28, ఫిబ్రవరి 2021, ఆదివారం

పి.శివశంకర్ – ఓ జ్ఞాపకం

 

ఎనభయ్యవ దశకం పూర్వార్ధంలో రేడియో మాస్కోలో పనిచేయడానికి నిర్ణయం జరిగింది కానీ అందుకు సంబంధించిన ఉత్తర్వులు రావడంలో జాప్యం జరుగుతోంది. విషయం తెలుసుకుందామని నేనూ, అప్పుడు రేడియో న్యూస్ ఎడిటర్ గా పనిచేస్తున్న ఆకిరి రామకృష్ణారావు గారు కలిసి ఢిల్లీ వెళ్లాం. ఏపీ భవన్ లో దిగి బ్రేక్ ఫాస్ట్ పూర్తిచేసుకుని ఆఫీసు పని వేళలకి ఇంకా కొంత సమయం ఉండడంతో అప్పుడు కేంద్ర మంత్రిగా వున్న శివశంకర్ ఇంటికి ఫోను చేసి వస్తున్నట్టు ఆకిరి చెప్పారు. ముందే కబురు చేయడం వల్ల సెక్యూరిటీ వాళ్ళు వెంటనే లోపలకు పంపారు. ముందు గదిలో శివశంకర్ కూర్చుని వున్నారు. మమ్మల్ని సాదరంగా పలకరించి వచ్చిన పని ఏమిటని వాకబు చేసారు. ఆకిరి సంకోచించకుండా నా మాస్కో ఆర్డర్లు లేటవుతున్నాయని చెప్పారు. ఆయన వెంటనే రాక్స్ ఫోనులో (మాట్లాడే విషయాలు ఇతరులకు తెలిసే అవకాశం లేని ఫోన్లు, రాష్ట్రపతి, ప్రధానమంత్రి, కొందరు కేంద్ర మంత్రులు, ముఖ్యమైన సీనియర్ అధికారుల ఇళ్ళల్లో మాత్రమే వుంటాయి) సమాచార శాఖ కార్యదర్శితో మాట్లాడి నా విషయం చెప్పారు. ఆయన పదిగంటలకు ఆఫీసుకు పంపించమని చెప్పారు. ఢిల్లీ వచ్చిన పని అనుకోకుండా శివశంకర్ గారిని కలవడంతో పూర్తయింది. దాంతో ఆయనతో కాసేపు అవీఇవీ మాట్లాడి, ఆయన ఇచ్చిన కాఫీ తాగి బయట పడ్డాము. పది గంటలకల్లా శాస్త్రి భవన్ (సమాచార మంత్రిత్వశాఖ కార్యాలయం వుండే సదనం) చేరుకున్నాము. అక్కడ చాలా హడావిడిగా వుంది. హైదరాబాదు స్టేషన్ డైరెక్టర్ గా పనిచేసి ఢిల్లీలో సీనియర్ అధికారిగా పనిచేస్తున్న జీ. రఘురాంని (మా పెద్దన్నయ్య పర్వతాలరావుకి మంచి స్నేహితులు) కలుసుకున్నాము. ఆయన మమ్మల్ని చూస్తూనే ‘రండి రండి మీకోసమే చూస్తున్నాను, మీ ఆర్డరు రెడీగా ఉందంటూ చేతికి అందించారు.

ఆ రోజుల్లో ఢిల్లీ అధికార కారిడార్లలో శివశంకర్ గారి హవా అలా వుండేది.


జీవితం చీకటి వెలుగుల రంగేళి - భండారు శ్రీనివాసరావు

 ఆనందం, విచారం ఒకేసారి పెనవేసుకుని వచ్చిన సమాచారం వస్తే దాన్ని మించిన విషాదం ఏముంటుంది?

అరుణ్ మొహంతి.

