27, ఫిబ్రవరి 2021, శనివారం

నవ్వుకుని వదిలేస్తే పోలా – భండారు శ్రీనివాసరావు

 

Srinivasa Subrahmanya Sai Bhagavatulaగారు  నా వేరే  పోస్టుకి కామెంటు పెడుతూ ఈ కింది ప్రశ్న అడిగారు. జవాబు క్లుప్తంగా ఇవ్వడం కుదరక  మళ్ళీ  ఓ పాత పోస్టునే  పెడుతున్నాను. వారికి  నా కృతజ్ఞతలు

వారిలా రాశారు:

 

 

“ఇది సందర్భం కాదు అని తెలుసు, అయినా సాహసించి ఇక్కడ మిమ్ములను అడుగుతున్నాను,దయచేసి అన్యధా భావించకండి.

మీరు నెహ్రూ కాలాల్లో ఆయన పరిపాలనపై ఊమెన్ అనే కార్టూన్ చిత్రకారుడు వేసిన వ్యంగ్య కార్టూన్ లపై నెహ్రూగారు ఎప్పుడైనా అసహనం చూపించటం గానీ, మండిపడటం కానీ విన్నారా, చూశారా చదివారా ?

కిందిది నా జవాబు :

 

 

నవ్వుకుని వదిలేస్తే పోలా – భండారు శ్రీనివాసరావు

సామాన్యుడికి ఊరట కలిగించేవి చిన్న చిన్న కార్టూన్లు, జోకులు. దినవారీ సీరియస్ వాతావరణం నుంచి ఎంతోకొంత ఉపశమనం కలిగిస్తాయి. దురదృష్టం ఏమిటంటే, ఆరోగ్యకరమైన, ఆలోచనాత్మకమైన వ్యాఖ్యలను కూడా హరాయించుకోలేని వాతావరణం ఈనాడు సమాజంలో వుంది. ముఖ్యంగా రాజకీయ నాయకుల్లో, వారి అనుయాయుల్లో సెన్స్ ఆఫ్ హ్యూమర్ రోజురోజుకీ తగ్గిపోతోంది. ప్రజాస్వామ్య ప్రియులకు ఆందోళన కలిగిస్తున్నఅంశాల్లో ఇదొకటి.

ఒక పాత సంగతి ముచ్చటించుకుందాం. 1962 లో చైనాతో జరిగిన యుద్ధంలో భారతదేశానికి ఘోర పరాభవం ఎదురయినప్పుడు, ప్రముఖ కార్టూనిష్టు ఆర్. కే. లక్ష్మణ్, నాటి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ పై ఒక కొంటె కార్టూన్ వేసారు. నెహ్రూను చిన్నబుచ్చుతూ వేసిన ఆ కార్టూన్ అది. నెహ్రూ అభిమానులనుంచి దాడి తప్పదని అనుకుంటుంటే, ఊహించని విధంగా లక్ష్మణ్ గారికి నెహ్రూ నుంచి ఫోన్ వచ్చింది.

ఈరోజు ఉదయం పత్రికలో మీ కార్టూన్ చూశాను. చూడగానే నాకెంతో సంతోషమయింది. నా మనసుకు ప్రశాంతత చిక్కింది. నాదో కోరిక. అదే కార్టూన్ ని కొంచెం పెద్దదిగా గీసి పంపిస్తే ఫ్రేం కట్టించి దాచుకుంటాను.” అడిగారు నెహ్రూ, కాసింత శ్లేషతో కూడిన హుందాతనం చూపిస్తూ. (https://www.ndtv.com/opinion/when-nehru-was-caricatured-by-rk-laxman-558107)

వెనక, ప్రసిద్ధ కార్టూనిస్టు శంకర్ ఆధ్వర్యంలో శంకర్స్ వీక్లీ అనే పూర్తి నిడివి కార్టూన్ల పత్రిక వచ్చేది. ఇందిరాగాంధీ హయాములో దేశంలో ఎమర్జెన్సీ అమలు అవుతున్న కాలంలో పత్రికలపై సెన్సార్ షిప్ విధించారు. ప్రభుత్వాన్ని విమర్శించకుండా కార్టూన్ గీయడం తనకు సాధ్యం కాదని చెబుతూ ఆయన ఆ పత్రిక ప్రచురణనే నిలిపివేశారు.

ఈ రోజుల్లో, కార్టూన్లు, జోకులు కొండొకచో కొంచెం శృతి మించుతున్న మాటా నిజమే. కానీ అవి చదవగానే రాసిన వారెవరో ఎందుకోసం రాసారో సులభంగా తెలిసిపోతూనే వుంటుంది. ఎందుకంటే దేశం ఇప్పుడు రాజకీయ పార్టీల వారీగా, నాయకుల వారీగా, వారివారి అనుయాయులవారీగా విడిపోయి వుంది. ఈ విభజన వల్ల లాభపడేది పార్టీలే, దేశం కాదు.

బాపూ సినిమాలో రావు గోపాలరావు అన్నట్టు మడిసన్నాక కూసింత కలాపోసన వుండాలి.

అది కూడా రాజహంస మాదిరిగా పాలను నీళ్ళను వేరు చేసి చూడగలిగే విధంగా వుండాలి.

అంజయ్యగారు ముఖ్యమంత్రిగా వున్నప్పుడు ఓ హెలికాప్టర్ కొని దానికి యాదగిరి అని పేరు పెట్టారు. ఒక ప్రముఖ పత్రిక అంజయ్య గారి కార్టూన్ వేసినప్పు డల్లా ఆయన వేలికి హెలికాప్టర్ కట్టి ప్రచురించేది. అయన కూడా అది చూసి నవ్వుకునే వారు. ఇప్పుడు ముఖ్యమంత్రులు ప్రత్యేక విమానాల్లో తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. కాలం తెచ్చిన మార్పు ఇది. అప్పుడు హెలికాప్టర్ అసహజం, ఇప్పుడు విమానాలు సహజం. ప్రతి విమర్శా, ప్రతి జోకూ రాజకీయ నాయకులను ఎద్దేవా చేయడానికి ఉద్దేశించించినవని అనుకోకూడదు.

నిత్య జీవితంలో ఎదురయ్యే అనుభవాలు అలా కార్టూన్ల రూపంలో వ్యక్తీకరింపబడుతుంటాయి. వాటిని చూసి, చదివి హాయిగా నవ్వుకోగలిగితే (అంజయ్య గారిలాగా) ఏ గొడవా వుండదు. (15-11-2020)

 

కామెంట్‌లు లేవు: