10, జులై 2021, శనివారం

రంగస్థల కృష్ణ మూర్తి పీసపాటి నరసింహ మూర్తి

(ఈరోజు జులై 10, ఆయన జయంతి)

కురుక్షేత్రంలో శ్రీ కృష్ణ పాత్రధారి అనగానే అందరికి గుర్తు వచ్చే పేరు పీసపాటి నరసింహ మూర్తి గారు.
విజయనగరం దగ్గర ‘రాముడు వలస’ అనే చిన్న వూళ్ళో వుండేవారు. ఎక్కడకి వెళ్ళాలన్న అక్కడ నుంచే. సాంప్రదాయ మైన బ్రాహ్మణ కుటుంబం కావడంతో సంస్కృతం, తెలుగు భాషల్లో మంచి పట్టు వుండేది.ఆజాన బాహుడు. అవసరమైన వరకే సంగీతం పద్యంలో చొప్పించి పాడే వారు. ఎంత గొప్పగా ఉండేదో.
ఆయన నాటకం చూడలేకపోతే జీవితంలో వో మంచి అవకాశం పోగొట్టుకున్నట్టే. తెలుగు వారంతా బ్రహ్మరథం పట్టడంతోపాటు, నటుడిగా ఆయనకు రావల్సిన గౌరవాలన్నీ దక్కాయి వొక్క పద్మ అవార్డు మినహా.
ఓసారి తిరుపతి వెంకట కవుల సమక్షంలో ‘ఉద్యోగ విజయాలు’ పోటీలు జరిగాయి. అందులో కృష్ణ పాత్రధారి పీసపాటి బంగారు కీరీటం బహుమతిగా పొందారు. 'మామా సత్యవతీ పౌత్రా! ధాత్రరాష్ట్రులకు పాండవులకు సంధి చేసి ఈ రాజలోకమ్మును కాపాడుమని యాచించుటకయి పాండవదూతగా నీ వద్దకు వచ్చితి’ అంటూ ఆయన రాయబారం సీన్ లో ప్రవేశించడం ఓ మధురాతి మధురమైన జ్ఞాపకం. ‘పతితులు కారు నీయెడల భక్తులు, శుంఠలు కారు విద్యలన్ చతురులు’ అని పాండవుల గొప్పతనం గురించి కౌరవుల సభలోచెప్పడం కూడా ఎంతో రమ్యంగా వుండేది. ‘ఒన్స్ మోర్’ లు పట్టించుకునే వారు కాదు. ఇక తప్పని సరి అయితే సంభాషణలు మార్చి కొత్తదనంతో అదే పద్యాన్ని కొద్దిగా మార్చి పాడేవారు. ప్రేక్షకులంతా హర్ష ధ్వానాలు చేసేవారు.
తెలుగు నాటకరంగాన్ని కొన్నేళ్ళ పాటు ఏలిన నటుడు పీసపాటి నరసింహ మూర్తి.



తెలుగు సినీ హాస్యానికి పెట్టని కోట, కోట శ్రీనివాసరావు

 (జులై, 10, కోట పుట్టినరోజు) 

“రేడియో నుంచి చాలా నేర్చుకున్నాను. ఉచ్చారణ ఎలా వుండాలి? ఏ వాక్యాన్ని ఎక్కడ ఎలా విరవాలి? ఏ పదాన్ని ఎక్కడ ఎంత నొక్కి చెప్పాలి? ఇవన్నీ రేడియో నాటకాల్లో నటిస్తూ నేర్చుకున్నాను”

తన డెబ్బయి నాలుగో పుట్టినరోజున ఓ టీవీ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రముఖ సినీ నటుడు కోట శ్రీనివాసరావు చెప్పిన మాటలు ఇవి. ఒకప్పుడు రేడియోలో పనిచేసిన మనిషిగా ఈ మాటలు విని నేనూ సంతోషపడ్డాను. ( నాకంటే వయసులో ఏడాది పెద్ద అని ఈరోజే తెలిసింది)

“బ్యాంకులో ఉద్యోగం. సాయంత్రాలు నాటకాలు రిహార్సల్స్. మధ్యమధ్య రేడియో నాటకాలు. రవీంద్ర భారతిలోనే నూట యాభయ్ కి పైగా నాటకాలు వేసిన అనుభవం. ఎవరో అన్నారు, సినిమాల్లో కూడా ప్రయత్నించరాదా అని. నాది నల్లటి ఛాయ. ఎప్పుడన్నా నీ మొహం అద్దంలో చూసుకున్నావా అంటారేమో అని బెరుకు” 

అలాంటి మనిషి ఒకటీ అరా కాదు, లెక్కకు మించిన సినిమాల్లో వేశారు. అవీ చిన్నాచితకా వేషాలు కావు. నటనా వైదుష్యానికి గుర్తుగా ఎనిమిది నందులు ఆయన సొంతం చేసుకున్నారు. తెలుగు సినీ ఆకాశంలో ఓ వెలుగు వెలిగారు.

నేను రేడియోలో చేరిన కొత్తల్లో కోట శ్రీనివాసరావు గారు నారాయణ గూడా (దీపక్ మహల్ పక్కన) స్టేట్ బ్యాంకులో ఉద్యోగం చేసేవారు. అప్పుడప్పుడు తోటి నాటకాల నటులతో కలిసి రేడియో ఆవరణలో కనిపించేవారు. 

ఒకరోజు అయన అన్నమాటలు నాకు బాగా జ్ఞాపకం.

