ చూసుకుంటున్నాను’ అంది నవ్వుతూ.
పెద్ద ఆశలు పెట్టుకోకుండా పిల్లల్ని పెంచిన మల్లయ్య దంపతుల ఆశలపై వాళ్ళు నమ్ముకున్న యాదాద్రి నరసింహుడు నీళ్ళు చల్లలేదు. సరికదా, వారిని చల్లగా చూస్తున్నాడు. శుభం!




19, అక్టోబర్ 2021, మంగళవారం

రేడియో ప్రాంగణంలో సమాధి చేయాలి – రావూరి భరధ్వాజ కడపటి కోరిక

 

జ్ఞానపీఠ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ గారి రెండో వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాల్ని మననం చేసుకుంటూ రాసిన దానికి ఇది జోడింపు." భరద్వాజ గారికి జ్ఞానపీఠ అవార్డు ప్రకటించినప్పుడు ప్రముఖ జర్నలిష్టు రెంటాల జయదేవ్ గారు ఆయన్ని ఇంటర్వ్యూ చేసారు. అది ప్రజాశక్తిలో వచ్చింది. మనసు ఆర్ద్రం అయ్యే ఒక జవాబు చెప్పారు అందులో భరద్వాజ గారు. నేను రేడియో మనిషిని కనుక దాన్ని అందరితో పంచుకోవాలని సహజంగా అనిపించింది. అదే ఇది.



(రావూరి భరధ్వాజ)


"ఆకాశవాణిలో ఉద్యోగానికి మీ జీవితంలో ఎలాంటి పాత్ర ఉంది? రెంటాల గారి ప్రశ్న. భరద్వాజ గారు ఉద్వేగానికి గురవుతూ ఇచ్చిన సమాధానం : "కడుపు నిండా తినడానికి పట్టెడన్నం కోసం కష్టపడిన రోజులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి నేను, నా భార్య, నా బిడ్డలు కడుపు నిండా ఇంత తినడానికి జీతభత్యాలతో కూడిన ఉద్యోగమిచ్చిన సంస్థ – ఆకాశవాణి. అప్పట్లో 185 రూపాయల జీతమంటే చాలా ఎక్కువ. హైదరాబాద్‌ ఆకాశవాణిలో నాకు ఉద్యోగం రావడానికి కారణమైన రచయిత త్రిపురనేని గోపీచంద్‌ను మర్చిపోలేను. నాకు ఎన్నో పుస్తకాలు చదువుకొనే అవకాశం, ఆలోచించే తీరిక, రాసే అవకాశకం ఇచ్చింది ఆకాశవాణే. నాకున్న పరిధిని విస్తృతీకరించిన మహౌన్నత కళాసంస్థ అది. ఆ జీవితాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. (గొంతు గద్గదికం అవుతుండగా…) నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. అది తీరుతుందో, లేదో కానీ… నేను చనిపోయాక, నా పార్థివ శరీరాన్ని ఆకాశవాణి ప్రాంగణంలో భూస్థాపితం చేయాలి. ఆకాశవాణిలోకి వచ్చే కళాకారులు, సాహితీవేత్తలందరూ దాని మీద నుంచే నడుచుకుంటూ పోవాలి. అవకాశం ఉంటే, వచ్చే జన్మలో ఆకాశవాణిలో ఓ చిన్న గరికపోచగా పుట్టాలని కోరిక!" (రెంటాల గారికి కృతజ్ఞతలు)