ముప్పయ్యేళ్ళ క్రితం రేడియో మాస్కోలో సహోద్యోగి. ఒరిస్సా (అప్పుడు అదే పేరు) నుంచి చదువుకోవడానికి మాస్కో వెళ్ళాడు. చదువుకుంటూనే మాస్కో రేడియోలో అప్పుడప్పుడూ ఒరియాలో వార్తలు చదివేవాడు. చివరికి అక్కడే ఉద్యోగం సంపాదించుకున్నాడు. నేను తెలుగులో వార్తలు చదవడానికి కుటుంబంతో సహా మాస్కో వెళ్ళినప్పుడు పరిచయం. మృదుస్వభావి. మార్క్సిజాన్ని ఆపోసన పట్టాడు. పుస్తకాల పురుగు. ఎప్పుడూ చేతిలో ఏదో ఒక పుస్తకంతోనే కానవచ్చేవాడు. సాయంకాలక్షేపాల్లో సయితం మాటలు తూకం వేసుకుని మాట్లాడేవాడు. నేను సరదాగా ప్రొఫెసర్ అని పిలిచేవాడిని. మేము అక్కడికి వెళ్ళిన రెండేళ్లకు కాబోలు పెళ్లయింది. వధువు నమిత. ఒరియా అమ్మాయి. బాగా చదువుకున్నది. కొత్త సంసారం. అప్పటికి మా ఆవిడే ఆమెకు పెద్ద దిక్కు. ఎక్కడికి వెళ్ళినా కలిసే తిరిగే వాళ్ళు.

పంజాబీ, హిందీ, బెంగాలి, ఒరియా, తమిళం, మలయాళం, కన్నడంతో సహా పద్నాలుగు భారతీయ భాషల్లో మాస్కో రేడియో వార్తలు ప్రసారం అయ్యేవి. అందరం కుటుంబాలతో కలిసి రేడియో మాస్కో వారు ఏర్పాటు చేసిన పలు అంతస్తుల భవనంలో కాపురాలు వుండేవాళ్ళం. కమ్యూనిస్ట్ శకం ముగిసి సోవియట్ యూనియన్ అంగ,వంగ కళింగ దేశాల మాదిరిగా విడివడ్డ తరువాత మేము మాస్కో నుంచి హైదరాబాదు వచ్చేసాము. అరుణ్ దంపతులు మాస్కోలోనే వుండిపోయారు. తరవాత మా నడుమ ఉత్తర ప్రత్యుత్తరాలు ఏవీ లేవు. చూస్తుండగానే ముప్పయ్యేళ్లు గడిచిపోయాయి.

పీ. ఎస్. మూర్తి. ఒకప్పుడు రాష్ట్రపతి సంజీవరెడ్డి గారి దగ్గర అయిదేళ్ళపాటు ప్రెస్ సెక్రెటరీగా పనిచేసిన కూచి సూర్యనారాయణ గారి అల్లుడు. వ్యాపారపనుల నిమిత్తం మాస్కోలో మేమున్న రోజుల్లో అక్కడికి వచ్చి వెడుతుండేవారు. సూర్యనారాయణ గారు మా ఆవిడకు వరసకు బాబాయి అవుతారు. అంచేత మూర్తిగారు కూడా మాస్కో వచ్చినప్పుడల్లా మాఇంటికి వచ్చేవారు. అక్కడే మూర్తి గారికీ, అరుణ్ మొహంతితో పరిచయం అయింది. మేము ఇండియా తిరిగి వచ్చిన తరువాత కూడా అనేక ఏళ్ళపాటు ఆ స్నేహం కొనసాగింది. మాస్కో వెళ్ళినప్పుడల్లా మొహంతిని కలిసేవారు. వ్యాపార విషయాల్లో తనకు తోచిన సలహాలు మూర్తికి చెబుతుండేవాడు అరుణ్.

తరువాత మూర్తి కుటుంబంతో సహా ఢిల్లీ నుంచి వచ్చి హైదరాబాదులో సెటిల్ అయ్యారు. ఆయన ద్వారానే అరుణ్ చనిపోయాడనే ఓ విషాద వార్త తెలిసింది.  ఆయన ఇచ్చిన నెంబరుకు ఒక మెసేజ్ పెట్టాను, నేను పలానా అని పరిచయం చేసుకుంటూ.