“మా బ్యాంకు వాళ్లకు ఆటలు ఆడేవాళ్ళు తప్ప మా బోటి నటులు పనికిరారు. (ఆ రోజుల్లోనే క్రికెట్ క్రీడాకారుడిగా స్టేట్ బ్యాంకు ఉద్యోగి మహమ్మద్ అజహరుద్దీన్ నిలదొక్కుకుంటున్నారు. చిన్నతనంలో విఠల్ వాడీలో గల్లీ క్రికెట్ ఆడేవారని చెప్పుకునేవారు) వాళ్లకు అడగడమే ఆలస్యం సెలవు దొరుకుతుంది. నాకేమో రాకరాక ఓ సినిమా వేషం వచ్చింది. వారం రోజులు సెలవు కావాలంటే దొరకడం గగనం. సరే మేము సినిమాల్లో వేసి డబ్బులు తీసుకుంటున్నాం అంటున్నారు. వాళ్ళు మాత్రం క్రికెట్ ఊరికే ఆడుతున్నారా! ఎందుకీ వివక్ష?” అనేది ఆయన ఆవేదన.

సినిమాలు పెరిగాక ఆయన ఆ ఉద్యోగం వదిలేశారు, అది వేరే విషయం.

స్టేట్ బ్యాంకులో మధుర బాబుగారని ఓ అధికారి వుండేవారు. (చనిపోయి కొద్ది సంవత్సరాలు అవుతోంది) హైదరాబాదు మెయిన్ బ్రాంచికి మేనేజర్. సమర్ధుడైన ఆఫీసర్ అని పేరు. ఆ రోజుల్లో ఆయన హవా బాగా వుండేది. ఈ రోజు రాష్ట్రంలో పెద్ద పెద్ద పారిశ్రామికవేత్తలు అనిపించుకుంటున్న వారిలో అనేకమంది ఆయనకోసం ఆఫీసు బయట వెయిట్ చేస్తుంటే నేను ఆరోజుల్లో చూశాను. మా రెండో అన్నయ్య రామచంద్రరావు గారూ మధురబాబు గారు మంచి స్నేహితులు. మా అన్నయ్య విశాఖ గ్రామీణ బ్యాంకు చైర్మన్ గా, మధురబాబుగారు నాగార్జున గ్రామీణ బ్యాంకు చైర్మన్ గా పనిచేశారు. తదనంతర కాలంలో మా అన్నయ్య చెన్నై, పుదుచ్చేరి, కేరళరాష్ట్రాల స్టేట్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ గా, మధురబాబు గారు జనరల్ మేనేజర్ గా పనిచేశారు. ప్రపంచ ప్రసిద్ధ కేన్సర్ నిపుణులు నోరి దత్తాత్రేయుడు మధురబాబు గారెకి స్వయానా తమ్ముడు.  

వేరే విషయం అంటూ వేరే వేరే విషయాల్లోకి పోతున్నానని అనుకుంటున్నారా. లేదు. కోట శ్రీనివాసరావు గారికీ బ్యాంకుకూ సంబంధం ఉన్నట్టే, ఒకప్పుడు ఏ బ్యాంకులో అయితే రెండు రోజులు సెలవు కోసం ఇబ్బందులు పడ్డారో అదే స్టేట్ బ్యాంకులో జనరల్ మేనేజర్ గా పనిచేసిన  ఈ మధురబాబు గారికీ సంబంధం వుంది. అది కూడా అలాంటిలాంటి సంబంధం కాదు. తదనంతర కాలంలో ఈ ఇద్దరూ స్వయానా వియ్యంకులు అయ్యారు.



9, జులై 2021, శుక్రవారం

పాదయాత్రాఫల సిద్ధిరస్తు – భండారు శ్రీనివాసరావు

 

కనుచూపు మేరలో ఎన్నికలు లేవు. అయినా అన్ని పార్టీల నాయకులు ఏదో ఒక పేరు పెట్టుకుని జనం మధ్యనే గడపాలని అనుకుంటున్నారు. ఈ మార్పుకు కారణం ఒక్కటే, వెనుకటికీ ఇప్పటికీ రాజకీయ వ్యూహాల్లో వచ్చిన తేడానే!
కొన్ని దశాబ్దాల క్రితం విద్యార్ధులు పరీక్షల తరుణంలోనే పుస్తకాలు చేతపట్టి రాత్రీ పగలూ అనకుండా కష్టపడి చదివి గట్టెక్కాలని ప్రయత్నం చేసేవారు. మిగిన రోజుల్లో ఆటాపాటలతో కాలక్షేపం చేసేవారు. విద్యారంగంలో కార్పొరేట్ సంస్కృతి ప్రబలిన తరువాత విద్యార్ధులకు అనునిత్యం పరీక్షలే. ప్రతిక్షణం పరీక్షాకాలమే.
ఇప్పుడీ సంస్కృతి రాజకీయ రంగంలో కూడా ప్రవేశించినట్టు వుంది. పూర్వం ఎన్నికల సమయంలో మాత్రమె కానవచ్చే హడావిడి ఇప్పుడు ఏడాది పొడుగునా కళ్ళకు కడుతోంది. నిత్యం జనాలతో అనుబంధం పెంచుకుంటూ ఆత్మస్తుతి, పరనిందలతో పొద్దుపుచ్చుతున్నారు. అందుకే, రాజకీయ కోయిలలు ముందే కూస్తున్నాయి. ఎన్నికల ఘడియ దగ్గరలో లేకపోయినా నాయకులు కాళ్ళకు బలపాలు కట్టుకుని జనాలమధ్యనే తిరుగుదామని ఆలోచనలు చేస్తున్నారు.
అరవయ్యో దశకంలో ఒక రాజకీయ నాయకుడు సుదీర్ఘ కాలం లోకసభ సభ్యుడిగా పనిచేశారు. ఎన్నికలప్పుడు జనాలకు చూపించిన మొహం మళ్ళీ ఎన్నికల వరకు చూపించేవారు కాదు. అయినా వరసగా అయిదు సార్లు ప్రజలు ఆయన్ని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నారు. గెలిచిన తరువాత ఢిల్లీలోనో, హైదరాబాదులోనో హాయిగా కాలక్షేపం చేసేవారు కాని నియోజకవర్గం వైపు తొంగి చూసేవారు కాదు. అయినా ఆ రోజుల్లో అలా నడిచిపోయింది.
ఎన్టీ రామారావు తెలుగుదేశం పార్టీ పెట్టి అధికారంలోకి వచ్చిన తరువాత కొంత పరిస్తితి మారింది. జనాల్లో తిరగకుండా జనాలమీద పెత్తనం చేయడం కష్టం అన్న ఎరుక రాజకీయ నాయకుల్లో మొదలయింది. అయితే ఎన్టీఆర్ తరహా కూడా అదో మాదిరి. ఎన్నికలు దగ్గర పడ్డప్పుడు, కనీసం ఏసీ సౌకర్యం కూడా లేని చైతన్య రధం మీద బయలుదేరి, ఎండావానల్ని లెక్కచేయకుండా, ఆకలిదప్పులు పట్టించుకోకుండా రాష్ట్రాన్ని చుట్టబెడుతూ రాత్రింబగళ్ళు ప్రజల మధ్యనే తిరిగేవారు. ఆ ఎండలకు అంతటి అందగాడి మొహం కూడా నల్లకప్పు వేసిపోయేది. ఒక్కసారి విజయం సాధించి, అధికార పీఠం ఎక్కడం తరువాయి, అంతే! ఎంతో ముఖ్యమైన రాచకార్యం వుంటే తప్ప రాజధానిని ఒదిలిపెట్టి అడుగు బయట పెట్టేవారు కాదు. జిల్లాల పర్యటనలు ఎక్కువగా పెట్టుకునేవారు కాదు. చంద్రబాబునాయుడు మొదటిసారి ముఖ్యమంత్రి అయిన తరువాత పరిస్తితి పూర్తిగా మారిపోయింది. రాష్ట్రంలో ఎక్కడ ఏ చిన్న సంఘటన గురించిన కబురు చెవిలో పడడం ఆలస్యం కాళ్ళకు రెక్కలు కట్టుకుని గాల్లో ఎగురుకుంటూ అక్కడికి వెళ్ళేవారు. కొన్ని సందర్బాలలో స్థానిక అధికారుల కంటే ముందే అక్కడ వాలిపోవడం, లేదా ముఖ్యమంత్రి హైదరాబాదు నుంచి ఆ విషయం గురించి వారిని వాకబు చేయడం ఇలాటివన్నీ ఆ రోజుల్లో తమాషాగా చెప్పుకునేవారు. కొండొకచో సంచలనాత్మకంగా, కొండొకచో విమర్శనాత్మకంగా ఉండేవి అవి.
దరిమిలా ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డిది కూడా ఓ రకంగా ఇదే తరహా. పర్యటనల్లో వున్నా, రాజధానిలో వున్నా జనం మధ్య గడపడానికే ఆసక్తి చూపేవారు. ప్రతిపక్షం నుంచి అధికారపక్షంలోకి మారడానికి ఆయన చాలా కాలం పాటు చేసిన నిరీక్షణ ఫలించడానికి కారణం ఆయన చేసిన పాదయాత్రే అనడంలో సందేహం లేదు. తదాదిగా అధికారం చేజిక్కించుకోవాలంటే పాదయాత్రలు చక్కని రాజమార్గం అన్న నమ్మకం రాజకీయ నాయకుల్లో కుదిరిపోయింది. చంద్రబాబు నాయుడు కూడా పాదయాత్ర అనంతరమే తొమ్మిదేళ్ళ పైచిలుకు సాగిన ప్రతిపక్ష అజ్ఞాత వాసం నుంచి బయట పడి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోగలిగారు.
ఇక సొంత పార్టీ పెట్టుకున్న జగన్ మోహన్ రెడ్డి పూర్తిగా జనం మీదనే ఆధారపడ్డారు. జనం అండ ఉంటుందనే నమ్మకంతో రాజకీయ ఎత్తుగడల్లో చూపించాల్సిన పట్టు విడుపుల్ని ప్రదర్శించకుండా ఓ మేరకు నష్టపోయారని కూడా ఆయన్ని గురించి చెప్పుకుంటారు. ప్రతిపక్ష నాయకుడిగా కూడా ఆయనది అదే తీరు. తన సొంత పార్టీ నాయకులతో కంటే జనాల మధ్యనే ఎక్కువ సమయం గడుపుతారనే పేరు ఆయన ఖాతాలో వుంది కూడా. అదే తీరు కొనసాగించి, సుదీర్ఘ పాదయాత్ర అనంతరం అధికార పీఠం ఎక్కగలిగారు.
పొతే, రాజకీయ నాయకుల పాదయాత్రలు, కిసాన్ యాత్రలు, రైతు భరోసా యాత్రలు, బస్సు యాత్రలు ఇంకా ఇలాటి అనేకానేక యాత్రలు, పర్యటనలు, ప్రదర్శనలు, ర్యాలీలు ప్రజలకు చేసే మేలు ఏమిటోకాని ఆయా పార్టీలకు మాత్రం పెద్ద మేళ్ళే చేస్తున్నాయని వాటి గత అనుభవాలు చెబుతున్నాయి. అందుకే ఇబ్బందులు వున్నా, కష్టాలు వున్నా, బాగా డబ్బు ఖర్చుతో కూడిన వ్యవహారం అయినా నాయకులు వెనుకడుగు వేయకుండా పాదయాత్రలతో ముందడుగు వేస్తున్నారు.
సరే! 'యాత్రాఫల సిద్ధిరస్తు' అని జనం వారిని ఆశీర్వదిస్తారో లేదో తెలియడానికి ఇంకా చాలా వ్యవధానం వుంది.

Link to Andhraprabha epaper which published the above article on 11-07-2021)

https://epaper.prabhanews.com/c/61719725

పన్నెండు కావాలి ఫోను చేయాలి

 'నా మాట విను. ఇంత అర్ధరాత్రి వేళ ఫోను చేయాలా! పొద్దున్నే చేస్తే సరిపోదా!'

'లేదు. ఇప్పుడు చేసి మాట్లాడితేనే నాకు తృప్తి'

ఈ ఒక్క విషయంలో నా మాట వినేది కాదు.

'పన్నెండు తర్వాత వాళ్ళ ఫోన్లు బిజీగా వుంటాయి. పన్నెండు గంటలకు కాస్త ముందు చెప్పరాదా'

'లేదు. నా ఫోను వస్తుందని వాళ్ళకి తెలుసు'

ఇంకేం చెప్పను?

ఇలా మా పిల్లలు, మా అన్నయ్య పిల్లలు, కోడళ్ళు, మనుమలు, మనుమరాళ్ళు అందరి పుట్టినరోజులప్పుడు గుర్తు పెట్టుకుని, ఆ రాత్రి మేలుకుని వుండి శుభాకాంక్షలు, శుభాశీశ్శులు చెప్పడం నేను దశాబ్దాలుగా చూస్తూ వచ్చాను.



ఈరోజు పన్నెండు అవుతోంది. జులై తొమ్మిది నా రెండో కుమారుడు సంతోష్, రెండో అన్నయ్య పెద్ద మనుమరాలు మాధుర్య పుట్టినరోజు.

మేలుకునే వున్నాను ఒంటరిగా. కానీ మా ఆవిడలా పనికట్టుకుని మేలుకుని లేను. ఈ గిల్టీ ఫీలింగ్ తో ఫోను ఎలా చేయను?

(08-07-2021)

8, జులై 2021, గురువారం

ఏం చెయ్యను? హెల్ప్ లెస్!

 చిన్నపుడు మా ఊళ్ళో గుంజకు కట్టేసిన చిన్న ఆవుదూడ మెడ పలుపు విప్పగానే  ఆ తువ్వాయి తోకపైకి లేపి ఎంతో ఆనందంతో గెంతులు పెడుతూ అటూ ఇటూ పరిగెట్టేది.

రాత్రి నా పరిస్థితి అలాగే వుంది. హైదరాబాదు వచ్చిన తోపుడు బండి సాదిక్ ఆలీ,  సాయంత్రం ప్రెస్ క్లబ్ లో కలుద్దాం, తప్పకుండా రండి  అన్నాడు. ముందు సంక్షేపించిన మాట వాస్తవం. ఇన్నాళ్లుగా బయటకు పోకుండా వుండి,  ఇప్పుడు వెడితే మంచిదేనా అనే మనసులోని  సందేహాన్ని, పోనీ పోయొస్తే పోలా అనే మెదడులోని భావన పటాపంచలు చేసింది. తీరా వెడితే అక్కడ పది మంది వెయిట్ చేస్తున్నారు. బాగా తెలిసిన వాళ్ళు కొందరు.  పరిచయం వుండి, ముఖపరిచయం లేనివాళ్లు మరి కొందరు. వీరిలో చాలామంది కరోనాని ఓ పక్క లెక్కలోకి తీసుకుంటూనే  మరోపక్క దాన్ని లెక్కపెట్టకుండా తమ పనులు తాము చేసుకుంటూ అన్ని చోట్లకూ తిరుగుతున్నారు. వారిలో నేనొక్కడినే రెండేళ్లుగా అసూర్యంపశ్య బాపతు. అంచేత ముందు చెప్పిన తువ్వాయి మాదిరిగానే  నాలో తెలియని ఉత్సాహం పెల్లుబుకింది.

క్లబ్ మేనేజర్ రామచంద్రం, కొత్తగా చేసిన ఏర్పాట్లు, మార్పులు  దగ్గరుండి చూపించాడు. కిచెన్ చాలా అధునాతనంగా వుంది. బార్ కౌంటర్ స్టార్ హోటల్ ని గుర్తు చేస్తోంది.  క్లబ్ లో పనిచేసే పాత సిబ్బంది అందరూ గుర్తుపట్టి పలకరించారు. నలభయ్ అయిదేళ్ళ అనుబంధం నాకు ఆ క్లబ్ తో.

పెద్దరికం వల్ల కావచ్చు, లేదా విధి లేక కావచ్చు వచ్చిన వాళ్ళు నాకే మైకు వదిలేశారు. నేను చెప్పిన కబుర్లే విన్నారు. తర్వాత అయ్యో పాపం అనిపించింది.  కానీ ముందే చెప్పాను కదా!  పలుపు తాడు  విప్పిన చిన్నారి ఆవుదూడలా ఆ కాసేపు నా గెంతులనే వాళ్ళు భరించాల్సి వచ్చింది.

ఏం చెయ్యను. హెల్ప్ లెస్!



సాదిక్ ఆలీ,  నందిరాజు రాధాకృష్ణ,  మండవ దుర్గాకుమార్,  కొల్లి అరవింద్,  కె ఎన్ మూర్తి,  తాడి ప్రకాష్, కంభం శివప్రసాద్, రామకృష్ణ వై., కస్తూరి శ్రీనివాస్, దండలో దారం జాగర్లమూడి రామకృష్ణ! అందరికీ మరోమారు థాంక్స్! 

(07-07-2021)

ఆదివారం సెలవు వద్దు – భండారు శ్రీనివాసరావు

 ఈరోజు తెల్లవారుతుండగానే ఏబీకే గారి నుంచి ఫోన్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయనకు పాత్రికేయుడిగా జీవన సాఫల్య పురస్కారం ప్రకటించి నందుకు ముందుగా ఆయనకు

అభినందనలు
తెలిపాను.
ఏబీకే గారెతో పరిచయం ఈనాటిది కాదు. 1970లో నేను బెజవాడ ఆంధ్రజ్యోతిలో చేరినప్పుడు ఆయన సీనియర్ సబ్ ఎడిటర్. నేను సబ్ ఎడిటర్. రాత్రి డ్యూటీలు మేమిద్దరం కలిసి చేసేవాళ్ళం. వేరే ఎవరూ వుండేవారు కాదు. అలా వారానికి మూడు రోజులు మాకు ఇద్దరికీ కలిపి నైట్ డ్యూటీ వేసేవాళ్ళు. ఎడిషన్ కు ఎడిషన్ కు నడుమ ఖాళీ సమయంలో ఆయన నాకు ఎన్నో విషయాలు చెప్పేవారు.
“చూడు శ్రీనివాస్! మనం సాధ్యమైనంత ఎక్కువగా చదవాలి. అప్పుడే రాయగల శక్తి వస్తుంది. చదవడం మరచిపోతే మనం మన ఫీల్డ్ లో ఎన్నటికీ ఒక స్థాయికి చేరుకోలేము. అంచేత నువ్వు ఏమి చేస్తావంటే నీ వీక్లీ ఆఫ్ ఆదివారం నుంచి మరో రోజుకు మార్చుకో. ఎందుకంటే మన బంధు మిత్రులు అందరికీ ఆదివారమే సెలవు వుంటుంది. మనం కనుక ఆరోజు పనిచేసి మరో రోజు ఆఫ్ తీసుకుంటే ఇక సెలవు రోజున మనల్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు ఎవరూ వుండరు. ఎంచక్కా ఆరోజు మనం కోరుకున్న పుస్తకంతో కాలక్షేపం చేయవచ్చు.” అని ఓ రోజు హితబోధ చేయడంతో నేను నా వీక్లీ ఆఫ్ శుక్రవారానికి మార్చుకున్నాను.
అలా ఓ శుక్రవారం నాడు (ఆయన ఆఫ్ కూడా ఆ రోజే) నన్ను వాళ్ళ ఇంటికి తీసుకువెళ్లి తాను ఏర్పాటు చేసుకున్న లైబ్రరీ చూపించారు. ఆ ఇల్లే ఒక లైబ్రరీ అంటే సముచితంగా వుంటుంది. అన్నిగ్రంధాలు వున్నాయి.
పాత్రికేయ జీవన సాఫల్య పురస్కారం అనుకుంటున్న ఏబీకే ప్రసాద్ గారెకి మరోమారు
అభినందనలు

వై.ఎస్. కలను జగన్ సాకారం చేస్తారా! – భండారు శ్రీనివాసరావు

 

(ఈరోజు వై.ఎస్. రాజశేఖరరెడ్డి జయంతి)

వై.ఎస్. జగన్ మోహన రెడ్డి తన పాదయాత్ర సందర్భంలో ప్రజలకు ఇచ్చిన

హామీలను నవరత్నాలుగా మలిచి రూపొందించిన మేనిఫెస్టోలో పొందుపరచిన అంశాలను

ఒక్కొక్కటిగా అమలులోకి తీసుకువచ్చే కార్యక్రమంలో ఆయన తలమునకలుగా

వున్నారు. ఈ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్న ముఖ్యమంత్రి దృష్టికి,

వారి నాన్నగారు వై.ఎస్. రాజశేఖరరెడ్డి ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా

వున్నప్పుడు కన్న ఓ కలను గుర్తుచేయడానికే ఈ ప్రయత్నం. ఆయన మదిలో

రూపుదిద్దుకున్న ఓ బృహత్తర పధకం తుది రూపం దాల్చకముందే, ఆ పధకం ఫలితాలను

కళ్ళారా చూడకుండానే వై ఎస్, హెలికాప్టర్ దుర్ఘటనలో మరణించారు. ఆయన మృతి

కారణంగా ఒక చక్కటి పధకం తుదికంటా అమలుకు నోచుకోలేదు.

దీనికి పూర్వరంగం గురించి చెప్పడం సముచితంగా వుంటుంది.

అప్పటికే, 108 అంబులెన్సులు రాష్ట్రాన్ని చుట్టిపెడుతున్నాయి. అత్యవసర

వైద్య సేవలు అందించడంలో దేశం మొత్తంలోనే అగ్రగామి అనిపించుకుంటున్నాయి.