నమిత నుంచి వెంటనే జవాబు వచ్చింది.

మాస్కో రేడియోలో భారతీయ ప్రసారాలు నిలిపివేసిన తర్వాత కూడా పద్నాలుగేళ్ళు అరుణ్ దంపతులు అక్కడే వుండిపోయారట. తరువాత ఢిల్లీ వచ్చేశారు. అరుణ్ మొహంతికి జేఎన్యూలో ప్రొఫెసర్ గా ఉద్యోగం వచ్చింది. భార్య నమిత కూడా ఒక ప్రైవేట్ స్కూల్లో టీచరుగా చేరారు. బాగా సెటిల్ అయ్యామని అనుకుంటున్న తరుణంలో అరుణ్ కిడ్నీవ్యాధిబారిన పడి కన్నుమూశాడు. అతడి తలితండ్రులు ఇద్దరూ ఏడాదిలోపలే మరణించారు.

అరుణ్ కుటుంబంతో మూడు దశాబ్దాల తరువాత సంబంధాలు ఏర్పడ్డాయని సంతోషించాలో, అరుణ్ ఇక లేడని తెలిసి బాధపడాలో ఏమీ తెలియని స్థితి.

27, ఫిబ్రవరి 2021, శనివారం

నవ్వుకుని వదిలేస్తే పోలా – భండారు శ్రీనివాసరావు

 

Srinivasa Subrahmanya Sai Bhagavatulaగారు  నా వేరే  పోస్టుకి కామెంటు పెడుతూ ఈ కింది ప్రశ్న అడిగారు. జవాబు క్లుప్తంగా ఇవ్వడం కుదరక  మళ్ళీ  ఓ పాత పోస్టునే  పెడుతున్నాను. వారికి  నా కృతజ్ఞతలు

వారిలా రాశారు:

 

 

“ఇది సందర్భం కాదు అని తెలుసు, అయినా సాహసించి ఇక్కడ మిమ్ములను అడుగుతున్నాను,దయచేసి అన్యధా భావించకండి.

మీరు నెహ్రూ కాలాల్లో ఆయన పరిపాలనపై ఊమెన్ అనే కార్టూన్ చిత్రకారుడు వేసిన వ్యంగ్య కార్టూన్ లపై నెహ్రూగారు ఎప్పుడైనా అసహనం చూపించటం గానీ, మండిపడటం కానీ విన్నారా, చూశారా చదివారా ?

కిందిది నా జవాబు :

 

 

నవ్వుకుని వదిలేస్తే పోలా – భండారు శ్రీనివాసరావు

సామాన్యుడికి ఊరట కలిగించేవి చిన్న చిన్న కార్టూన్లు, జోకులు. దినవారీ సీరియస్ వాతావరణం నుంచి ఎంతోకొంత ఉపశమనం కలిగిస్తాయి. దురదృష్టం ఏమిటంటే, ఆరోగ్యకరమైన, ఆలోచనాత్మకమైన వ్యాఖ్యలను కూడా హరాయించుకోలేని వాతావరణం ఈనాడు సమాజంలో వుంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో, వారి అనుయాయుల్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ రోజురోజుకీ తగ్గిపోతోంది. ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నఅంశాల్లో ఇదొకటి.

ఒక పాత సంగతి ముచ్చటించుకుందాం. 1962 లో చైనాతో జరిగిన యుద్ధంలో భారతదేశానికి ఘోర పరాభవం ఎదురయినప్పుడు, ప్రముఖ కార్టూనిష్టు ఆర్. కే. లక్ష్మణ్, నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పై ఒక కొంటె కార్టూన్ వేసారు. నెహ్రూను చిన్నబుచ్చుతూ వేసిన ఆ కార్టూన్ అది. నెహ్రూ అభిమానులనుంచి దాడి తప్పదని అనుకుంటుంటే, ఊహించని విధంగా లక్ష్మణ్ గారికి నెహ్రూ నుంచి ఫోన్ వచ్చింది.