నిజానికి ఈ సర్వీసులకు ప్రాచుర్యం కల్పించిన ఘనత రాజశేఖరరెడ్డి గారిదే. ఏ

పబ్లిక్ మీటింగ్ లోనయినా సరే - 'కుయ్ ...కుయ్' మని 108 అంబులెన్సు చేసే

సైరన్ ధ్వనిని అనుకరిస్తూ ఆ సర్వీసు ప్రాముఖ్యాన్ని ప్రజలకు

తెలియచేసేవారు.

ఆ రోజుల్లోనే, సుదూర గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సేవలకు సంబంధించి మరో

ప్రతిపాదన ప్రభుత్వం ముందుకు వచ్చింది. అదే 'ఫిక్సెడ్ డేట్ హెల్త్

సర్వీస్' (ఎఫ్.డీ.హెచ్.ఎస్). అంటే నిర్దేశిత దిన వైద్య సేవలు.

ప్రభుత్వం ఏటా కోట్ల రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తోంది.

ఇందులో సింహ భాగం నిర్వహణ వ్యయం కిందికే పోతోంది. గ్రామీణ ప్రాంతాలలో

ప్రాధమిక ఆరోగ్య కేంద్రాలు కొంత మేరకు ప్రజల ఆరోగ్య సేవల అవసరాలను

తీరుస్తున్నప్పటికీ, డాక్టర్ల కొరత అన్నది ఎప్పటికీ తీరని సమస్యగానే

మిగిలిపోతున్నది. మన (ఉమ్మడి) రాష్ట్రంలో ఎనభయి వేల గ్రామాలుంటే, కేవలం పదిహేను

వందల చోట్ల మాత్రమే వైద్యులు అందుబాటులో ఉన్నారు. వైద్య కళాశాలలో పట్టా

పుచ్చుకున్న ఏ ఒక్కరు కూడా పల్లెలకు వెళ్లి వైద్యం చేయడానికి సిద్దంగా

లేరంటే అతిశయోక్తి కాదు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. ప్రాధమిక ఆరోగ్య

కేంద్రాలకు దూరంగా వున్న కుగ్రామాల్లో నివసించే వారికి ఈ అరకొర సదుపాయం

కూడా అందుబాటులో లేదు. నాటు వైద్యుల దయాదాక్షిణ్యాల పైనా, వారిచ్చే

నాటుమందుల పైనా ఆధారపడాల్సిన దీనస్తితి వారిది. బయట ప్రపంచంతో సంబంధాలు

లేకుండా కొండ ప్రాంతాలలో, అంత సులువుగా చేరుకోలేని కోయ గూడాలు, లంబాడి

తండాల్లో వుండే పేదవారికి రోగంరొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. అలాటివారు

సాధారణంగా షుగరు, రక్త పోటు, ఉబ్బసం, కీళ్ళ వ్యాధులతో బాధపడుతుంటారు.

అసలు ఇలాటి జబ్బులు తమకు వున్నట్టు కూడా వీరికి తెలియదు. ఎందుకంటే ఎలాటి

వైద్య పరీక్షలు ఎప్పుడూ చేయించుకుని ఎరుగరు కనుక. రోగం ముదిరి ఏ

పక్షవాతానికో దారి తీసేదాకా 'బీపీ' వున్నట్టు కూడా వారికి తెలియదు.

ఈ నేపధ్యంలో,

అప్పటికే, ప్రభుత్వ ప్రయివేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఏర్పాటయి,

పనిచేస్తున్న 104 ఉచిత వైద్య సలహా కేంద్రం నిర్వాహకులు హెచ్.ఎం.ఆర్.ఐ.

(హెల్త్ మానేజిమెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) వారు ఈ సమస్యపై దృష్టి

సారించారు. అందుబాటులో వున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని

వినియోగించుకుని ఒక పరిష్కారాన్ని కనుగొన్నారు. ప్రాధమిక ఆరోగ్య

కేంద్రాలకు మూడు కిలోమీటర్ల ఆవల వుండే ప్రతి పల్లెకు, నెల నెలా క్రమం

తప్పకుండా వెళ్లి, వూరివారికి వైద్య పరీక్షలు చేసి ఉచితంగా మందులు

అందించే వాహనానికి రూపకల్పన చేశారు. 108 అంబులెన్సు ప్రమాదం అంచున

ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినదయితే, ఈ 104 సంచార వైద్య

వాహనం పేద పల్లెప్రజల ప్రాణాలు ప్రమాదం అంచుకు చేరకుండా చూస్తుంది. ఇంతా

చేసి ఈ పధకం కింద లబ్ది పొందేవారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే,

ఒక్కొక్కరిపై పెట్టే ఖర్చు ఏడాదికి కేవలం ఎనభయి రూపాయలు మాత్రమే. అంటే,

వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్ లో పది శాతం కన్నా తక్కువన్నమాట.

ఈ 104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక

గ్రామాన్ని సందర్శిస్తుంది. ఇందులో ఒక డేటా ఎంట్రీ ఆపరేటర్, ముగ్గురు

ఏ.ఎన్.ఎం. లు(నర్సులు), ఒక ఫార్మసిస్టు, ఒక లాబ్ టేక్నీషియన్, ఒక

డ్రయివర్తో సహా మొత్తం ఏడుగురు సిబ్బంది వుంటారు. బయో మెట్రిక్ పద్దతి

ద్వారా రోగుల వివరాలను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. గర్భిణీ

స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు. గర్భిణి కడుపులో పిండం

పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు సూచిస్తారు. అవసరమని

భావిస్తే, 108 అంబులెన్సుకి ఫోన్ చేసి రప్పించి ఆసుపత్రిలో చేర్పిస్తారు.

రక్త పోటు, షుగర్ ఉన్నవారికి నెలవారీగా చేయాల్సిన రక్త పరీక్షలు, ఇతర

పరీక్షలు నిర్వహిస్తారు.

'దర్వాజాలో దవాఖానా' వంటి ఈ పధకానికి సంబంధించిన మొత్తం వివరాలను పవర్

పాయింట్ ప్రజంటేషన్ రూపంలో ముఖ్యమంత్రికి వివరించడానికి హెచ్.ఎం.ఆర్.ఐ

నిర్వాహకులు ఒకనాడు సచివాలయానికి వెళ్ళారు. సమావేశం మొదలయింది.

ఉన్నట్టుండి వై.ఎస్. వారిని ఒక ప్రశ్న అడిగారు. గ్రామాలకు వెళ్ళే ఈ

బండిలో డాక్టర్ ఉంటాడా? అని. పల్లెలకు వెళ్ళే వైద్యులు లేకపోబట్టే ఈ

పధకాన్ని రూపొందించామని నిర్వాహకులు బదులు చెప్పారు. స్వయంగా డాక్టర్

అయిన వై.ఎస్. రాజశేఖర రెడ్డికి ఆ విషయం తెలియదని అనుకోము. సందేహ నివృత్తి

కోసం అడిగివుంటారు. మూడు నాలుగు స్లయిడులు వేసారో లేదో, రాజశేఖరరెడ్డి

గారు ఇక వినాల్సింది ఏమీ లేదన్నట్టు, హఠాత్తుగా 'అయాం సోల్డ్ '(ఫర్ థిస్

ఐడియా) అనేసారు.

అంతే!

దాదాపు ఏడాదికి నూరుకోట్ల రూపాయలకు పైగా ఖర్చయ్యే ప్రాజక్టును పది

నిమిషాల్లో ఖరారుచేసి, గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసారు.

దటీజ్! రాజశేఖర రెడ్డి.

అయితే ఆయన కన్న స్వప్నం ఇంతటితో ఆగిపోలేదు. ప్రజారోగ్యానికి సంబంధించిన

అన్ని వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తేవాలన్నది ఆయన ధ్యేయం.

ఆ పధకానికి సంపూర్ణత్వం కలిగించాలనుకున్నారు. ఈ దిక్కుగా ఆలోచించారు.

గుండెజబ్బుల వంటి పెద్ద సమస్యలు ఎదురయితే చిన్నవాళ్ళు ఏమైపోవాలి? వాటికి

వైద్యం చేయించుకోగల వెసులుబాటు వారికి ఎలా కలిగించాలి. అంతే! మరో అపురూప

వ్యవస్థ ‘ఆరోగ్య శ్రీ’ కి అంకురార్పణ జరిగింది.

చిన్నా చితకా రోగాలకు వైద్య సలహా చాలు. అందుకోసం ఇరవై నాలుగ్గంటలూ

అందుబాటులో వుండే 104 ఉచిత కాల్ సెంటరు. రాష్ట్రంలో ఏమారు మూల ప్రాంతం

నుంచయినా సరే ఏ చిన్న ఆరోగ్య సమస్యకయినా ఈ కేంద్రంలో రాత్రింబగళ్ళు

అందుబాటులో వుండే నిపుణులయిన వైద్యులు సలహాలు అందిస్తారు. వ్యాధి నిదానం 

కంటే నివారణ మేలు. అందుకోసం నిర్దేశితదిన వైద్య పరీక్షలు నిర్వహించే 104

సంచార వాహనం. అత్యవసర వైద్యసాయం కోసం 108 అంబులెన్సు . ఇక విధి వికటించి

పెద్ద రోగాల పాలుపడి ఎవరు కాపాడుతారా అని ఎదురు చూపులు చూసేవారి కోసం

ఆరోగ్యశ్రీ.

పైగా, ఇవన్నీ పూర్తిగా ఉచితం. అన్నీ ఒక్క గొడుగులో.

నిజానికి వై ఎస్ ఆర్ కల అంతటితో కూడా ఆగలేదు.

104 సంచార వాహనం వారు బయో మెట్రిక్ పద్దతి ద్వారా రోగుల వివరాలను

కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తారు. రాష్ట్రంలో ఏ ప్రభుత్వ వైద్యశాలకు

వెళ్ళినా ఆ రోగుల వివరాలన్నీ నిమిషాల్లో వైద్యులకు తెలిసిపోతాయి.

అప్పటివరకు ఏ మందులు ఎన్నాల్టి నుంచి తీసుకుంటున్నది డాక్టర్లకు

బోధపడుతుంది. గర్భిణీ స్త్రీలను, బాలింతలను పరీక్షించి మందులు ఇస్తారు.

గర్భిణి కడుపులో పిండం పెరుగుదలను నెలనెలా గమనిస్తూ తగిన జాగ్రత్తలు

సూచిస్తారు. తగు మందులు, పోషకాలు ఇస్తారు. నెలనెలా పరీక్షలు చేసి పురుడు

వచ్చే సమయాన్ని నిర్ధారిస్తారు. పురిటి ఘడియలు దగ్గర పడ్డప్పుడు 108 కి

తెలియచేసి వారిని దగ్గరలోని ప్రభుత్వ వైద్య శాలకు చేరుస్తారు. సుఖ ప్రసవం

తరువాత తగిన జాగ్రత్తలు చెప్పి, తిరిగి అంబులెన్సులో ఇంటికి చేరుస్తారు.