ఈరోజు ఉదయం పత్రికలో మీ కార్టూన్ చూశాను. చూడగానే నాకెంతో సంతోషమయింది. నా మనసుకు ప్రశాంతత చిక్కింది. నాదో కోరిక. అదే కార్టూన్ ని కొంచెం పెద్దదిగా గీసి పంపిస్తే ఫ్రేం కట్టించి దాచుకుంటాను.” అడిగారు నెహ్రూ, కాసింత శ్లేషతో కూడిన హుందాతనం చూపిస్తూ. (https://www.ndtv.com/opinion/when-nehru-was-caricatured-by-rk-laxman-558107)

వెనక, ప్రసిద్ధ కార్టూనిస్టు శంకర్ ఆధ్వర్యంలో శంకర్స్ వీక్లీ అనే పూర్తి నిడివి కార్టూన్ల పత్రిక వచ్చేది. ఇందిరాగాంధీ హయాములో దేశంలో ఎమర్జెన్సీ అమలు అవుతున్న కాలంలో పత్రికలపై సెన్సార్ షిప్ విధించారు. ప్రభుత్వాన్ని విమర్శించకుండా కార్టూన్ గీయడం తనకు సాధ్యం కాదని చెబుతూ ఆయన ఆ పత్రిక ప్రచురణనే నిలిపివేశారు.

ఈ రోజుల్లో, కార్టూన్లు, జోకులు కొండొకచో కొంచెం శృతి మించుతున్న మాటా నిజమే. కానీ అవి చదవగానే రాసిన వారెవరో ఎందుకోసం రాసారో సులభంగా తెలిసిపోతూనే వుంటుంది. ఎందుకంటే దేశం ఇప్పుడు రాజకీయ పార్టీల వారీగా, నాయకుల వారీగా, వారివారి అనుయాయులవారీగా విడిపోయి వుంది. ఈ విభజన వల్ల లాభపడేది పార్టీలే, దేశం కాదు.

బాపూ సినిమాలో రావు గోపాలరావు అన్నట్టు మడిసన్నాక కూసింత కలాపోసన వుండాలి.

అది కూడా రాజహంస మాదిరిగా పాలను నీళ్ళను వేరు చేసి చూడగలిగే విధంగా వుండాలి.

అంజయ్యగారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఓ హెలికాప్టర్ కొని దానికి యాదగిరి అని పేరు పెట్టారు. ఒక ప్రముఖ పత్రిక అంజయ్య గారి కార్టూన్ వేసినప్పు డల్లా ఆయన వేలికి హెలికాప్టర్ కట్టి ప్రచురించేది. అయన కూడా అది చూసి నవ్వుకునే వారు. ఇప్పుడు ముఖ్యమంత్రులు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కాలం తెచ్చిన మార్పు ఇది. అప్పుడు హెలికాప్టర్ అసహజం, ఇప్పుడు విమానాలు సహజం. ప్రతి విమర్శా, ప్రతి జోకూ రాజకీయ నాయకులను ఎద్దేవా చేయడానికి ఉద్దేశించించినవని అనుకోకూడదు.

నిత్య జీవితంలో ఎదురయ్యే అనుభవాలు అలా కార్టూన్ల రూపంలో వ్యక్తీకరింపబడుతుంటాయి. వాటిని చూసి, చదివి హాయిగా నవ్వుకోగలిగితే (అంజయ్య గారిలాగా) ఏ గొడవా వుండదు. (15-11-2020)

 

26, ఫిబ్రవరి 2021, శుక్రవారం

News Watch With Journalist Bandaru Srinivas rao Part 1 (2014)


రాష్ట్ర విభజన నిర్ణయం జరిగిపోయి,   తెలంగాణా రాష్ట్రం  ఆవిర్భావానికి   ముందు,  అప్పటి  ఎన్నికలపై  ఇచ్చిన ఇంటర్వ్యూ. ఒక మిత్రుడు  అమెరికా నుంచి వాట్సప్ లో పంపారు, ఇప్పటి ఎన్నికల పరిస్తితులకు అనుగుణంగానే ఉందంటూ.