ఆ రోజుల్లో జరిగిన సమావేశాల్లో ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డి అనేవారు.

“కడుపుతో వున్న ఆడపిల్లలను పుట్టింటికి తీసుకువచ్చి, పురుడు పోయించి

తిరిగి తల్లీ బిడ్డను క్షేమంగా అత్తారింటికి పంపడం తలితండ్రుల బాధ్యత. ఇక

నుంచీ ప్రతి పేదింటి ఆడపిల్లకూ ప్రభుత్వమే పుట్టిల్లు. వాళ్ళ బాధ్యత

ప్రభుత్వానిదే”

ఇంతే కాదు.

104 కాల్ సెంటర్ కు ఇంకా విస్తృతమైన లక్ష్యాలు నిర్దేశించారు.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య శాలలు, నర్సింగు హోములు, ప్రైవేటు

క్లినిక్కులు, ఔషధ దుకాణాలు, బ్లడ్ బ్యాంకులు ఇలా వైద్య రంగానికి

సంబంధించిన సమస్త సమాచారం సేకరించి ఒక్కచోటే నిక్షిప్తం చేసారు.

అర్ధరాత్రి, అపరాత్రి అనకుండా రాష్ట్రంలో ఏమూలనుంచి ఫోను చేసినా వారు

వుండే ప్రదేశానికి ఈ సదుపాయాలు యెంత దూరంలో వున్నాయి, ఏ సమయాల్లో

పనిచేస్తాయి అనే వివరాలు తెలియచేయడానికి వీలుగా ఈ ఏర్పాటు. ఇక వైద్య

ఆరోగ్య శాఖ సహకారంతో ఏ ప్రాధమిక వైద్య కేంద్రంలో వైద్యుడు అందుబాటులో

ఉన్నదీ, సెలవు మీద వెళ్లిందీ ఆన్ లైన్లో తెలుసుకుని ఆ సమాచారాన్ని అటు

అవసరమైన రోగులకూ, ఇటు పర్యవేక్షణ జరిపే అధికారులకూ ఎప్పటికప్పుడు ఈ

కేంద్రం తెలియచేస్తూ వుంటుంది. అలాగే విద్యుత్ అధికారులతో సంప్రదించి ఏ

వూర్లో ఏ సమయంలో కరెంటు వుంటుందీ, ఏ వూరి ఆసుపత్రిలో ఎక్స్ రే మిషన్లు

పనిచేయడం లేదు మొదలయిన వివరాలను సంసిద్ధంగా వుంచుకుని అడిగిన వారికి

అడిగినట్టుగా సమాచారం అందించే వ్యవస్థకు రూపకల్పన చేసారు.

ఒక్క ముక్కలో చెప్పాలంటే నాణ్యత కలిగిన వైద్య చికిత్సలను కేవలం కలిగిన

వారికే కాదు, పేదసాదలకు కూడా అందుబాటులోకి తేవాలనేది మొత్తం ఈ పధకం

లక్ష్యం.

ఆయన హఠాత్ మరణం తరవాత రాష్ట్రంలో రాజకీయ పరిస్తితులు వేగంగా మారిపోయాయి.

కారణం ఎవరయినా జరగరానిది జరిగిపోయింది. మొత్తం ప్రపంచానికే ఆదర్శంగా

నిలవాల్సిన ఓ అద్భుత పధకం కొందరి నిర్వాకాలకు నీరుకారిపోయింది. కొందరి

స్వార్ధాలకు బలయిపోయింది. కొందరి ఆహాలను చల్లార్చడానికి మాడిమసయిపోయింది.

రాజకీయ చదరంగంలో చిక్కుకుపోయి కొందరి ఎత్తులు పైఎత్తులకు

చిత్తయిపోయింది.

ఈ పధకం వల్ల లబ్ది పొందుతున్న వారు నిరుపేదలు. వారికి నోరూవాయీ లేదు.

కష్టం వచ్చినా చెప్పుకోలేరు. ఆ కష్టం తొలగినా చెప్పుకోలేరు. ఎందుకంటే

చెప్పుకోవడానికి వారికెవరూ లేరు. వారితరపున చెప్పేవారూ లేరు.

వారి గురించి రాసేవారు లేరు. కారణం వారిలో చాలా మంది నిరక్షరాస్యులు.

చదవడం రాని వారి గురించిన వార్తలు ఎవరికీ పట్టవు.

వారి గురించి బుల్లి తెరలపై చూపించేవారు లేరు. ఎందుకంటే అలాటి ఆధునిక

సౌకర్యాలకు దూరంగా ఎక్కడో బతుకులీడుస్తున్న బడుగులు వాళ్ళు.

కర్ణుడి చావుకు అన్నట్టుగా ఈ పధకం భ్రష్టుపట్టిపోవడానికి కూడా అనేక

కారణాలు వున్నాయి. అందులో ప్రధానమయింది వై ఎస్ రాజశేఖరరెడ్డి అకాల మరణం.

ఆయన జీవించి వుంటే ఈ పధకం ఇలా నీరుకారిపోయి వుండేది కాదని గట్టిగా

చెప్పొచ్చు.


(ఈరోజు ఆంధ్రప్రభ దినపత్రికలో ప్రచురితం)

LINK:

Clipping of Andhra Prabha Telugu Daily - Andhra Pradesh Main (prabhanews.com)