చివరి నవ్వు

 

2019, ఆగస్టు.
గలేరియా మాల్ లో ఓ షాపు.

“ఎంత”
“ట్వెల్ ఫిఫ్టీ”
“అయితే నాలుగివ్వండి” అన్నాను పర్సులో నుంచి యాభయ్ నోటు తీస్తూ.

అప్పుడు వినపడింది నవ్వు.
ముందు సేల్స్ గర్ల్ అనుకున్నాను.
ఆమె వైపు చూస్తే ఆ అమ్మాయి నా మొహం లోకి చూస్తూ సన్నగా మందహాసం చేస్తోంది. మరి అంత బిగ్గరగా నవ్వుతోంది ఎవరు?
తీరా చూస్తే మా ఆవిడే.

నవ్వుతోంది. చిన్నగా కాదు. పగలబడి నవ్వుతోంది. అందరూ చూస్తున్నారు అనే ధ్యాస లేకుండా.
బహుశా అంత హాయిగా నవ్వింది మా నలభయ్ ఎనిమిదేళ్ళ వైవాహిక జీవితంలో మొదటిసారి అనుకుంటా. అందుకే అలా చూస్తుండి పోయాను.

అంతగా నవ్వు తెప్పించే మాట అమాయకంగా ఏమన్నాను?
ఆ తర్వాత తెలిసింది, ఆమె నవ్వింది నా అమాయకత్వాన్ని చూసి కాదు, నా తెలివి తక్కువతనాన్ని చూసి అని.

తర్వాత ఉబెర్ లో ఇంటికి వస్తున్నప్పుడు కూడా ఆ నవ్వు అలా తెరలు తెరలుగా వస్తూనే వుంది.
“మీకు కిలో కాఫీపొడుం రేటు తెలవదు, అలాంటి షాపుల్లో పదీ పరక్కూ దొరుకుతాయని ఎలా అనుకున్నారు” అని నవ్వుతూనే అంది.

ఇంతకీ ఆ రోజు జరిగింది ఏమిటంటే సినిమా చూసి వస్తూ ఓ షాపులోకి వెళ్ళాము. ఏదో తల నూనె కొన్నది. చూడబోతే చిన్నసీసా.
డబ్బులు ఇవ్వబోతూ నేనడిగిన ప్రశ్న”ఎంత” అని. “ట్వెల్ ఫిఫ్టీ” అన్నది షాపులోని అమ్మడు. “పన్నెండున్నర రూపాయల సీసా కోసం మళ్ళీ మళ్ళీ రావడం ఎందుకు ఒకేసారి నాలుగు సీసాలు కొనుక్కోవచ్చు కదా” అంటూ యాభయ్ నోటు తీశాను. నిజానికి దాని ధర పన్నెండు వందల యాభయ్ రూపాయలు. ఈ విషయం తనకు తెలుసు. నాకు తెలవదు. మరి నాది అమాయకత్వమో, తెలివితక్కువతనమో కూడా తెలియదు. ఏదైతేనేం అది చూసే ఆమెకు నవ్వొచ్చింది. మామూలుగా కాదు. తెరలుతెరలుగా.

ఇలా పగలబడి నవ్వడం మొదటిసారి. నాకప్పుడు తెలియదు, మరో వారం తర్వాత అదే చివరిసారి అవుతుందని.

నవ్వు లాగే జ్ఞాపకాలు.
తెరలు తెరలుగా అలా వస్తూనే వుంటాయి.

23, ఫిబ్రవరి 2021, మంగళవారం

నడిచివచ్చిన దారి - భండారు శ్రీనివాసరావు (Idream)


చెప్పింది చెప్పినట్టు, చెప్పింది మార్చకుండా (ఇంటి పేరుతొ సహా) నా జీవనయాన క్రమాన్ని నాతోనే చెప్పించిన  ఐ డ్రీం (Idream) నాగరాజు గారికీ, అ సంస్థ యాజమాన్యానికీ కృతజ్ఞతలు. 

https://youtu.be/jVNIPkwB_48